You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

యుద్ధం తొలి దశ ముగిసిందన్న రష్యా.. యుక్రెయిన్ సరిహద్దుల్లో అమెరికా అధ్యక్షుడు బైడెన్

యూరప్ పర్యటనలోనున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పోలండ్ చేరుకున్నారు. పోలండ్‌లోని యుక్రెయిన్ సరిహద్దుల్లో శరణార్థులను బైడెన్ కలవబోతున్నారు. యుక్రెయిన్‌లో రసాయన ఆయుధాలు ఉపయోగిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని రష్యాను బైడెన్ హెచ్చరించారు.

లైవ్ కవరేజీ

రాజేశ్ పెదగాడి, వరికూటి రామకృష్ణ

  1. పోలండ్ చేరుకున్న బైడెన్.. యుక్రెయిన్ సరిహద్దుల్లో శరణార్థులతో సమావేశం

    యూరప్ పర్యటనలోనున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పోలండ్ చేరుకున్నారు.

    పోలండ్‌లోని యుక్రెయిన్ సరిహద్దుల్లో శరణార్థులను బైడెన్ కలవబోతున్నారు.

    మరోవైపు యుక్రెయిన్‌లో రసాయన ఆయుధాలు ఉపయోగిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని రష్యాను బైడెన్ హెచ్చరించారు.

  2. ఎక్స్‌ప్రెస్ రైలు ముందు దూకిన యువకుడు.. రెప్పపాటులో కాపాడిన పోలీస్

  3. RRR మూవీ రివ్యూ: ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి సినిమా ఎలా ఉందంటే..

  4. దానిశ్ ఆజాద్ అన్సారీ: యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంలోని ఏకైక ముస్లిం మంత్రి ఎవరు?, దిల్‌నవాజ్ పాషా, బీబీసీ ప్రతినిధి

    ఉత్తర్ ప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణం చేశారు. ఆయనతోపాటు 52 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో ఇద్దరు డిప్యూటీ ముఖ్యమంత్రులు, 16 మంది క్యాబినెట్ మంత్రులు, 14 మంది సహాయక మంత్రులు(స్వతంత్ర హోదా), 20 మంది సహాయక మంత్రులు ఉన్నారు.

    ఉత్తర్ ప్రదేశ్‌లో ముస్లింల జనాభా 20 శాతం వరకూ ఉంటుంది. అయితే, ఆ వర్గానికి చెందినవారు యోగి ప్రభుత్వంలో ఒక్కరే ఉన్నారు. ఆయన పేరు దానిశ్ ఆజాద్ అన్సారీ. బలియాకు చెందిన ఆయనకు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌(ఏబీవీపీ)తోనూ సంబంధముంది.

    ఇదివరకటి యోగి ప్రభుత్వంలోనూ ఒకే ఒక ముస్లిం మంత్రి ఉండేవారు. ఆయన పేరు మోహిసిన్ రాజా.

    ప్రస్తుతం మంత్రిగా బాధ్యతలు తీసుకున్న అన్సారీ వయసు 32ఏళ్లు. లఖ్‌నవూ యూనివర్సిటీ విద్యార్థి రాజకీయాల్లోనూ ఆయన పాలుపంచుకున్నారు.

  5. యుక్రెయిన్‌పై రష్యా యుద్ధం: నెల రోజులుగా యుక్రేనియన్లు ‘చాలా తెలివిగా, చురుకుగా, సృజనాత్మకంగా యుద్ధం’ ఎలా చేస్తున్నారు?, ఫ్రాంక్ గార్డెనర్, బీబీసీ సెక్యూరిటీ కరస్పాండెంట్

    యుక్రెయిన్‌పై రష్యా దాడి మొదలై నెల రోజులైంది. రష్యా దాడులను తట్టుకొని యుక్రెయిన్ నిలబడుతోంది.

    ట్యాంకులు, దళాలు, విమానాలు.. ఇలా దాదాపు అన్నింటిలోనూ రష్యా కంటే యుక్రెయిన్ తక్కువే. మరోవైపు చాలాచోట్ల రష్యా సైన్యానికి ఎదురు నిలబడి పోరాడుతున్న వారిలో స్వచ్ఛందంగా వచ్చిన యుక్రెయిన్ పౌరులే ఉన్నారు.

    యుక్రెయిన్‌ చాలా భూభాగాన్ని కోల్పోయింది. ముఖ్యంగా క్రైమియా చుట్టుపక్కల దక్షిణ ప్రాంతాలు రష్యా ఆధీనంలోకి వెళ్లిపోయాయి. 2014లోనే క్రైమియాను రష్యా ఆక్రమించిన సంగతి తెలిసిందే.

    రాజధాని కీయెవ్‌తోపాటు యుక్రెయిన్‌లోని ప్రధాన నగరాలను ఆక్రమించి, అక్కడి ప్రభుత్వాన్ని కూలదోయాలని రష్యా ప్రభుత్వం తొలుత భావించింది. అయితే, అది సాధ్యంకాదని రష్యాకు అర్థమైంది.

  6. జొరాస్ట్రియనిజం: మృతదేహాలను పక్షులకు ఆహారంగా వదిలిపెట్టే ఈ మతం ఏంటి?, జుబిన్ బెఖ్రాడ్, బీబీసీ కల్చర్

    హాలీవుడ్ చిత్రాలు స్టార్ వార్స్, గేమ్ ఆప్ థ్రోన్స్‌లను ప్రభావితం చేసింది. డివర్స్, వోల్టైర్, నీషే, ఫ్రెడ్డీ మెర్క్యురీ వంటి వారికి ప్రేరణగా నిలిచింది. ఇలా ఎందరినో ప్రేరేపించిన జొరాస్ట్రియనిజం అంటే ఏంటో తెలుసుకుందాం.

    పశ్చిమ దేశాల్లోని ఇరాన్ సంబంధిత రాజకీయాల్లో 'మనం', 'వారు' అనే చర్చ చాలా కాలం ఆధిపత్యం ప్రదర్శించింది.

    అదే సమయంలో యూఎస్, యూరప్ దేశాల విలువలను, గుర్తింపును నిర్వచించడానికి... మధ్య ప్రాచ్య దేశాలకు చెందిన అవే విలువలను విభేదించడానికి క్రైస్తవ మతాన్ని తరచుగా ఉపయోగించేవారు.

    అయినప్పటికీ, ఇప్పటికీ ఆచరణలో ఉన్న పురాతన మతం జొరాస్ట్రియనిజం గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. చాలామంది పాశ్చాత్య ఆదర్శాలు, నమ్మకాలు, సంస్కృతిగా భావించేవి నిజానికి ఇరానియన్ మూలాలు కలిగి ఉండొచ్చని తెలుస్తోంది.

  7. యుక్రెయిన్: భారత అలీన విధానం ఒత్తిడిని ఎదుర్కొంటోందా? తటస్థ వైఖరి భారత్‌కు ఇబ్బందికరంగా మారిందా?, సౌతిక్ బిశ్వాస్, బీబీసీ ప్రతినిధి

    యుక్రెయిన్ మీద వ్లాదిమిర్ పుతిన్ దండయాత్ర విషయంలో క్వాడ్ దేశాల బృందంలో ఒక్క భారతదేశం మాత్రం కొంత జంకుతోందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సోమవారం నాడు వాషింగ్టన్‌లో వ్యాపారవేత్తలతో నిర్వహించిన ఒక సమావేశంలో వ్యాఖ్యానించారు.

    చైనా ప్రభావాన్ని తిప్పికొట్టటానికి ఏర్పాటుచేసుకున్న క్వాడ్ బృందంలోని మిగతా మూడు దేశాలు అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాలు.. ''పుతిన్ దురాక్రమణ విషయంలో అత్యంత బలంగా వ్యవహరిస్తున్నాయ''ని బైడెన్ పేర్కొన్నారు.

    భారతదేశం స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచీ అలీన విదేశాంగ విధానాన్ని అవలంబిస్తోంది. ''మేం పెద్ద కూటములకు దూరంగా ఉంటాం.. అన్ని దేశాలతో స్నేహపూర్వకంగా ఉండటానికి ఏ కూటమిలోనూ చేరం'' అని తొలి భారత ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ స్వాతంత్ర్యం తొలి నాళ్లలో చెప్పారు.

    అయితే ఇప్పుడు యుక్రెయిన్ యుద్ధం.. భారత ప్రసిద్ధ అలీన విధానం మీద ఒత్తిడి తెస్తోంది.

  8. యుక్రెయిన్‌లో ఎంత మంది రష్యా సైనికులు మరణించారు?

    యుక్రెయిన్‌లో మరణించిన తమ సైనికుల వివరాలపై రష్యా రక్షణ మంత్రిత్వ స్పందించింది. ఇప్పటివరకు యుద్ధంలో 1,351 మంది తమ సైనికులు మరణించారని తెలిపింది. 3,825 మంది గాయపడినట్లు పేర్కొంది. ఈ విషయంపై రష్యా వార్తా సంస్థ రియా నోవోస్టి వివరాలు వెల్లడించింది. మృతులపై రష్యా స్పందించడం ఇది రెండోసారి.

    ఇప్పటివరకు 15,000 మందికిపైగా రష్యా సైనికులు మరణించారని యుక్రెయిన్ సైనిక వర్గాలు వెల్లడించాయి. ఈ సంఖ్యలో మృతులతోపాటు గాయపడిన వారి వివరాలు కూడా ఉండొచ్చు. మరోవైపు అమెరికా నిఘా వర్గాలు మాత్రం ఈ సంఖ్యలో సగం మంది మరణించారని అంచనా వేశాయి.

    మృతులపై తొలిసారి మార్చి 2న రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ స్పందించింది. దాడి మొదలైనప్పటి నుంచీ 498 మంది తమ సైనికులు మరణించినట్లు ఆనాడు పేర్కొంది.

    అయితే, మార్చి 21న రష్యా అనుకూల వార్తా పత్రిక కోమ్సోమోల్స్‌కయా ప్రవ్డా (కేపీ) రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వర్గాలతో మాట్లాడి మృతుల వివరాలపై ఒక కథనం ప్రచురించింది. దీనిలో 9,861 మంది రష్యన్లు మరణించినట్లు పేర్కొన్నారు.

    అయితే, ఆ తర్వాత వెబ్‌సైట్‌లో ఆ కథనంలోని కొంత భాగాన్ని తొలగించారు. తమ వెబ్‌సైట్ హ్యాకింగ్‌కు గురైందని బీబీసీతో కేపీ ఎడిటర్ చెప్పారు.

  9. యుక్రెయిన్‌లో ఇప్పటివరకు 1000 మందికిపైగా పౌరుల మృతి

    యుక్రెయిన్‌పై రష్యా దాడి మొదలైనప్పటి నుంచి నేటి వరకు 1,081 మంది పౌరులు మరణించినట్లు ధ్రువీకరించామని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కార్యాలయం శుక్రవారం వెల్లడించింది.

    అయితే వాస్తవానికి పౌరుల మరణాలు ఇంతకంటే ఎక్కువగానే ఉండే అవకాశముంది.

    భారీగా కాల్పులు జరుగుతున్న దోన్యస్క్‌ లాంటి ప్రాంతాల్లో మృతుల వార్తలను ధ్రువీకరించేందుకు తమ పరిశీలక బృందాలు ప్రయత్నిస్తున్నట్లు ఐరాస తెలిపింది.

    తాము చెబుతున్న దానికంటే మరణాల సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చని ఇదివరకు ఐరాస వెల్లడించింది. యుద్ధం జరుగుతున్న ప్రాంతాల నుంచి సమాచారం సేకరించడం చాలా కష్టం అవుతోందని పేర్కొంది.

    మరోవైపు దోన్యస్క్‌లోని మరియుపూల్‌లో దాదాపు 200 మృతదేహాలున్న భారీ శిథిల భవనం గుర్తించినట్లు ఐరాస తెలిపింది. అయితే, వీరంతా సాధారణ పౌరులేనని ధ్రువీకరించలేమని పేర్కొంది.

  10. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంలో మంత్రులు వీళ్లే..

    యోగి ఆదిత్యనాథ్ ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు.

    ఆయనతో పాటు 52 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు.

    కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రజేష్ పాఠక్‌ ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

    ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ మంత్రులందరితో సమావేశమయ్యారు.

    యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంలోని మంత్రులు వీళ్లే..

    • కేశవ్ ప్రసాద్ మౌర్య (ఉప ముఖ్యమంత్రి)
    • బ్రజేష్ పాఠక్ (ఉప ముఖ్యమంత్రి)
    • సూర్య ప్రతాప్ షాహి (మంత్రి)
    • సురేష్ కుమార్ ఖన్నా (మంత్రి)
    • స్వతంత్ర దేవ్ సింగ్ (మంత్రి)
    • బేబీ రాణి మౌర్య (మంత్రి)
    • లక్ష్మీ నారాయణ్ చౌదరి (మంత్రి)
    • జైవీర్ సింగ్ (మంత్రి)
    • ధరంపాల్ సింగ్ (మంత్రి)
    • నంద్ గోపాల్ గుప్తా 'నంది' (మంత్రి)
    • భూపేంద్ర సింగ్ చౌదరి (మంత్రి)
    • అనిల్ రాజ్‌భర్ (మంత్రి)
    • జితిన్ ప్రసాద (మంత్రి)
    • రాకేష్ సచన్ (మంత్రి)
    • అరవింద్ కుమార్ శర్మ (మంత్రి)
    • యోగేంద్ర ఉపాధ్యాయ (మంత్రి)
    • ఆశిష్ పటేల్ (మంత్రి)
    • సంజయ్ నిషాద్ (మంత్రి)
    • నితిన్ అగర్వాల్ (రాష్ట్ర మంత్రి - స్వతంత్ర బాధ్యతలు)
    • కపిల్ దేవ్ అగర్వాల్ (రాష్ట్ర మంత్రి - స్వతంత్ర బాధ్యతలు)
    • రవీంద్ర జైస్వాల్ (రాష్ట్ర మంత్రి - స్వతంత్ర బాధ్యతలు)
    • సందీప్ సింగ్ (రాష్ట్ర మంత్రి - స్వతంత్ర బాధ్యతలు)
    • గులాబ్ దేవి (రాష్ట్ర మంత్రి - స్వతంత్ర బాధ్యతలు)
    • గిరీష్ చంద్ర యాదవ్ (రాష్ట్ర మంత్రి - స్వతంత్ర బాధ్యతలు)
    • ధరమ్‌వీర్ ప్రజాపతి (రాష్ట్ర మంత్రి - స్వతంత్ర బాధ్యతలు)
    • అసీమ్ అరుణ్ (రాష్ట్ర మంత్రి - స్వతంత్ర బాధ్యతలు)
    • జేపీఎస్ రాథోడ్ (రాష్ట్ర మంత్రి - స్వతంత్ర బాధ్యత)
    • దయాశంకర్ సింగ్ (రాష్ట్ర మంత్రి - స్వతంత్ర బాధ్యతలు)
    • నరేంద్ర కశ్యప్ (రాష్ట్ర మంత్రి - స్వతంత్ర బాధ్యతలు)
    • దినేష్ ప్రతాప్ సింగ్ (రాష్ట్ర మంత్రి - స్వతంత్ర బాధ్యతలు)
    • అరుణ్ కుమార్ సక్సేనా (రాష్ట్ర మంత్రి - స్వతంత్ర బాధ్యతలు)
    • దయాశంకర్ మిశ్రా 'దయాలు' (రాష్ట్ర మంత్రి - స్వతంత్ర బాధ్యత)
    • మయాంకేశ్వర్ సింగ్ (రాష్ట్ర మంత్రి)
    • దినేష్ ఖటిక్ (రాష్ట్ర మంత్రి)
    • సంజీవ్ గోండ్ (రాష్ట్ర మంత్రి)
    • బలదేవ్ సింగ్ ఓలాఖ్ (రాష్ట్ర మంత్రి)
    • అజిత్ పాల్ (రాష్ట్ర మంత్రి)
    • జస్వంత్ సైనీ (రాష్ట్ర మంత్రి)
    • రాంకేశ్ నిషాద్ (రాష్ట్ర మంత్రి)
    • మనోహర్ లాల్ మన్ను కోరీ (రాష్ట్ర మంత్రి)
    • సంజయ్ గంగ్వార్ (రాష్ట్ర మంత్రి)
    • బ్రిజేష్ సింగ్ (రాష్ట్ర మంత్రి)
    • కేపీ మాలిక్ (రాష్ట్ర మంత్రి)
    • సురేష్ రాహి (రాష్ట్ర మంత్రి)
    • సోమేంద్ర తోమర్ (రాష్ట్ర మంత్రి)
    • అనూప్ ప్రధాన్ వాల్మీకి (రాష్ట్ర మంత్రి)
    • అనూప్ ప్రతిభా శుక్లా (రాష్ట్ర మంత్రి)
    • రాకేష్ రాథోడ్ గురు (రాష్ట్ర మంత్రి)
    • రజనీ తివారీ (రాష్ట్ర మంత్రి)
    • సతీష్ శర్మ (రాష్ట్ర మంత్రి)
    • డానిష్ ఆజాద్ అన్సారీ (రాష్ట్ర మంత్రి)
    • విజయ్ లక్ష్మి గౌతమ్ (రాష్ట్ర మంత్రి)
  11. వాంగ్ యీ: చైనా విదేశాంగ మంత్రి భారత్‌లో ఎందుకు పర్యటిస్తున్నారు? రెండు దేశాలూ మళ్లీ దగ్గరవుతున్నాయా?

    ‘‘కశ్మీర్‌పై చాలా ఇస్లామిక్ మిత్ర దేశాలు నిరసన వ్యక్తంచేస్తున్నాయి. మేం కూడా అదే విధంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. కశ్మీర్ వివాదం పరిష్కారం దిశగా ఇస్లామిక్ దేశాలు చేస్తున్న కృషికి మేం మద్దతు పలుకుతున్నాం.’’

    పాకిస్తాన్‌లో మార్చి 23న జరిగిన ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (ఓఐసీ) విదేశాంగ మంత్రుల 48వ సమావేశంలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ఈ వ్యాఖ్యలు చేశారు.

    భారత్‌ పర్యటనకు రెండు రోజుల ముందుగా వాంగ్ యీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పాక్‌లో పర్యటించిన ఆయన కాబూల్ మీదుగా భారత్‌ చేరుకున్నారు.

    భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్‌ను చైనా విదేశాంగ మంత్రి శుక్రవారం కలిశారు. మూడు గంటలపాటు వీరిద్దరూ చర్చలు జరిపారు.

    ఇంతకీ చైనా మంత్రి భారత పర్యటనకు కారణాలేంటి? దీనివల్ల భారత్‌కు లాభం ఏంటి?

  12. బ్రేకింగ్ న్యూస్, రెండోసారి ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్

    ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు యోగి ఆదిత్యనాథ్. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

    ఇతర కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కార్యకర్తలు కూడా వచ్చారు.

  13. లఖ్‌నవూ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ

    ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ రెండో సారి ప్రమాణస్వీకారం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యేందుకు లఖ్‌నవూ చేరుకున్నారు.

    ఇప్పటికే వివిధ రాష్ట్రాల నుంచి బీజేపీ నేతలు, కార్యకర్తలు సభా ప్రాంగణానికి చేరుకుంటున్నారు. బీజేపీ పాలనలోని ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు కూడా హాజరవుతున్నారు.

  14. జైశంకర్: ‘నెమ్మదిగానే అయినప్పటికీ చైనాతో సంబంధాల్లో పురోగతి కనిపిస్తోంది’

    చైనాతో భారత్ సంబంధాల్లో పురోగతి కనిపిస్తోందని, పరిస్థితులు తిరిగి సాధారణ స్థితికి వస్తాయని కేంద్రవిదేశాంగశాఖ మంత్రి జైశంకర్ అన్నారు.

    భారత పర్యటనకు వచ్చిన చైనా విదేశాంగశాఖ మంత్రి వాంగ్ యి, నేడు జైశంకర్‌తో భేటీ అయ్యారు.

    వాంగ్ యితో సుమారు మూడు గంటలపాటు సమావేశం జరిగిందని, దెబ్బతిన్న దౌత్యసంబంధాలు, అఫ్గాన్, యుక్రెయిన్, విద్య, వాణిజ్యం వంటి విషయాల మీద చర్చించినట్లు జైశంకర్ తెలిపారు.

    రెండు దేశాల మధ్య ఉన్న సరిహద్దు వివాదాలను పరిష్కరించుకునేందుకు చర్చలను మరింత వేగంగా కొనసాగించాలని అన్నారు.

    సరిహద్దుల్లో శాంతి నెలకొంటేనే రెండు దేశాల మధ్య సంబంధాలు తిరిగి సాధారణ స్థితికి వస్తాయని వెల్లడించారు.

  15. యోగి ఆదిత్యనాథ్ ప్రమాణస్వీకారానికి ప్రధాని నరేంద్ర మోదీ

    ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ రెండో సారి ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షా, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు.

    యోగి ఆదిత్యనాథ్ 2017లో తొలిసారి యూపీ ముఖ్యమంత్రి అయ్యారు.

    అలాగే బీజేపీ పాలనలోని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర బీజేపీ సీనియర్ నేతలు కూడా హాజరుకానున్నారు.

    ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, బీఎస్‌పీ అధినేత మాయావతి వంటి వారికి కూడా ఆహ్వానాలు పంపారు.

    బాబాలు, ఆధ్యాత్మిక గురువులు, పారిశ్రామికవేత్తలు కూడా ప్రమాణస్వీకార కార్యక్రమానికి రానున్నారు.

    యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేస్తున్న సందర్భంగా గోరఖ్‌పూర్ మఠంలో ప్రత్యేక పూజలు చేశారు.

  16. ఆంధ్రప్రదేశ్: పెగాసస్ హౌస్ కమిటీ ఏర్పాటు

    పెగాసస్ వివాదంపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ హౌస్ కమిటీని ఏర్పాటు చేసింది. భూమన కరుణాకర్ రెడ్డిని కమిటీ చైర్మన్‌గా నియమించారు.

    కె.భాగ్యలక్ష్మీ, గుడివాడ అమరనాథ్, కొటారి అప్పయ్య చౌదరి, కొల్లు పార్థసారథి, డా.మెరుగు నాగార్జున, మద్దాలి గిరధరరావు కమిటీలో సభ్యులుగా ఉండనున్నారు.

    టీడీపీ 2019లో అప్పటి ప్రతిపక్ష పార్టీ సభ్యులపై నిఘా పెట్టేందుకు పెగాసస్ స్పైవేర్ ఉపయోగించిందనే ఆరోపణలొచ్చాయి.

    చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెగాసస్‌ను కొనుగోలు చేశారంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించడం దుమారాన్ని రేపింది.

    రాజకీయ ప్రత్యర్థులపై నిఘా పెట్టేందుకు నాటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పెగాసస్‌ను వాడిందని, ఆ అంశంపై విచారణ జరపాలని వైసీపీ డిమాండ్ చేసింది.

    మరొక వైపు వైసీపీ ఆరోపణలను ఖండించిన నారా లోకేశ్, తాము పెగాసస్‌ను కొనుగోలు చేయలేదని చెప్పుకొచ్చారు.

  17. బ్రేకింగ్ న్యూస్, తెలంగాణ ధాన్యం కొనుగోలు: ‘కొనమని కేంద్రం చెప్పలేదు’

    ధాన్యం కొనుగోలు విషయంలో తెలంగాణ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ధాన్యం సేకరణ మీద కేసీఆర్ ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఖర్చు చేయకుండా తమను ఎలా విమర్శిస్తారంటూ ప్రశ్నించారు.

    ధాన్యం కొనుగోలు చేయమని కేంద్రం చెప్పలేదని కిషన్ రెడ్డి తెలిపారు. కేంద్రం ఇచ్చిన టార్గెట్‌ను తెలంగాణ రాష్ట్రప్రభుత్వమే పూర్తి చేయడం లేదని విమర్శించారు.

    ఇంత వరకు తెలంగాణలో ఎంత వరి సాగు చేశారో రాష్ట్ర ప్రభుత్వం తమకు చెప్పడం లేదని ఆయన అన్నారు.

  18. యుక్రెయిన్: ‘రష్యా దాడుల్లో 135 మంది పిల్లలు చనిపోయారు’

    రష్యా దాడుల్లో ఇప్పటి వరకు 135 మంది చనిపోగా 184 మంది గాయపడ్డారని యుక్రెయిన్ ప్రాసిక్యూటర్ జనరల్ కార్యాలయం తెలిపింది. లుహాన్‌స్క్ ప్రాంతంలో తాజాగా ఇద్దరు పిల్లలు చనిపోయారని వెల్లడించారు.

    జపోరిజియా ప్రాంతంలో మందుపాతర పేలి ముగ్గురు టీనేజర్లు గాయపడ్డారని, వారిని మెలిటొపోల్ హాస్పిటల్‌కు తరలించారని ప్రాసిక్యూటర్ జనరల్ కార్యాలయం వెల్లడించింది. వారి పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నట్లు తెలిపింది.

    వీటిని బీబీసీ స్వతంత్రంగా ధ్రువీకరించలేదు.

  19. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ 19 సీట్ల విమానం

    చిన్న పట్టణాలకు సైతం విమాన ప్రయాణాన్ని చేరువ చేయడంలో భాగంగా 19 సీట్ల చిన్న విమానాన్ని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారు చేసింది. ఈమేరకు దీన్ని హైదరాబాద్‌లో జరుగుతున్న ఏవియేషన్ షోలో ప్రదర్శిస్తున్నారు.

    హిందుస్థాన్ 228 అని పిలిచే ఈ విమానం ‘రన్ వే’ లేక పోయినా ల్యాండ్ అయ్యేందుకు అనుకూలంగా ఉంటుందని కంపెనీ చెబుతోంది.

    తక్కువ దూరాల మధ్య రాకపోకలకు ఉపయోగించే చిన్న ఎయిర్‌క్రాఫ్ట్స్‌కు భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉందని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ అపుర్బ రాయ్ తెలిపారు. వీటిని ఎయిర్ అంబులెన్స్, కార్గో వంటి వాటికి కూడా ఈ విమానాన్ని వినియోగించొచ్చని వివరించారు.

  20. ‘మేం వరి వేయొద్దని చెప్పినా బీజేపీ రైతులను రెచ్చగొట్టింది’

    కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనేటట్లు లేదని అందువల్ల వరి వేయొద్దని తాము తెలంగాణ రైతులకు స్పష్టంగా చెప్పామని టీఆర్‌ఎస్ నేతలు అన్నారు.

    అయినా బీజేపీ నేతలు రైతులను రెచ్చగొట్టి వరి వేయించారని ఆరోపించారు. ఎలాగైనా పోరాడి కేంద్రం ధాన్యం కొనేలా చేస్తామని అన్నారు.

    కేంద్రం ధాన్యం ఎందుకు కొనడం లేదో తెలంగాణ రైతులు, ప్రజలు రాష్ట్ర బీజేపీ నేతలను నిలదీయాలని పిలుపునిచ్చారు.