You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

యుక్రెయిన్: కీయెవ్‌లో షాపింగ్ సెంటర్‌పై రష్యా క్షిపణి దాడి, ఎనిమిది మంది మృతి

యుక్రెయిన్ రాజధాని కీయెవ్ నగరంలోని పొడిల్‌స్కీయి జిల్లాలో ఒక షాపింగ్ సెంటర్ మీద, పలు ఇళ్ల మీద రష్యా బాంబు దాడులు జరపటంతో ఎనిమిది మంది పౌరులు చనిపోయారని యుక్రెయిన్ అధికారులు తెలిపారు.

లైవ్ కవరేజీ

సతీష్ ఊరుగొండ, వరికూటి రామకృష్ణ

  1. ఇవాళ్టి ప్రధానాంశాలు

    యుక్రెయిన్ రాజధాని కీయెవ్‌లో షాపింగ్‌ సెంటర్‌, ఇళ్లపై రష్యా బాంబు దాడులు చేయడంతో ఎనిమిది మంది చనిపోయారు.

    కీయెవ్‌లో మళ్లీ కర్ఫ్యూ విధించారు. ఇళ్లు, షెల్టర్ల నుంచి బయటకు రావద్దని నగర మేయర్ ఆదేశించారు.

    ‘నాటో తమను వెంటనే కూటమిలో చేర్చుకోవాలని’ అడిగారు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియెన్‌స్కీ.

    మరియుపోల్‌ను తమకు అప్పగిస్తే హుమానిటేరియన్ కారిడార్స్ ఏర్పాటు చేసేందుకు అంగీకరిస్తామని రష్యా రక్షణమంత్రిత్వశాఖ ప్రకటించింది. కానీ ఇందుకు యుక్రెయిన్ అంగీకరించలేదు.

    చైనాలో 132 మందితో ప్రయాణిస్తున్న విమానంపర్వత ప్రాంతాల్లో కూలిపోయింది.

    ఆరునూరైనాముందస్తు ఎన్నికల ముచ్చటేలేదని కేసీఆర్ అన్నారు. ఈసారి 95 నుంచి 105 స్థానాలుగెలుస్తామని ఆయన చెప్పారు.

    చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు ప్రభుత్వం పెగాసస్‌ సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేసిందనే ఆరోపణల నేపథ్యంలో ఈ అంశంపై సమగ్ర విచారణ కోసం హౌస్ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు.

    యుక్రెయిన్, రష్యా తాజా సమాచారం కోసం బీబీసీన్యూస్ లైవ్ పేజీ చూడండి. ధన్యవాదాలు

  2. 'కేజీ చికెన్ 1000, ఒక్కో గుడ్డు 35.. కిలో ఉల్లిపాయలు 250, బియ్యం 200'

    పేపర్లు, ప్రింటింగ్ కోసం ఇంక్ కొనలేక ప్రభుత్వం పరీక్షలు రద్దు చేసింది.

    ప్రస్తుతం అక్కడ పరిస్థితి 1970ల్లో వచ్చిన కరువు కన్నా దారుణంగా ఉంది.

    ఇంతలా అక్కడ ఆర్థిక పరిస్థితి ఎందుకు దిగజారిందంటే...

  3. బీజేపీ ప్రభుత్వం పోవాలి.. దేశంలో పరివర్తన రావాలి.. అందుకోసం ప్రశాంత్ కిషోర్ నాతో కలిసి పనిచేస్తారు: కేసీఆర్

    ''కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్నిరకాలుగానూ విఫలమైంది. ఈ ప్రభుత్వం పోవాలి. ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలి. ప్రగతిశీల విధానంలో పనిచేసే ప్రభుత్వం కావాలి. అందుకోసం మేం కృషి చేస్తాం'' అని తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు పేర్కొన్నారు.

    ''నేనిప్పుడు జాతీయ రాజకీయాలు చేస్తున్నాను. అందులో నాన్చుడు లేదు. జాతీయ రాజకీయాల్లో ఒక శూన్యత ఉంది. ఆ ఖాళీని భర్తీ చేయటానికి మేం ప్రయత్నిస్తున్నాం. 2024లో సంపూర్ణ క్రాంతి వైపు భారతదేశం ప్రయాణిస్తుంది'' అని కేసీఆర్ పేర్కొన్నారు.

    కేసీఆర్ సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లో విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. రైతుల కోసం తెలంగాణ రాష్ట్ర సమితి ఉగాది తర్వాత దిల్లీలో ధర్నా చేస్తుందని తెలిపారు. టీఆర్‌ఎస్‌ రైతు ధర్నాకు అందరూ కలిసి రావాలని కోరారు. ఆహార ధాన్యాల సేకరణలో దేశం మొత్తం ఒకే రకమైన విధానం ఉండాలన్నారు. పంజాబ్‌లో లాగానే తెలంగాణ వరి ధాన్యాన్ని 100 శాతం కేంద్రం కొనుగోలు చేయాలన్నారు.

    ''మేం కోరేది గొంతెమ్మ కోరిక కాదు. పంజాబ్‌లో తరహాలోనే తెలంగాణలో కూడా పండిన ధాన్యం తీసుకుని, మద్దతు ధర ఇవ్వండి. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి చేతులెత్తి నమస్కరిస్తూ సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ ప్రజలతో పెట్టుకోవద్దు. మేం తప్పకుండా ఉద్యమిస్తాం. మీరే భంగపడతారు'' అని కేసీఆర్ పేర్కొన్నారు.పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  4. సుమీ నగరంలో అమ్మోనియా ట్యాంక్ ధ్వంసం.. ప్రజలకు హెచ్చరిక జారీ

    యుక్రెయిన్‌లోని ఈశాన్య నగరం సుమీలో ఒక రసాయన పరిశ్రమ నుంచి అమ్మోనియా లీక్ అవుతోందని ప్రాంతీయ గవర్నర్ దిమిత్రో ఝీవిట్‌స్కీ చెప్పారు.

    ఈ గ్యాస్ ప్రమాదకరమని, కాబట్టి సుమిఖిమ్‌ప్రామ్‌ ప్లాంటు చుట్టూ ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉన్న వారంతా ఆ ప్రాంతం విడిచి వెళ్లాలని ఆయన హెచ్చరించారు.

    స్థానిక కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున 4:30 గంటలకు ఈ గ్యాస్ లీక్ జరిగినట్లు ఆయన తన టెలిగ్రామ్ చానల్‌లో తెలిపారు.

    మొత్తం 2.60 లక్షల మంది జనాభా ఉన్న సుమీ నగరం రష్యా సరిహద్దుకు కేవలం 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

    రష్యా షెల్లింగ్ దాడిలో సుమిఖిమ్‌ప్రామ్‌ ప్లాంటులోని 50 టన్నుల అమ్మోనియా ట్యాంక్ దెబ్బతిన్నదని.. దానివల్ల అమ్మోనియా గ్యాస్ మేఘం ఏర్పడిందని అధికారులు తెలిపారు.

    ప్లాంటు చుట్టూ 2.5 కిలోమీటర్ల పరిధి మేర ఈ అమ్మోనియా మేఘం ప్రభావం ఉందని దిమిత్రో చెప్పారు. ప్లాంటులో పనిచేసే ఒక కార్మికుడు గాయపడ్డట్లు తెలిసిందన్నారు.

    గాలి వీచే దిశను బట్టి.. సమీపంలోని నొవొసెలిత్స్యా నగర జనం సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని ఆయన సూచించారు.

    ఎరువుల తయారీకి అమ్మోనియాను భారీ మొత్తంలో ఉపయోగిస్తారు. ఈ గ్యాస్ బారిన పడితే శ్వాసనాళాలకు, కళ్లకు తీవ్ర కాలిన గాయాలు అవుతాయి.అమ్మోనియా గ్యాస్ లీక్‌ను నియంత్రించామని ఆ తర్వాత యుక్రెయిన్ అధికారులు చెప్పారు.

  5. యుక్రెయిన్ రాజధాని కీయెవ్‌లో షాపింగ్ సెంటర్ మీద క్షిపణి దాడి.. ఆరుగురు మృతి

    యుక్రెయిన్ రాజధాని కీయెవ్ నగరంలోని పొడిల్‌స్కీయి జిల్లాలో.. ఒక షాపింగ్ సెంటర్ మీద, పలు ఇళ్ల మీద రష్యా బాంబు దాడులు జరపటంతో ఎనిమిది మంది పౌరులు చనిపోయారని యుక్రెయిన్ అధికారులు తెలిపారు.

    యుక్రెయిన్ స్టేట్ ఎమర్జెన్సీ సర్వీస్ విడుదల చేసిన ఒక వీడియోలో.. ఆ షాపింగ్ సెంటర్ మీద క్షిపణి పేలుడు దృశ్యాలు కనిపిస్తున్నాయి.

    శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించటానికి అగ్నిమాక సిబ్బంది ప్రయత్నిస్తున్న దృశ్యాలూ ఉన్నాయి.

  6. మరియుపూల్ లొంగిపోవాలన్న రష్యా.. తిరస్కరించిన యుక్రెయిన్

    మరియుపూల్ నగరం స్థానిక కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 5 గంటల కల్లా లొంగిపోవాలని రష్యా రక్షణ మంత్రిత్వశాఖ డిమాండ్‌ చేయగా.. అందుకు యుక్రెయిన్ తిరస్కరించింది.

    ఇప్పటికే ఈ నగరాన్ని చుట్టుముట్టిన రష్యా బలగాలు కొద్ది రోజులుగా ఉధృతంగా దాడులు చేస్తున్నాయి.

    రష్యా ప్రభుత్వ సంస్థ అయిన రియా నొవోస్టీ న్యూస్ ఏజెన్సీ కథనం ప్రకారం.. తమ లొంగుబాటు ప్రతిపాదనకు రాతపూర్వకంగా సమాధానం ఇస్తే.. పౌరులు నగరం విడిచి వెళ్లటానికి ఉదయం 10 గంటల కల్లా మానవతా కారిడార్లను తెరుస్తామని రష్యా రక్షణ మంత్రిత్వశాఖ చెప్పింది.

    లొంగుబాటు నిబంధనలకు అంగీకరించకపోతే స్థానిక అధికారులను ‘మిలటరీ ట్రైబ్యునల్’ విచారిస్తుందని.. రష్యా నేషనల్ సెంటర్ ఫర్ డిఫెన్స్ మేనేజ్‌మెంట్ అధిపతి కల్నల్ జనరల్ మిఖాయిల్ మిజిన్‌త్సేవ్ చెప్పినట్లు రియా నొవోస్టీ పేర్కొంది.

    అయితే.. లొంగుబాటు ప్రశ్నే లేదని యుక్రెయిన్ ఉప ప్రధానమంత్రి ఐరీనా వెరెష్చుక్ సోమవారం తెల్లవారుజామున స్పష్టంచేశారు.

    ‘‘ఈ విషయాన్ని రష్యా వాళ్లకు తెలియజేశాం’’ అని ఆమె చెప్పినట్లు యుక్రేనిస్కా ప్రావ్దా తెలిపింది.

    రష్యా వేలాది మంది పౌరులను బలప్రయోగంతో అక్రమంగా రష్యాకు తరలిస్తోందని మరియుపూల్ నగర మండలి శనివారం నాడు ఆరోపించింది.

  7. ఆంధ్రప్రదేశ్: పెగాసస్ అంశంపై హౌస్ కమిటీ

    గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పెగాసస్‌ను కొనుగోలు చేసిందనే ఆరోపణల మధ్య, నేడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పెగాసస్‌పై చర్చ జరిగింది.

    ఈ అంశంపై సమగ్ర విచారణ కోసం హౌస్ కమిటీ వేయాలని, ఆంధ్రప్రదేశ్ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డితో పాటు ఇతర సభ్యులు స్పీకర్‌ను కోరారు.

    సభ్యుల వినతి మేరకు హౌస్ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు.

    అయితే 2019 మే నాటికి ఆంధ్రప్రదేశ్‌లో పెగాసస్ సాఫ్ట్‌వేర్‌ను ప్రభుత్వం కొనుగోలు చేయలేదని సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు.

    చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో ఆయన ఇంటెలిజెన్స్ అధిపతిగా పని చేశారు. నాడు వెంకటేశ్వరరావే పెగాసస్ సాఫ్ట్‌వేర్‌ను కొన్నారనేది ఆరోపణ.

  8. చైనా: పర్వతాల్లో కూలిన విమానం... చెలరేగిన మంటలు

    సుమారు 132 మందితో ప్రయాణిస్తున్న చైనా ఈస్ట్రన్ ఎయిర్‌లైన్స్ విమానం గ్వాంగ్సీ ప్రావిన్స్‌లో కూలిపోయినట్లు చైనా అధికారులు ధ్రువీకరించారు.

    విమానంలో మొత్తం 123 మంది ప్రయాణికులు, 9 మంది సిబ్బంది ఉన్నారని సివిల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ చైనా(సీఏఏ) తెలిపింది.

    ఈ విమాన ప్రమాదంలో చనిపోయిన వారి సంఖ్య, గాయపడిన వారి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

    బోయింగ్ 737-800 రకానికి చెందిన ఆ విమానం, గ్వాంగ్సీ ప్రావిన్స్‌లోని వూజో పర్వత ప్రాంతంలో కూలిపోయింది. కూలిన ప్రాంతంలో మంటలు సైతం చెలరేగినట్లు చైనా ప్రభుత్వమీడియా తెలిపింది.

    కున్మింగ్ నుంచి బయలుదేరిన ఆ విమానం గ్వాంగ్జూకు వెళ్లాల్సి ఉంది. గంటకు పైగా విమానం మాములుగానే ప్రయాణించినట్లు ఫ్లైట్ ట్రాకింగ్ సిస్టమ్ డేటా చెబుతోంది.

    2010లో హేలంగ్‌జియాంగ్ ప్రావిన్స్‌లో విమానం కూలిన తరువాత చైనాలో మరొకసారి విమాన ప్రమాదం జరగడం ఇదే తొలిసారి. నాడు ప్రమాదంలో సుమారు 42 మంది చనిపోయారు.

    ప్రమాదం జరిగిన చోటుకు సహాయక బృందాలను అధికారులు పంపారు. అయితే ఇంతవరకు ఈ ప్రమాదం మీద చైనా ఈస్ట్రన్ ఎయిర్‌లైన్స్ స్పందించలేదు.

    విమానం కూలింది పర్వత ప్రాంతాల్లో కాబట్టి ఫైర్ ఇంజిన్లు చేరుకోవడం కష్టమని, సహాయక బృందాలు కాలినడకనే చేరుకోవాల్సిన ఉంటుందని అధికారులు చెప్పినట్లు గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది.

    గ్లోబల్ టైమ్స్ ప్రకారం తాజా కూలిన బోయింగ్-737 విమానం 2015 నుంచి సేవలు మొదలు పెట్టింది.

  9. చైనా: ‘విమానం కూలిన చోట మంటలు’

    సుమారు 132 మందితో ప్రయాణిస్తున్న చైనా ఈస్ట్రన్ ఎయిర్‌లైన్స్ విమానం గ్వాంగ్సీ ప్రావిన్స్‌లో కూలిపోయినట్లు చైనా అధికారులు ధ్రువీకరించారు.

    విమానంలో మొత్తం 123 మంది ప్రయాణికులు, 9 మంది సిబ్బంది ఉన్నారని సివిల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ చైనా(సీఏఏ) తెలిపింది.

    ఈ విమాన ప్రమాదంలో చనిపోయిన వారి సంఖ్య, గాయపడిన వారి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

    బోయింగ్ 737-800 రకానికి చెందిన ఆ విమానం, గ్వాంగ్సీ ప్రావిన్స్‌లోని వూజో పర్వత ప్రాంతంలో కూలిపోయింది. కూలిన ప్రాంతంలో మంటలు సైతం చెలరేగినట్లు చైనా ప్రభుత్వమీడియా తెలిపింది.

    కున్మింగ్ నుంచి బయలుదేరిన ఆ విమానం గ్వాంగ్జూకు వెళ్లాల్సి ఉంది. గంటకు పైగా విమానం మాములుగానే ప్రయాణించినట్లు ఫ్లైట్ ట్రాకింగ్ సిస్టమ్ డేటా చెబుతోంది.

  10. బ్రేకింగ్ న్యూస్, కూలిన చైనా విమానం... లోపల 132 మంది ప్రయాణికులు

    చైనాకు చెందిన చైనా ఈస్ట్రన్ ఎయిర్‌లైన్స్ విమానం గ్యాంగ్సీ ప్రావిన్స్‌లో కూలినట్లుగా ఆ దేశ ప్రభుత్వ మీడియా వెల్లడించింది. విమానంలో 132 మంది ప్రయాణిస్తున్నారు.

    విమానం కూలడానికి కారణాలు, ఎవరైనా చనిపోయారా లేదా అనే విషయాలపై ఇంకా సమాచారం లేదు. ప్రమాదానికి గురైన విమానం బోయింగ్ 737గా తెలుస్తోంది.

    పర్వత ప్రాంతంలో విమానం కూలి, మంటలు వ్యాపించినట్లు చైనా ప్రభుత్వ మీడియా తెలిపింది.

  11. ఆమిర్ ఖాన్: ‘నేను కూడా కశ్మీర్ ఫైల్స్ చూస్తా’

    భారతీయులందరూ కశ్మీర్ ఫైల్స్ సినిమా చూడాలని బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ అన్నారు. తాను కూడా తప్పకుండా ఆ సినిమాను చూస్తానన్నారు.

    ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్ ఈవెంట్‌లో మాట్లాడిన ఆమిర్ ఖాన్, కశ్మీరీ పండితుల బాధలను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.

    కశ్మీర్ ఫైల్స్ సినిమా హిట్ అయినందుకు సంతోషంగా ఉందన్నారు.

  12. రాజ్యసభకు మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్

    పంజాబ్‌లో ఇటీవలే అధికారం చేపట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ, క్రికెటర్ హర్భజన్ సింగ్‌ను తాజాగా రాజ్యసభకు నామినేట్ చేసింది.

    హర్భజన్ సింగ్‌తోపాటు మరొక ఆమ్ ఆద్మీ పార్టీ నేత రాఘవ చడ్డా కూడా రాజ్యసభకు ఎంపిక అయ్యారు.

    41 ఏళ్ల హర్భజన్ సింగ్ 1980లో పంజాబ్‌లోని జలందర్‌లో జన్మించారు. ఆఫ్ స్పిన్ బౌలర్‌గా 1998 నుంచి 2016 వరకు టీం ఇండియాకు ఆడారు.

    టెస్టుల్లో 417 వికెట్లు, వన్డేలలో 269 వికెట్లు తీశారు.

  13. అసెంబ్లీలో పెగాసస్ చర్చపై టీడీపీ అభ్యంతరం

    పెగాసస్ అంశంపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చర్చించాలని అధికార పార్టీ ఎమ్మెల్యేలు భావిస్తున్న తరుణంలో స్పీకర్ తమ్మినేనికి టీడీపీ సభ్యులు లేఖ రాశారు. అసెంబ్లీలో పెగాసస్‌పై చర్చించడం సరికాదంటూ వారు అభ్యంత‌రాలు తెలిపారు.

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు పెగాసస్ సాఫ్ట్‌వేర్ కొనుగోలు చేశారంటూ ఇటీవల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యలు చేయడం వివాదంగా మారుతోంది.

    ఈ నేపథ్యంలోనే అసెంబ్లీలో దీని మీద చర్చించేందుకు చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి నోటీసు ఇచ్చారు. దీంతో స్పల్పకాలిక చర్చ చేపట్టడానికి అనుమతి ఇస్తామని స్పీకర్ తెలిపారు.

    అయితే తాము పెగాసస్ సాఫ్ట్‌వేర్ కొనలేదని టీడీపీ వాదిస్తోంది.

  14. పాకిస్తాన్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయిన దిల్లీ-దోహా విమానం

    ఖతార్ ఎయిర్‌వేస్‌కు చెందిన దిల్లీ-దోహా విమానం (QR579), అత్యవసర పరిస్థితి వల్ల పాకిస్తాన్‌‌లోని కరాచీలో దిగింది.

    విమానంలో 100 మందికిపైగా ప్రయాణికులు ఉన్నారు. కార్గో సెక్షన్‌లో పొగ రావడంతో కరాచీ విమానాశ్రయంలో అత్యవసరంగా దించినట్లు ఖతార్ ఎయిర్‌వేస్ వెల్లడించింది.

    విమానం సురక్షితగా ల్యాండ్ అయిందని, ప్రయాణికులందరూ క్షేమంగా ఉన్నారని సంస్థ తెలిపింది.

  15. 100 మంది మహిళలను, శవాలను రేప్ చేసిన వ్యక్తిని పోలీసులు ఎలా పట్టుకున్నారు?

    బ్రిటన్‌లో ఇద్దరు మహిళల హత్యలను చేధించడానికి 33 ఏళ్లు పట్టింది. కానీ ఈ కేసులను విచారించే నేపథ్యంలో భయంకరమైన వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.

    ఒక వ్యక్తి సుమారు 100 మంది మహిళలను, శవాలను రేప్ చేసినట్లు తెలిసింది. మరి ఇది ఎలా జరిగింది? 30 ఏళ్ల పాటు పోలీసులు ఎందుకు పట్టుకోలేక పోయారు?

  16. బోధన్‌లో శాంతియుతంగా సాగుతున్న బంద్

    నిజామాబాద్ జిల్లా బోధన్‌లో 144 సెక్షన్ కొనసాగుతోంది. ఆదివారం బోధన్‌లో శివాజీ విగ్రహం ఏర్పాటు సందర్భంగా గొడవలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే.

    ఈరోజు బోధన్‌లో బంద్‌కు బీజేపీ పిలుపును ఇవ్వగా బలవంతంగా దుకాణాలు మూయిస్తే కఠిన చర్యలు ఉంటాయని అడిషనల్ డీజీ నాగిరెడ్డి హెచ్చరించారు.

    బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. విద్యా, వ్యాపార సంస్థలు తెరుచుకోలేదు. పరిస్థితి నియంత్రణలోనే ఉందని పోలీసులు వెల్లడించారు.

    విగ్రహ ఏర్పాటుకు సంబంధించి మున్సిపల్ కౌన్సిల్‌లో తీర్మానం పాస్ అయినా ఇంకా కలెక్టర్, స్టేట్ కమిటీ నుంచి అనుమతి రాలేదని నిజామాబాద్ పోలీసు కమిషనర్ నాగరాజు తెలిపారు. ఎవరికి ఇబ్బంది కలగకుండా అన్ని రకాల అనుమతులు తెచ్చుకుంటే బాగుంటుందని బీబీసీతో మాట్లాడుతూ ఆయన అన్నారు.

    ప్రస్తుతం విగ్రహాన్ని ఏం చేయాలన్న అంశం పై న్యాయనిపుణులతో చర్చిస్తున్నామని, వారి సలహా మేరకు తదుపరి చర్యలు ఉంటాయని నాగరాజు వివరించారు.

    నిజామాబాద్ తో పాటు కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల అదనపు పోలీస్ బలగాలు బోధన్‌లో పహారా కాస్తున్నాయి. బయటి ప్రాంతాల నాయకులు ఎవరూ బోధన్‌లోకి ప్రవేశించకుండా పట్టణ శివార్లలో నిఘా పెట్టారు.

    వివాదానికి కారణం అయిన విగ్రహం మీద మున్సిపల్ అధికారులు ముసుగు కప్పారు.

  17. 29 పురాతన వస్తువులను భారత్‌కు తిరిగి ఇచ్చిన ఆస్ట్రేలియా

    భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్‌ల వర్చువల్ సమావేశం నేడు జరగనున్న నేపథ్యంలో సుమారు 29 పురాతన వస్తువులను భారత్‌కు తిరిగి ఇచ్చింది ఆస్ట్రేలియా.

    శివుడు, శక్తి ఆరాధన, విష్ణుమూర్తి అవతారాలు, జైన విగ్రహాలతోపాటు ఇతర అలంకార వస్తువులు వీటిలో ఉన్నాయి. ఇవన్నీ క్రీస్తుశకం 9-10వ శతాబ్దం కాలానికి చెందినవి.

    తెలంగాణ, తమిళనాడు, గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల నుంచి ఈ పురాతన వస్తువులను సేకరించారు.

    ఆస్ట్రేలియా తిరిగి ఇచ్చిన ఈ పురాతన వస్తువులను ప్రధాని నరేంద్ర మోదీ పరిశీలించారు.

  18. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికుల నిరవధిక సమ్మె

    విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 28 నుంచి నిరవధిక సమ్మె చేస్తున్నట్లు కార్మికులు నోటీసులు ఇచ్చారు. ఈమేరకు వివిధ కార్మిక సంఘాలు విశాఖ స్టీల్ ప్లాంట్ సీఎండికి నోటీసు అందించాయి.

    విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తున్నట్లు గతంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది.

    అయితే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఏడాదికి పైగా కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు ఆందోళనలు చేస్తున్నాయి.

    అయినా కేంద్రం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో ఉద్యమం ఉధృతం చేయాలని కార్మిక సంఘాలు నిర్ణయించాయి. అందులో భాగంగా నిరవధిక సమ్మె చేపట్టేందుకు సిద్ధమవుతున్నాయి.

  19. ఆంధ్రప్రదేశ్: కల్తీ సారా తయారీలో 70వేల మంది అరెస్టు

    ఆంధ్రప్రదేశ్‌లో గత ఏడాదిన్నరలో కల్తీ సారాకు సంబంధించి 70వేల మందికిపైగా వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు.

    స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో ఏర్పాటు చేసిన తరువాత కల్తీ సారా మీద కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ఆంధ్రప్రదేశ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ చెప్పారు.

    గత రెండేళ్లలో నాటు సారా తయారీకి ఉపయోగించే టన్నుల కొద్ది బెల్లాన్ని నాశనం చేసినట్లు ఆయన వెల్లడించారు.

    ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కల్తీ సారా తయారు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు రజత్ భార్గవ వివరించారు.

    ఇటీవల జంగారెడ్డి గూడెంలో 18 మంది మరణించడం వివాదంగా మారింది. వీరంతా కల్తీ సారా తాగి చనిపోయారని వారి బంధువులు, ప్రతిపక్షాలు చెబుతున్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం వారంతా సహజంగానే చనిపోయారని అసెంబ్లీలో ప్రకటించింది.

  20. జెలియెన్‌స్కీ: ‘చర్చలు విఫలమైతే మూడో ప్రపంచయుద్ధమే’

    యుక్రెయిన్ దేశాన్ని వెంటనే నాటోలో చేర్చుకోవాలని కోరారు ఆ దేశ అధ్యక్షుడు వొలదిమిర్ జెలియెన్‌స్కీ. అమెరికా మీడియా సంస్థ సీఎన్‌ఎన్‌తో ఆదివారం మాట్లాడిన ఆయన, ‘నాటో కూటమిలో మమ్మల్ని చూడాలనుకుంటే, వెంటనే చేర్చుకోవాలి’ అని ఆయన అన్నారు.

    యుక్రెయిన్ నాటోలో మెంబర్ అయి ఉంటే దాడి చేసేందుకు రష్యా సాహసించేది కాదని జెలియెన్‌స్కీ తెలిపారు.

    రష్యా దాడులను ఆపడంలో చర్చలు విఫలమైతే మూడో ప్రపంచయుద్ధం వస్తుందని ఆయన హెచ్చరించారు. చర్చల ద్వారా మాత్రమే యుద్ధాన్ని ఆపగలమని అన్న జెలియెన్‌స్కీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో నేరుగా మాట్లాడేందుకు తాను సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు.