యుక్రెయిన్: మరియుపూల్‌లోని ప్రసూతి, పిల్లల ఆస్పత్రిపై రష్యా బాంబు దాడి

యుక్రెయిన్ నుంచి లక్షల సంఖ్యలో ప్రజలు వలసపోతున్నారని సేవ్ ద చిల్డ్రన్ సంస్థ వెల్లడించింది. యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియెన్‌స్కీ బ్రిటన్ పార్లమెంటులో వీడియో ప్రసంగం చేస్తూ, "మేం వీధుల్లో, అడవుల్లో, తీర ప్రాంతాల్లో అంతటా పోరాడుతాం" అని ప్రకటించారు.

లైవ్ కవరేజీ

ఆలమూరు సౌమ్య

  1. యుక్రెయిన్‌పై రష్యా దాడి ప్రారంభించి నేటికి 14 రోజులు.. ఈనాటి ముఖ్యాంశాలు ఇవి

    యుక్రెయిన్‌పై రష్యా దాడి ప్రారంభించి నేటికి 14 రోజులు.

    ఈరోజు ముఖ్యాంశాలు మరోసారి..

    • యుక్రెయిన్‌లోని మరియుపూల్ నగరంలో పిల్లల ఆస్పత్రిని రష్యా ధ్వంసం చేసిందని సిటీ కౌన్సిల్ తెలిపింది. "రష్యా దళాలు ఆస్పత్రిపై చాలా బాంబులు వేశాయి. ఆస్పత్రి భవనం ఘోరంగా దెబ్బతింది" అని యుక్రెయిన్ అధికారులు ఫేస్‌బుక్‌లో ప్రకటించారు.
    • యుక్రెయిన్‌కు యుద్ధ విమానాలను పంపబోమని జర్మనీ తెలిపింది. జర్మనీ, ఆయుధాలు సహా "అన్ని రకాల రక్షణ సామగ్రిని అందించిందని, యుద్ధ విమానాలు అందులో భాగం కాదు" అని జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ తెలిపారు.
    • చెర్నోబిల్ న్యూక్లియర్ ప్లాంటుకు అత్యవసరంగా మరమత్తులు చేయించాలని, అందుకు కాల్పుల విరమణ అవసరమని యుక్రెయిన్ విదేశాంగ మంత్రి పిలుపునిచ్చారు.
    • సుమీ నుండి బయలుదేరిన మొదటి కాన్వాయ్‌లో చాలావరకు భారతదేశానికి చెందిన వైద్య విద్యార్థులు ఉన్నారు. సుమీ నుంచి తరలింపు ప్రక్రియ విజయవంతమైందని, అన్ని బస్సులూ సురక్షితంగా సుమీ నుంచి తరలివెళ్లాయని స్థానిక అధికారులు చెబుతున్నారు.
    • భారత అధికారులు ఒక పాకిస్తానీ విద్యార్థికి కూడా యుక్రెయిన్ నుంచి తరలివెళ్లేందుకు సహాయం చేశారు. ఆమె భారత రాయబారులకు, ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.
    • యుక్రెయిన్ నగరం సుమీలో ప్రజలను తరలించే పని విజయవంతంగా పూర్తయినట్లు కీయెవ్ ప్రకటించింది. పలు నగరాల్లో 12 గంటల పాటు కాల్పుల విరమణకు రష్యా అంగీకరించినట్లు యుక్రెయిన్ డిప్యూటీ పీఎం చెప్పారు. దీంతో ఆరు నగరాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే అవకాశం ఏర్పడుతుందని భావిస్తున్నారు.
    • రష్యా చేసిన దాడుల్లో సోమవారమే 22 మంది మరణించగా, అందులో ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారని స్థానిక అధికారులు చెప్పారు. యుక్రెయిన్ రాజధాని కీయెవ్‌ నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో మళ్లీ పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు వార్తలు వస్తున్నాయి.
    • తూర్పు యుక్రెయిన్‌ ప్రాంతంలో నెలకొన్న వేర్పాటువాదులపై యుక్రెయిన్ దాడి చేయనున్నట్లు నిరూపించే రహస్య పత్రాలు లభించాయని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ చెబుతోంది. యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియెన్‌స్కీ బ్రిటన్ పార్లమెంటులో మాట్లాడుతూ, 'మేం వీధుల్లో, మైదానాల్లో, అడవుల్లో, సముద్ర తీరాల్లో అన్ని చోట్లా పోరాడుతాం' అని ప్రకటించారు.

    ఈ యుద్ధానికి సంబంధించిన తాజా అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి బీబీసీ న్యూస్ లైవ్ పేజీ చూస్తూ ఉండండి.

  2. మరియుపూల్ పిల్లల ఆస్పత్రి వీడియో

    రష్యా దాడిలో ధ్వంసమైన మరియుపూల్ పిల్లల ఆస్పత్రి వీడియోను యుక్రెయిన్ ఎంపీ డిమిట్రో గురిన్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు."పిల్లలు, నవజాత శిశువుల గురించి సమాచారం లేదని" ప్రసూతి వార్డు "శిథిలాల కింద నుంచి ప్రజలను వెలికితీశారని" ఎంపీ చెప్పారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  3. బ్రేకింగ్ న్యూస్, మరియుపూల్‌లోని పిల్లల ఆస్పత్రిపై రష్యా దాడి

    యుక్రెయిన్‌లోని మరియుపూల్ నగరంలో పిల్లల ఆస్పత్రిని రష్యా ధ్వంసం చేసిందని సిటీ కౌన్సిల్ తెలిపింది. ఈ నగరాన్ని రష్యా ముట్టడించిన సంగతి తెలిసిందే.

    "రష్యా దళాలు ఆస్పత్రిపై చాలా బాంబులు వేశాయి. ఆస్పత్రి భవనం ఘోరంగా దెబ్బతింది" అని ఫేస్‌బుక్‌లో యుక్రెయిన్ అధికారులు ప్రకటించారు.

    ఈ దాడిలో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారన్నది ఇంకా స్పష్టంగా తెలీదని చెప్పారు.

    "ప్రసూతి వార్డు, పిల్లల వార్డు, థెరపీ వార్డు అన్నీ రష్యా వైమానిక దాడిలో ధ్వంసమయ్యాయి" అని ప్రాంతీయ సైనిక పరిపాలనా విభాగం అధిపతి పావ్లో కైరిలెంకో ఒక ఫేస్‌బుక్ వీడియోలో తెలిపారు. గాయపడినవారిని సమీప ఆస్పత్రికి తరలించామని చెప్పారు.

    రష్యా దాడికి సంబంధించిన ఈ ఆరోపణలను బీబీసీ స్వతంత్రంగా ధృవీకరించలేదు. కానీ, స్థానిక ఎంపీ డిమిట్రో గురిన్, బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో దాడి జరిగిన విషయాన్ని వెల్లడించారు.

  4. యుక్రెయిన్‌కు యుద్ధ విమానాలు పంపేది లేదు- జర్మనీ

    యుక్రెయిన్‌

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, పోలిష్ ఎయిర్ ఫోర్స్ మిగ్-29, ఫైల్ ఫోటో

    యుక్రెయిన్‌కు యుద్ధ విమానాలను పంపబోమని జర్మనీ తెలిపింది.

    అంతకుముందు, జర్మనీలోని అమెరికా స్థావరం ద్వారా యుక్రెయిన్‌కు రష్యాలో తయారైన మిగ్-29 జెట్‌లను పంపించమని పోలండ్ ప్రతిపాదించింది. కానీ, అమెరికా దాన్ని తిరస్కరించింది.

    జర్మనీ, ఆయుధాలు సహా "అన్ని రకాల రక్షణ సామగ్రిని అందించిందని, యుద్ధ విమానాలు అందులో భాగం కాదు" అని జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ తెలిపారు.

    రష్యా విమానాలను నాటో జెట్లు కూల్చివేయడం సమర్థనీయం కాదని బ్రిటన్ ప్రభుత్వం చెప్పింది. అయితే, "యుక్రెయిన్‌కు అవసరమైన ఆయుధాలను అందించడానికి" తాము సిద్ధంగా ఉన్నామని బోరిస్ జాన్సన్ "పలుమార్లు చెప్పారు" అని పీఎం ప్రతినిధి ఒకరు చెప్పారు.

    అంతకుముందు, బ్రిటన్ యుక్రెయిన్‌కు ఆయుధాల సరఫరాను పెంచుతున్నట్లు, మరో 1,615 తేలికపాటి యాంటీ ట్యాంక్ క్షిపణులను, లాంగ్ రేంజ్ జావెలిన్ క్షిపణులను పంపుతున్నట్లు తెలిపింది. ఆపై, సర్ఫేస్ టు ఎయిర్ క్షిపణులను పంపే యోచన చేస్తోంది.

  5. చెర్నోబిల్‌కు మరమ్మత్తులు చేయించేందుకు కాల్పుల విరమణ అవసరం - యుక్రెయిన్

    యుక్రెయిన్

    ఫొటో సోర్స్, RUSSIAN DEFENCE MINISTRY/GETTY IMAGES

    చెర్నోబిల్ న్యూక్లియర్ ప్లాంటుకు అత్యవసరంగా మరమత్తులు చేయించాలని, అందుకు కాల్పుల విరమణ అవసరమని యుక్రెయిన్ విదేశాంగ మంత్రి పిలుపునిచ్చారు.

    ప్లాంట్‌కు కావలసిన శక్తిని అందించడానికి రిజర్వ్ డీజిల్ జనరేటర్లు 48 గంటలు మాత్రమే పనిచేస్తాయని, "ఆ తరువాత అణు ఇంధనల నిల్వలను కూలింగ్ చేసే వ్యవస్థలు ఆగిపోతాయి. రేడియేషన్ లీక్స్ ప్రారంభమవుతాయి" అని డిమిట్రో కులేబా ట్విట్టర్‌లో తెలిపారు.

    అయితే, బుధవారం ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఈ విషయమై ఒక ప్రకటన విడుదల చేస్తూ భయాందోళనలను తగ్గించే ప్రయత్నం చేసింది.

    "1986 చెర్నోబిల్ ప్రమాదం జరిగి ఇంతకాలం అయింది కాబట్టి, అణు ఇంధనాల వేడిని తగ్గించడానికి పూల్‌లో ఉన్న చల్లటి నీరు సరిపోతుందని, అందుకు విద్యుత్ సరఫరా అవసరం ఉండదని" ఆ ప్రకటనలో తెలిపింది.

    మరోవైపు, జాపోరిజ్జియా అణు విద్యుత్ ప్లాంట్ చుట్టూ రేడియేషన్ స్థాయిలు సాధారణంగానే ఉన్నాయని సమాచారం. గతవారం రష్యా ఈ ప్లాంట్‌ను స్వాధీనం చేసుకుంది.

  6. యుక్రెయిన్‌ సైన్యంలో చేరి రష్యాతో పోరాడుతున్న తమిళనాడు విద్యార్థి

    SAI NIKESH

    ఫొటో సోర్స్, SAI NIKESH

    ఫొటో క్యాప్షన్, సాయి నికేష్

    ఇంజనీరింగ్ చదవటానికి యుక్రెయిన్ వెళ్లిన ఓ తమిళనాడు విద్యార్థి, యుక్రెయిన్ పారామిలటరీ బలగాల్లో చేరి రష్యాతో యుద్ధం చేస్తున్నాడు.

    సాయి నికేష్ స్వస్థలం కోయంబత్తూరు జిల్లాలోని తుడియలూర్‌. 2018లో పాఠశాల విద్య పూర్తిచేసిన నికేష్, భారత సైన్యంలో చేరటానికి రెండుసార్లు ప్రయత్నించి విఫలమయ్యాడు.

    ఆ తర్వాత అమెరికా సైన్యంలో చేరటం గురించి వాకబు చేశాడు. అది కూడా ఫలించలేదు. దీంతో యుక్రెయిన్‌లోని ఖార్కియెవ్‌లో నేషనల్ ఏరోస్పేస్ యూనివర్సిటీలో చేరాడు. అక్కడ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ నేర్చుకుంటున్నాడు.

    ఇప్పుడు యుక్రెయిన్‌ మీద రష్యా దాడిచేయటంతో యుద్ధం మొదలుకాగానే భారత విద్యార్థులు ఖార్కియెవ్ వీడి స్వదేశానికి వచ్చేస్తున్నారు. కానీ సాయి నికేష్ అక్కడే ఉండిపోయాడు. ఇంటికి వచ్చేయాలని అతడి కుటుంబం, స్నేహితులు కోరినా అతడు ససేమిరా అంటున్నాడు.

    పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  7. సుమీ నుంచి తరలివచ్చిన మొదటి కాన్వాయ్‌లో ఎక్కువమంది భారతీయ విద్యార్థులే

    ఉక్రెయిన్

    సుమీ నగరం నుంచి తరలివెళ్లిన ప్రజలు కొంతమంది నిన్న రాత్రి పోల్టావా నగరానికి చేరుకున్నారు. వారంతా చాలా అలిసిపోయి ఉన్నారు. రైల్వే స్టేషన్ ముందు బస్సులు దిగీ దిగగానే ఏదో ఒక ట్రైన్ పట్టుకుని డేంజర్ జోన్ నుంచి వీలైనంత దూరంగా పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు.

    సుమీ నుండి బయలుదేరిన మొదటి కాన్వాయ్‌లో చాలావరకు భారతదేశానికి చెందిన వైద్య విద్యార్థులు ఉన్నారు.

    రష్యా దాడి ప్రారంభించిన తరువాత, వారంతా రెండు వారాల పాటు దయనీయమైన పరిస్థితుల్లో గడిపారని ఒక భారతీయ విద్యార్థి చెప్పారు.

    "తిండి, తిప్పలు లేవు. చాలావరకు అండర్‌గ్రౌండ్‌లోనే ఉన్నాం. మేమంతా ఆకలితో అలమటించాం" అని మనీషా చెప్పారు.

    అక్కడ పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతోందని, భయాందోళనలు పెరిగిపోతున్నాయని మరొక భారతీయ విద్యార్థి తెలిపారు.

    సోమవారం రాత్రి రష్యా జరిపిన వైమానిక దాడిలో కనీసం 20 మంది చనిపోయారు. అందులో ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. రష్యా విచక్షణారహితంగా దాడులు చేస్తోంది.

    యుక్రెయిన్

    తరలింపు బస్సులు జనంతో కిక్కిరిసిపోయాయి. కూర్చునేందుకు సీట్లు లేకపోయినా కొందరు నిలబడి ప్రయాణం చేశారు. సుమీ నుంచి పోల్టావాకు సుమారు 175 కిమీ దూరం. బాంబు దాడులు జరుగుతున్న ప్రాంతాలకు దూరంగా ప్రయాణం చేస్తూ పోల్టావా చేరుకునేందుకు 12 గంటలు పట్టింది. అన్ని గంటలూ తాము నిలబడే వచ్చామని కొందరు చెప్పారు.

    సుమీ నుంచి బయలుదేరుతుండగా, రష్య న్ ఫిరంగులు, ట్యాంకులను చూశామని మరొక విద్యార్థి చెప్పారు. ఒక కాన్వాయ్ గుమికూడిన చోట కాల్పులు జరిగినట్లు చూపిస్తున్న ఒక వీడియోను బీబీసీ చూసింది. ధృవీకరించింది.

    కానీ, సుమీ నుంచి తరలింపు ప్రక్రియ విజయవంతమైందని, అన్ని బస్సులూ సురక్షితంగా సుమీ నుంచి తరలివెళ్లాయని స్థానిక అధికారులు చెబుతున్నారు.

    యుక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తరువాత విజయవంతమైన మొదటి తరలింపు ఇదే. అంతకుముందు, మరియుపూల్ నుంచి పౌరులను తరలించే ప్రయత్నాలు విఫలమయ్యాయి.

  8. యుక్రెయిన్‌లో చిక్కుకున్న పాకిస్తాన్ విద్యార్థి భారత ప్రధాన మోదీకి ఎందుకు ధన్యవాదాలు తెలిపారు?

    యుక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులను భారత ప్రభుత్వం అవిరామంగా తరలిస్తోంది. ఒకదాని తరువాత ఒకటిగా విద్యార్థులను తీసుకువస్తున్న విమానాలు భారత్ చేరుతున్నాయి.

    ఇదిలా ఉండగా, భారత అధికారులు ఒక పాకిస్తానీ విద్యార్థికి కూడా యుక్రెయిన్ నుంచి తరలివెళ్లేందుకు సహాయం చేశారు.

    పాకిస్తాన్‌కు చెందిన అస్మా షఫీక్ ఇప్పుడు పశ్చిమ యుక్రెయిన్ వైపు వెళుతున్నారని, అక్కడి నుంచి ఆమె ఆ దేశాన్ని విడిచివెళ్లగలరని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది. ఆమె త్వరలో తన కుటుంబాన్ని కలుసుకుంటారు.

    తనకు సహాయం చేసినందుకు కీయెవ్‌లోని భారత రాయబార కార్యాలయానికి, భారత ప్రధాని మోదీకి అస్మా షఫీక్ కృతజ్ఞతలు తెలిపారని ఏఎన్ఐ వెల్లడించింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    అస్మా ఒక వీడియోలో మాట్లాడుతూ, "ఇక్కడ అడుగడుగునా సహాయం చేసినందుకు కీయెవ్‌లోని భారత రాయబార కార్యాలయానికి నేను ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. మేం ఇక్కడ చాలా దుర్భర పరిస్థితుల్లో చిక్కుకున్నాం. ఈ సాయం చేసినందుకు భారత ప్రధాని మోదీకి కూడా ధన్యవాదాలు తెలుపాలనుకుంటున్నాను. భారత రాయబారుల వలనే నేను ఇంటికి చేరగలననే నమ్మకం వచ్చింది" అని అన్నారు.

    భారత రాయబారులు యుక్రెయిన్‌లో చిక్కుకున్న విదేశీయులకు సాయం అందించడం ఇది మొదటిసారి కాదు.

    ఇంతకుముందు ఒక బంగ్లాదేశీ పౌరుడిని యుక్రెయిన్ నుంచి సురక్షితంగా తరలించామని భారత విదేశాంగ శాఖ తెలిపింది.

    అలాగే, ఆపరేషన్ గంగ కింద ఒక నేపాలీని కూడా అక్కడి నుంచి తరలించారు. సురక్షితంగా స్వదేశానికి చేరుకున్న నేపాలీ రోషన్ ఝా భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారని ఖాట్మండు పోస్టు వెల్లడించింది.

    మరో ఏడుగురు నేపాలీ పౌరులు పోలండ్ నుంచి స్వదేశానికి చేరుకునేందుకు భారతదేశం సహాయం చేసిందని ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయం తెలిపింది.

    ఆపరేషన్ గంగ కింద ఇప్పటివరకు సుమారు 18,000 మంది భారతీయ విద్యార్థులను స్వదేశానికి తీసుకువచ్చారు.

  9. యుద్ధ నేరం అంటే ఏమిటి? యుక్రెయిన్‌లో రష్యా యుద్ధ నేరాలకు పాల్పడుతోందా?

    యుక్రెయిన్‌లో రష్యా యుద్ధ నేరాలకు పాల్పడిందన్న ఆరోపణలపై దర్యాప్తు మొదలవుతోంది.

    యుక్రెయిన్ పౌరులపై దాడులు చేసిందని రష్యాపై ఆరోపణలు వచ్చాయి.

    రష్యా చేసినట్లు చెబుతున్న యుద్ధ నేరాలు, మారణహోమంపై ఆధారాలు సేకరిస్తామని ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ (ఐసీసీ) చీఫ్ ప్రాసిక్యూటర్ చెప్పారు.

    రష్యా యుద్ధ నేరాలపై దర్యాప్తు చేయాలని 39 దేశాలు కోరడంతో ఈ విచారణ మొదలవుతోంది.

    అయితే, సామాన్య ప్రజలపై దాడులు చేశారన్న ఆరోపణలను రష్యా ఖండిస్తోంది.

    అసలు యుద్ధ నేరాలు అంటే ఏమిటి? రష్యాపై వచ్చిన ఆరోపణలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  10. యుక్రెయిన్ శరణార్థులు ఏ దేశాలకు తరలివెళుతున్నారు?

    యుక్రెయిన్ నుంచి విజయవంతంగా పౌరులను తరలిస్తున్నారన్న వార్తలను ఇప్పటికే ఆ దేశం విడిచి వెళ్లినవారు అలాగే, దేశంలోనే మరోచోట చిక్కుకున్నవారు జాగ్రత్తగా గమనిస్తున్నారు.

    ప్రస్తుతం 20 లక్షల మంది యుక్రెయిన్ విడిచిపెట్టి వెళ్లారు. కాగా, సుమారు 40 లక్షల మంది ఆ దేశాన్ని వదిలి వెళ్లవచ్చని ఐక్యరాజ్య సమితి రెఫ్యుజీ ఏజెన్సీ అంచనా వేసింది.

    యుక్రెయిన్ సరిహద్దుల్లో ఉన్న పోలండ్, స్లోవేకియా, హంగేరీ, రొమేనియా, మల్దోవా, రష్యా దేశాలకు ప్రజలు తరలివెళుతున్నారు.

    స్థానిక అధికారులు, సహాయ సంస్థలు, పౌరుల సహకారంతో తరలింపు వేగంగా సాగుతోంది. మధ్య యూరప్‌లో సహాయక చర్యలు ఆకట్టుకుంటున్నాయి.

    యుక్రెయిన్
  11. ఇప్పటి వరకు యుక్రెయిన్‌లో ఏమి జరిగింది?

    యుక్రెయిన్‌పై రష్యా దాడులు 14వ రోజుకు చేరాయి.

    ఈశాన్య యుక్రెయిన్ నగరం సుమీలో ప్రజలను తరలించే పని విజయవంతంగా పూర్తయినట్లు కీయెవ్ ప్రకటించింది. రష్యా చేసిన దాడుల్లో ఒక్క సోమవారమే 22 మంది మరణించగా, అందులో ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారని స్థానిక అధికారులు చెప్పారు.

    యుక్రెయిన్ రాజధాని కీయెవ్‌ నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో మళ్లీ పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు వార్తలు వస్తున్నాయి.

    మానవతా దృష్టితో రష్యా మరొకసారి కాల్పుల విరమణ చేస్తున్నట్లు ప్రకటించింది. రష్యా దాడులకు పాల్పడనున్న నగరాల నుంచి ప్రజలు సురక్షితంగా తరలి వెళ్లేందుకు వీలుగా కాల్పుల విరమణ చేస్తున్నట్లు రష్యన్ ప్రభుత్వ మీడియా ప్రకటించింది.

    రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లావ్‌రోవ్ యుక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా టర్కీలో సమావేశంకానున్నట్లు రష్యా విదేశాంగ శాఖ మంత్రి ధృవీకరించింది.

    తూర్పు యుక్రెయిన్‌ ప్రాంతంలోనెలకొన్న వేర్పాటువాదుల పై యుక్రెయిన్ దాడి చేయనున్నట్లు నిరూపించే రహస్య పత్రాలు లభించాయని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ చెబుతోంది.

    ఇవీ ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్.మిగిలిన అప్డేట్స్ సౌమ్య అందిస్తారు.

  12. డోన్బాస్ పై దాడికి ప్రణాళిక చేస్తున్న యుక్రెయిన్ - ఆధారాలు లభించాయంటున్న రష్యా

    దొ నెట్స్క్ , లుహాన్స్క్

    తూర్పు యుక్రెయిన్‌ ప్రాంతంలో నెలకొన్న వేర్పాటువాదుల పై యుక్రెయిన్ దాడికి సిద్ధపడుతోంది. ఈ దాడిని నిరూపించే రహస్య పత్రాలు లభించాయని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ చెబుతోంది.

    డోన్బాస్ ప్రాంతంలో రష్యాకు మద్దతు పలుకుతున్న తిరుగుబాటు ప్రాంతాల పై కీయెవ్ సైనిక దాడికి పాల్పడనుంది. రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ దీనికి సంబంధించిన ఆరు పేజీల పత్రాలను ప్రచురించినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ ప్రచురించింది.

    అయితే, ఈ పత్రాలను రాయిటర్స్ స్వతంత్రంగా ధ్రువీకరించలేదు.

    యుక్రెయిన్ భాషలో ఉన్న ఈ పత్రాల్లో సైన్యం వ్యూహాత్మక దాడులకు సన్నద్ధమయ్యే ప్రణాళికలు పొందుపరిచినట్లు భావిస్తున్నారు.

    గత నెలలో తూర్పు యుక్రెయిన్‌లో నున్న దొ నెట్స్క్ , లుహాన్స్క్ ప్రాంతాలను ప్రత్యేక దేశాలుగా గుర్తిస్తూ రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటన చేశారు. ఈ ప్రకటన చేసిన కొంతసేపటికే ఆ రెండు ప్రాంతాల్లోకి రష్యన్ సేనలను పంపేందుకు ఆదేశాలు చేశారు. ఆ తర్వాతే యుద్ధం మొదలయింది.

  13. సోషల్ మీడియాలో రష్యాతో మరో యుద్ధం చేస్తున్న యుక్రెయిన్ యువత

    యుద్ధానికి ముందు కాట్రినా, సెలవులను ఎంజాయ్ చేస్తూ..

    ఫొటో సోర్స్, KATRINA

    యుక్రెయిన్‌లో యుద్ధం కొనసాగుతోంది. మరోపక్క ఆ దేశం గురించి, యుద్ధం గురించి సోషల్ మీడియాలో గందరగోళం, తప్పుడు సమాచారం పేరుకుపోతోంది.

    సోషల్ మీడియాలో తన స్నేహితుల నుంచి కలవరపెట్టే సమాచారం, వాస్తవాలతో పాటు చాలా నకిలీ సమాచారం, తప్పుడు వార్తలు కూడా కనిపించినట్లు కీయెవ్‌కు చెందిన 24 ఏళ్ల కాట్రిన్ చెప్పారు.

    ప్రస్తుతం ఆమె ఎల్వివ్ నగరానికి వెలువల ఉన్న తన స్వగ్రామంలో సురక్షితంగా ఉన్నారు.

    టెలిగ్రామ్‌లో విపరీతంగా వదంతులు వ్యాపిస్తున్నాయని, ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయని మరికొంత మంది చెప్పారు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  14. టర్కీలో యుక్రెయిన్ - రష్యా విదేశాంగ మంత్రుల సమావేశం

    రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్,  యుక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్, యుక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా

    రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లావ్‌రోవ్ యుక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా టర్కీలో సమావేశం కానున్నారు. ఈ విషయాన్ని రష్యా విదేశాంగ శాఖ మంత్రి ధృవీకరించింది.

    ఫిబ్రవరి 24న రష్యా ఆక్రమణ మొదలైన తర్వాత ఇరు దేశాల విదేశాంగ మంత్రుల మధ్య సమావేశం చోటు చేసుకోవడం ఇదే మొదటిసారి.

    లావ్‌రోవ్ ఆంటాల్యాలో ఉన్న ఇంటర్నేషనల్ డిప్లొమాటిక్ ఫోరమ్ దగ్గర కులేబాతో సమావేశమవుతారని రష్యన్ విదేశాంగ శాఖ ప్రతినిధి మరియా జఖోరోవా రష్యన్ ప్రభుత్వ మీడియాకు తెలిపారు.

    టర్కీ విదేశాంగ మంత్రి మెవ్లుత్ చావుసోగ్లు త్రిసభ్య సమావేశాన్ని ప్రతిపాదించారు. మార్చి 10న చోటు చేసుకోనున్న ఈ సమావేశంలో ఆయన కూడా పాల్గొంటారు.

    రష్యా, యుక్రెయిన్ మధ్య ఇప్పటి వరకు చోటు చేసుకున్న శాంతి సమావేశాల్లో ఎటువంటి ఒప్పందం కుదరకపోవడంతో ఈ చర్చలొక సవాలుగా మారాయి.

  15. యుక్రెయిన్ నుంచి వలస వెళ్లినవారిలో 8లక్షల మంది చిన్నారులు: సేవ్ ది చిల్డ్రన్

    11ఏళ్ల హసన్

    ఫొటో సోర్స్, Slovak Interior Ministr

    యుక్రెయిన్ పై రష్యా దాడులు మొదలయినప్పటి నుంచి సుమారు 20 లక్షలు మంది దేశాన్ని వదిలిపెట్టి వెళ్లినట్లు 'సేవ్ ది చిల్డ్రన్' తెలిపింది. అందులో సుమారు 8 లక్షల మంది పిల్లలున్నట్లు అంచనా.

    చాలా మంది పిల్లలు ఎవరి సహాయమూ లేకుండా ఒంటరిగా వెళుతున్నట్లు సేవ్ ది చిల్డ్రన్ హెచ్చరించింది.

    "పిల్లలను కాపాడుకునేందుకు చాలా మంది తల్లితండ్రులు కొన్ని హృదయవిదారక, నిస్సహాయ చర్యలకు పాల్పడుతున్నారు. కొంత మంది తమ ఇళ్లను సంరక్షించుకునేందుకు యుక్రెయిన్ లోనే ఉండిపోయి, పిల్లలను మాత్రం ఇరుగు పొరుగు లేదా స్నేహితులతో కానీ బయటకు పంపిస్తున్నారు" అని సేవ్ ది చిల్డ్రన్ స్వచ్ఛంద సంస్థకు చెందిన ఐరీనా సఘోయాన్ చెప్పారు.

    హసన్ చేతి పై ఫోన్ నంబర్

    ఫొటో సోర్స్, Slovak Interior Ministry

    జాపోరిజియాలో 11ఏళ్ల హసన్ ఒంటరిగా ఊరొదిలి వెళ్లాల్సి వచ్చిన కథనాన్ని బీబీసీ ప్రచురించింది. ఇంట్లో ఉన్న నానమ్మను, వదిలిపెట్టి వచ్చే పరిస్థితి బాబు తల్లికి లేకపోవడంతో ఒక్కడే ఇల్లొదిలి వెళ్లాల్సి వచ్చిన కథనాన్ని బీబీసీ ప్రచురించింది.

    ఆ బాబు 1200 కిలోమీటర్ల రైలు ప్రయాణం చేసి సురక్షితంగా స్లోవేకియా చేరుకున్నాడు. ఆ బాబుతో పాటు రెండు బ్యాగులు, పాస్ పోర్ట్, చేతి పై రాసుకున్న బంధువుల ఫోన్ నంబర్ మాత్రమే ఉన్నాయి.

    యుక్రెయిన్ వదిలిపెట్టి వెళుతున్న శరణార్ధుల్లో ఎక్కువ మంది పోలండ్ వెళుతుండగా మరి కొంత మంది హంగరీ, స్లోవేకియా కూడా వెళుతున్నారు.

  16. తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటించిన రష్యా

    పుతిన్

    ఫొటో సోర్స్, Getty Images

    మానవతా దృష్టితో రష్యా మరొకసారి కాల్పుల విరమణ చేస్తున్నట్లు ప్రకటించింది. రష్యా దాడులకు పాల్పడనున్న నగరాల నుంచి ప్రజలు సురక్షితంగా తరలి వెళ్లేందుకు వీలుగా కాల్పుల విరమణ చేస్తున్నట్లు రష్యన్ ప్రభుత్వ మీడియా ప్రకటించింది.

    యుక్రెయిన్ కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 10గంటలకు కీయెవ్, సుమీ, చెర్నిహియెవ్, ఖార్కియెవ్, మరియుపూల్ నగరాల్లో తిరిగి మానవతా కారిడార్లను ఏర్పాటు చేస్తారు.

    రష్యా కాల్పుల విరమణను ప్రకటించడం ఇది మూడవ సారి. అయితే, గతంలో కొన్ని నగరాల్లో ప్రజలను తరలించేందుకు చేసిన ప్రయత్నాలు చాలా వరకు విఫలమయ్యాయి.

    సుమీ నుంచి మంగళవారం 5000 మందిని తరలించినట్లు యుక్రెయిన్ అధికారులు ప్రకటించారు. ఈ తరలింపు విజయవంతమయింది.

    "చెర్నిహియెవ్ నగరం నుంచి బయటకు వెళ్లే మార్గంలో రష్యా దాడులను ఆపకపోవడంతో అక్కడ మాత్రం ప్రజల తరలింపు కష్టమయింది" అని యుక్రెయిన్ చెబుతోంది.

  17. బ్యారికేడ్ల దగ్గర 'డోంట్ వర్రీ, బీ హ్యాపీ' పాటను వాయిస్తున్న యుక్రెయిన్ సైన్యం

    యుక్రెయిన్‌లో దాడులు జరుగుతున్న సమయంలో ఇటీవల కొంత మంది సంగీతకారులు వాయిద్యాలు వాయిస్తూ, పాటలు పాడుతున్నట్లుగా ఉన్న వీడియోలు కనిపించాయి.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    లీయెవ్ రైల్వే స్క్వేర్ దగ్గర ఒక వైపు రైళ్లను ఎక్కేందుకు ప్రయాణికులు పరుగులు తీస్తుండగా, మరో వైపు 'వాట్ ఏ బ్యూటిఫుల్ వర్డ్' పాటను ప్లే చేస్తున్న పియానిస్ట్ కనిపించారు.

    ఒక అండర్ గ్రౌండ్ షెల్టర్ లో 'లెట్ ఇట్ గో' అనే పాటను పాడుతున్న అమ్మాయి కనిపించింది.

    ఒడెస్సా నగరంలోని ఓపెరా, బ్యాలే థియేటర్ ముందున్న బ్యారికేడ్ల ముందు నిల్చుని యుక్రెయిన్ సైన్యానికి చెందిన బ్యాండ్ బాబీ మెక్ ఫెర్రీన్ 'డోన్ట్ వర్రీ, బీ హ్యాపీ' పాటను వాయించారు.

    ఈ వీడియోను బీబీసీ ధ్రువీకరించింది.

  18. బ్రేకింగ్ న్యూస్, కీయెవ్ నగరంలో మళ్లీ బాంబు పేలుళ్లు

    యుక్రెయిన్ రాజధాని కీయెవ్‌ నగరంలో, ఆ పరిసర ప్రాంతాల్లో మళ్లీ పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు వార్తలు వస్తున్నాయి.

    అక్కడ వరుసగా పేలుళ్లు జరుగుతున్నట్లు స్థానికంగా ఉన్న విలేఖరులు తెలిపారు.

    నగరంలో ఉదయం 6 గంటల నుంచే వైమానిక దాడుల సైరన్లు వినిపించడం మొదలయింది.

  19. సుమీలో పూర్తయిన పౌరుల తరలింపు

    సుమీలో పూర్తయిన పౌరుల తరలింపు

    ఫొటో సోర్స్, REUTERS

    ఈశాన్య యుక్రెయిన్ నగరం సుమీలో ప్రజలను తరలించే పని విజయవంతంగా పూర్తయినట్లు కీయెవ్ ప్రకటించింది.

    "సుమారు 5000 మంది ప్రజలు, 1000కి పైగా ప్రైవేటు వాహనాలు సురక్షితంగా ఉన్నాయి" అని అధ్యక్ష కార్యాలయం డెప్యూటీ హెడ్ కిర్లో టిమోషెన్కో చెప్పారు.

    టిమోషెన్కో టెలిగ్రామ్ అకౌంట్లో బుధవారం ఉదయం రాత్రి సమయంలో రైల్వే స్టేషన్ కు చేరుకుంటున్నట్లుగా కనిపిస్తున్న వారి వీడియోను పోస్టు చేశారు.

    అయితే, ఈ వీడియోను కూడా స్వతంత్రంగా ధ్రువీకరించలేదు.

    రష్యా సరిహద్దుల్లో ఉన్న సుమీ నగరం కూడా గత కొన్ని రోజులుగా రష్యన్ దాడులకు గురవుతోంది.

    రష్యా చేసిన దాడుల్లో ఒక్క సోమవారమే 22 మంది మరణించగా అందులో ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారని స్థానిక అధికారులు చెప్పారు.

  20. రష్యా అధీనంలో యుక్రెయిన్ అణు విద్యుత్ కేంద్రం - మాస్కో

    వీడియో క్యాప్షన్, యుక్రెయిన్ అణు విద్యుత్‌ కేంద్రంపై రష్యా దాడులు.. సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలు

    రష్యన్ నేషనల్ గార్డ్ యుక్రెయిన్‌లోని జాపోరిజియా అణు విద్యుత్ కేంద్రాన్ని అధీనంలోకి తీసుకున్నట్లు రష్యా ప్రభుత్వ మీడియా ప్రకటించింది.

    న్యూక్లియర్ ప్లాంట్ సిబ్బంది మాత్రం తమ విధులను యధావిధిగా కొనసాగిస్తున్నట్లు నేషనల్ గార్డ్ కు చెందిన అధికారి తెలిపారు. ప్లాంట్ కు కాపలా కాస్తున్న యుక్రెయిన్ నేషనల్ గార్డ్ సిబ్బంది తమ ఆయుధాలను రష్యన్ దళాలకు అప్పగించిన తర్వాత వారిని వదిలిపెట్టినట్లు పేర్కొన్నారు.

    అంతకు ముందే, అణు విద్యుత్ కేంద్రంలో పని చేస్తున్న సిబ్బందిని బంధించి వారిని వేధిస్తున్నట్లు యుక్రెయిన్ ఇంధన మంత్రి హెర్మన్ హాలుష్చెంకో ఆరోపించారు.

    రష్యా ప్లాంట్ మేనేజ్మెంట్ తో ఒక తప్పుడు ప్రకటన చేయించి ప్రచారానికి కూడా వాడుకుంటుందని కూడా హెచ్చరించారు.

    అయితే, ఇరు దేశాలు చేసిన వాదనలను బీబీసీ స్వతంత్రంగా ధ్రువీకరించలేదు.

    గత వారం రష్యా కొన్ని గంటల పాటు బాంబు దాడి చేసి ప్లాంటును స్వాధీనం చేసుకుంది. రష్యా చర్యల ద్వారా మొత్తం ఖండం భద్రతకు ముప్పు కలిగిస్తోందని ప్రపంచ నాయకులు ఆరోపించారు. రష్యా న్యూక్లియర్ టెర్రర్ సృష్టిస్తోందని యుక్రెయిన్ అధ్యక్షుడు వొలదిమీర్ జెలియెన్‌స్కీ అన్నారు.