You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

జో బైడెన్‌పై ఆంక్షలు.. తమ దేశంలో అడుగుపెట్టనివ్వమన్న రష్యా

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌పై ఆంక్షలు విధించినట్లు రష్యా ప్రకటించింది. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్, రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్, జాతీయ భద్రతా సలహాదారు జాక్ సుల్లివాన్, సీఐఏ చీఫ్ విలియం బర్న్స్‌లపైన కూడా ఈ ఆంక్షలు అమలవుతాయి.

లైవ్ కవరేజీ

బీఎస్ఎన్ మల్లేశ్వర రావు, వరికూటి రామకృష్ణ

  1. బ్రేకింగ్ న్యూస్, ‘యుక్రెయిన్‌లో ముందుకు సాగలేకపోతున్న రష్యా బలగాలు’

    యుక్రెయిన్‌లో రష్యా బలగాలు ముందుకు సాగలేకపోతున్నాయని అమెరికా అధికారులు వెల్లడించారు. యుక్రెయిన్‌లో రష్యా బలగాలు ముందుకు సాగలేకపోతున్నట్లు అమెరికా రక్షశాఖ అధికారులు చెబుతున్నారు. వారాంతంలో కొంచెం పురోగతి సాధించినా ప్రస్తుతానికి అన్ని రకాలుగా రష్యా దాడులు నిలిచిపోయినట్లు వెల్లడించారు.

  2. పార్లమెంటులో రాజ్‌నాథ్ సింగ్: పాకిస్తాన్‌లో పడిన భారత్ మిసైల్ అనుకోకుండా లాంచ్ అయిందే

    ఇటీవల భారత్ మిసైల్ ఒకటి పాకిస్తాన్‌లో పడిన ఘటనపై పార్లమెంట్‌లో కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వివరణ ఇచ్చారు. దేశ ఆయుధాల భద్రతకు తాము అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపిన మంత్రి... మెయింటనెన్స్, ఇన్‌స్పెక్షన్ సందర్భంగా అనుకోకుండా మిసైల్ లాంచ్ అయినట్లు వివరించారు. ఆయుధాల భద్రతా వ్యవస్థలో ఏమైనా లోపాలు ఉంటే వాటిని వెంటనే సవరిస్తామని తెలిపారు.

  3. రెండో రోజూ భారీగా నష్టపోయిన పేటీఎం షేరు

    పేటీఎం షేర్లు వరుసగా రెండో రోజూ తీవ్రమైన నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. నిన్న సుమారు 12శాతం నష్టపోయిన పేటీఎం షేరు ధర నేడు 8శాతం వరకు పడిపోయింది. కొత్త ఖాతాదారులను చేర్చుకోవడాన్ని వెంటనే ఆపాలంటూ పేటీం పేమెంట్స్ బ్యాంక్‌ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశించడమే ఇందుకు కారణం. పేటీఎంలో వాటాదారులుగా ఉన్న చైనా కంపెనీలకు సంస్థ డేటా లీకైందనే వార్తల నేపథ్యంలో ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. సోమవారం 12.8శాతం నష్టపోయి రూ.674.80 వద్ద ముగిసిన పేటీఎం షేరు ప్రస్తుతం 7.53శాతం నష్టపోయి రూ.624 వద్ద ట్రేడ్ అవుతోంది.

  4. యుక్రెయిన్ సైన్యం: రష్యాకు చెందిన నాలుగు హెలికాప్టర్లు కూల్చాం

    రష్యాకు చెందిన నాలుగు హెలికాప్టర్లను కూల్చినట్లు యుక్రెయిన్ బలగాలు ప్రకటించాయి. ఈమేరకు ఉదయాన్నే విడుదల చేసిన అప్‌డేట్‌లో సైన్యం తెలిపింది. యుద్ధానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను రోజూ ఉదయాన్నే యుక్రెయిన్ బలగాలు వెల్లడిస్తుంటాయి. నాలుగు హెలికాప్టర్లతో పాటు ఒక విమానం, క్రూయిజ్ మిసైల్‌ను కూడా ధ్వంసం చేసినట్లు యుక్రెయిన్ సైన్యం తెలిపింది. పౌర నివాసాలు, మౌలిక వసతుల మీద రష్యా దాడులు కొనసాగుతున్నాయని వెల్లడించింది.

  5. విద్యాసంస్థల్లో హిజాబ్ ఆర్టికల్-25 కిందకు రాదు అన్న కోర్టు

    ఇస్లాంలో హిజాబ్ అనేది తప్పనిసరిగా పాటించాలనే ఆచారం కాదని కర్నాటక హై కోర్టు తీర్పునిచ్చింది. అలాగే యూనిఫాం ఎలా ఉండాలో నిర్ణయించే హక్కు విద్యాసంస్థలకు ఉందని తెలిపిన కోర్టు, హిజాబ్ ధరించే తమ హక్కును కాపాడాలంటూ కోర్టుకు వెళ్లిన అమ్మాయిల పిటీషన్‌ను కొట్టివేసింది. ఆర్టికల్-25 కింద దానికి రక్షణ లేదని కోర్టు తెలిపింది. అలాగే హిజాబ్‌కు సంబంధించి ఫిబ్రవరి 5న కర్నాటక ప్రభుత్వం విడుదల చేసిన జోవోను కూడా కోర్టు సమర్థించింది. విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించడంపై గత కొంతకాలంగా వాదనలు ప్రతివాదనలు విన్న కర్నాటక హై కోర్టు నేడు తుది తీర్పును వెలువరించింది.

  6. బ్రేకింగ్ న్యూస్, కర్నాటక హై కోర్టు: యూనిఫాం ఎలా ఉండాలో నిర్ణయించే హక్కు విద్యాసంస్థలకు ఉంది

    ఇస్లాంలో హిజాబ్ అనేది తప్పనిసరిగా పాటించాలనే ఆచారం కాదని కర్నాటక హై కోర్టు తీర్పునిచ్చింది. అలాగే యూనిఫాం ఎలా ఉండాలో నిర్ణయించే హక్కు విద్యాసంస్థలకు ఉందని తెలిపిన కోర్టు, హిజాబ్ ధరించే తమ హక్కును కాపాడాలంటూ కోర్టుకు వెళ్లిన అమ్మాయిల పిటీషన్‌ను కొట్టివేసింది.

  7. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో నేడు కూడా జంగారెడ్డి గూడెం మరణాల మీద టీడీపీ నిరసనలు కొనసాగుతున్నాయి. కల్తీ సారా వల్ల ప్రజలు చనిపోతే వాటిని సహజ మరణాలుగా ప్రభుత్వం చూపిస్తోందంటూ టీడీపీ విమర్శిస్తోంది. జంగారెడ్డి గూడెంలో చనిపోయిన వ్యక్తులు సహజంగానే మరణించారని సోమవారం అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.

  8. ‘పేలుళ్లతో మంటల్లో చిక్కుకున్న యుక్రెయిన్‌లోని నివాస భవనం’

    యుక్రెయిన్‌ రాజధాని కీయెవ్‌లో ఒక నివాస భవనం మంటల్లో చిక్కుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. కొన్ని పేలుళ్ల శబ్దాలు వినిపించిన తరువాత మంటలు కనిపించినట్లు యుక్రెయిన్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. అయితే ఆ నివాస భవనంలో ఎంత మంది ఉంటున్నారు? ఎవరైనా గాయపడ్డారా? వంటి అంశాలపై ఇంకా స్పష్టత లేదు.

  9. హిజాబ్ వివాదంపై నేడు కర్నాటక హై కోర్టు తీర్పు

    విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించాలా వద్దా అనే అంశంపై నేడు కర్నాటక హై కోర్టు తుది తీర్పును ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో కర్నాటకలోని ఉడుపి జిల్లాలోని అనేక ప్రాంతాల్లో 144 సెక్షన్ పెట్టారు. పోయిన ఏడాది డిసెంబరు నుంచి కర్నాటకలో హిజాబ్ మీద వివాదం చెలరేగుతోంది. హిజాబ్ ధరించి వచ్చిన ముస్లిం అమ్మాయిలను క్లాసులోకి రానివ్వకుండా అనేక విద్యాసంస్థలు నిషేధిస్తూ వచ్చాయి. ఆ తరువాత హిజాబ్ ధరిస్తున్న ముస్లిం అమ్మాయిలకు వ్యతిరేకంగా కాషాయ కండువాలు ధరించి హిందు విద్యార్థులు రావడం కూడా వివాదంగా మారింది. ఆ తరువాత విద్యాసంస్థల్లో హిజాబ్‌ను నిషేధించడాన్ని సవాల్ చేస్తూ కర్నాటక హై కోర్టును ఆశ్రయించారు కొందరు ముస్లిం బాలికలు. ఇప్పటి వరకు వాదోపవాదనలు విన్న హై కోర్టు నేడు తుది తీర్పును వెల్లడించనుంది.

  10. రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటే భారత్‌‌లో పెట్రోలు రేట్లు తగ్గుతాయా?

    యుక్రెయిన్ మీద దాడికి దిగిన రష్యా అంతర్జాతీయంగా అనేక ఆర్థిక ఆంక్షలు ఎదుర్కొంటోంది. రష్యా ఆదాయానికి కీలకంగా ఉన్న చమురు, సహజవాయుల దిగుమతులను అమెరికా నిషేధించగా యూరోపియన్ యూనియన్ దేశాలు తగ్గించుకునే ప్రయత్నంలో ఉన్నాయి. ఈ ఏడాది చివరి కల్లా రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకోవడాన్ని ఆపాలని బ్రిటన్ కూడా నిర్ణయించింది. ఇప్పుడు ఇది రష్యాకు ఇబ్బందికరంగా మారింది. దాంతో చౌకగా చమురు అమ్ముతామంటూ భారత్‌కు ఆఫర్ ఇచ్చింది రష్యా. తమ దేశంలో పెట్టుబడులు పెంచాలని భారత్‌ను కోరింది.

  11. రష్యా బలగాలలో అయోమయం: యుక్రెయిన్ అధ్యక్షుడు

    టర్కీ వేదికగా రష్యాతో నాలుగో దఫా శాంతి చర్చలు కొనసాగుతున్నాయని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియెన్‌స్కీ తెలిపారు.

    ఈ మేరకు ఆయన తాను మాట్లాడిన ఓ వీడియోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.

    చర్చలు బాగానే జరుగుతున్నాయని ఆయన ఆ వీడియోలో చెప్పారు.

    సోమవారం లుహాన్స్క్, కీయెవ్ నుంచి తరలివెళ్తున్న 3,806 మందికి యుక్రెయిన్ దళాలు సహాయపడ్డాయని ఆయన చెప్పారు.

    వంద టన్నుల సహాయ సామగ్రి, సరకులతో వస్తున్న కాన్వాయ్ బెర్డియాన్స్క్‌లో చిక్కుకుందని, అది ఇంకా రేవు పట్టణం మరియుపూల్ చేరలేదని చెప్పారు.

    మరోవైపు యుక్రెయిన్ బలగాల నుంచి ఈ స్థాయి ప్రతిఘటనను రష్యా ఊహించలేదని, రష్యా సేనలు గందరగోళంలో ఉన్నాయని జెలియెన్స్కీ అన్నారు.

    యుద్ధ రంగం నుంచి రష్యన్లు పారిపోతున్నారని, వారి యుద్ధ సామగ్రిని కూడా వదిలివెళ్తున్నారని ఆయన అన్నారు.

    యుద్ధానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రష్యా ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

  12. బీబీసీ తెలుగు లైవ్ పేజ్‌కి స్వాగతం

    యుక్రెయిన్ యుద్ధం 20వ రోజుకు చేరుకుంది.

    ఓ వైపు పోరు సాగుతుండగా మరోవైపు కాల్పుల విరమణ దిశగా చర్చలూ సాగుతున్నాయి.

    యుద్ధం తీవ్రమవుతుండడం, రష్యా దాడులు మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తుండడంతో పెద్దసంఖ్యలో ప్రజలు పొరుగు దేశాలకు వెళ్లిపోతున్నారు.

    యుక్రెయిన్ యుద్ధంతో పాటు, తెలుగు రాష్ట్రాలకు చెందిన, జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం ఈ లైవ్ పేజ్ చూస్తూ ఉండండి.