You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

వైఎస్‌ జగన్: ‘మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నాం, శాసన వ్యవస్థలో కోర్టులు వేలు పెట్టకూడదు’

కోర్టులు శాసన వ్యవస్థలో వేలు పెట్టకూడదు. కోర్టు తీర్పుల్లో గడువు పెట్టడం కూడా సరికాదు. నెల రోజుల్లో లక్షకోట్లు ఖర్చు చేయాలి, ఆరు నెలల్లో రాజధాని కట్టాలి వంటివి కోర్టులు నిర్దేశించలేవు అని వైఎస్ జగన్ అన్నారు.

లైవ్ కవరేజీ

  1. యుక్రెయిన్‌కు మరింత సైనిక సాయం, సైబర్ మద్దతు: నాటో

    యుక్రెయిన్‌కు మరింత సైనిక సరఫరాలు సాయంగా అందిస్తామని నాటో సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ చెప్పారు.

    నాటో కూటమి నేతలు గురువారం బ్రసెల్స్‌లో అత్యవసరంగా సమావేశమయ్యారు. అనంతరం స్టోల్టెన్‌బర్గ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. యుక్రెయిన్ మీద రష్యా దండయాత్ర ఈ తరంలో అతిపెద్ద భద్రతా ముప్పు అని అభివర్ణించారు. తమ స్వాతంత్ర్యం కోసం, భవిష్యత్తు కోసం యుక్రెయిన్ ఎంతో ధైర్యంగా పోరాడుతోందని ప్రశంసించారు.

    ‘‘వారికి మేం అండగా ఉన్నాం’’ అని చెప్పారు.

    యుక్రెయిన్‌కు మరిన్ని సైనిక సరఫరాలను, సైబర్ రక్షణను అందిస్తామని ప్రకటించారు. దానితోపాటు.. అణ్వాయుధాలు, జీవాయుధాల ముప్పు నుంచి కూడా యుక్రెయిన్ తనను తాను రక్షించుకోవటానికి నాటో సాయం చేస్తుందన్నారు.

    యుక్రెయిన్ మీద పుతిన్ దాడి భద్రతా వాతావరణాన్ని దీర్ఘకాలికంగా మార్చివేసిందని.. దీర్ఘకాలిక ప్రయాణానికి నాటో సంసిధ్దంగా ఉందని స్టోల్టెన్‌బర్గ్ పేర్కొన్నారు.

    నాటో కూటమి తూర్పు ప్రాంతంలో భూమి మీద అత్యధిక స్థాయి సంసిద్ధతతో మరిన్ని బలగాలను మోహరిస్తామని చెప్పారు. ఆకాశంలో మరిన్ని విమానాలను నిలుపుతామని, సముద్రంలో యుద్ధ విమాన వాహక నౌకలు, జలాంతర్గాములు, యుద్ధనౌకలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు.

    తాజా సమాచారం కోసం బీబీసీ న్యూస్ లైవ్ పేజీ చూడండి. ధన్యవాదాలు.

  2. ఉత్తరాదిని ఊపేస్తున్న తెలుగు సినిమా

    దేశ వ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ సృష్టించిన మానియా అంతా ఇంతా కాదు.

    తెలుగు సినిమా దేశ సినీ పరిశ్రమలో ఎలా వెలిగిపోతోంది?

    తన సొంత బ్రాండ్‌ని, సొంత మార్కెట్‌ను ఎలా విస్తరించుకుంది?

    ది ఎరా ఆఫ్ తెలుగు సినిమాపై బీబీసీ తెలుగు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ విశ్లేషణ వీక్లీషో విత్ జీఎస్‌లో..

  3. చంద్రబాబు: వైసీపీకి రాజధానిపై మాట్లాడే నైతిక హక్కు ఉందా?

    రాజధానిపై ప్రభుత్వ వైఖరిని విపక్ష టీడీపీ తప్పుపట్టింది. అమరావతి, మూడు రాజధానులపై మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి ఉందా అని చంద్రబాబు ప్రశ్నించారు.

    కోర్టు తీర్పుపై అభ్యంతరాలు ఉంటే పై కోర్టుకు వెళ్లాలని, అంతేకానీ ఇష్టం వచ్చినట్లు చేస్తానంటే ఎలా అని ఆయన అన్నారు.

    అధికార వికేంద్రీకరణ కాదు, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని చంద్రబాబు సూచించారు.

  4. వైఎస్ జగన్: ‘హైకోర్టు మీద గౌరవం ఉంది, రాజ్యాంగపరంగా సలహాలు తీసుకుంటున్నాం. ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తాం’

    ఆంధ్రప్రదేశ్ రాజధానిపై అసెంబ్లీలో జరిగిన చర్చలో సీఎం వైఎస్ జగన్ మాట్లాడారు.

    ఆయన ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లోనే..హైకోర్టుని అగౌరవపరచడం కోసం ఈ చర్చ జరగడం లేదు. హైకోర్టు మీద గౌరవం ఉంది. అదే సమయంలో రాష్ట్ర అసెంబ్లీకి ఉన్న అధికారాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది.

    ప్రజలు ఎన్నుకుంటేనే సభ్యులంతా అసెంబ్లీకి వచ్చారు. ఇప్పుడు సభ గౌరవాన్ని కాపాడుకోలేకపోతే చట్టాలు ఎవరు చేస్తారన్నది ప్రశ్నార్థకమవుతుంది. జ్యూడీషియరీ చట్టాలు చేస్తుందా, ఎగ్జిక్యూటివ్ చట్టాలు చేస్తుందా అన్నది ప్రశ్నగా మిగిలిపోతుంది.

    రాజధాని వికేంద్రీకరణపై తీర్మానం కూడా చేసే అధికారం సభకు లేదనడం న్యాయస్థానం తన పరిధిని దాటి శాసనవ్యవస్థలోకి ప్రవేశించడమే అవుతుంది. ఇది అవాంఛనీయం.

    రాజధాని మాస్టర్ ప్లాన్ సహా అన్నీ గ్రాఫిక్స్ రూపంలోనే ఉన్నాయి.

    సీఆర్డీయే చట్టం ప్రకారం ఆ మాస్టర్ ప్లాన్ గడువు 20 ఏళ్లు. దానిని ప్రతీ ఐదేళ్లకు సమీక్షించాలని కూడా చట్టంలో ఉంది.

    కనీస సదుపాయాలు కూడా లేని ఈ ప్రాంతంలో వాటి కోసమే ఆనాటి అంచనాల ప్రకారం 1లక్షా 9వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ ఆరేళ్లలో ఇది గణనీయంగా పెరిగి ఉంటుంది.

    రాజధాని నిర్మాణానికి కనీసం 40 ఏళ్లు పడుతుంది. ఏ రాజధాని అభివృద్ధి వెనుకనయినా దశాబ్దాల కృషి ఉంది. రాష్ట్రంలో 99శాతం మిగిలిన ప్రాంతం అభివృద్ధి కూడా ప్రభుత్వ బాధ్యతగా ఉంటుంది.

    ఈ ప్రాంతం మీద నాకు ప్రేమ ఉంది. కాబట్టే ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను. చంద్రబాబు కట్టుకోలేదు కానీ నేను కట్టుకున్నాను. అందుకే ఈ ప్రాంతంలో శాసనవ్యవస్థ కొనసాగుతుందని చెప్పడానికి నాకున్న ప్రేమ కారణం.

    రాజధానిలో ప్రాధమిక సదుపాయాల కల్పన కోసమే 15 నుంచి 20లక్షల కోట్ల వరకూ అవుతుంది. ఇది సాధ్యమేనా. ఎమోషనల్‌గా ఓట్ల కోసం నిర్ణయాలు తీసుకోవడం, ఊహాజనితంగా గ్రాఫిక్స్‌ని చూపించడం వల్ల ఉపయోగం ఉండదు.

    రాష్ట్ర ప్రభుత్వ ఎజెండా ఒక్క రాజధాని మాత్రమే కాదు.. ప్రజల పట్ల బాధ్యత ఉంది. రాష్ట్రమంతా సంక్షేమం, అభివృద్ధి చేయాల్సి ఉంది.

    సాధ్యం కాని వాటిని అమలు చేయాలని కోర్టులు కూడా నిర్దేశించలేవు. రాజ్యాంగ పరంగా సలహాలు తీసుకుంటున్నాం. ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తాం.

    అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందేలా, పరిపాలనా, అభివృద్ధి వికేంద్రీకరణ ప్రక్రియను కొలిక్కి తీసుకురావడమే కాకుండా, రాజధాని కోసం భూములిచ్చిన రైతుల ప్రయోజనాల కూడా కాపాడుతాం. వారికి కూడా అండగా ఉంటాం. వికేంద్రీకరణ విషయంలో వెనకడుగువేయం.

    అందరి ఆత్మగౌరవం అందులోనే ఉంది. అడ్డంకులు ఎదురయినా అదే సరైన మార్గం కాబట్టి వికేంద్రీకరణను అనుసరిస్తాం. చట్టసభకు సర్వాధికారాలున్నాయి కాబట్టి, రాబోయే తరాల భవితవ్యం కోసం వికేంద్రీకరణ మినహా మరో మార్గం లేదు అని వైఎస్ జగన్ అన్నారు.

  5. బ్రేకింగ్ న్యూస్, వైఎస్‌ జగన్: ‘మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నాం, శాసన వ్యవస్థలో కోర్టులు వేలు పెట్టకూడదు. కోర్టు తీర్పుల్లో గడువు పెట్టడం కూడా సరికాదు’

    ఆంధ్రప్రదేశ్ రాజధానిపై అసెంబ్లీలో జరిగిన చర్చలో సీఎం వైఎస్ జగన్ మాట్లాడారు.

    ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే..

    మనుగడలో లేని చట్టం గురించి కోర్టులు తీర్పు ఎలా ఇస్తాయి?

    మూడు రాజధానుల చట్టాన్ని ఉపసంహరించుకున్న తర్వాత రాజధాని మారుస్తారనే ఊహాగానాలతో తీర్పు రాకూడదు.

    మూడు వ్యవస్థలు ఎవరి పరిధిలో వారు వ్యవహరించాలి. కానీ న్యాయవ్యవస్థ శాసనవ్యవస్థలో జోక్యం చేసుకోవడం తగదు.

    ప్రభుత్వ తీరు నచ్చకపోతే ప్రజలు ఇంటికి పంపించేస్తారు. గత ప్రభుత్వం చేసిన చట్టాలు, విధానాలు ప్రజలకు నచ్చలేదు కాబట్టే 86 శాతం సీట్లు మాకు ఇచ్చారు.

    ఈ విధానాలను ప్రజలు వ్యతిరేకించారనడానికి ఇదే తార్కాణం.

    కోర్టులు శాసన వ్యవస్థలో వేలు పెట్టకూడదు. కోర్టు తీర్పుల్లో గడువు పెట్టడం కూడా సరికాదు. నెల రోజుల్లో లక్షకోట్లు ఖర్చు చేయాలి, ఆరు నెలల్లో రాజధాని కట్టాలి వంటివి కోర్టులు నిర్దేశించలేవు. ఇది కూడా సరికాదు.

    సభ ద్వారా ప్రజా ప్రభుత్వం అందరికీ బాధ్యత వహిస్తుంది. అభివృద్ధి లేకపోవడం వల్లే తెలంగాణ ఉద్యమం వచ్చింది. అభివృద్ధి కేంద్రీకృతం కావడం వల్లనే వచ్చిందని జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ కూడా చెప్పింది.

    వికేంద్రీకరణ ద్వారానే ఏపీలోని అన్ని ప్రాంతాలకు న్యాయం జరుగుతుందని రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం వచ్చిన శివరామకృష్ణన్ కమిటీ కూడా చెప్పింది.

    మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో వాటిని పరిగణనలోకి తీసుకున్నాం.

    మూడు రాజధానులకు ప్రభుత్వం నేటికీ కట్టుబడి ఉంది.

    రాష్ట్ర రాజధాని, సీఆర్డీయే చట్టాలకు సంబంధించి కోర్టు తీర్పు కారణంగానే సభలో మాట్లాడాల్సి వస్తోంది.

    హైకోర్టు తీర్పు రాజ్యాంగపరంగానే కాకుండా రాష్ట్ర శాసనసభ అధికారాలను కూడా ప్రశ్నించేలా ఉంది అని వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు.

  6. రష్యా, యుక్రెయిన్‌లకు మరియుపోల్‌ ఎందుకంత కీలకం?

    యుక్రెయిన్, రష్యా యుద్ధంలో భీకర బాంబు దాడులకు గురైన నగరం మరియుపోల్.

    రష్యా దాడుల్లో ఈ నగరం 90 శాతం ధ్వంసమైంది. ఈ రేవు పట్టణం రెండు దేశాలకు ఎందుకంత కీలకం?

  7. మారుతీ సుజుకీ కొత్త సీఈఓగా హిసాషీ తకెయిచి

    కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ కొత్త ఎండీ, సీఈఓగా హిసాషీ తకెయిచి నియమితులయ్యారు. ఈ ఏడాది ఏప్రిల్ 1న బాధ్యతలు చేపట్టనున్న ఆయన, 2025 మార్చి 31 వరకు ఈ పదవిలో ఉంటారు.

    1986లో సుజుకీ మోటార్‌లో చేరిన హిసాషీ, అంచెలంచెలుగా ఎదుగుతూ 2021లో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్(కమర్షియల్) డైరెక్టర్‌గా మారుతీ సుజుకీలో జాయిన్ అయ్యారు.

  8. ఆంధ్రప్రదేశ్: ‘కోర్టులే పాలనాపరమైన నిర్ణయాలు తీసుకుంటే ఇక ప్రభుత్వాలు ఏమి చేయాలి?

    ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మూడు రాజధానుల వ్యవహారంపై చర్చ నడుస్తోంది. వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి ఇలా అన్నారు...

    • తీర్పులు ఇచ్చే వారు మరింత అప్రమత్తంగా ఉండాలి.
    • శాసనవ్యవస్థ మీద న్యాయవ్యవస్థకు గౌరవం లేకుంటే ప్రజాస్వామ్యం ఎలా నిలబడుతుంది?
    • ప్రతి విషయంలో న్యాయవ్యవస్థలు జోక్యం చేసుకుంటే ప్రభుత్వాలు ఎలా నడుస్తాయి?
    • ప్రభుత్వాలు ప్రజలకు జవాబుదారీగా ఉంటాయి? మరి శాసనవ్యవస్థ పనితీరును సమీక్షించే న్యాయవ్యవస్థ ఎవరికి జవాబుదారీగా ఉండాలి?
    • పలాన జడ్జి ఉన్న బెంచ్‌కు కేసు వెళితే పలానా విధంగా తీర్పు వస్తుందని నేడు ప్రజలు, లాయర్లు చెప్పే స్థితి నేడు ఉంది.
    • కోర్టులే స్వయంగా పూనుకొని పాలనాపరమైన నిర్ణయాలు తీసుకుంటే ఇక ప్రభుత్వాలు ఏమి చేయాలి?
    • తాము తీసుకునే పాలనా పరమైన నిర్ణయాలకు కోర్టులు ఎవరికి జవాబుదారీగా ఉంటాయి?
    • శాసనవ్యవస్థకు కోర్టులు ప్రత్యామ్నాయం కాగలవా?
    • శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు గాడి తప్పితే సరిదిద్దే కమిషన్ ఒకటి ఏర్పాటు చేయాలి.
  9. చెన్నై సూపర్ కింగ్స్ కొత్త కెప్టెన్‌గా రవీంద్ర జడేజా

    చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా బాధ్యతలు చేపట్టారు. తొలి సీజన్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్‌ను మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్‌గా నడిపిస్తున్న విషయం తెలిసిందే.

  10. ఆంధ్రప్రదేశ్: ‘మారిన ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు తీసుకోకూడదంటే ఎన్నికలు ఎందుకు?’

    మారిన ప్రభుత్వానికి విధానపరమైన నిర్ణయాలు తీసుకునే అధికారం లేదంటే ఇక ఎన్నికలు ఎందుకు? ఓట్లు ఎందుకు? అని వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాద రావు అన్నారు.

    ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల వ్యవహారంపై అసెంబ్లీలో జరుగుతున్న చర్చ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

    ప్రజలు కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారంటే దాని అర్థం, ఉన్న చట్టాలను మార్చమనేనని... పాత విధానాలు నచ్చక కొత్త విధానాలు కావాలని ప్రజలు తీర్పు ఇచ్చినట్లుగా దాన్ని భావించాలని ఆయన అన్నారు.

    విధానపరమైన విధానాలు తీసుకునే అధికారం లేకపోతే ఇక ప్రభుత్వాలకు పని ఏముంటందని, ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను ఎలా నెరవేరుస్తారని ధర్మాన ప్రశ్నించారు.

    అన్ని వ్యవస్థలు రాజ్యాంగాన్ని గౌరవించినప్పుడే అందరికీ గౌరవం ఉంటుందని చెప్పారు.

  11. బ్రేకింగ్ న్యూస్, ఆంధ్రప్రదేశ్: ‘చట్టాలు చేసే అధికారం శాసనవ్యవస్థదే... కోర్టులది కాదు’

    ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల వ్యవహారంపై అసెంబ్లీలో చర్చ జరుగుతోంది. భారతదేశంలోని ఒక వ్యవస్థ మరొక వ్యవస్థ పనుల్లో జోక్యం చేసుకోకూడదని వైసీపీ ఎమ్మెల్వే ధర్మాన ప్రసాద రావు అన్నారు.

    న్యాయవ్యవస్థల గురించి సుప్రీం కోర్టు గతంలో వివిధ కేసుల సందర్భంగా ఏమన్నదో ధర్మాన ఇలా చెప్పారు...

    • కార్యనిర్వాహక వ్యవస్థలో న్యాయవ్యవస్థ జోక్యం చేసుకూడదు.
    • శాసనవ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ సరిగ్గా పని చేయకపోతే ప్రజలు చూసుకుంటారు. వచ్చే ఎన్నికల్లో తమ తీర్పు ఇస్తారు.
    • జూడిషియల్ యాక్టివిజం కన్నా జూడిషియల్ రిస్ట్రెయింట్ ముఖ్యం. అప్పుడే సమస్యలు ఉండవు.
    • మూడు వ్యవస్థలు సమానమే అనే విషయాన్ని న్యాయవ్యవస్థ గుర్తించాలి. అందరికీ మేం అతీతులం అనే భావననను న్యాయవ్యవస్థ విడనాడాలి.
    • అన్ని విషయాల మీద న్యాయమూర్తులకు పూర్తి అవగాహన ఉంటుందని భావించకూడదు.
    • చట్టాలు చేసే అధికారం శాసనవ్యవస్థది మాత్రమే. ఆ అధికారం పార్లమెంటు, అసెంబ్లీలకు మాత్రమే ఉంది. చట్టాలు రాజ్యాంగానికి లోబడి ఉన్నాయా లేవా అని వాటిని రివ్వూ చేయడం వరకే న్యాయవ్యవస్థ పాత్ర. అంతేకానీ కొత్త చట్టాలు చేసే అధికారం కోర్టులకు లేదు.
    • కోర్టులు ప్రభుత్వాన్ని నడపకూడదు.

    ధర్మాన ప్రసాద రావు ప్రసంగం:

    • ప్రభుత్వం మారితే విధానపరమైన నిర్ణయాలు తీసుకునే అధికారం లేదంటే ఇక ఎన్నికలు ఎందుకు? ఓట్లు ఎందుకు?
    • ప్రజలు కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారంటే దాని అర్థం ఉన్న చట్టాలను మార్చమని. పాత విధానాలు నచ్చలేదు. కొత్త విధానాలు కావాలని ప్రజలు కోరడమే.
    • కొత్త విధానాలను శాసనవ్యవస్థ మాత్రమే తీసుకురాగలదు.
    • సమాజంలో అసమనాతలను తొలగించేది కూడా శాసనవ్యవస్థ మాత్రమే.
  12. అసదుద్దీన్ ఓవైసీ: ‘చైనా విదేశాంగశాఖ మంత్రి అధికారికంగానే భారత్‌కు వస్తున్నారా?’

    చైనా విదేశాంగశాఖ మంత్రి యాంగ్ యి భారత పర్యటకు వస్తున్నారనే వార్తలపై ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు.

    యాంగ్ యి పర్యటనపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

    ‘చైనా విదేశాంగశాఖ మంత్రి అధికారికంగానే భారత్‌లో పర్యటిస్తున్నారా? అలా అయితే లద్ధాఖ్ వద్ద సరిహద్దు వివాదాలు పరిష్కారం అయ్యేంత వరకు చైనాతో సాధారణ దౌత్యసంబంధాలు ఉండవు అన్న మన పాలసీకి ఇది ఎలా పొసుగుతుంది?’ అంటూ పీఎంఓకు ఓవైసీ ట్వీట్ చేశారు.

  13. టీడీపీ: ‘నేడు ఆంధ్రప్రదేశ్‌లో మద్యం కంపెనీలను నడుపుతోంది వైసీపీ నేతలే’

    ఆంధ్రప్రదేశ్‌లో మద్యం అమ్మకాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెబుతున్నారని తెలుగు దేశం పార్టీ నాయకులు ఆరోపించారు.

    నేడు వైసీపీ నాయకుల కనుసన్నులలో మద్యం కంపెనీలన్నీ నడుస్తున్నాయని అన్నారు. వాస్తవాలను బయటకు తీయాలంటే జూడిషియల్ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు.

    జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత 103 కొత్త బ్రాండ్లు తీసుకొచ్చినట్లు తమకు ఆర్‌టీఐ ద్వారా తెలిసిందని కింజారపు అచ్చెన్నాయుడు అన్నారు.

    టీడీపీ నేతలకు చెందిన డిస్టలరీ కంపెనీలను వైసీపీ వాళ్లే లాక్కుని నడిపిస్తున్నారని ఆరోపించారు.

  14. బ్రేకింగ్ న్యూస్, ‘కేంద్రంలో 10 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయ్’

    దేశంలో నిరుద్యోగం మీద టీఆర్‌ఎస్ పార్టీ ఎంపీలు పార్లమెంటులో నిరసనకు దిగారు. దేశంలో అనేక ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలున్నాయని, వాటిని కేంద్ర ప్రభుత్వం భర్తీ చేయడం లేదని టీఆర్‌ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు.

    కేంద్రంలో దాదాపు 10 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వాటిని వెంటనే భర్తీ చేయాలని కె.కేశవరావు డిమాండ్ చేశారు.

    గత ఎనిమిదేళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో వెల్లడించాలని టీఆర్ఎస్ ఎంపీలు డిమాండ్ చేశారు. యువత నిరుద్యోగంతో ఆత్మహత్య చేసుకుంటున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

    నేడు దేశంలో నిరుద్యోగం పెద్ద సమస్యగా ఉందని, దాన్ని కేంద్ర ప్రభుత్వం పరిష్కరించడం లేదని చెప్పుకొచ్చారు.

    ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోదీ సర్కారు ఇచ్చిన హామీలు యువతను మోసం చేయడానికే అని నామా విమర్శించారు.

  15. యుక్రెయిన్ యుద్ధం: అమెరికా దౌత్యవేత్తలను బహిష్కరిస్తామన్న రష్యా

    అమెరికా తీసుకున్న నిర్ణయానికి ప్రతీకారంగా తమ దేశంలోని ఆ దేశ దౌత్యవేత్తలను బహిష్కరిస్తామని రష్యా తెలిపింది. రష్యాకు చెందిన 12 మంది దౌత్యవేత్తలను బహిష్కరిస్తామని అమెరికా ప్రకటించిన నేపథ్యంలో రష్యా ఈ నిర్ణయం తీసుకుంది.

  16. ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో చిడతలు వాయించిన టీడీపీ సభ్యులు... సభ నుంచి సస్పెన్షన్

    ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో చిడతలు వాయిస్తూ నిరసనలకు దిగారు టీడీపీ సభ్యులు. దాంతో సభ కార్యకలాపాలకు అడ్డుతగులుతున్నారంటూ వారిని శాసనమండలి చైర్మన్ సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసిన బయటకు వెళ్లకుండా సభ లోపలే టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. దాంతో మార్షల్స్‌ను పిలిపించి వారిని బయటకు పంపించారు.

  17. యుక్రెయిన్: ‘ప్రపంచవ్యాప్తంగా రష్యాకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టండి’

    యుక్రెయిన్ మీద రష్యా దాడి మొదలై నెల రోజులు అవుతున్న సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా రష్యాకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేపట్టాలని యుక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలియెన్‌స్కీ పిలుపునిచ్చారు.

    రష్యా యుద్ధం చేస్తోంది యుక్రెయిన్‌కు వ్యతిరేకంగా మాత్రమే కాదని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల స్వేచ్ఛ మీద కూడా అది దాడి చేస్తోందని ఆయన అన్నారు. అందువల్ల రష్యాను అడ్డుకునేందుకు అందరూ కలిసి రావాలని కోరారు.

    ‘ఇళ్లు, ఆఫీసులు, యూనివర్సిటీలు, స్కూళ్ల నుంచి అందరూ బయటకు రండి. శాంతి కోసం, స్వేచ్ఛ కోసం, యుక్రెయిన్ ప్రజల కోసం... యుక్రెయిన్ చిహ్నాలు ధరించి వీధుల్లోకి రావాల’ని జెలియెన్‌స్కీ వీడియో సందేశంలో పిలుపునిచ్చారు.

  18. కర్నాటక: హిందువుల ఉత్సవాల్లో ముస్లిం వ్యాపారుల స్టాల్స్ వద్దంటూ ఫ్లెక్సీలు... చర్యలు తీసుకుంటామన్న పోలీసులు

    కర్నాటకలో హిందువుల ఉత్సవాలు, పండుగల సమయంలో ముస్లిం వ్యాపారులు స్టాల్స్ ఏర్పాటు చేయడాన్ని కొన్ని దేవాలయాల కమిటీలు నిషేధించడంపై ఆ రాష్ట్ర మైనారిటీస్ కమిషన్ స్పందించింది.

    ఉడుపిలో హిందూ దేవాలయాలు ముస్లిం వ్యాపారులను నిషేధించడంపై సంబంధిత వర్గాలతో చర్చలు జరుపుతున్నట్లు కర్నాటక స్టేట్ మైనారిటీస్ కమిషన్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ తెలిపారు.

    కొన్ని సంవత్సరాలుగా కర్నాటకలో ఉత్సవాలు, పండుగల సందర్భంగా హిందూ దేవాలయాల వద్ద ముస్లింలు స్టాల్స్ ఏర్పాటు చేస్తూ వస్తున్నారు.

    విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించడంపై కర్నాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుకు నిరసనగా కర్నాటకలో చాలా మంది ముస్లిం వ్యాపారులు తమ దుకాణాలను బంద్ చేశారు. దీంతో పండుగలు, ఉత్సవాల సమయంలో స్టాల్స్ ఏర్పాటు చేయకుండా ముస్లిం వ్యాపారులను నిషేధించడం ప్రారంభించాయి హిందూ దేవాలయాల కమిటీలు.

    శివమొగ్గలో పేరుగాంచిన ‘కోటే మారికాంబ జాతర’లో హిందువులు మాత్రమే స్టాల్స్ ఏర్పాటు చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది నిర్వాహక కమిటీ.

    అలాగే ఉడుపి జిల్లాలోని కాపు టౌన్‌లో గల మారీ గుడి నిర్వాహకులు కూడా వార్షిక ఉత్సవాల్లో ముస్లిం వ్యాపారులు పాల్గొనకుండా నిషేధించినట్లు వార్తలు వచ్చాయి.

    ఇక ముస్లిం వ్యాపారులు స్టాల్స్ ఏర్పాటు చేయకూడదంటూ మంగళూరు జిల్లాలోని బప్పనాడు దుర్గా పరమేశ్వరి దేవాలయ ప్రాంగణంలో ఫ్లెక్సీలు వెలిశాయి.

    అయితే ఆ ఫ్లెక్సీలకు తమకు ఎటువంటి సంబంధం లేదని దేవాలయ నిర్వాహణ కమిటీ చెబుతోంది.

    ఇలా ఫ్లెక్సీలు పెడుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందని, అందుకు కారణమైన వారిని గుర్తించిన తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు.

  19. శ్రీలంక పెట్రోలు బంకులకు సైన్యం కాపల

    శ్రీలంకలో పెట్రోలు బంకుల వద్ద అల్లర్లు చెలరేగకుండా చూసేందుకు, ఆ దేశ సైన్యం పహారా కాస్తోంది. శ్రీలంక ఆర్థికవ్యవస్థ ఎంతగా దిగజారిందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ.

    ఇప్పుడు అక్కడ ధరలు మండిపోతున్నాయి. సరుకులు, కూరగాయలు కొనలేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

    మరి శ్రీలంక పరిస్థితి ఇంతగా దిగజారడానికి కారణం ఏమిటి?

  20. జెలియెన్‌స్కీ: ‘మా మిత్రులు ఎవరో మమ్మల్ని మోసం చేసేది ఎవరో చూస్తాం’

    బ్రస్సెల్స్‌లో పశ్చిమదేశాల నేతలు సమావేశమవుతున్న తరుణంలో యుక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలియెన్‌స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు.

    నేటి నుంచి ప్రారంభం అవుతున్న జీ7, నాటో, యురోపియన్ యూనియన్ సమావేశాలలో తమ గొంతును గట్టిగా వినిపిస్తామన్నారు జెలియెన్‌స్కీ.

    అయితే తన మీద ఆధారపడ్డ యురోపియన్ దేశాలను యుక్రెయిన్‌కు అండగా నిలవకుండా చేసేందుకు రష్యా ప్రయత్నిస్తుందంటూ పశ్చిమ దేశాలను హెచ్చరించారు జెలియెన్‌స్కీ.

    ‘రష్యా ఇప్పటికే యురోపియన్ దేశాలతో లాబియింగ్ మొదలుపెట్టింది. రష్యాకు యుద్ధ ప్రయోజనాలే ముఖ్యం. కొన్ని దేశాలతో వాళ్లు ఈ దిశగా పని చేస్తున్నట్లు మాకు తెలుసు.

    మా మిత్రులు ఎవరో, మా భాగస్వాములు ఎవరో, డబ్బు కోసం మమ్మల్ని మోసం చేసేది ఎవరో... ఈ సమావేశాల్లో చూస్తామ’ని ఆయన అన్నారు.

    యూరప్ 40శాతం ఇంధన అవసరాలకు రష్యా సరఫరా చేసే గ్యాసే ఆధారం. రష్యా మీద తీవ్రమైన ఆర్థిక ఆంక్షలు విధిస్తున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఇంధన వనరుల కోసం యూరప్ దేశాలు చూస్తున్నాయి.