You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

భారత్‌లో కరోనా కొత్త వేరియంట్ కలకలం.. మహారాష్ట్రలో తొలి కేసు గుర్తింపు

ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కేసులు తగ్గుతున్నాయని అనుకుంటున్న సమయంలో కొత్త వేరియంట్లు కలకలం రేపుతున్నాయి. కొత్తరకం వేరియంట్ ఎక్స్‌ఈ ఇప్పుడు భారత్‌లోనూ బయటపడింది. మరింత వేగంగా వ్యాపించే లక్షణం ఈ వేరియంట్‌కు ఉందని చెబుతున్నారు.

లైవ్ కవరేజీ

సతీష్ ఊరుగొండ and పృథ్వి రాజ్

  1. ఇవాళ్టి ముఖ్యాంశాల్లో కొన్ని..

    రష్యా దాడులను తీవ్రతరం చేస్తుందనే భయాల నేపథ్యంలో తూర్పు యుక్రెయిన్‌లోని ఖార్కియెవ్, లూహాన్స్క్, దోన్యస్క్ ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా యుక్రెయిన్ డిప్యూటీ పీఎం కోరారు.

    యుక్రెయిన్ భూభాగాన్ని గెలుచుకోవటానికి రష్యా.. ఆకలిని ఆయుధంగా వాడుతోందని యుక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలియెన్‌స్కీ ఆరోపించారు.

    ఫోర్బ్స్ విడుదల చేసిన ప్రపంచ కుబేరుల జాబితాలో టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ అగ్రస్థానంలో ఉండగా.. అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ రెండో స్థానంలో ఉన్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ పదో స్థానంలో, గౌతమ్ అదానీ 11వ స్థానంలో నిలిచారు.

    భారత్‌లో కరోనావైరస్ కొత్త వేరియంట్ XE తొలి కేసు మహారాష్ట్రలోని ముంబయిలో నమోదైనట్లు ముంబయి మహా నగర పాలక సంస్థ (బీఎంసీ) అధికారులు ప్రకటించారు.

    ఇవి లైవ్ పేజీ అప్‌డేట్స్. ధన్యవాదాలు.

  2. వైఎస్ జగన్: గురువారం ఏపీ మంత్రిమండలి సమావేశం

    ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం గురువారం వెలగపూడి సచివాలయంలో జరుగనుంది.

    ఈ నెల 11న ఏపీ కేబినెట్‌ విస్తరణకు ముహూర్తం ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో గురువారం నాటి కేబినెట్ సమావేశంలో మంత్రులు ముఖ్యమంత్రి జగన్‌కు రాజీనామా లేఖలు సమర్పించనున్నారు.

    11న ఉదయం 11:30 గంటలకు సచివాలయం భవన సముదాయం పక్కనున్న స్థలంలో కొత్త మంత్రులతో గవర్నర్ ప్రమాణం చేయించనున్నారు.

    మరోవైపు, మంత్రివర్గంలో మార్పు చేర్పులపై సీఎం జగన్‌ బుధవారం గవర్నర్‌ను కలిసి వివరించారు. ఢిల్లీ పర్యటన వివరాలను కూడా జగన్‌ గవర్నర్‌కు తెలిపారు.

  3. కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వమన్న రాహుల్ గాంధీ వాదనలో నిజమెంత?

    వచ్చే ఏడాది కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. శుక్రవారం బెంగళూరులో జరిగిన కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సమావేశంలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. బీజేపీ నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వం భారతదేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వమని ఆయన ఆరోపించారు.

    ''మొన్నటి ఎన్నికల్లో మోదీ అవినీతిపై పోరాటం గురించి మాట్లాడారు. ఈ రోజు మోదీజీ కర్ణాటకకు వచ్చి అవినీతిపై పోరాటం గురించి మాట్లాడితే బాగుంటుంది. ఈ రాష్ట్రంలో ఆయన అవినీతి గురించి మాట్లాడితే కర్ణాటక మొత్తం నవ్వుతుంది'' అని రాహుల్ వ్యాఖ్యానించారు.

    కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వాన్ని 40 పర్సెంట్ ప్రభుత్వంగా రాహుల్ గాంధీ అభివర్ణించారు. ప్రభుత్వ ప్రాజెక్టుల్లో మంత్రులు... కాంట్రాక్టర్ల నుంచి 40 శాతం కమీషన్లను డిమాండ్ చేస్తున్నారని రాహుల్ అన్నారు.

    రాహుల్ వాదనలో నిజమెంత? పూర్తి వివరాలు ఈ కథనంలో..

  4. హైదరాబాద్: భోల‌క్‌పూర్ కార్పొరేట‌ర్ గౌసుద్దీన్ అరెస్టు

    విధి నిర్వ‌హ‌ణ‌లో ఉన్న పోలీసుల‌తో దురుసుగా ప్ర‌వ‌ర్తించారంటూ భోల‌క్‌పూర్ ఎంఐఎం కార్పొరేట‌ర్ మ‌హ్మ‌ద్ గౌసుద్దీన్‌ను హైదరాబాద్‌లోని ముషీరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.

    గౌసుద్దీన్‌పై 353, 506 IPC సెక్ష‌న్ల కింద కేసు న‌మోదు చేశారు.

    సోమవారం అర్ధరాత్రి పోలీసులు భోల‌క్‌పూర్ ప్రాంతానికి వెళ్లారు. సమయం మించిపోయిందని, తెరిచి ఉన్న షాపులను మూసివేయాలని కోరారు.

    అయితే, రంజాన్ సమయం కనుక ఎక్కువసేపు షాపులు తెరిచి ఉంచామంటూ కొందరు షాపు యజమానులు వారితో వాగ్వాదానికి దిగారు.

    అప్పుడు అక్కడికి వచ్చిన కార్పొరేటర్ గౌసుద్దీన్ డ్యూటీలో ఉన్న పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు.

    తెలంగాణ మంత్రి కేటీఆర్ ఈ విషయంపై సీరియస్‌గా స్పందించారు. చట్టప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

  5. బ్రేకింగ్ న్యూస్, భారత్‌లో కరోనా కొత్త వేరియంట్ కలకలం.. మహారాష్ట్రలో తొలి కేసు గుర్తింపు

    భారత్‌లో కరోనావైరస్ కొత్త వేరియంట్ XE తొలి కేసు మహారాష్ట్రలోని ముంబయిలో నమోదైనట్లు ముంబయి మహా నగర పాలక సంస్థ (బీఎంసీ) అధికారులు ప్రకటించారు.

    మంగళవారం సేకరించిన 230 శాంపిళ్లలో 228 శాంపిళ్లు ఒమిక్రాన్ వేరియంట్‌కు సంబంధించినవి కాగా, రెండు కేసుల్లో ఒకటి XE, మరొకటి కప్పా వేరియంట్‌గా గుర్తించారు.

    అయితే, XE వేరియంట్ సోకిన వ్యక్తిలో ఎలాంటి తీవ్ర అనారోగ్య లక్షణాలు కనిపించలేదని అధికారులు తెలిపారు.

    డెల్టా వేరియంట్ తర్వాత వచ్చిన ఒమిక్రాన్ భారత్‌లో పెద్దగా ప్రభావం చూపలేదు. అయితే, ఇప్పటికీ దేశవ్యాప్తంగా రోజుకు వెయ్యి వరకు కొత్త కేసులు నమోదవుతున్నాయి.

    మరణాల సంఖ్య బాగా తగ్గింది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా కరోనా మరణాలు 5లక్షల 21వేలకు పైగా నమోదయ్యాయి.

  6. శ్రీలంక, చైనా మధ్య పెరుగుతున్న దూరం భారత్‌కు కలిసొస్తుందా?

    గత రెండు దశాబ్దాలలో భారత, శ్రీలంకల మధ్య బలమైన సంబంధాలు ఏర్పడకపోవడానికి ముఖ్య కారణం చైనా.

    గడిచిన ఇరవై సంవత్సరాలలో శ్రీలంకలోని ప్రభుత్వాలు చైనాతో మంచి సంబంధాలు కొనసాగించాయి.

    శ్రీలంక, తమ దేశంలోని పెద్ద పెద్ద ప్రాజెక్టుల కోసం చైనా సహాయం అర్థించింది. చాలా వాటిల్లో చైనా పెట్టుబడులు పెట్టింది.

    అయితే, సహాయం అందిస్తున్న సాకుతో చైనా, శ్రీలంకను అప్పుల ఊబిలోకి దింపుతోందనే విమర్శలూ ఉన్నాయి.

    శ్రీలంక ఇప్పుడు పూర్తిగా మునిగిపోయింది. తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. దీనికి కారణం చైనా మాత్రమే కాకపోయినప్పటికీ, అక్కడి ప్రభుత్వ నిర్వహణలోపం, పెద్ద పెద్ద ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను తలకెత్తుకోవడం, జనాదరణ పొందేందుకు ప్రత్యేక విధానాల అమలు వంటి ఎన్నో కారణాలు ఉన్నాయి.

    ఈ కష్ట సమయంలో పాత నేస్తం భారత్ సహాయం అందించడం, మరోవైపు, నమ్ముకున్న చైనా మొండి చేయి చూపించడం కూడా కనిపిస్తోంది.

  7. ఆకలిని రష్యా ఆయుధంగా ప్రయోగిస్తోంది: జెలియన్‌స్కీ

    యుక్రెయిన్ భూభాగాన్ని గెలుచుకోవటానికి రష్యా.. ఆకలిని ఆయుధంగా ప్రయోగిస్తోందని యుక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలియెన్‌స్కీ ఆరోపించారు.

    ఆయన బుధవారం ఐర్లండ్ పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగిస్తూ.. యుక్రెయిన్ ప్రజల జీవనాధారాలను రష్యా క్షిపణులు ధ్వంసం చేస్తున్నాయని చెప్పారు.

    యుక్రెయిన్‌లోని సముద్ర రేవులను, ఆహారం ఎగుమతి చేసే నౌకలను రష్యా బలగాలు దిగ్బంధించాయన్నారు.

    వ్యవసాయ, ఆహార ఉత్పత్తిలో ప్రపంచంలోనే అతి పెద్ద దేశాల్లో యుక్రెయిన్ ఒకటి. రష్యా చర్యల వల్ల ప్రపంచమంతటా ఆహార కొరత తలెత్తుతుందని, కోట్లాది మంది జనం ఆకలితో అలమటిస్తారని జెలియన్‌స్కీ పేర్కొన్నారు.

    ‘‘వారికి ఆకలి అనేది మాకు వ్యతిరేకంగా ప్రయోగించే ఆయుధం. మా మీద పైచేయి సాధించటానికి సామాన్య జనాన్ని పావుగా వాడుకుంటున్నారు’’ అని ఆయన ఆరోపించారు.

    రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సైనికదాడిని నిలిపివేసేలా ఆ దేశం మీద మరింత కఠినమైన ఆంక్షలు విధించాలని ఇతర ఈయూ దేశాలను ప్రభావితం చేయాలని ఆయన ఐర్లండ్ రాజకీయ నేతలను కోరారు.

  8. హైదరాబాద్ డ్రగ్స్ కేసులో ఇద్దరు అరెస్ట్

    హైదరాబాద్ నగర నార్కొటిక్ ఎన్ఫోర్సుమెంటు విభాగం పోలీసులు ఇద్దరు డ్రగ్స్ అమ్మే వ్యక్తులను అరెస్టు చేశారు. వారిలో ఒకరు విశాఖపట్నం డుంబ్రిగూడ ప్రాంతానికి చెందిన వారు.

    హైదరాబాద్, తెలంగాణల్లోని పలు డ్రగ్స్ కేసుల్లో పాత్రధారి అయిన లక్ష్మీపతిని, విశాఖ డుంబ్రిగూడ మండలం లోగిలి గ్రామానికి చెందిన గంజాయి లిక్విడ్ తయారు చేసే నగేశ్‌నూ - ఈ ఇద్దర్నీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

    లక్ష్మీపతి ఇంజినీరింగ్ చదువు మధ్యలో వదిలేసి ముందుగా డ్రగ్స్ కి బానిసై, తరువాత డ్రగ్స్ సరఫరాదారుగా మారాడు. ఇక నగేశ్, అతని కుటుంబం మొత్తం అరకు ప్రాంతంలో గంజాయి సాగులో ఉంది. దీంతో పాటూ గంజాయి నుంచి హాష్ ఆయిల్ కూడా వారు తయారు చేస్తారు. వీరిద్దరిపై గతంలో వివిధ స్టేషన్లలో కేసులు ఉన్నాయి. నగేశ్ వివిధ రాష్ట్రాల్లో విస్తృత నెట్వర్క్ ఉన్నట్టు వివరించారు పోలీసులు.

    సుమారు 50 వేల రూపాయలకు కేజీ గంజాయి ఆయిల్ కొని దాన్ని చిన్న బాటిళ్లలో దాదాపు 6 లక్షల రూపాయలకు వారు అమ్ముతున్నట్టుగా హైదరాబాద్ నార్కొటిక్స్ విభాగం డీసీపీ చక్రవర్తి తెలిపారు.

    ఈరోజు మొత్తం 840 గ్రాములు హాష్ ఆయిల్ (గంజాయి నూనె) సీజ్ చేశారు. వాటిని 5 గ్రాముల చిన్న బాటిళ్లను వారు అమ్ముతుంటారు.

    డ్రగ్స్ అమ్మేవారితో పాటూ వాటిని కొని వాడే 9 మంది కన్జ్యూమర్లను కూడా పోలీసులు అరెస్టుచేశారు. మరింత మంది కష్టమర్ల కోసం వెతుకుతున్నట్టు చెప్పారు.

  9. పాకిస్తాన్‌లో ఎన్నికలకు తేదీలు ప్రతిపాదించాలంటూ ఎన్నికల కమిషన్‌కు అధ్యక్షుడి సూచన

    పాకిస్తాన్‌లో ఎన్నికలు నిర్వహించటానికి తేదీలను ప్రతిపాదించాల్సిందిగా ఆ దేశ అధ్యక్ష కార్యాలయం.. ఎన్నికల కమిషన్‌కు సూచించింది.

    పాక్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ కార్యాలయం ఒక ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది.

    పాకిస్తాన్ రాజ్యాంగం ప్రకారం, నేషనల్ అసెంబ్లీ రద్దయిన 90 రోజుల్లోగా ఎన్నికలు నిర్వహించటానికి ఎన్నికల కమిషన్ తేదీలు ప్రతిపాదించాలని ఆ ప్రకటనలో ఉటంకించారు.

    ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ సలహా మేరకు పాక్ జాతీయ అసెంబ్లీని అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ ఏప్రిల్ 3వ తేదీన రద్దు చేశారు.

    దానికి ముందు ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం మీద ప్రతిపక్షం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని నేషనల్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ తిరస్కరించారు.

  10. రష్యాపై ఆంక్షలు.. స్వాతంత్ర్యం కోసం రష్యా చెల్లించాల్సిన మూల్యం అంటున్న పుతిన్, జెన్నీ హిల్, బీబీసీ న్యూస్, మాస్కో

    పశ్చిమ దేశాలు రష్యా మీద ఇంతకుముందు విధించిన ఆంక్షల విషయంలో ఎలా స్పందించారో.. పుతిన్ తాజా ఆంక్షల విషయంలోనూ అలాగే స్పందిస్తారని మీరు కచ్చితంగా భావించవచ్చు. రష్యా మీద ఆంక్షలు విధించటానికి పశ్చిమ ప్రపంచం అన్ని సాకులనూ వెదుకుతోందనేది ఆయన మాట.

    రష్యా అభివృద్ధిని దెబ్బతీయటానికి పశ్చిమ ప్రపంచం తమ దేశం మీద ఎన్నో ఏళ్లుగా ఆర్థిక యుద్ధం చేస్తోందని పుతిన్ గత వారంలో పేర్కొన్నారు.

    ఇక్కడ నిజానికి రష్యా ప్రజలే బాధితులని, యుక్రెయిన్‌లో జరుగుతున్న దానికి తాజా ఆంక్షలకు సంబంధం లేదని ఆ ప్రజలకు చెప్పటానికి పుతిన్ ప్రయత్నిస్తున్నారు.

    ఆయన మాటల్లో.. రష్యా తన స్వేచ్ఛా స్వాతంత్ర్యాల కోసం తప్పనిసరిగా చెల్లించాల్సిన మూల్యమే పశ్చిమ ప్రపంచపు ఆంక్షలు.

    రష్యా అధ్యక్ష భవనం కథనం ఏమిటంటే.. ఇది యుద్ధం కాదు, యుక్రెయిన్ తూర్పు భాగంలో నివసిస్తున్న రష్యన్ మాట్లాడే ప్రజల ప్రయోజనాలను కాపాడటానికి ఉద్దేశించిన స్పెషల్ మిలటరీ ఆపరేషన్.

    కానీ.. యుక్రెయినే అసలు దాడి చేస్తోందని చిత్రీకరించటం అంతకంతకూ పెరుగుతోంది. ఆ దేశం అణ్వస్త్రాలను సమకూర్చుకోవటానికి ప్రయత్నిస్తోందని, రసాయన ఆయుధాలను తయారు చేయటానికి ప్రయత్నిస్తోందని, ఆ ఆయుధాలను రష్యా మీద ప్రయోగించాలని కోరుకుంటోందని రష్యన్లకు చెప్తున్నారు.

    బుచా పట్టణం నుంచి వస్తున్న వీడియో దృశ్యాలను కొందరు రష్యన్లు చూస్తున్నారు. కానీ అవి నకిలీ వార్తలను వారికి చెప్తున్నారు.

    మరే ఇతర సమాచార వనరులు అందటం రష్యన్లకు చాలా కష్టంగా మారింది. సోషల్ మీడియా చానళ్లను కూడా చాలా వరకూ ఇక్కడ బ్లాక్ చేశారు.

    చాలా మంది రష్యన్లు తమకు ఏం చెప్తున్నారో దానినే నమ్ముతున్నారు.

  11. ఫోర్బ్స్ ప్రపంచ కుబేరుల జాబితాలో ముకేశ్ అంబానీ ఎక్కడున్నారు?

    2022 సంవత్సరంలో ప్రపంచ కుబేరుల జాబితాను ఫోర్బ్స్ విడుదల చేసింది. టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ అగ్రస్థానంలో ఉండగా.. జెఫ్ బెజోస్ రెండో స్థానంలో ఉన్నారు.

    భారతీయుల విషయానికి వస్తే.. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ భారతదేశంలో అత్యంత సంపన్నుడిగా నిలిచారు. ఆయన తర్వాతి స్థానంలో గౌతమ్ అదానీ ఉన్నారు. మొత్తం ప్రపంచ కుబేరుల జాబితాలో ముకేశ్ అంబానీ పదో స్థానంలోను, గౌతమ్ అదానీ 11వ స్థానంలోనూ ఉన్నారు.

    ఫోర్బ్స్ జాబితా ప్రకారం.. ఎలాన్ మస్క్ మొత్తం సంపద 21,900 కోట్ల డాలర్లు కాగా బెజోస్ మొత్తం సంపద విలువ 17,100 కోట్ల డాలర్లు. భారత కుబేరుల్లో ముకేశ్ అంబానీ సంపద విలువ 9,070 కోట్ల డాలర్లు కాగా.. అంబానీ సంపద విలువ 9,000 కోట్ల డాలర్లుగా ఉంది.

    ఫోర్బ్స్ జాబితాలో బిల్ గేట్స్ నాలుగో స్థానంలో, వారెన్ బఫెట్ ఐదో స్థానంలో ఉన్నారు. ఫేస్‌బుక్ యజమాని మార్క్ జుకర్‌బర్గ్ 15వ స్థానంలో నిలిచారు.

  12. పాకిస్తాన్ ప్రజాస్వామ్యాన్ని ప్రజలే కాపాడుకోవాలి: ఇమ్రాన్ ఖాన్ పిలుపు

    దేశ సార్వభౌమాధికారం, ప్రజాస్వామ్యం మీద అతిపెద్ద దాడి జరుగుతోందని.. దాని నుంచి దేశాన్ని కాపాడుకోవటానికి ప్రజలు ముందుకు రావాలని పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ పిలుపునిచ్చారు.

    దేశ సార్వభౌమాధికారం, ప్రజాస్వామ్యానికి ప్రజలే ఎల్లప్పుడూ బలమైన రక్షకులంటూ ఆయన బుధవారం ట్వీట్ చేశారు.

    పాకిస్తాన్ ప్రజాస్వామ్యం మీద విదేశీ శక్తులు దేశంలోని స్థానిక మిత్రుల సాయంతో దాడి చేస్తున్నాయని ఆయన మరోసారి ఆరోపించారు. మీర్ జాఫర్, మీర్ సాదిక్‌లు విదేశీ శక్తులకు సాయం చేస్తున్నారని నిందించారు.

    దీనికి వ్యతిరేకంగా ప్రజలు ముందుకు వచ్చి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరముందని పేర్కొన్నారు.

    ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం మీద ప్రతిపక్షం ఇటీవల అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. ఆదివారం దాని మీద ఓటింగ్ జరగటానికి ముందుగానే.. డిప్యూటీ స్పీకర్ ఆ అవిశ్వాస తీర్మానాన్ని తిరస్కరించారు.

    ఆ తర్వాత ఇమ్రాన్ ఖాన్ సలహా మేరకు అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ జాతీయ అసెంబ్లీ (పాకిస్తాన్ పార్లమెంటు)ను రద్దు చేశారు.

    ప్రస్తుతం ఈ అంశం పాకిస్తాన్ సుప్రీంకోర్టు పరిశీలనలో ఉంది.

    కొన్ని విదేశీ శక్తులు తన ప్రభుత్వాన్ని కూల్చటానికి కుట్ర పన్నుతున్నాయని, ప్రతిపక్షం వారికి సాయం చేస్తోందని ఇమ్రాన్ ఖాన్ కొన్ని రోజులుగా ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఆరోపణల్లో నిజం లేదని అమెరికా అంటోంది. ప్రతిపక్షం కూడా ఈ ఆరోపణలను తిరస్కరించింది.

  13. వైఎస్ జగన్ కూడా ఎన్టీఆర్ బాటలోనే వెళ్తున్నారా?

    ఆంధ్రప్రదేశ్‌లో మంత్రివర్గ పునర్వవస్థీకరణకు అంతా సిద్ధమయ్యింది. ఈ నెల 11న కొత్త మంత్రివర్గం కొలువుదీరబోతోంది. ఆ రోజు ఏపీ సచివాలయం వేదికగా ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు చేస్తున్నారు. దానికి అనుగుణంగా ముఖ్యమంత్రి గవర్నర్‌ని ఆహ్వానించేందుకు బుధవారం సాయంత్రం భేటీ కాబోతున్నారు. తొలగించబోతున్న మంత్రుల వివరాలు, కొత్త మంత్రివర్గం పేర్లు సమర్పించే అవకాశం ఉందని కూడా ప్రచారం సాగుతోంది.

    ఏది జరిగినా ఏపీలో ప్రస్తుత మంత్రులు దాదాపుగా వైదొలగడం ఖాయంగా ఉంది. వివిధ సమీకరణాల రీత్యా ఒకరిద్దరికి మాత్రమే మినహాయింపు ఉంటుందని ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికే ప్రకటించారు. వైసీపీ శాసనసభాపక్ష సమావేశంలో ఆయన చేసిన ప్రకటనను బట్టి సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా మంత్రులంతా దాదాపుగా రాజీనామాలు సమర్పించాల్సి ఉంటుంది.

    ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొత్తం మంత్రివర్గం రాజీనామా చేయడం ఇది రెండోసారి అవుతుంది. ప్రభుత్వానికి పూర్తి మద్ధతు ఉండగా, ఎన్నికలకు సుదూర సమయంలో మంత్రివర్గమంతా రాజీనామా చేసిన చరిత్ర ఎన్టీఆర్ హయంలో జరిగింది. అయితే అప్పట్లో ఆయన తన క్యాబినెట్ సహచరులందరినీ భర్తరఫ్ చేసేందుకు రాజీనామాలు తీసుకున్నారు.

    1989లో ఎన్నికలకు వెళ్లేందుకు అనుగుణంగా ఎన్టీఆర్ తీసుకున్న ఆ నిర్ణయం అప్పట్లో సంచలనమయ్యింది.

    ఇప్పుడు జగన్ కూడా అదే బాటలో ప్రయాణిస్తున్నారా?

  14. బుచా హత్యలను తీవ్రంగా ఖండించిన భారత్.. భద్రతామండలిలో ప్రకటన

    యుక్రెయిన్‌లోని బుచా పట్టణంలో పౌరుల హత్యలను భారతదేశం నిర్దద్వంద్వంగా ఖండించింది.

    ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత ప్రతినిధి టి.ఎస్.మూర్తి బుధవారం నాడు మాట్లాడుతూ.. ‘‘యుక్రెయిన్‌లో పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతున్న దాఖలాలు లేవు. బుచాలో పౌరులను హత్య చేసినట్లు ఇటీవల వచ్చిన వార్తలు తీవ్రంగా కలతపెడుతున్నాయి. ఈ హత్యలను మేం నిర్దద్వంద్వంగా ఖండిస్తున్నాం. దీనిపై స్వతంత్ర్య దర్యాప్తు పిలుపుకు మద్దతిస్తున్నాం’’ అని పేర్కొన్నారు.

    యుక్రెయిన్ మీద రష్యా దండయాత్ర విషయంలో భారతదేశం ఇప్పటివరకూ చేసిన ప్రకటనల్లో అతి కఠినంగా చేసిన ప్రకటన ఇదే.

    యుక్రెయిన్‌లో ‘‘విషమిస్తున్న పరిస్థితి పట్ల భారత్ తీవ్రంగా ఆందోళన చెందుతోంది. హింసను తక్షణమే ఆపివేయాలని, శత్రుత్వాలకు స్వస్తి పలకాలని మా పిలుపును పునరుద్ఘాటిస్తున్నాం. దౌత్య, చర్చల మార్గాలను అనుసరించాలని ఈ సంఘర్షణ ఆరంభం నుంచీ మేం గట్టిగా చెప్తూనే ఉన్నాం’’ అని టి.ఎస్.మూర్తి వ్యాఖ్యానించారు.

    యుక్రెయిన్‌లో తీవ్ర మానవ సంక్షోభ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని, యుక్రెయిన్‌కు, దాని పొరుగు దేశాలకు భారతదేశం మానవతా సాయం అందిస్తోందని, మందులు, ఇతర అత్యవసర సహాయ సరకులను పంపిస్తోందని చెప్పారు.

    ‘‘రాబోయే రోజుల్లో మరిన్ని వైద్య సరఫరాలు అందించటానికి మేం సిద్ధంగా ఉన్నాం’’ అని పేర్కొన్నారు.

  15. తిరుపతి వద్ద జనావాసాల్లోకి ఏనుగులు

    తిరుపతి సమీపంలో శేషాచలం అడవుల నుంచి ఏనుగులు జనవాసాల్లోకి రావటంతో ప్రజలు భయందోళనలు చెందుతున్నారు.

    రేణిగుంట మండలం తూకీవాకం గ్రామపంచాయతీ పరిధిలోని ఎర్రం రెడ్డిపాలెం వద్ద ఏనుగులు సంచరిస్తున్నాయి.

    రామకృష్ణ నగర్,వసుంధర నగర్, తూకివాకం ప్రాంతాల్లో సంచరిస్తున్న ఏనుగుల దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

    గాజులమండ్యం పోలీసులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఏనుగులను బెదరుగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు

  16. జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు మిలిటెంట్ల మృతి

    జమ్మూకశ్మీర్‌లోని ట్రాల్‌లో బుధవారం ఉదయం భద్రతా బలగాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు తీవ్రవాదులు చనిపోయారు.

    ‘‘అన్సార్ ఘ్వాజ్వాతుల్ హింద్ ఉగ్రవాది సఫత్ ముజఫర్ సోఫి అలియాస్ మువావియా, లష్కర్ ఉగ్రవాది ఉమర్ తేలి అలియాస్ తల్హాలు ఈ ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు. ఈ ఇద్దరు ఉగ్రవాదులకు ఇటీవల శ్రీనగర్‌లోని ఉగ్రవాద కార్యకలాపాల్లో ప్రమేయముంది. సర్పంచ్ సమీర్ అహ్మద్ హత్యలో కూడా వారి పాత్ర ఉంది’’ అని జమ్మూకశ్మీర్ పోలీస్ ఐజీపీ విజయ్ కుమార్ చెప్పారు.

    పౌరులు, భద్రతా బలగాల మీద దాడులను సహించేది లేదని, దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని జమ్మూకశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ మంగళవారం నాడు పేర్కొన్నారు.

    ఈ దాడులు పొరుగు దేశం ప్రోద్బలంతో జరుగుతున్నాయంటూ పాకిస్తాన్‌ను నిందిస్తూ.. లోయలో శాంతి నెలకొనటాన్ని కొందరు వ్యక్తులు జీర్ణించుకోలేకపోతున్నారని డీజీపీ వ్యాఖ్యానించారు.

  17. శ్రీలంక: జనాగ్రహంతో ఎమర్జెన్సీ ఎత్తివేసిన అధ్యక్షుడు గొటబయ రాజపక్స

    శ్రీలంకలో అత్యవసర పరిస్థితి విధించిన దేశాధ్యక్షుడు గొటబయ రాజపక్స.. దీనిపై తీవ్ర ప్రజాగ్రహం పెల్లుబకటంతో ఎమర్జెన్సీని ఉపసంహరించారు.

    ఏప్రిల్ ఒకటో తేదీన తన ఇంటి బయట జనం నిరసనకు దిగటంతో రాజపక్స ఎమర్జెన్సీ చట్టాన్ని అమలులోకి తెచ్చారు. ఈ చట్టం కింద అనుమానితులను వారంట్లు లేకుండానే అరెస్ట్ చేయవచ్చు.

    ఈ ఎమర్జెన్సీని మంగళవారం అర్థరాత్రి నుంచి ఎత్తివేస్తున్నట్లు అధ్యక్షుడు ఆదేశాలు జారీచేశారు.

    శ్రీలంక 1948లో బ్రిటన్ నుంచి స్వాతంత్ర్యం పొందిన తర్వాత ఎన్నడూ చూడనంత దారుణ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.

    దిగుమతుల మీద భారీగా ఆధారపడి ఉన్న దేశం శ్రీలంక. అయితే.. ప్రజలకు సరఫరా చేయటానికి ఆహారం కానీ.. వాహన ఇంధనాలకే కాదు, ఇళ్లకు కరెంటు ఇవ్వటానికి విద్యుత్‌ను ఉత్పత్తి చేయటానికి కూడా చమురు, బొగ్గులను దిగుమతి చేసుకోవటానికి కానీ ఆ దేశం దగ్గర డాలర్ నిల్వలు లేకుండా పోయాయి.

    జనం రోజుకు 13 గంటల విద్యుత్ కోతలు ఎదుర్కొంటున్నారు. ద్రవ్యోల్బణం భారీగా పెరిగిపోగా.. ఆహార, నిత్యావసరాలకు తీవ్ర కొరత నెలకొంది.

  18. ఇమ్రాన్ ఖాన్ దేశద్రోహి అని నిరూపణ అయితే ఏం శిక్ష విధిస్తారు?

    ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ పై ప్రతిపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానం రాజ్యాంగ విరుద్ధమని నేషనల్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఖాసిం సూరి ఆదివారం తిరస్కరించారు. అయితే, ఈ నిర్ణయం రాజ్యాంగ ఉల్లంఘన అని ప్రతిపక్షాలు ఆరోపించాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 6 ప్రకారం వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి.

    అవిశ్వాస తీర్మానాన్ని తిరస్కరించిన ఖాసీం సూరి ‘‘అవిశ్వాస తీర్మానం రాజ్యాంగానికి, దేశ సార్వభౌమాధికారానికి, స్వాతంత్య్రానికి విరుద్ధం, ఈ తీర్మానాన్ని రద్దు చేస్తూ రూలింగ్ ఇస్తున్నాను’’ అంటూ సభా కార్యకలాపాలను వాయిదా వేశారు.

    విపక్షాల అవిశ్వాస తీర్మానం బయటి శక్తుల మద్దతుతో ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్ర అని, అది విఫలమైందని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు.

    అయితే, ప్రతిపక్ష నాయకుడు షాబాజ్ షరీఫ్ మాత్రం స్పీకర్ ఖాసిం సూరి, ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ల చర్యలను "తీవ్రమైన రాజద్రోహం"గా అభివర్ణించారు. ఈ ఇద్దరి పై పాకిస్తాన్ రాజ్యాంగంలోని "ఆర్టికల్ 6" ప్రకారం చర్యలు తీసుకోవాలని, వీరు కచ్చితంగా దేశద్రోహానికి పాల్పడ్డారని అన్నారు.

    పాకిస్తాన్ రాజ్యాంగం దృష్టిలో దేశద్రోహం అంటే ఏమిటి, ఎవరు దేశద్రోహి అవుతారు అని తెలుసుకోవడానికి బీబీసీ ప్రయత్నించింది. దేశద్రోహాన్ని ఎవరు నిర్ణయిస్తారు, దేశద్రోహిపై చర్య తీసుకునే హక్కు రాజ్యాంగం ఎవరికి ఇస్తుంది, ఈ ప్రక్రియ ఎలా జరుగుతుంది?

  19. రష్యా మీద పశ్చిమ దేశాల ఆంక్షల్లో ముఖ్యమైనవి ఇవీ..

    రష్యా మీద పశ్చిమ దేశాలు మరిన్ని ఆంక్షలు విధించాయి. రష్యా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయటం లక్ష్యంగా ఈ ఆంక్షలను విధించాయి. వాటిలో ముఖ్యమైనవి ఇవీ...

    రష్యా సెంట్రల్ బ్యాంక్ ఆస్తులను పశ్చిమ దేశాలు స్తంభింపజేశాయి. విదేశీ కరెన్సీ నిల్వలు 63,000 కోట్ల డాలర్లు ఉపయోగించకుండా అడ్డుకున్నాయి.

    దేశాలకు వెలుపల నగదు బదిలీలకు ఉపయోగించే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ మెసేజింగ్ సిస్టమ్ అయిన స్విఫ్ట్ నుంచి కొన్ని రష్యా బ్యాంకులను తొలగించారు.

    రష్యా నుంచి చమురు, గ్యాస్ దిగుమతులను అమెరికా పూర్తిగా నిషేధించింది. ఈయూ, బ్రిటన్‌లు రష్యా నుంచి చమురు దిగుమతులను దశల వారీగా ఆపివేసే ప్రణాళికను అమలు చేస్తున్నాయి.

    అమెరికా, ఈయూ, బ్రిటన్‌లు ఉమ్మడిగా.. 1,000 మందికి పైగా రష్యా ప్రముఖులు, వ్యాపారుల మీద ఆంక్షలు విధించాయి. వారిలో రష్యా అధ్యక్షుడికి సన్నిహితులుగా భావించే సంపన్న వ్యాపారులు కూడా ఉన్నారు.

    సైనిక, పౌర అవసరాలకు ఉపయోగించే ద్వివిధ వినియోగ వస్తువులను రష్యాకు ఎగుమతి చేయటాన్ని కూడా బ్రిటన్, ఈయూ, అమెరికాలు నిషేధించాయి. వాహనాల విడిభాగాల వంటివి ఇందులో ఉంటాయి.

    వాహనాలు, ఉన్నతస్థాయి ఫ్యాషన్, ఆర్ట్ సహా లగ్జరీ వస్తువులను రష్యాకు ఎగుమతి చేయకుండా బ్రిటన్, ఈయూలు నిషేధించాయి.

  20. పుతిన్ ఇద్దరు కుమార్తెలపై ఆంక్షలు విధించనున్న అమెరికా

    యుక్రెయిన్‌లోని బుచా పట్టణంలో రష్యా సైన్యం యుద్ధ నేరాలకు పాల్పడ్డారని యుక్రెయిన్ ఆరోపించిన నేపథ్యంలో.. రష్యా మీద అదనపు ఆంక్షలు విధించటానికి అమెరికా, యూరోపియన్ యూనియన్‌లు సిద్ధమయ్యాయి.

    రష్యాలో కొత్త పెట్టుబడులను అమెరికా నిషేధిస్తుందని, రష్యా ఆర్థిక సంస్థల మీద, క్రెమ్లిన్ ఉన్నతాధికారులు, వారి కుటుంబాల మీద అదనపు ఆంక్షలు విధిస్తుందని శ్వేతసౌధం ప్రెస్ సెక్రటరీ జెన్ సాకి చెప్పారు.

    పుతిన్ ఇద్దరు కుమార్తెలతో పాటు.. రష్యాలో అతి పెద్ద బ్యాంకు అయిన స్బెర్బాంక్ మీద మరిన్ని ఆంక్షలు విధించే యోచనలో అమెరికా ఉన్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ ఒక కథనంలో తెలిపింది.

    మరోవైపు.. రష్యా మీద ఐదో విడత ఆంక్షలను విధించే ప్రణాళికపై యూరోపియన్ యూనియన్ రాయబారులు బుధవారం నాడు చర్చించనున్నారు. రష్యా నుంచి బొగ్గు దిగుమతిని నిషేధించటం కూడా ఈ ఆంక్షల్లో ఉంటుంది. అలాగే రష్యా యాజమాన్యంలోని లేదా నిర్వహణలోని నౌకలు ఈయూ ఓడరేవులను వినియోగించకుండా నిరోధించే అంశాన్ని కూడా ఈ ఆంక్షల్లో భాగంగా పరిశీలిస్తున్నారు.