You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

నో ఫ్లై జోన్ ప్రకటించండి, రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించండి - అమెరికాకు జెలియెన్‌స్కీ విజ్ఞప్తి

రష్యా, యుక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో శాంతి చర్చల మీద చాలా పాజిటివ్‌గా స్పందించారు యుక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలియెన్‌స్కీ. మరొకవైపు యుక్రెయిన్ రాజధాని కీయెవ్ మీద రష్యా దాడులు పెంచింది.

లైవ్ కవరేజీ

సతీష్ ఊరుగొండ, వరికూటి రామకృష్ణ

  1. వికెట్ల వేటలో టీం ఇండియా

    న్యూజీలాండ్‌లో ఇంగ్లండ్‌తో టీం ఇండియా తలపడుతోంది. ప్రపంచకప్‌లో భాగంగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 33 పరుగులకు 2 వికెట్లు కోల్పోయింది. ఇప్పటికి 8 ఓవర్లు అయిపోయాయి. మేఘనా సింగ్, జూలన్ గోస్వామి చెరో ఒక వికెట్ తీశారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా 134 పరుగులకు ఆలవుట్ అయింది.

  2. జంగారెడ్డి గూడెం: మృతుల బంధువులను పరామర్శించిన జనసేన నేతలు

    పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో ఇటీవల చనిపోయిన వారి కుటుంబాలను జనసేన పార్టీ నేతలు నాదెండ్ల మనోహర్, నాగబాబు పరామర్శించి ఆర్థిక సహాయం చేశారు. జంగారెడ్డిగూడెంలో ఇటీవల నాలుగు రోజుల వ్యవధిలో 18 మంది చనిపోయారు. వాళ్లంతా ఒకే విధమైన లక్షణాలతో మరణించారు. అందరికీ ఉన్నట్టుండి వాంతులు, కడుపునొప్పి రావడం, పల్స్ రేట్ పడిపోయి హఠాత్తుగా ప్రాణం పోయినట్టు మృతుల బంధువులు, వైద్యులు తెలిపారు. ఈ మరణాలకు కారణం కల్తీ సారా అని స్థానికులు, బాధిత కుటుంబాలు చెబుతుండగా ప్రభుత్వం మాత్రం వారు సహజంగానే చనిపోయారని అంటోంది.

  3. యుక్రెయిన్‌లో యుద్ధం జరుగుతుంటే రష్యన్లు ఎందుకు తమ దేశం విడిచి వెళుతున్నారు?

    యుక్రెయిన్‌లో రష్యా దాడి చేస్తున్న తరుణంలో కొందరు రష్యా ప్రజలు దేశం విడిచి వెళ్తున్నారు. యుక్రెయిన్‌కు మద్దతు ఇచ్చే వారికి 20 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించేలా రష్యా చట్టం తీసుకురావడమే ఇందుకు కారణం. యెవజినీ లియామిన్ జార్జియా పార్లమెంట్ వెలుపల యుక్రెయిన్‌కు వెళుతున్న ట్రక్కులో దుస్తులు, ఆహార పదార్థాల డబ్బాలను పెడుతున్నారు. యుక్రెయిన్‌పై దాడి తర్వాత స్వదేశం విడిచి జార్జియా చేరుకున్న దాదాపు 25,000 మంది రష్యన్లలో లియామిన్ ఒకరు. జార్జియా ప్రధాన నగరాల్లో నివసించడానికి సరైన స్థలాలను గుర్తించడానికి రష్యా నుంచి వలస వచ్చిన వారు ఇబ్బందులు పడుతున్నారు. చాలామంది తమ సూట్‌కేసులు, పెంపుడు జంతువులతో రాజధాని టిబిలిసి వీధుల్లో తిరుగుతూ కనిపిస్తారు.

  4. కీయెవ్‌లో 35 గంటల పాటు కర్ఫ్యూ, శివార్లలోధాటిగా పేలుళ్లు

    లీస్ డూసెట్

    చీఫ్ ఇంటర్నేషనల్ కరెస్పాండెంట్

    కీయెవ్‌లో 35 గంటల కర్ఫ్యూ అమల్లోకి రాగానే, రాజధాని శివారు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పేలుళ్లు సంభవించాయి.

    ఆ విధ్వంసానికి సంబంధించిన శబ్ధాలు కీయెవ్ నగరవ్యాప్తంగా వినిపిస్తున్నాయి. యుక్రెయిన్‌కు ‘‘నిస్సందేహంగా మద్దతు’’ ఇస్తున్నామని పేర్కొంటూ పోలాండ్, చెక్ రిపబ్లిక్, స్లొవేనియా దేశాల ప్రధానమంత్రులు కీయెయ్‌లోనే చర్చలు జరిపారు.

    రష్య యుద్ధ ట్యాంకులు, ఫిరంగులు యుక్రెయిన్‌లోని నగరాలు, పట్టణాలపై దాడులు చేస్తూనే ఉన్నాయి.

    ముట్టడికి గురైన మరియుపూల్ నగరంలోని ఒక ఆసుపత్రిలో వైద్యులు, రోగులు కలిపి మొత్తం 400 మంది నిర్బంధంలో ఉన్నట్లు స్థానిక అధికారులు చెబుతున్నారు.

    ఖేర్సన్‌లోని దక్షిణ ప్రాంతం తమ ఆధీనంలోకి వచ్చినట్లు రష్యా అంటోంది.

    కానీ కీయెవ్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో రష్యా పురోగతి నిలిచిపోయిందని పశ్చిమదేశాల అధికారులు అన్నారు.

  5. జెలియెన్‌స్కీ: ‘శాంతి చర్చలు వాస్తవికంగా కనిపిస్తున్నాయి’

    ‘‘రష్యాతో శాంతి చర్చలు మరింత వాస్తవికంగా కనిపిస్తున్నాయి. కానీ అవి పురోగతి సాధించడానికి మరింత సమయం పడుతుంది’’ అని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియెన్‌స్కీ అన్నారు.

    ఫేస్‌బుక్‌లో తాజాగా విడుదల చేసిన వీడియోలో మాట్లాడుతూ రష్యాపై విజయం సాధించడానికి శాంతి చర్చలు జరుపుతోన్న బృందంతో పాటు యుక్రెయిన్ పౌరులందరి సహకారం అవసరం అని అన్నారు.

    ఇరు దేశాల మధ్య బుధవారం కూడా శాంతి చర్చలు కొనసాగనున్నాయి.

    ‘‘ఇరు వర్గాల మధ్య ప్రాథమిక వైరుధ్యాలు ఉన్నాయని, అయితే కచ్చితంగా రాజీ కుదిరే అవకాశం ఉందని’’ యుక్రెయిన్ తరఫున శాంతిచర్చల్లో పాల్గొన్న మిఖైల్ పొదొల్యాక్ అన్నారు.

  6. బీబీసీ తెలుగు లైవ్ పేజ్‌కి స్వాగతం

    యుక్రెయిన్ యుద్ధం 21వ రోజుకు చేరుకుంది.

    లువ్యూ నగరంలో సైరన్ల మోత మోగుతోంది. ఉదయం 3 గంటల తర్వాత అక్కడ యుద్ధవాతావరణం కాస్త చల్లబడింది.

    అయితే స్థానిక జర్నలిస్టుల నివేదికల ప్రకారం ఇప్పుడు మళ్లీ సైరన్లు తమ పని మొదలుపెట్టనున్నాయి.

    ఒకవేళ రష్యా దాడులు మళ్లీ మొదలైతే ప్రజలంతా బంకర్లకు వెళ్లిపోవాలని పలువురు సూచిస్తున్నారు.

    యుక్రెయిన్ యుద్ధంతో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన, జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం ఈ లైవ్ పేజ్ చూస్తూ ఉండండి.