చైనా అతిపెద్ద నగరం షాంఘై లాక్‌డౌన్: రెండేళ్లలో ఇదే తొలిసారి.. తొమ్మిది రోజులు కరోనా పరీక్షలు

కరోనా మహమ్మారి ప్రారంభమైన రెండేళ్ల కాలంలో చైనాలోని అతిపెద్ద నగరమైన షాంఘైలో లాక్‌డౌన్ విధించడం ఇదే తొలిసారి. గత నెల రోజులుగా కరోనా వ్యాప్తి పెరుగుతుండటంతో ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు ప్రకటించారు.

లైవ్ కవరేజీ

రాజేశ్ పెదగాడి and ఆలమూరు సౌమ్య

  1. ఇప్పటివరకు ఏం జరిగింది?

    యుక్రెయిన్

    యుక్రెయిన్‌ రాజధాని కీయెవ్‌ను ఆధీనంలోకి తీసుకొని, అక్కడి ప్రభుత్వాన్ని కూలదోసే ప్రయత్నంలో విఫలమైన రష్యా.. ఇప్పుడు యుక్రెయిన్‌ను కొరియాలానే రెండు ముక్కలు చేయాలని భావిస్తోందని యుక్రెయిన్ సైన్యంలోని గూఢచర్య విభాగం అధిపతి కిరిలో బుదానోవ్ హెచ్చరించారు.

    రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ‘‘కసాయి’’గా అభివర్ణించిన మరుసటి రోజు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయెల్ మెక్రాన్ దీనిపై స్పందించారు. ఇలాంటి వ్యాఖ్యలతో యుద్ధం మరింత తీవ్రమయ్యే ముప్పుందని అన్నారు.

    మరోవైపు పుతిన్‌ను రష్యా అధ్యక్ష పదవిలో కొనసాగకుండా చూడాలని రష్యన్లకు బైడెన్ పిలుపునిచ్చారు. అయితే, పుతిన్‌ను గద్దె దించేందుకు అమెరికా ప్రయత్నిస్తోందన్న వాదనను అమెరికా విదేశాంగ మంత్రి ఆంటొనీ బ్లింకెన్ ఖండించారు.

    రష్యాలో చేరే విషయంపై త్వరలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించనున్నట్లు యుక్రెయిన్‌లో రష్యా మద్దతున్న ప్రాంతం లుహాన్స్క్ చెప్పినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ ఓ కథనం ప్రచురించింది.

    అయితే, ఈ ప్రజాభిప్రాయ సేకరణ చెల్లదని యుక్రెయిన్ విదేశాంగ శాఖ వ్యాఖ్యానించింది.

  2. స్విస్ ఓపెన్ గెలిచిన పీవీ సింధు

    భారతీయ షట్లర్ పీవీ సింధు స్విస్ ఓపెన్ 2022 టోర్నమెంట్‌లో మహిళల సింగిల్స్ టైటిల్ గెలుపొందింది.

    ఫైనల్‌లో థాయిలాండ్‌ క్రీడాకారిణి బుసానన్ ఓంగ్బమ్రున్గ్‌పన్‌పై 21-16, 21-8 తేడాతో విజయం సాధించింది.

    ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పీవీ సింధును అభినందించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  3. ఐపీఎల్: 205 పరుగులు చేసిన రాయల్ ఛాలెంజర్స్

    ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆదివారంనాటి రెండో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై రాయల్స్ ఛాలెంజెర్స్ బెంగళూరు 205 పరుగులు చేసింది.

    బెంగళూరు జట్టు కెప్టెన్ ఫా డుప్లెసిస్ రికార్డు స్థాయిలో 88 పరుగులు కొట్టారు. మరోవైపు జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా 41 పరుగులు చేశారు. చివర్లో వచ్చిన దినేశ్ కార్తిక్ 32 పరుగులు కొట్టారు.

    ముంబయిలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరిగింది.

    పంజాబ్ టాస్ గెలిచినప్పటికీ జట్టు కెప్టెన్ మయాంక్ అగర్వాల్ బౌలింగ్ ఎంచుకున్నారు.

  4. ఆన్‌లైన్‌లో నకిలీ ‘రామసేతు వంతెన రాళ్లు’.. 20 గ్రాముల రాయి రూ.5,000.. దొంగతనంగా అమ్ముతున్న మాఫియా

    రామసేతు

    అరుదైన పగడపు దిబ్బల రాళ్లను ‘‘రామసేతు’’ రాళ్ల పేరుతో రూ.ఐదు వేలకు ఓ వెబ్‌సైట్ విక్రయానికి పెట్టింది. దీనిపై తమిళనాడు అటవీ విభాగం కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తోంది.

    పగడపు దిబ్బల రాళ్లను విక్రయించడంపై తమిళనాడు ప్రభుత్వం నిషేధం విధించింది.

    రామనాథపురం జిల్లాకు పొడవైన తీర ప్రాంతముంది. గల్ఫ్ ఆఫ్ మన్నార్, పాక్ జలసంధి తదితర ప్రాంతాల్లో పగడపు దిబ్బలు కనిపిస్తాయి.

    ఈ పగడపు దిబ్బలు 500కుపైగా జీవజాతులకు నిలయం. సముద్రపు తాబేళ్లు, సీహార్స్‌లు, సీకౌ తదితర జీవులను మనం వీటిలో చూడొచ్చు.

    అరుదైన ఈ పగడపు దిబ్బలను చేపలు కూడా ఆవాసంగా చేసుకుంటాయి. అయితే, ఇక్కడ లభించే రాళ్లను విక్రయించేందుకు సేకరించడంతో వీటి మనుగడే ప్రమాదంలో పడుతోంది. దీంతో ఈ రాళ్ల విక్రయాలపై తమిళనాడు ప్రభుత్వం నిషేధం విధించింది.

    ఈ పగడపు దిబ్బలను కాపాడేందుకు, వీటిని అభివృద్ధి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నాయి. కృత్రిమ పగడపు దిబ్బలను కూడా సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయి.

  5. షాంఘైలో లాక్‌డౌన్ విధించిన చైనా

    కరోనావైరస్

    ఫొటో సోర్స్, GETTY IMAGES

    కోవిడ్-19 వ్యాప్తి కట్టడికి షాంఘై నగరంలో లాక్‌డౌన్ విధిస్తున్నట్లు చైనా ప్రకటించింది. రెండేళ్ల క్రితం వైరస్ వ్యాప్తి మొదలైనప్పటి నుంచీ ఈ స్థాయిలో ఇక్కడ లాక్‌డౌన్ విధించలేదు.

    రెండు దశల్లో తొమ్మిది రోజులపాటు ఈ లాక్‌డౌన్ ఉంటుందని, ఆ సమయంలో అధికారులు భారీగా కోవిడ్-19 పరీక్షలు నిర్వహిస్తారని చైనా తెలిపింది.

    వాణిజ్యపరమైన లావాదేవీలతో రద్దీగా ఉండే షాంఘైలో నెల రోజుల నుంచీ కోవిడ్-19 కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయితే, ఇక్కడ లాక్‌డౌన్ విధిస్తే, ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోతుందని అధికారులు ఇప్పటివరకు ఆలోచించారు.

    అయితే, శనివారం రికార్డు స్థాయిలో షాంఘైలో కేసులు నమోదు కావడంతో అధికారులు లాక్‌డౌన్ ప్రకటించారు.

    ప్రభుత్వ రవాణా సదుపాయాలు ఉండబోవని అధికారులు స్పష్టంచేశారు. కంపెనీలు, పరిశ్రమలపైనా ఆంక్షలు వర్తిస్తాయని వారు వెల్లడించారు.

    వీచాట్ అకౌంట్‌లో లాక్‌డౌన్ నిబంధనలను అధికారులు పోస్ట్ చేశారు. ప్రజలు సహకరించాలని వారు కోరారు.

  6. యుక్రెయిన్ యుద్ధం: రష్యా ఓలిగార్క్‌లు లక్షల కోట్ల నల్ల ధనాన్ని ఎక్కడ దాస్తున్నారు?

    యుక్రెయిన్

    ఫొటో సోర్స్, Getty Images

    దశాబ్దాల నుంచి రష్యన్ ఓలిగార్క్‌లు బిలియన్ల కొద్దీ నల్లధనాన్ని విదేశాలకు తరలిస్తున్నారు. డొల్ల కంపెనీల్లో ఈ డబ్బును పెట్టుబడిగా పెడుతూ దీని జాడను కనుక్కోవడానికి వీలు లేకుండా చేస్తున్నారు.

    అయితే, నేడు ప్రపంచ దేశాలు ఈ ఓలిగార్క్‌ల నల్ల డబ్బు గుట్టు కనుక్కొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.

    విదేశాల్లో దాచిన రష్యన్ల నల్ల డబ్బు మొత్తంగా దాదాపు రూ. 76 లక్షల కోట్లు (ఒక ట్రిలియన్ డాలర్లు) వరకు ఉంటుందని అమెరికా మేధోమధన సంస్థ ‘‘ద అట్లాంటిక్ కౌన్సిల్’’ అంచనా వేసింది.

    ఈ ‘‘డార్క్ మనీ’’పై 2020లో సంస్థ ఓ నివేదిక విడుదల చేసింది. మొత్తం నల్ల ధనంలో నాలుగో వంతు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తోపాటు ఆయనకు సన్నిహితులైన రష్యన్ ఓలిగార్క్‌ల దగ్గరే ఉందని నివేదికలో పేర్కొన్నారు.

    ఈ డబ్బును గూఢచర్యం, ఉగ్రవాదం, లంచాలు, రాజకీయ పలుకుబడి, నకిలీ వార్తలతోపాటు ఇతర చట్ట వ్యతిరేక కార్యకలాపాల కోసం ఉపయోగించే అవకాశముందని అంచనా వేశారు.

  7. ఐపీఎల్: ముంబయి ఇండియన్స్‌పై దిల్లీ క్యాపిటల్స్ విజయం

    లలిత్ యాదవ్

    ఫొటో సోర్స్, ANI

    ఫొటో క్యాప్షన్, లలిత్ యాదవ్

    ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 15వ సీజన్ రెండో మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌పై దిల్లీ క్యాపిటల్స్ గెలిచింది.

    మొదట బ్యాటింగ్ చేసిన ముంబయి ఇండియన్స్ దిల్లీ క్యాపిటల్స్ ముందు భారీ స్థాయిలో 178 రన్ల లక్ష్యం ఉంచింది. ఆరంభంలో తడబడిన దిల్లీ.. అక్షర్ పటేల్, లలిత్ యాదవ్ మంచి ప్రదర్శన ఇవ్వడంతో మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.

    మరో పది బాల్స్ మిగిలి ఉండగానే 179 రన్లతో దిల్లీ మ్యాచ్ గెలిచింది.

    ఒకానొక దశలో 32 రన్లకే దిల్లీ మూడు వికెట్లు కోల్పోయింది. పది ఓవర్లకు స్కోర్ 75 మాత్రమే ఉండేది. అప్పటికే ఐదు వికెట్లను కోల్పోయింది. ఈ మ్యాచ్‌ను ముంబయి ఇండియన్స్ తేలిగ్గానే గెలుస్తారని అంతా అంచనా వేశారు.

    అయితే అక్షర్ పటేల్ 17 బాల్స్‌లోనే 38 రన్లు కొట్టాడు. మరోవైపు లలిత్ కూడా 38 బాల్స్‌లోనే 48 రన్లు కొట్టాడు. దీంతో విజయం దిల్లీ సొంతమైంది.

  8. ‘‘యుక్రెయిన్‌ను కొరియాలానే రష్యా రెండు ముక్కలు చేయాలని అనుకుంటోంది’’

    యుక్రెయిన్

    ఫొటో సోర్స్, Reuters

    యుక్రెయిన్‌ రాజధాని కీయెవ్‌ను ఆధీనంలోకి తీసుకొని, అక్కడి ప్రభుత్వాన్ని కూలదోసే ప్రయత్నంలో విఫలమైన రష్యా.. ఇప్పుడు యుక్రెయిన్‌ను కొరియాలానే రెండు ముక్కలు చేయాలని భావిస్తోందని యుక్రెయిన్ సైన్యంలోని గూఢచర్య విభాగం అధిపతి కిరిలో బుదానోవ్ హెచ్చరించారు.

    ముఖ్యంగా యుక్రెయిన్ తూర్పు, దక్షిణ భాగాలపైనే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ దృష్టి కేంద్రీకరిస్తున్నట్లు కిరిలో చెప్పారు.

    ‘‘ఈ రెండు ప్రాంతాలను పుతిన్ తన సైన్యం సాయంతో కలపగలిగితే, ఆయన యుక్రెయిన్‌ను రెండు ముక్కలు చేయాలని చూస్తారు.’’

    తూర్పు యుక్రెయిన్, క్రైమియాలను అనుసంధానించడమే లక్ష్యంగా పుతిన్ ముందుకు వెళ్తున్నారని ఆయన అన్నారు. అయితే, మధ్యలో వారికి మరియుపోల్ అడ్డంగా నిలుస్తోందని వివరించారు.

  9. చరిత్ర: 500 ఏళ్ల కిందట శ్రీశైలం వచ్చి, శివుడిని దర్శించుకున్న రష్యన్ నావికుడు.. మతం మారాలని పట్టుబట్టిన ముస్లిం రాజు..

    రష్యా

    ఫొటో సోర్స్, ARTEM SOBOV

    భారత్, రష్యాల మధ్య సత్సంబంధాల గురించి మనం నేడు మాట్లాడుకుంటున్నాం. కానీ, ఈ రెండు దేశాల మధ్య బంధాలు ఏనాటివి? ఈ ప్రశ్నకు సమాధానాలు 15వ శతాబ్దం వరకూ వెళ్తాయి. ఆ కాలంలోనే తొలి రష్యన్.. భారత్‌లో కాలుమోపారు. ఆయన పేరు అఫనాసీ నికితిన్.

    భారత్‌ను చూడాలనే సంకల్పం, సాహస యాత్ర కోసం గుండె నిండా ధైర్యం, ఒక గుర్రం, డైరీ.. భారత్‌లో కాలు మోపేటప్పుడే ఇవే నికితిన్ దగ్గరున్న వస్తువులు. 1469లో ఆయన భారత్‌లో అడుగుపెట్టారు.

    అప్పుడే దిల్లీలో లోధీల పాలనా కాలం మొదలైంది. విజయనగర్, బహమనీ సుల్తానుల పాలనలో దక్షిణ భారత దేశం ఉంది.

    ఇంకా బాబర్ జన్మించలేదు. వాస్కోడిగామా అప్పుడే పుట్టారు. భారత్‌ను ఆయన చేరుకోవడానికి మరో 30ఏళ్లు పడుతుంది.

    అప్పట్లో భారత్ ఎలా ఉండేది? ఆనాటి పరిస్థితులను నికితిన్ చూడటమే కాదు. వాటి గురించి సవివరంగా ఆయన తన డైరీలో రాసుకొచ్చారు.

    గుజరాత్, దీవ్‌ల మీదగుండా మహారాష్ట్రలోని తీర పట్టణం చౌల్‌కు ఆయన చేరుకున్నారు. దక్కన్‌లోని గ్రామీణ ప్రాంతాల మీదుగా ఆయన ప్రస్తుత తెలంగాణలోనూ పర్యటించారు.

    ఆయన కథను బాలీవుడ్‌లో సినిమాగా తెరకెక్కించారు. దీనిలో హిందీ సినీ ప్రముఖులు నటించారు. మహారాష్ట్రలోని చౌల్‌లో ఆయన కోసం ఒక స్మారకం కూడా కట్టారు.

    ఇంతకీ అఫనాసీ నికితిన్ ఎవరు? ఆయన కథ ఎందుకంత ముఖ్యమైనది?

  10. జీరో-కోవిడ్ స్ట్రాటజీ: కరోనా కేసులు, మరణాలు అమెరికా, బ్రిటన్‌ల కంటే చైనాలోనే తక్కువా?

    చైనా

    ఫొటో సోర్స్, GETTY IMAGES

    ప్రపంచంలో కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి ఉన్న అతి కఠినమైన విధానాలలో చైనా పాటించే జీరో-కోవిడ్ స్ట్రాటజీ కూడా ఒకటి.

    కానీ ఇటీవల ఇన్ఫెక్షన్లలో నమోదవుతోన్న పెరుగుదల ఈ స్ట్రాటజీ గురించి పునరాలోచించేలా చేస్తోంది.

    దేశవ్యాప్తంగా రోజూవారీ కేసుల్లో తాజా పెరుగుదలకు ఎక్కువగా ఒమిక్రాన్ వేరియంటే కారణం.

    ఈశాన్యంలోని జిలిన్ ప్రావిన్సు మొత్తంతో పాటు, దక్షిణాన ఉన్న టెక్ హబ్ సిటీ షెన్‌జెన్‌లోని లక్షలాది మంది ప్రజలకు లాక్‌డౌన్ పాటించాలనే ఆదేశాలు అందాయి.

    షాంఘైలాంటి ఇతర నగరాలు కూడా ప్రయాణాలపై ఆంక్షలు విధించడం ద్వారా కరోనా నిబంధనలను కఠినతరం చేశాయి.

    చైనా వ్యాప్తంగా తాత్కాలిక ఆసుపత్రులతో పాటు క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటయ్యాయి.

    అయితే అమెరికా, యూరప్‌లతో పోలిస్తే ఇక్కడ ఇన్ఫెక్షన్ రేట్లు తక్కువగానే ఉన్నాయి.

  11. ఇప్పటివరకు ఏం జరిగిందంటే..

    అంతర్జాతీయం

    యుక్రెయిన్-రష్యా యుద్ధం:

    • అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పోలండ్‌లో పర్యటిస్తున్నారు. ఆ దేశ రాజధాని వార్సాలో ఆయన ప్రసంగిస్తూ, "దేవుడి సాక్షిగా, ఈ వ్యక్తి ఇక అధికారంలో కొనసాగకూడదు" అని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గురించి వ్యాఖ్యానించారు. అయితే, బైడెన్, రష్యా ప్రభుత్వంలో మార్పు కోసం పిలుపునివ్వలేదని, పొరుగు దేశాలపై పుతిన్ అధికారం చెలాయించేందుకు అనుమతించకూడదని మాత్రమే అన్నారని ఆ తరువాత వైట్ హౌస్ సంజాయిషీ ఇచ్చింది.
    • శనివారం ఎల్వివ్‌లో భారీ పేలుళ్లు వినిపించాయి. నగర శివార్లలో దట్టంగా నల్లటి పొగలు కమ్ముకున్నాయి. యుక్రెయిన్‌కు పశ్చిమాన ఉన్న ఎల్వివ్ నగరం పోలండ్ సరిహద్దులకు సమీపంలో ఉంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పోలండ్‌ను సందర్శిస్తున్న సందర్భంలోనే ఎల్వివ్‌పై దాడి జరిగిందని, ఇది బైడెన్‌కు ఇస్తున్న సందేశమని ఆ నగర మేయర్ ఆండ్రియ్ సాడోవీ అన్నారు.
    • బైడెన్ ప్రసంగంపై పోలండ్ విదేశాంగ శాఖ స్పందించింది. "ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన దేశానికి అధ్యక్షుడు వార్సాకు వచ్చి ప్రసంగించారు. సూటిగా, స్పష్టంగా రష్యా దూకుడు గురించి మట్లాడారు"నియంతను మార్చేందుకు ఒక సమయం ఉంటుందని బైడెన్ రష్యన్లతో అన్నారు. ఇది (బైడెన్ ప్రసంగం) చాలా లోతైన, కదిలించిన అనుభవం. ప్రపంచ సమాజంలోకి పుతిన్‌ను తిరిగి ఆహ్వానించలేం. ఆయన మాటలు ఇక వినలేం. ఆయన నమ్మదగిన భాగస్వామి కారు" అని పోలండ్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లూకాస్ జసీనా బీబీసీతో అన్నారు.
    • యుక్రెయిన్‌కు 100 మిలియన్ డాలర్ల (సుమారు రూ.762 కోట్లు) పౌర భద్రతా సహాయాన్ని అందజేస్తామని అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించింది. "అవసరమైన సరిహద్దు భద్రత అందించడానికి, పౌర చట్టాలను అమలు చేసే విధానాలు కొనసాగించడానికి, కీలకమైన ప్రభుత్వ మౌలిక సదుపాయాలను రక్షించడానికి" ఈ సహాయాన్ని అందిస్తామని పేర్కొంది.
    • యుక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమీర్ జెలియెన్‌స్కీ మాట్లాడుతూ, పశ్చిమ దేశాలు తమ దేశానికి అందించే సైనిక సామాగ్రిని పెంచాలని డిమాండ్ చేశారు. రష్యాతో పోరాడడానికి నాటో ట్యాంకులు, విమానాల్లో కేవలం 1 శాతం తమ బలగాలకు అందిస్తే చాలని అన్నారు.
    • యుక్రెయిన్ యుద్ధంలో రష్యా సైన్యానికి చెందిన లెఫ్టినెంట్ జనరల్ యాకోవ్ రెజాంట్సేవ్ మరణించినట్లు యుక్రెయిన్ రక్షణ శాఖ వెల్లడించింది. యుద్ధం ప్రారంభమైన దగ్గర నుంచి ఒక జనరల్ మాత్రమే చనిపోయాని రష్యా చెబుతున్నప్పటికీ, మొత్తం ఏడుగురు అత్యున్నత స్థాయి అధికారులు మరణించినట్లు పశ్చిమ దేశాల అధికారులు భావిస్తున్నారు. ఇప్పటివరకు 1,351 మంది సైనికులు మరణించారని రష్యా పేర్కొంది. అయితే, వాస్తవ సంఖ్య అంతకన్నా చాలా ఎక్కువ అని యుక్రెయిన్ సహా పశ్చిమ దేశాలు చెబుతున్నాయి.

    క్రికెట్:

    • ఐసీసీ మహిళల ప్రపంచకప్‌లో కీలకమైన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 3 వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. న్యూజీలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల మధ్య విజయం చివరి బంతి వరకు దోబూచులాడింది. చివరి ఓవర్‌లో భారత్ గెలుపుకు కాసింత దూరంలో ఉందనగా, ఒక నోబాల్ ఆశలపై నీళ్లు జల్లింది.

    స్థానిక వార్తలు

    • అనంతపురం జిల్లా ధర్మవరం నుంచి తిరుపతి వెళుతున్న ప్రైవేట్ బస్సు మార్చి 26 శనివారం రాత్రి అదుపు తప్పి భాకరాపేట ఘాట్ లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 8 మంది చనిపోయారు. 46 మంది గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
    • ఏపీ సీఎం వైయస్‌ జగన్‌, చనిపోయిన వారి కుటుంబాలకు తక్షణ సహాయం కింద రెండు లక్షలు, చికిత్స పొందుతున్న వారికి రూ.50 వేలు ఆర్థిక సాయం ప్రకటించారు.
    • బస్సు ప్రమాదంలో మరణించినవారి కుటుంబాలకు ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలుపుతూ, రూ. 2 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
  12. యుక్రెయిన్‌లోని లుహాన్స్క్ ప్రాంతం రష్యాలో చేరడంపై రిఫరెండం నిర్వహించే అవకాశం ఉంది

    తూర్పు యుక్రెయిన్‌లోని లుహాన్స్క్ పీపుల్స్ రిపబ్లిక్ ప్రాంతం రష్యాలో చేరడంపై త్వరలో రిఫరెండం (ప్రజాభిప్రాయ సేకరణ) నిర్వహించే అవకాశం ఉందని స్థానిక వేర్పాటువాద నాయకుడు లియోనిడ్ పసెచ్నిక్ చెప్పినట్టు రష్యా ప్రభుత్వ యాజమాన్యంలోని వార్తా సంస్థ ఆర్ఐఏ వెల్లడించింది.

    ఈ ప్రాంతానికి రష్యా మద్దతు ఇస్తున్న సంగతి తెలిసిందే. దోన్యస్క్, లుహాన్స్క్ ప్రాంతాలను స్వతంత్ర భూభాగాలుగా గుర్తించినట్లు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫిబ్రవరిలో ప్రకటించారు.

    యుక్రెయిన్‌
  13. ఇథియోపియా అంతర్యుద్ధం: ‘‘ఈ యుద్ధంలో అమ్మాయిలపై అత్యాచారాలనే ఆయుధంగా వాడుతున్నారు’’

    ఇథియోపియా

    ఇథియోపియాలో 16 నెలలుగా కొనసాగుతున్న అంతర్యుద్ధం ఆపేందుకు ఒప్పందం కుదిరింది. దీంతో ఉత్తర టిగ్రేలో కరువుతో అలమటిస్తున్న కొన్ని వేల మంది ప్రజలకు సహాయం అందించేందుకు అవకాశం దొరికింది.

    టిగ్రే ప్రాంతంలో అనేక దారుణాలు చోటు చేసుకున్నాయి. ఈ యుద్ధంలో 'అత్యాచారాలను ఆయుధంగా' వాడుతున్నారని మానవ హక్కుల సంఘాలు కూడా ఆరోపించాయి.

    టిగ్రే పరిసర ప్రాంతాల్లో ఉన్న అంహారాలో ఈ యుద్ధానికి ప్రభావితమైన మహిళలతో బీబీసీ ప్రతినిధి కల్కిదాన్ ఇబెల్తాల్ మాట్లాడారు.

  14. ICC మహిళల ప్రపంచకప్: చివర్లో ఉత్కంఠ... భారత్‌కు నిరాశ... 3 వికెట్లతో దక్షిణాఫ్రికా గెలుపు

    ICC మహిళల ప్రపంచకప్

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, షెఫాలీ వర్మ, స్మృతి మంధాన

    ఐసీసీ ప్రపంచకప్‌లో కీలకమైన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 3 వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. న్యూజీలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల మధ్య విజయం చివరి బంతి వరకు దోబూచులాడింది.

    చివరి ఓవర్‌లో భారత్ గెలుపుకు కాసింత దూరంలో ఉందనగా, ఒక నోబాల్ ఆశలపై నీళ్లు జల్లింది.

    దక్షిణాఫ్రికా విజయానికి ఆఖరి 6 బంతుల్లో 7 పరుగులు చేయాల్సి ఉంది.

    దీప్తి శర్మ వేసిన తొలి బంతికి ఒక పరుగు రాగా, రెండో పరుగు చేసే క్రమంలో త్రిషా చెట్టి (7) రనౌట్ అయింది. ఆ తర్వాత వరుసగా రెండు బంతుల్లో రెండే పరుగులు వచ్చాయి. తర్వాతి బంతిని మిగ్నాన్ డు ప్రీజ్ లాంగాన్ దిశగా ఆడగా అక్కడ ఫీల్డర్ క్యాచ్ పట్టుకున్నారు. దీంతో అందరూ ఆమె అవుట్ అయిందని అనుకున్నారు.

    మిగ్నాన్ కూడా క్రీజు వదిలి పెవిలియన్ వైపు వెళ్లడం ప్రారంభించారు. కానీ అది నోబాల్‌గా తేలింది. దీంతో విజయ సమీకరణం రెండు బంతుల్లో 2 పరుగులుగా మారింది. ఇక ఎలాంటి తడబాటు లేకుండా దక్షిణాఫ్రికా ఆ రెండు పరుగులు కూడా సాధించి విజయాన్ని అందుకుంది.

    అంతకుముందు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 274 పరుగులు చేసింది.

  15. భాకరాపేట బస్సు ప్రమాదంలో మరణించినవారి కుటుంబాలకు రెండు లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని మోదీ

    భాకరాపేట బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలియజేశారు.

    ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (PMNRF) నుంచి మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడినవారికి రూ. 50 వేలు అందజేయనున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం ట్విట్టర్‌లో తెలిపింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  16. యుక్రెయిన్‌లో ఏడుగురు రష్యన్ జనరల్స్ మరణించారంటున్న పశ్చిమ దేశాల అధికారులు

    రష్యా

    ఫొటో సోర్స్, Reuters

    యుక్రెయిన్ యుద్ధంలో రష్యా సైన్యానికి చెందిన లెఫ్టినెంట్ జనరల్ యాకోవ్ రెజాంట్సేవ్ మరణించినట్లు యుక్రెయిన్ రక్షణ శాఖ వెల్లడించింది.

    రష్యా సైనికుల్లో నైతిక స్థైర్యం సన్నగిల్లడంతో సీనియర్ అధికారులు యుద్ధంలో ముందు వరుసకు చేరుకుంటున్నారని నిపుణులు భావిస్తున్నారు.

    ఖెర్సాన్ సమీపంలోని చోర్నోబైవ్కా వైమానిక స్థావరం వద్ద జనరల్ రెజాంట్సేవ్ మరణించినట్లు యుక్రెయిన్ మీడియా శుక్రవారం వెల్లడించింది. ఈ స్థావరాన్ని రష్యా కమాండ్ పోస్ట్‌గా ఉపయోగిస్తోంది. దీనిపై యుక్రెయిన్ సైన్యం అనేకసార్లు దాడి చేసిందని మీడియా రిపోర్టులు చెబుతున్నాయి.

    మరొక లెఫ్టినెంట్ జనరల్ ఆండ్రీ మోర్డ్‌విచెవ్ కూడా ఈ స్థావరంపై యుక్రేనియన్ చేసిన దాడిలో మరణించినట్లు నివేదికలు తెలుపుతున్నాయి.

    యుద్ధం ప్రారంభమైన దగ్గర నుంచి ఒక జనరల్ మాత్రమే చనిపోయాని రష్యా చెబుతున్నప్పటికీ, మొత్తం ఏడుగురు అత్యున్నత స్థాయి అధికారులు మరణించినట్లు పశ్చిమ దేశాల అధికారులు భావిస్తున్నారు.

    ఇప్పటివరకు 1,351 మంది సైనికులు మరణించారని రష్యా పేర్కొంది. అయితే, వాస్తవ సంఖ్య అంతకన్నా చాలా ఎక్కువ అని యుక్రెయిన్ సహా పశ్చిమ దేశాలు చెబుతున్నాయి.

    యుక్రెయిన్, పశ్చిమ దేశాల ప్రకారం, మృతి చెందిన రష్యా జనరల్స్ జాబితా ఇదీ..

    • యాకోవ్ రెజాంట్సేవ్: కమాండర్, 49వ కంబైన్డ్ ఆర్మీ
    • ఆండ్రీ మోర్డ్‌విచెవ్: కమాండర్, 8వ కంబైన్డ్ ఆర్మీ
    • ఒలేగ్ మిత్యేవ్: కమాండర్, 150వ రైఫిల్ డివిజన్
    • ఆండ్రీ కొలెస్నికోవ్: కమాండర్, 29వ కంబైన్డ్ ఆర్మీ
    • విటాలీ గెరాసిమోవ్: చీఫ్ ఆఫ్ స్టాఫ్, 41వ కంబైన్డ్ ఆర్మీ
    • ఆండ్రీ సుఖోవెట్‌స్కీ: డిప్యూటీ కమాండర్, 41వ కంబైన్డ్ ఆర్మీ
  17. భాకరాపేట బస్సు ప్రమాదం.. 8 మంది మృతి, 46 మందికి గాయాలు

    తిరుపతి

    ఫొటో సోర్స్, UGC

    ఫొటో క్యాప్షన్, లోయలో పడిన బస్సు

    అనంతపురం జిల్లా ధర్మవరం నుంచి తిరుపతి వెళుతున్న ప్రైవేట్ బస్సు మార్చి 26 శనివారం రాత్రి అదుపు తప్పి భాకరాపేట ఘాట్ లోయలో పడిపోయింది.

    ఈ ఘటనలో 8 మంది చనిపోయారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.

    ధర్మవరం నుంచి తిరుపతికి నిశ్చితార్థానికి వెళ్తున్న పెళ్లి బృందం ప్రయాణిస్తున్న ఈ బస్సులో 54 మంది ఉన్నారు. భాకరాపేట దాటి ఘాట్‌రోడ్‌లో తిరుపతి వైపు వస్తుండగా మలుపు దగ్గర బస్సు లోయలో పడిపోయింది.

    రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మంత్రి రామచంద్రారెడ్డి ఆదివారం పరామర్శించారు.

    సంఘటన జరిగిన వెంటనే జిల్లా కలెక్టర్, తిరుపతి ఎస్పీలు అక్కడకు చేరుకొని పోలీసు బృందాలతో సహాయక చర్యలు చేపట్టారు.

    క్షతగాత్రులను రుయా, బర్డ్, స్విమ్స్ ఆసుపత్రికి తరలించారని, ఘటనా స్థలం వద్ద ఏడుగురు మరణించగా, ఒకరు ఆస్పత్రిలో చనిపోయారని రామచంద్రారెడ్డి తెలిపారు. మిగిలిన వారందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నదని చెప్పారు.

    ఈ ఘటన పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారని, చనిపోయిన వారందరికీ తక్షణ సహాయం కింద రెండు లక్షలు, చికిత్స పొందుతున్న వారికి రూ.50 వేలు ఆర్థిక సాయం ప్రకటించారని మంత్రి తెలిపారు.

    భాకరాపేట ఘాట్ రోడ్డులో ఆర్&బి శాఖ ద్వారా తాత్కాలికంగా రైలింగ్ ఏర్పాటు చేస్తామని, నాలుగు లైన్ల రోడ్డుకు పదిహేను వందల కోట్లతో టెండర్లు పిలిచామని రామచంద్రారెడ్డి అన్నారు.

    తిరుపతి, బస్సు ప్రమాదం

    ఫొటో సోర్స్, I&PR

    ఫొటో క్యాప్షన్, క్షతగాత్రులను పరామర్శిస్తున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

    "KL30A4995 నెంబర్ గల ప్రైవేటు బస్సు పీలేరు సమీపంలోని భాకరాపేట ఘాట్‌లో మలుపును చూడకుండా ర్యాష్ డ్రైవింగ్ చేయడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని" డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ బసిరెడ్డి బీబీసీకి చెప్పారు.

    ఘటనా స్థలాన్ని ఆయన పరిశీలించారు. ప్రమాద సమయంలో బస్సులో 54 మంది ఉన్నారని, అందులో 8 మంది చనిపోగా, మిగిలిన 46 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారన్నారు.

    ఈ ఘాట్ రోడ్డులో అప్పడప్పుడు ప్రమాదాలు జరుగుతున్నాయని ఫోర్ లైన్ రోడ్డుకు ప్రతిపాదన ఉందని ఆయన అన్నారు.

  18. యుక్రెయిన్‌కు ఆయుధాలు సరఫరా చేయాలని పశ్చిమ దేశాలను కోరిన జెలియెన్‌స్కీ

    యుక్రెయిన్‌

    ఫొటో సోర్స్, Getty Images

    యుక్రెయిన్‌కు విమానాలు, ట్యాంకులు, క్షిపణి రక్షణ వ్యవస్థలను సరఫరా చేయాలని ఆ దేశ అధ్యక్షుడు వొలదిమీర్ జెలియెన్‌స్కీ పాశ్చాత్య ప్రభుత్వాలను కోరారు.

    అర్థరాత్రి వీడియో ప్రసంగంలో ఉద్రేకపూరితంగా మాట్లాడుతూ, యూరప్‌లో స్వేచ్ఛను రక్షించగల భారీ ఆయుధాలు కేవలం ధూళిని సేకరిస్తున్నాయని అన్నారు.

    రష్యా విమానాలను మెషిన్ గన్‌లతో కాల్చివేయలేమని జెలియెన్‌స్కీ అన్నారు.

    "నాటో ఏం చేస్తోంది? దాన్ని రష్యా నడుపుతోందా? వారు దేనికోసం వేచి చూస్తున్నారు? ఇప్పటికి 31 రోజులయ్యాయి. నాటోకు ఉన్న ఆయుధాల్లో కేవలం ఒక శాతం ఇమ్మని అడుగుతున్నాం. అంతకన్నా ఎక్కువేమీ అడగలేదు" అని ఆయన అన్నారు.

    స్లోవేకియా, సోవియట్ నిర్మిత ఎస్-300 ఎయిర్ డిఫెన్స్ క్షిపణులను యుక్రెయిన్‌కు పంపేందుకు సిద్ధంగా ఉందని, వాటికి ప్రత్యామ్నాయాలను ఏర్పాటు చేస్తే వెంటనే పంపగలమని ఆ దేశ ప్రధాని ఎడ్వర్డ్ హెగెర్ బీబీసీతో అన్నారు.

  19. యుక్రెయిన్: 'బతికి ఉండగానే వెనక్కి తిరిగి వెళ్ళిపోండి' - రష్యా సైనికులకు యుక్రెయిన్ హెచ్చరిక

    యుక్రెయిన్
    ఫొటో క్యాప్షన్, వ్లాడ్

    యుక్రెయిన్‌లో యుద్ధం మొదలై నెల రోజులు దాటింది. రష్యా సుమారు 2,00,000 మంది సైనికులను యుద్ధ రంగంలోకి పంపింది. రష్యా దాడుల ప్రభావం తొలుత యుక్రెయిన్‌లోని ఖార్కియెవ్ నగరంపై తీవ్రంగా పడింది.

    బీబీసీ ప్రతినిధి కెంటిన్ సోమర్‌విల్లీ , కెమెరా పర్సన్ డారెన్ కాన్‌వే యుద్ధం చేస్తున్న ఇద్దరు యుక్రెయిన్ సైనికులతో కొంత సమయం గడిపారు. ఆ ఇద్దరు సైనికులూ, యుద్ధం మొదలైనప్పటి నుంచి ముందువరసలో పోరాడుతున్నారు.

    వారు చెప్పిన యుద్ధం విశేషాలు ఇక్కడ చదవండి.

  20. యుక్రెయిన్‌కు సుమారు రూ. 762 కోట్ల పౌర భద్రతా సహాయాన్ని అందిస్తామని ప్రకటించిన అమెరికా

    యుక్రెయిన్‌కు 100 మిలియన్ డాలర్ల (సుమారు రూ.762 కోట్లు) పౌర భద్రతా సహాయాన్ని అందజేస్తామని అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించింది.

    "అవసరమైన సరిహద్దు భద్రత అందించడానికి, పౌర చట్టాలను అమలు చేసే విధానాలు కొనసాగించడానికి, కీలకమైన ప్రభుత్వ మౌలిక సదుపాయాలను రక్షించడానికి" ఈ సహాయాన్ని అందిస్తామని పేర్కొంది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    ఇప్పటివరకు ప్రశాంతంగా ఉన్న యుక్రెయిన్ నగరం ఎల్వివ్‌లో శనివారం రష్యా భారీ స్థాయిలో రాకెట్ దాడులు జరిపిన నేపథ్యంలో, అమెరికా ఈ ప్రకటన చేసింది.

    అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పోలండ్‌లో పర్యటిస్తున్నారు. ఈ దేశం, యుక్రెయిన్‌లోని ఎల్వివ్ నగరానికి కేవలం 70 కిమీ దూరంలో ఉంది.