బైడెన్, షీ జిన్‌పింగ్ వీడియో కాల్ చర్చలు.. రష్యాకు ఆయుధాలు ఇవ్వొద్దని చైనాను కోరిన అమెరికా

యుక్రెయిన్‌పై రష్యా దండయాత్ర నేపథ్యంలో రష్యాపై పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధిస్తూ ఒత్తిడి పెంచుతున్నాయి. ఇదే తరహాలో చైనా కూడా చర్యలు చేపట్టాలని అమెరికా అధ్యక్షుడు కోరుతున్నారు. దీనిపై ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటనా వెలువడలేదు.

లైవ్ కవరేజీ

వరికూటి రామకృష్ణ

  1. బైడెన్, షీ జిన్‌పింగ్ వీడియో కాల్ చర్చలు

    బైడెన్, షీ

    ఫొటో సోర్స్, Getty Images

    అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ శుక్రవారం వీడియో కాల్‌లో మాట్లాడుకున్నారని వైట్ హౌస్ ప్రకటించింది.

    యుక్రెయిన్‌పై రష్యా దండయాత్ర నేపథ్యంలో రష్యాపై పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధిస్తూ ఒత్తిడి పెంచుతున్నాయి. ఇదే తరహాలో చైనా కూడా చర్యలు చేపట్టాలని అమెరికా అధ్యక్షుడు కోరుతున్నారు.

    నవంబర్ తర్వాత ఇద్దరు నాయకులు మాట్లాడుకోవడం ఇదే తొలిసారి. ఇద్దరి మధ్యా 50 నిమిషాల పాటు చర్చలు జరిగాయి.

    దీనిపై ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటనా వెలువడలేదు.

    అయితే, యుక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాకు ఎలాంటి సైనిక ఆయుధాలు ఇవ్వొద్దని చైనాను బైడెన్ కోరతారని అమెరికా అధికారులు వీడియోకాల్ కంటే ముందే తెలిపారు.

    ‘‘యుక్రెయిన్ సంక్షోభాన్ని మేం చూడాలనుకోవట్లేదు’’ అని బైడెన్‌తో జిన్‌పింగ్ చెప్పారని చైనా ప్రభుత్వ మీడియా తెలిపింది.

  2. చిన్న జీయర్: ‘పూసుకుని తిరగను, పాకులాడను.. ఎవరితోనూ గ్యాప్స్ ఉండవు. వాళ్లు పెట్టుకుంటే చేసేదేమీ లేదు’

    చిన్న జీయర్

    ఫొటో సోర్స్, FACEBOOK/JEEYARSWAMY

    తెలంగాణలోని ఆదివాసీ వనదేవతలు సమ్మక్క, సారలమ్మల గురించి 20 ఏళ్ల కిందట తాను చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు కొందరు పనిగట్టుకుని పెద్ద ఇష్యూగా చేసి, ప్రజలను రెచ్చగొడుతున్నారని చిన్న జీయర్ అన్నారు.

    విజయవాడలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలోని యాదాద్రి ఆలయ ప్రారంభోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించలేదు కదా అని మీడియా అడగ్గా చిన్న జీయర్ స్పందిస్తూ.. తాను దేంట్లోనూ, ఎవరితోనూ పూసుకుని తిరగనని, తనకు ఎవరితోనూ గ్యాప్స్ ఉండవని అన్నారు.

    సమతా మూర్తి దర్శనానికి టికెట్ రుసుము వసూలు చేయడంపై స్పందిస్తూ.. రూ.150 రూపాయలు టికెట్ పెట్టామని, అయితే అది ఆ ప్రాంగణ నిర్వహణ కోసమే తప్ప లోపల పూజలకు కానీ, ప్రసాదాలకు కానీ ఎలాంటి టికెట్లు లేవని తెలిపారు.

    చిన్న జీయర్ ఇంకా ఏమన్నారో ఈ కథనంలో చదవండి.

  3. రష్యా దాడి చేసిన మరియుపూల్‌ థియేటర్‌ నుంచి 130 మందిని రక్షించాం:యుక్రెయిన్ అధికారులు

    మరియుపూల్

    ఫొటో సోర్స్, Azov/Reuters

    మరియుపూల్ థియేటర్‌ బేస్‌మెంట్‌ నుంచి ఇప్పటి వరకు 130 మందిని కాపాడినట్లు యుక్రెయిన్ అధికారులు వెల్లడించారు.

    అయితే, 1300 మంది ఇంకా ఆ భవనంలోని బేస్‌మెంట్‌లో చిక్కుకుని ఉన్నారని యుక్రెయిన్ మానవ హక్కుల సంఘం అధ్యక్షుడు చెప్పారు.

    వారిని కాపాడేందుకు సహాయ చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.

    రష్యా ఈ థియేటర్‌పై నిన్న వైమానిక దాడి చేసింది.

    ఈ భవనం లోపల 1200 మంది వరకు పౌరులు ఉండొచ్చని మరియుపూల్ మేయర్ గురువారం బీబీసీకి చెప్పారు.

  4. యుక్రెయిన్ రాజధాని కీయెవ్‌లో పరిస్థితి ఇది

    యుక్రెయిన్

    ఫొటో సోర్స్, Getty Images

    యుక్రెయిన్ రాజధాని కీయెవ్‌లో రష్యా దాడులు కొనసాగుతున్నాయి.

    రష్యా క్షిపణి విడి భాగాలు నివాస ప్రాంతాలపై పడటంతో ఒకరు చనిపోయారు. మరో 19 మంది గాయపడ్డారు.

    కీయెవ్‌లో జరిగిన విధ్వంసం ఈ ఫొటోల్లో చూడొచ్చు.

    యుక్రెయిన్

    ఫొటో సోర్స్, Getty Images

    యుక్రెయిన్

    ఫొటో సోర్స్, Getty Images

  5. రష్యా, యుక్రెయిన్ యుద్ధం: పుతిన్‌కు ఏం కావాలి?

    రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్

    ఫొటో సోర్స్, EPA

    యుక్రెయిన్‌పై దాడితో యూరప్‌లో శాంతికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ విఘాతం కలిగించారు.

    4.4 కోట్ల మంది నివసించే తూర్పు యూరప్ దేశమైన యుక్రెయిన్‌.. పశ్చిమ దేశాల వైపు మొగ్గు చూపడంతో తమ సార్వభౌమత్వానికి ముప్పు ఉందని చెబుతూ పుతిన్ ఈ దాడికి ఆదేశాలిచ్చారు.

    దీంతో బాంబు దాడులు మొదలయ్యాయి. వీటిలో వేల మంది మరణించారు. లక్షల మంది శరణార్థులుగా పొరుగు దేశాలకు వలసపోతున్నారు.

  6. ‘బంగ్లాదేశ్‌లో ఇస్కాన్ టెంపుల్ మీద దాడి’

    బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో గల ఇస్కాన్ టెంపుల్‌పై గురువారం కొందరు దాడి చేశారు. సుమారు 200 మంది చొచ్చుకుని వచ్చి, భక్తుల మీద దాడి చేయడంతోపాటు దేవాలయాన్ని ధ్వంసం చేశారని ఏఎన్‌ఐ వార్తా సంస్థ తెలిపింది.

    ‘గౌర పూర్ణిమ సందర్భంగా వేడుకల కోసం సన్నాహాలు చేస్తున్న సమయంలో ఢాకాలోని శ్రీ రాధాకాంతా టెంపుల్‌లోకి 200 మంది చొచ్చుకుని వచ్చినట్లు’ కోల్‌కతా ఇస్కాన్ వైస్ ప్రెసిడెంట్ రాధా రమణ్ దాస్, ఏఎన్‌ఐతో మాట్లాడుతూ చెప్పారు.

    ఈ దాడిలో ముగ్గురు గాయపడ్డారని, పోలీసుల రాకతో అల్లరి మూకలు పారిపోయాయని దాస్ వెల్లడించారు.

    పోయిన ఏడాది అక్టోబరులో బంగ్లాదేశ్ హిందూ మైనార్టీల మీద వరుసగా దాడులు జరిగాయి.

  7. రెండేళ్ల తరువాత బయట కనిపించిన దలైలామా

    హిమాచల్ ప్రదేశ్‌లో బౌద్ధ ఆధ్యాత్మిక గురువు దలైలామా

    ఫొటో సోర్స్, ANI

    సుమారు రెండు సంవత్సరాల తరువాత బౌద్ధుల ఆధ్యాత్మిక గురువు దలైలామా ధర్మశాలలో మళ్లీ బోధనలు ప్రారంభించారు.

    దేశంలో కరోనా సంక్షోభం మొదలైన నాటి నుంచి ఆయన ప్రజలకు కనిపించడం మానేశారు. ప్రస్తుతం దలైలామా వయస్సు 86 ఏళ్లు.

    వేల మంది బౌద్ధ సన్యాసులు, సెంట్రల్ టిబెట్ అడ్మినిస్ట్రేషన్ ప్రెసిడెంట్, ఇతర మంత్రులు దశాబ్దాలుగా భారత్‌లో ప్రవాస జీవితం గడుపుతున్నారు.

  8. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌‌ను గద్దె దించేందుకు సిద్ధమైన సొంత ఎంపీలు

    పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్

    ఫొటో సోర్స్, Getty Images

    సొంత పార్టీ నుంచే తీవ్ర అసమ్మతిని ఎదుర్కొంటున్నారు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌.

    పార్లమెంటులో ఇమ్రాన్ ఖాన్ మీద ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేస్తామంటూ పీటీఐ పార్టీకి చెందిన 24 మంది పార్లమెంటు సభ్యులు బహిరంగంగానే బెదిరించినట్లు వార్తా సంస్థ పీటీఐ తెలిపింది.

    ప్రభుత్వంలో అవినీతి పెరగడంతోపాటు నిరుద్యోగం, ధరల పెరుగుదలను నియంత్రించడంలో విఫలమయ్యారంటూ ఇమ్రాన్ ఖాన్ మీద ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి.

    అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 172 ఓట్లు వస్తే ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం కూలి పోతుంది.

  9. యుక్రెయిన్: ఇప్పటి వరకు 14 వేలకు పైగా రష్యా సైనికులు చనిపోయారు

    తూర్పు యుక్రెయిన్లో రష్యా మద్దతు సాయుధులు

    ఫొటో సోర్స్, Getty Images

    దాడి మొదలైన తరువాత ఇప్పటి వరకు 14,200 మంది రష్యా సైనికులు చనిపోయినట్లు యుక్రెయిన్ రక్షణశాఖ ప్రకటించింది. అయితే ఇందులో వాస్తవం ఎంతో ధ్రువీకరించడం కష్టం.

    ఈ యుద్ధంలో సైనికుల మరణాలపై రష్యా, యుక్రెయిన్ భిన్న లెక్కలు చెబుతున్నాయి.

    యుక్రెయిన్ మీద రష్యా దాడులు మొదలై 23 రోజులవుతోంది.

    అయితే చనిపోయిన రష్యా సైనికుల సంఖ్య 7వేల నుంచి 14వేల వరకు ఉండొచ్చని అమెరికా నిఘా సంస్థలు అంచనా వేస్తున్నాయి.

    తమ సైనికులు 498 మంది చనిపోయినట్లు మార్చి 3న రష్యా ప్రకటించింది.

    యుక్రెయిన్ చెబుతున్న ప్రకారం రష్యా పోగొట్టుకున్న ఆయుధ సామాగ్రి...

    • 450 ట్యాంకులు
    • 93 విమానాలు
    • 112 హెలికాప్టర్లు
    • 43 యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ సిస్టమ్స్
  10. అస్సాంలో చనిపోయిన 100 రాబందులు... విషమే కారణమా?

    చనిపోయిన రాబందులు

    ఫొటో సోర్స్, ANI

    అస్సాంలోని కామ్రుప్ జిల్లాలో సుమారు 100 రాబందులు చనిపోయి కనిపించాయి. చనిపోవడానికి కారణం అవి తిన్న విషపూరితమైన ఆహారమేనని అధికారులు భావిస్తున్నారు.

    మిలాన్‌పుర్ ప్రాంతంలో చనిపోయిన ఒక మేకను ఈ రాబందులు తిన్నట్లుగా తెలుస్తోంది. చచ్చిన మేకలో ఎవరైనా విషం కలిపి ఉంటారా అనే కోణంలో కూడా అధికారులు విచారిస్తున్నారు.

    ఇంత భారీ సంఖ్యలో రాబందులు చనిపోవడం తొలిసారని కామ్రుప్ వెస్ట్ ఫారెస్ట్ డివిజన్ డీఎఫ్ఓ డింపీ బోరా తెలిపారు. ‘రాబందులు చనిపోయిన చోట మేక ఎముకలు కనిపించాయి. విషపూరితమైన మేక శవాన్ని తినడం వల్లే అవి చనిపోయాయని అనుమానిస్తున్నాం. చచ్చిన మేకలో ఎవరైనా విషయం కలిపి ఉంటే వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామ’ని బోరా చెప్పుకొచ్చారు.

  11. పుతిన్ నిజంగానే యుద్ధాన్ని ఆపేస్తామని చెప్పారా?

    రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్

    ఫొటో సోర్స్, Getty Images

    రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శాంతి ప్రకటన చేస్తున్నట్లు ట్విటర్లో షేర్ అవుతున్న ఒక వీడియో ఇటీవల తెర పైకి వచ్చింది. మరోవైపు, రష్యాకు లొంగిపోతున్నామని యుక్రెయిన్ అధ్యక్షుడు చెబుతున్న వీడియో కూడా వైరల్ అయింది.

  12. రష్యా దాడుల్లో చనిపోయిన యుక్రెయిన్ నటి

    అక్సానా షివియెట్స్

    ఫొటో సోర్స్, Twitter

    యుక్రెయిన్ రాజధాని కీయెవ్‌లో జరిగిన రష్యా రాకెట్ దాడుల్లో ఆ దేశానికి చెందిన నటి అక్సానా షివియెట్స్ చనిపోయారు. ఆమె నటించే నాటక సమాజం ‘యంగ్ థియేటర్’ ఈ విషయాన్ని ధ్రువీకరించింది.

    67 ఏళ్ల అక్సానాను యుక్రెయిన్ గొప్ప నటుల్లో ఒకరిగా చూస్తుంటారు.

    1955లో జన్మించిన అక్సానా కొన్ని దశాబ్దాలుగా నాటకాలు వేస్తూ సినిమాల్లో నటిస్తున్నారు. యుక్రెయిన్ దేశపు పరిపూర్ణమైన నటుల్లో ఆమె ఒకరు.

  13. రష్యా, యుక్రెయిన్ యుద్ధం: ‘లివ్యూ ఎయిర్‌పోర్ట్ మీద దాడి’

    లివ్యూ ఎయిర్‌పోర్టు ఉన్న ప్రాంతంలో కనిపిస్తున్న భారీ పొగ
    ఫొటో క్యాప్షన్, లివ్యూ ఎయిర్‌పోర్టు ఉన్న ప్రాంతంలో కనిపిస్తున్న భారీ పొగ

    యుక్రెయిన్‌లోని లివ్యూ ఎయిర్‌పోర్ట్ మీద దాడులు చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఎయిర్‌పోర్ట్ ఉన్న ప్రాంతంలో భారీ స్థాయిలో పొగలు కనిపిస్తున్నాయి. సుమారు మూడు వారాలుగా జరుగుతున్న యుద్ధంలో యుక్రెయిన్‌లోని పశ్చిమ భాగం ఇంత వరకు పెద్దగా దాడులకు గురి కాలేదు.

    కీయెవ్ యుద్ధ శిథిలాలో యుక్రెయిన్ సైనిక జంట

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, కీయెవ్ యుద్ధ శిథిలాలో యుక్రెయిన్ సైనిక జంట
    యుక్రెయిన్ రాజధాని కీయెవ్‌లో బాంబు దాడుల్లో మరణించిన వారి వద్ద విలపిస్తున్న బంధువులు

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, యుక్రెయిన్ రాజధాని కీయెవ్‌లో బాంబు దాడుల్లో మరణించిన వారి వద్ద విలపిస్తున్న బంధువులు
    సైనికుల కోసం సామాగ్రి తయారు చేస్తున్న యుక్రెయిన్ వాసులు

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, సైనికుల కోసం సామాగ్రి తయారు చేస్తున్న యుక్రెయిన్ వాసులు
    ఖార్కివ్‌లో బాంబు దాడుల్లో శిథిలమైన ఒక స్కూలు

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, ఖార్కివ్‌లో బాంబు దాడుల్లో శిథిలమైన ఒక స్కూలు
  14. బ్రేకింగ్ న్యూస్, ‘లివ్యూలో పేలుళ్లు’

    యుక్రెయిన్‌లోని అనేక నగరాల్లో ఈ రోజు పొద్దున పేలుళ్లు వినిపించినట్లు వార్తలు వస్తున్నాయి. యుక్రెయిన్ 24 టీవీ చెబుతున్న ప్రకారం లివ్యూ నగరంలో చాలా చోట్ల పేలుళ్ల శబ్దాలు వినిపించాయి.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  15. చిత్రాల్లో రష్యా, యుక్రెయిన్ వార్

    క్రెయిన్‌లోని ఒడెసా యుద్ధక్షేత్రంలో భార్యకు వీడ్కోలు చెబుతున్న యుక్రెయిన్ సైనికుడు.

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, యుక్రెయిన్‌లోని ఒడెసా యుద్ధక్షేత్రంలో భార్యకు వీడ్కోలు చెబుతున్న యుక్రెయిన్ సైనికుడు. యుక్రెయిన్‌లోని ముఖ్యమైన నగరాల్లో ఒడెసా ఒకటి. ఈ నగరాన్ని ఆక్రమించుకునేందుకు రష్యా బలగాలు తీవ్రంగా దాడులు చేస్తున్నాయి.
    రష్యా దాడుల్లో చనిపోయిన యుక్రెయిన్ యువ సైనికునికి నివాళులు అర్పిస్తున్న కుటుంబసభ్యులు

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, రష్యా దాడుల్లో చనిపోయిన యుక్రెయిన్ యువ సైనికునికి నివాళులు అర్పిస్తున్న కుటుంబసభ్యులు
  16. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో మాట్లాడనున్న అమెరికా అధ్యక్షుడు బైడెన్

    చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్‌తో సమావేశమైన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్

    ఫొటో సోర్స్, Getty Images

    నేడుఅమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో మాట్లాడనున్నారు. రష్యా దాడులకు చైనా మద్దతుగా నిలిస్తే తగిన పర్యావసనాలను చవి చూడాల్సి ఉంటుందని చైనాకు బైడెన్ చెప్పనున్నట్లు అమెరికా విదేశాంగశాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ తెలిపారు. ఇక మరోవైపు యుక్రెయిన్ మీద రష్యా దాడులు చేస్తున్నందుకు నిరసనగా జపాన్, ఆస్ట్రేలియా మరొకసారి రష్యా సంస్థల మీద ఆంక్షలు విధించాయి.

  17. చివరి పరీక్షకు నాసా బాహుబలి రాకెట్‌

    నాసాకు చెందిన స్పేస్ లాంచ్ సిస్టమ్ రాకెట్

    ఫొటో సోర్స్, Reuters

    చంద్రుని మీదకు వెళ్లడానికి అత్యంత ఆధునిక టెక్నాలజీతో నాసా నిర్మించిన సూపర్ రాకెట్‌కు తుది పరీక్షలు జరుగుతున్నాయి. ఇందుకోసం ఫ్లోరిడాలోని లాంచ్ ప్యాడ్‌కు రాకెట్‌ను తరలిస్తున్నారు.

    స్పేస్ లాంచ్ సిస్టమ్(ఎస్‌ఎల్‌ఎస్) అని పిలిచే ఈ స్పేస్ వెహికల్‌కు ఫ్లోరిడాలో గల కెన్నడీ స్పేస్ సెంటర్‌లో డమ్మీ కౌంట్ డౌన్ నిర్వహిస్తారు.

    డమ్మీ కౌంట్ డౌన్‌లో అంతా బాగానే జరిగితే ప్రయాణానికి రాకెట్ సిద్ధంగా ఉన్నట్లు లెక్క.

    ఆ తరువాత మనుషులు లేని టెస్ట్ క్యాప్సుల్స్‌ను ఈ రాకెట్ ద్వారా చంద్రుని దగ్గరకు పంపుతారు.

    ఇదంతా జరగడానికి మరొక రెండు మూడు నెలలు పడుతుంది.

    మొత్తానికి మరొక అయిదారేళ్లలో ఈ ఎస్‌ఎల్‌ఎస్ రాకెట్ ద్వారా అస్ట్రోనాట్స్ చంద్రుని మీద దిగుతారని భావిస్తున్నారు.

    నాసా రాకెట్

    ఫొటో సోర్స్, NASA

  18. కష్టాల కడలిలో మరియపోల్, లీస్ డూసెట్, చీఫ్ ఇంటర్నేషనల్ కరస్పాండెంట్

    మరియపోల్ ఇప్పుడు కష్టాల కడలిగా మారింది. బాధలకు ఒక రూపంగా కనిపిస్తోంది. ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. చలికి వణికిపోతున్నారు.

    చనిపోయినవారిని ఖననం చేయడానికి కూడా అక్కడ ప్రశాంతమైన పరిస్థితులు లేవు.

    బుధవారం రాత్రి ధ్వంసమైన తెల్లరంగు థియేటర్‌తో సహా ఈ దక్షిణ రేవు నగరంలో 90 శాతం నాశనమైందని స్థానిక అధికారులు చెబుతున్నారు.

    ప్రాణాలతో ఉన్నవారిని సహాయ సిబ్బంది శిథిలాల నుంచి బయటికి తీస్తున్నారు. థియేటర్‌లోని బలమైన భూగర్భ బంకర్ వందల మందిని, ముఖ్యంగా మహిళలు, పిల్లల ప్రాణాలు కాపాడిందని యుక్రెయిన్ రక్షణ సలహాదారు చెప్పారు.

    మరియపోల్‌లో ధ్వంసమైన థియేటర్
    ఫొటో క్యాప్షన్, మరియపోల్‌లో ధ్వంసమైన థియేటర్ ముందు, ఆ తరువాత

    నగరం నుంచి పారిపోయిన స్విట్లానా లాంటి కొందరికి ఈరోజు ఉపశమనం లభించింది.

    గ్యాస్, విద్యుత్ లేక తను బయటే వంట చేసుకుంటున్నానని, బట్టలను కప్పుకుని పడుకుంటున్నానని ఆమె చెప్పారు. కానీ మొత్తం అపార్ట్‌మెంటులో వారందరూ పరస్పరం సాయం చేసుకుంటున్నారు.

    రాత్రిపూట మాపై నిరంతరం బాంబులు పడుతుండటంతో మేం కారిడార్లోనే నేల మీద పడుకోవాల్సి వచ్చిందని ఆమె చెప్పారు.

    ఈ నగరం నుంచి 30 వేల మంది సురక్షితంగా తప్పించుకోగలిగారు. కానీ మూడున్నర లక్షల మంది ఇంకా నగరంలోనే చిక్కుకుపోయి ఉన్నారు.

    మరియపోల్ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే, ఈ తీర ప్రాంతం ఇప్పటికే రష్యా అధీనంలో ఉన్న రెండు ప్రాంతాల మధ్యలో ఉంటుంది.

  19. జర్మనీ కొత్త దారి కోసం వెతుకుతోంది- జెలియెన్‌స్కీ

    యుక్రెయిన్ జెలియెన్‌స్కీ

    ఫొటో సోర్స్, Facebook/ Zelensky

    రష్యాకు దూరమయ్యేలా జర్మనీ కొత్తదారి వెతుక్కుంటోందని యుక్రెయిన్ అధ్యక్షుడు వొలిదిమిర్ జెలియెన్‌స్కీ రాత్రి ఫేస్‌బుక్ ద్వారా ఇచ్చిన తన తాజా సందేశంలో చెప్పారు.

    ఈ విషయాన్ని దేశ అధ్యక్షుడుగా కాకుండా, యుక్రెయిన్ పౌరుడుగా చెబుతున్నట్లు ఆయన జర్మన్ ప్రజా ప్రతినిధులను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో తెలిపారు.

    "మనకు దూరంగా ఒక గోడతో తన చుట్టూ కంచె వేసుకున్న ఒక వ్యక్తిలా జర్మనీ చాలా ఏళ్లుగా ఉండిపోయింది. కనిపించకపోయినా ఆ గోడ ఇప్పటికీ బలంగానే ఉంది" అన్నారు.

    అణచివేత నుంచి స్వేచ్ఛను విభజించిన కొత్త రకంబెర్లిన్ గోడను కూల్చడానికి జర్మన్లు ఇప్పుడు మరింత చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

    “ఆర్థికవ్యవస్థ కోసం, కొత్త రష్యా గ్యాస్ పైప్‌లైన్ కోసం, పాత యూరోపియన్ కలల కోసం. సుదీర్ఘ కాలంగా రష్యా పెద్దగా పట్టించుకోని సహకార స్వప్నాల కోసం జర్మనీ దశాబ్దాల పోరాటాన్ని మనం చూశాం” అని జెలియెన్‌స్కీ అన్నారు.

    “జర్మన్ల అభిప్రాయాలు మారడం మనం చూశాం. ఇది చాలా ముఖ్యం. జర్మనీ కొత్త దారికోసం వెతుకుతున్నట్లు మనం చూస్తున్నాం"

    ప్రచ్ఛన్నయుద్ధం ముగిసినప్పటి నుంచి శాంతియుత రష్యాను పశ్చిమ దేశాలతో కలపడానికి జర్మనీ వాణిజ్యం, వ్యాపారం, శక్తి ఉపయోగించుకోవాలని ప్రయత్నించింది.

    కానీ, ఈ దాడి ఆ ఆశలకు తెరదించింది. వెంటనే మిగతా ప్రాంతాల్లో తన వాణిజ్య అవకాశాలను వెతుక్కునేలా ఇది జర్మనీని ప్రేరేపించింది.