నేటి ముఖ్య పరిణామాలివీ...
- యుక్రెయిన్లోని క్రమటార్స్క్ రైల్వే స్టేషన్ మీద జరిగిన రాకెట్లదాడిలో మృతుల సంఖ్య 50కి పెరిగినట్లు ఆ ప్రాంత గవర్నర్ పావ్లో తెలిపారు. ఈ దాడి చేసింది రష్యా అని యుక్రెయిన్ ఆరోపిస్తోంటే.. ఆ దాడితో తమకు ప్రమేయం లేదని రష్యా నిరాకరిస్తోంది.
- దాడికి ఉపయోగించిన క్షిపణుల ఉపయోగాన్ని తాము కొన్నేళ్ల కిందటే నిలిపివేశామని, వాటిని యుక్రెయిన్ ఉపయోగిస్తోందని రష్యా చెప్తోంది. అయితే.. యుక్రెయిన్ మీద దండయాత్రలో రష్యా పలు ప్రాంతాల్లో దాడులకు ఇదే రకం క్షిపణులను ఉపయోగించినట్లు ఆధారాలున్నాయని నిపుణులు చెప్తున్నారు.
- ముంబైపై ఉగ్రవాద దాడి కేసు నిందితుడు లష్కర్-ఎ-తాయిబా చీఫ్ హఫీజ్ సయీద్కి 31 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ పాకిస్తాన్ యాంటీ-టెర్రరిజం కోర్టు తీర్పు ఇచ్చిది. ఆయన ఇప్పటికే వేరే కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్నారు.
- ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ ఓడరేవు నుంచి.. సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకకు ఆహారధాన్యాలు తరలిస్తున్నారు. మొత్తం 40 వేల మెట్రిక్ టన్నుల బియ్యం తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. తొలుత 11 వేల మెట్రిట్ టన్నుల బియ్యంతో ఓడ బయలుదేరింది.
- దేశంలో 18 ఏళ్ల వయసు దాటిన వయోజనులు బూస్టర్ డోస్ కోసం దరఖాస్తు చేసుకోవటానికి కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. మరోవైపు.. కోవిషీల్డ్ బూస్టర్ డోసు రూ. 600 ధరకు ప్రజలకు అందుబాటులో ఉంటుందని కోవిడ్ వ్యాక్సీన్ను ఉత్పత్తి చేసే సంస్థ సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తెలిపింది.
- కొరియన్ ఓపెన్ సింగిల్స్లో పీవీ సింధూ, కిడాంబి శ్రీకాంత్ సెమీ ఫైనల్కు చేరుకున్నారు. ఇక మెన్స్ డబుల్స్లో స్వాతిక్సాయిరాజ్ రాంకీ రెడ్డి, చిరాక్ షెట్టీ జోడి క్వార్టర్స్లో ఓడిపోయింది.
- ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ వినియోగం మీద ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఇప్పటికే ఆదివారం పరిశ్రమలు మూతవేయాల్సి ఉండగా ఇక నుంచి మరో రోజు అదనంగా పవర్ హాలిడే అమలు చేయాల్సి ఉంటుంది. విద్యుత్ను కూడా 50శాతం మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది.
ఇవి ఇప్పటివరకూ ఉన్న ముఖ్యాంశాలు. నేటి లైవ్ పేజీని ఇంతటితో ముగిస్తున్నాం.
యుక్రెయిన్ యుద్ధంపై తాజా పరిణామాలను బీబీసీ న్యూస్ లైవ్ పేజీ ద్వారా తెలుసుకోవచ్చు.

















