You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

యుక్రెయిన్‌లోని కీలక నగరాలపై రష్యా దాడులు

యుక్రెయిన్‌లోని రెండవ అతిపెద్ద నగరం ఖార్కియెవ్‌లో రష్యా దాడులు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ భవనాలను లక్ష్యంగా చేసుకుని రష్యా క్షిపణులను ప్రయోగిస్తోంది. సిటీ కౌన్సిల్ భవనంపై క్రూయిజ్ క్షిపణిని ప్రయోగించిందని ఖార్కియెవ్‌ డిప్యూటీ గవర్నర్ తెలిపారు.

లైవ్ కవరేజీ

ఆలమూరు సౌమ్య

  1. యుక్రెయిన్‌పై రష్యా దాడి: ఏడవ రోజు ఏం జరిగిందంటే..

    ఫిబ్రవరి 24న రష్యా, యుక్రెయిన్‌పై "ప్రత్యేక సైనిక చర్య" ప్రారంభించింది.

    రష్యా యుక్రెయిన్‌లోని పలు నగరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది.

    ఇవాళ, ఏడవ రోజు జరిగిన సంఘటనలు క్లుప్తంగా మీకోసం..

    • రష్యా బలగాలు యుక్రెయిన్‌లోని కీలక నగరాలపై దాడులను ముమ్మరం చేశాయి.
    • ఖెర్సాన్ పోర్టును స్వాధీనం చేసుకున్నట్టు రష్యా చెబుతోంది. కానీ, యుక్రెయిన్ బలగాలు దానిపై పట్టు కోల్పోలేదని ఆ నగర మేయర్ అంటున్నారు.
    • రష్యా సరిహద్దులకు దగ్గరగా ఉన్న మరియుపూల్‌లో భారీ ప్రాణనష్టం జరిగి ఉండవచ్చని యుక్రెయిన్ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక రాష్ట్రం "దాదాపుగా ధ్వంసమైందని" నగర డిప్యూటీ మేయర్ తెలిపారు.
    • యుక్రెయిన్‌లోని రెండవ అతిపెద్ద నగరం ఖార్కియెవ్‌లో ఒక పోలీసు విభాగం భవనం, ఒక యూనివర్సిటీలోని కొంత భాగం రాకెట్ దాడికి దెబ్బతిన్నాయి.
    • గత రాత్రి రష్యా, ఖార్కియేవ్ నగరంలోకి పారాట్రూపర్లను దించిందని, నగరాన్ని ఆక్రమించుకోవడానికి దాడులు జరుపుతోందని యుక్రెయిన్ సైన్యం తెలిపింది.
    • రష్యా దాడులు మొదలైన దగ్గర నుంచి 2,000 మందికి పైగా యుక్రెయిన్ పౌరులు మృతి చెందినట్టు యుక్రెయిన్ అధికారులు తెలిపారు.
    • రష్యా, యుక్రెయిన్‌ల మధ్య తిరిగి శాంతి చర్చలు ప్రారంభమవుతాయని రష్యా ప్రభుత్వ మీడియా సంస్థ టాస్ తెలిపింది.

    ఇవీ ఇప్పటి వరకు ఉన్న అప్‌డేట్స్. తాజా సమాచారం కోసం బీబీసీ న్యూస్ లైవ్ పేజీని చూడండి. ధన్యవాదాలు.

  2. ఇప్పటివరకు 17 వేల మంది భారతీయులు యుక్రెయిన్ నుంచి వెనుదిరిగారు - భారత ప్రభుత్వం

    తూర్పు యుక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను తరలించేందుకు మార్గాలను అన్వేషిస్తున్నట్లు భారత ప్రభుత్వం తెలిపింది.

    "భారత బృందం అక్కడకు చేరుకునే మార్గాలను అన్వేషిస్తోంది. ఈ సమయంలో అదంత సులువు కాదు. రహదారులు అన్ని వేళలా తెరుచుకోవట్లేదు" అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి బుధవారం ఒక బ్రీఫింగ్‌లో తెలిపారు.

    జనవరి చివరి వారంలో జారీ చేసిన అడ్వైజరీ తరువాత ఇప్పటివరకు 17 వేల మంది భారతీయులు యుక్రెయిన్ సరిహద్దులను విడిచిపెట్టారని భారత ప్రభుత్వం అంచనా.

    "భారతీయులు యుక్రెయిన్ సరిహద్దు దాటడానికి వీలుగా లవీవ్‌లో తాత్కాలిక కార్యాలయాన్ని తెరవాలని కీయెవ్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని కోరాం. అదే పనిపై మా రాయబారి కార్యాలయ బృందం ఇప్పుడు లవీవ్‌లో ఉంది.

    భారత పాస్‌పోర్టు పోగొట్టుకున్న వారికి ఎమర్జెన్సీ సర్టిఫికెట్ ఇచ్చే వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇది చాలామంది భారతీయ విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుంది" అని బాగ్చి వెల్లడించారు.

    ఇదిలా ఉండగా, యుక్రెయిన్‌లో చిక్కుకుపోయిన విద్యార్థులను తీసుకుని మరో విమానం బుధవారం దిల్లీ చేరుకుంది.

  3. "ఇప్పటి వరకు 2,000 మందికి పైగా పౌరులను రష్యా చంపింది" - యుక్రెయిన్

    రష్యా దాడుల్లో ఇప్పటి వరకు 2,000 కన్నా ఎక్కువమంది పౌరులు మరణించారని యుక్రెయిన్ అధికారులు పేర్కొన్నారు.

    ఈ దాడులలో పది మంది రెస్క్యూ వర్కర్లు కూడా మరణించారని యుక్రెయిన్ ఎమర్జెన్సీ సర్వీస్ తెలిపింది.

    చాలా చోట్ల మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది సుమారు 400 చోట్ల మంటలను అదుపులోకి తెచ్చారు. 416 బాంబులను కూడా నిర్వీర్యం చేసినట్లు పేర్కొన్నారు.

    దాడులు మొదలైన ఏడు రోజుల్లో రష్యా సైన్యం పలు ప్రభుత్వ భవనాలు, వందలాది రవాణా కేంద్రాలు, నివాసాలు, ఆస్పత్రులను ధ్వంసం చేసిందని యుక్రెయిన్ అత్యవసర సేవల సిబ్బంది తెలిపారు.

  4. బ్రేకింగ్ న్యూస్, మరియుపూల్‌లో భారీ ప్రాణనష్టం జరిగి ఉండవచ్చని అంచనా

    రష్యా సరిహద్దుకు సమీపంలో ఉన్న యుక్రెయిన్ నగరం మరియుపూల్‌లో అనేక గంటలపాటు బాంబు దాడి జరిగింది.

    భారీ ప్రాణనష్టం జరిగి ఉండవచ్చని యుక్రెయిన్ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

    సుమారు 1,30,000 మంది నివసిస్తున్న ఈ రాష్ట్రం "దాదాపుగా ధ్వంసమైందని" డిప్యూటీ మేయర్ సెర్గీ ఓర్లోవ్ తెలిపారు.

    "బాధితులను లెక్కించే పరిస్థితి లేదు. కానీ, వందల కొద్దీ పౌరులు మరణించి ఉండవచ్చని అంచనా. మృతదేహాలను వెలికితీసేందుకు లోపలికి వెళ్లలేం" అని ఆయన బీబీసీతో చెప్పారు.

    "రష్యా దళాలు అన్ని రకాల ఆయుధాలనూ ఇక్కడ ప్రయోగిస్తున్నాయి. ఫిరంగులు, అనేక రాకెట్లను ఒకేసారి ప్రయోగించగల ఆయుధాలు, వ్యూహాత్మక రాకెట్లు. నగరాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారు" అని ఓర్లోవ్ అన్నారు.

    రష్యా దళాలు అన్ని వైపులా అనేక కిలోమీటర్ల దూరంలో ఉన్నాయని చెప్పారు.

    "యుక్రెయిన్ ఆర్మీ ధైర్యసాహసాలతో పోరాడుతోంది. నగరాన్ని రక్షించుకునేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తోంది. కానీ రష్యా దళాలు సముద్రపు దొంగల్లా (పైరేట్స్) దాడి చేస్తున్నాయి. వాళ్లు సైన్యంతో యుద్ధం చేయరు. మొత్తం రాష్ట్రాన్ని ధ్వంసం చేస్తారు" అని ఓర్లోవ్ అన్నారు.

  5. 'బాంబులకు బాబు' వ్యాక్యూమ్ బాంబు

    యుక్రెయిన్‌పై థర్మోబారిక్ ఆయుధాలను ఉపయోగించాలని రష్యా ప్రణాళిక రచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీటిని వాక్యూమ్ బాంబులని కూడా పిలుస్తారు.

    ఈ వ్యాక్యూమ్ బాంబులు, ఇదే సైజులోని సంప్రదాయ బాంబులకన్నా పెను విధ్వంసాన్ని సృష్టిస్తాయి. పేలుళ్ల పరిధిలో చిక్కుకున్నవారిపై భీకర ప్రభావం చూపుతాయి.

    అందుకే, రష్యా వీటిని ప్రయోగించాలని యోచిసున్నట్టు వస్తున్న వార్తలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి.

    ఇంతకీ వాక్యూమ్ బాంబు ఎలా పనిచేస్తుంది? కిందున్న లింక్‌పై క్లిక్ చేసి చదవండి.

  6. చెర్నిహివ్‌లో రష్యన్లను తిప్పికొట్టాం - యుక్రెయిన్ సైన్యం

    కీయెవ్, ఖార్కియెవ్, ఖేర్సన్ నగరాలపైనే మనం ఎక్కువ దృష్టి పెడుతున్నాం. కానీ, యుక్రెయిన్‌లోని ఇతర ప్రాంతాల్లో కూడా యుద్ధం కొనసాగుతోంది.

    ఉత్తరాన ఉన్న చెర్నిహివ్ నగరాన్ని ఆక్రమించుకునేందుకు రష్యా విఫలయత్నం చేసిందని, తరువాత రాకెట్ దాడి మొదలుపెట్టిందని యుక్రెయిన్ మిలటరీ తెలిపింది.

    కీయెవ్‌కు, బెలారస్ సరిహద్దుకు మధ్యలో ఉంది చెర్నిహివ్ నగరం.

    ఈ నగరంలోని ఆస్పత్రికి సమీపంలో ఉన్న అడ్మినిస్ట్రేటివ్ భవనాలను రాకెట్లు ఢీకొట్టాయని యుక్రెయిన్ సైన్యం తెలిపింది. పేలుళ్ల తాకిడికి ఆస్పత్రి భవనం దెబ్బతింది కానీ, ఆ సమయంలో రోగులు షెల్టర్‌లో ఉన్నారు. నీటి సరఫరా కూడా దెబ్బతింది.

  7. 'రష్యా మా చరిత్రను చెరిపేయాలనుకుంటోంది' - జెలియెన్‌స్కీ

    యుక్రెయిన్ రాజధాని కీయెవ్‌లో హోలోకాస్ట్ మెమోరియల్‌పై రష్యా క్షిపణి దాడిని ఖండిస్తూ ఆ దేశ ఆధ్యక్షుడు వొలొదిమీర్ జెలియెన్‌స్కీ ఈరోజు ఉదయం ప్రసంగించారు.

    ఇది "మానవత్వం లేకుండా చేసిన పని" అని ఆయన అన్నారు.

    రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో కీయెవ్‌లో 33,000 కంటే ఎక్కువ మంది యూదులను నాజీలు ఊచకోత కోశారు. వీరి జ్ఞాపకార్థం అక్కడ బాబిన్ యార్ మెమోరియల్ నిర్మించారు.

    "మా చరిత్ర గురించి, రాజధాని కీయెవ్ గురించి చాలామంది రష్యన్లకు అవగాహన లేదని ఈ దాడి నిరూపిస్తోంది."

    "కానీ, మా చరిత్రను తుడిచిపెట్టమని వారికి ఆదేశాలు అందాయి. మా దేశాన్ని, మమ్మల్ని కూడా" అని జెలియెన్‌స్కీ అన్నారు.

  8. బ్రేకింగ్ న్యూస్, ఖార్కియెవ్‌లోని సిటీ కౌన్సిల్ భవనాన్ని ఢీకొట్టిన రష్యా క్షిపణి

    యుక్రెయిన్‌లోని రెండవ అతిపెద్ద నగరం ఖార్కియెవ్‌లో రష్యా దాడులు కొనసాగుతున్నాయి.

    ప్రభుత్వ భవనాలను లక్ష్యంగా చేసుకుని రష్యా క్షిపణులను ప్రయోగిస్తోంది.

    తాజాగా సిటీ కౌన్సిల్ భవనంపై క్రూయిజ్ క్షిపణిని ప్రయోగించిందని ఖార్కియెవ్‌ డిప్యూటీ గవర్నర్ తెలిపారు.

    గత రెండు రోజులుగా ఖార్కియెవ్‌లో భీభత్సం సృష్టిసోంది రష్యా. నగర వీధుల్లో రష్యా, యుక్రెయిన్ దళాలు తలపడుతున్నాయన్న వార్తలు వస్తున్నాయి.

    రష్యా గత రాత్రి ఇక్కడ పారాట్రూపర్లను దించింది. అప్పటి నుంచి పోరు తీవ్రమైంది.

  9. శాంతి చర్చలు తిరిగి ప్రారంభమవుతాయని రష్యా మీడియా చెబుతోంది

    బుధవారం సాయంత్రం రష్యా, యుక్రెయిన్ మధ్య శాంతి చర్చలు తిరిగి ప్రారంభమవుతాయని రష్యా ప్రభుత్వ వార్తా సంస్థ టాస్ తెలిపింది.

    "మా ప్రతినిధి బృందం చర్చలు కొనసాగించడానికి సిద్ధంగా ఉంటుంది" అని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ చెప్పారు.

    రెండు రోజుల ముందు రష్యా, బెలారస్ సరిహద్దుల్లో మొదటి విడత శాంతి చర్చలు జరిగాయి. కానీ, ఎలాంటి నిర్ణయానికీ రాలేదు.

    రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సహాయకుడు వ్లాదిమిర్ మెడిన్‌స్కీ మరోసారి రష్యా తరపున ప్రధాన సంధానకర్తగా వ్యవహరిస్తారని నివేదికలు చెబుతున్నాయి.

    "పరిస్థితులు ఏమీ మారకపోవచ్చు. మేం మా వైఖరికి కట్టుబడి ఉంటాం" అని పుతిన్ సలహాదారు ఒలెక్సీ అరెస్టోవిచ్, సస్పిల్నే టీవీతో చెప్పారు.

    ఈ చర్చలు ఎక్కడ జరుగుతాయనే దానిపై ఇంకా సమాచారం లేదు.

  10. బ్రేకింగ్ న్యూస్, వాహనాలు దొరకకపోతే కాలినడకన వెళ్లండి - భారత ఎంబసీ

    ఖార్కియెవ్‌లోని భారతీయులకు యుక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం మరో అడ్వైజరీ జారీ చేసింది.

    "వాహనాలు, బస్సులు అందుబాటులో లేకపోతే కాలినడకనన అక్కడి నుంచి తరలివెళ్లమని" ఎంబసీ చెప్పింది.

    అక్కడి నుంచి PESOCHIN 11 కి.మీ దూరంలో ఉందని, BABAYE 12 కి.మీ, BEZLYUDOVKA 16 కి.మీ దూరంలో ఉన్నాయని రాయబార కార్యాలయం చెబుతోంది.

    అక్కడ ఉన్న భారతీయులందరూ సాయంత్రం 6.00 (యుక్రెయిన్ సమయం) లోపు ఖార్కియెవ్‌ను విడిచివెళ్లాలని అంతకుముందు జారీ చేసిన అడ్వైజరీలో తెలిపింది.

    యుక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయ పౌరులను ఆపరేషన్ గంగ కింద తరలించే ప్రయత్నాన్ని భారత ప్రభుత్వం ప్రారంభించింది. ఇంకా అక్కడ పెద్ద సంఖ్యలో భారతీయులు చిక్కుకున్నట్టు సమాచారం.

    భారత పౌరులను వెనక్కు తీసుకొచ్చే ఏ అవకాశాన్నీ వదిలిపెట్టమని భారత ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.

  11. యుక్రెయిన్‌లో అనారోగ్యంతో భారతీయ విద్యార్థి మృతి

    యుక్రెయిన్‌లో భారతీయ విద్యార్థి చందన్ జిందాల్ ఈరోజు ఆస్పత్రిలో మరణించారు.

    పంజాబ్‌లోని బర్నలాకు చెందిన చందన్ 2018లో మెడిసిన్ చదవడానికి యుక్రెయిన్ వెళ్లారు. అక్కడ వినిట్సియా నేషనల్ పైరోగోవ్ మెమోరియల్ మెడికల్ యూనివర్శిటీలో చేరారు.

    యుక్రెయిన్ నుంచి నిన్న భారత్‌కు తిరిగి వచ్చిన చందన్ పెదనాన్న బీబీసీతో మాట్లాడారు.

    చందన్‌కు మెదడులో రక్తం గడ్డ కట్టడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. యుక్రెయిన్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు.

    ఫిబ్రవరి 2న చందన్‌కు ఇస్కెమిక్ స్ట్రోక్ రావడంతో వినిట్సియాలోని ఆస్పత్రిలో చేరారు. చందన్ తండ్రి శేషన్ కుమార్, పెదనాన్న క్రిషన్ కుమార్ ఫిబ్రవరి 7న బయలుదేరి యుక్రెయిన్ వెళ్లారు.

    చందన్ మృతదేహాన్ని భారతదేశానికి తీసుకొచ్చేందుకు సహాయం చేయాలని మృతుడి కుటుంబ సభ్యులు భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

    చందన్ మృతిని భారత విదేశాంగ శాఖ ధృవీకరించింది.

  12. బ్రేకింగ్ న్యూస్, 'భారతీయులు తక్షణమే ఖార్కియెవ్‌ను విడిచిపెట్టాలి' - భారత ఎంబసీ

    ఖార్కియెవ్‌లో నివసిస్తున్న భారతీయ పౌరులందరికీ యుక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం ఒక అడ్వైజరీ జారీ చేసింది.

    "తమ భద్రత, రక్షణ కోసం భారతీయులు తక్షణమే ఖార్కియెవ్‌ను విడిచిపెట్టాలి. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా PESOCHIN, BABAYE, BEZLYUDOVKA లకు తరలివెళ్లాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈరోజు సాయంత్రం 6.00 (యుక్రెయిన్ సమయం) లోపు ఈ ప్రాంతాలకు చేరుకోవాలి" అని ఎంబసీ ట్వీట్ చేసింది.

  13. 'రష్యా అంటే పుతిన్ మాత్రమే కాదు'.. అలెక్సీ నావల్నీ

    జైల్లో ఉన్న రష్యా ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నావల్నీ, రష్యా లోపల, బయట కూడా రోజూ నిరసన ప్రదర్శనలు జరపాలని పిలుపునిస్తూ పలు ట్వీట్లు చేశారు.

    "రష్యా శాంతియుతమైన దేశంగా ఉండాలని మేం కోరుకుంటున్నాం. కానీ, ఇప్పుడు చాలా కొద్దిమందే మమ్మల్ని శాంతికాముకులుగా గుర్తిస్తారు."

    "రష్యన్లు భయపడి, మౌనం వహించిన ప్రజలు కాకూడదు. యుద్ధాన్ని గమనించలేదనే సాకులు చెప్పకూడదు."

    "ఈ 21వ శతాబ్దంలో కూడా ప్రజల చావులు, బాంబు దాడుల గురించి వార్తలు వింటున్నాం. అణు యుద్ధానికి దారి తీసే ముప్పు ఉందన్న వార్తలను టీవీల్లో చూస్తున్నాం" అంటూ నావల్నీ ట్వీట్ చేశారు.

    "రష్యా అంటే పుతిన్ మాత్రమే కాదని" నావల్నీ అన్నారు.

    గతంలో నావల్నీపై విషప్రయోగం జరిగిన సంగతి తెలిసిందే. దాని నుంచి కోలుకున్న తరువాత ఆయన ఒక ఏడాది పాటు జైలుశిక్ష అనుభవించారు. క్రెమ్లినే విషప్రయోగం జరిపిందని ఆయన అరోపించారు. గత నెల తాజా ఆరోపణలతో మళ్లీ ఆయనపై విచారణ జరిగింది.

  14. ఖెర్సాన్‌లో రష్యా దళాలు

    దక్షిణ యుక్రెయిన్‌లోని ఖెర్సాన్ నగరాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకున్నట్లు రష్యా పేర్కొంది. ఖెర్సాన్ ఓడరేవు పట్టణం.

    అయితే, ఈ నగరం ఇంకా యుక్రెయిన్ నియంత్రణలోనే ఉన్నట్లు స్థానిక అధికారులు చెబుతున్నారు.

    కాగా, నగరం మధ్యలో రష్యా మిలటరీ దళాలు తిరుగుతున్నట్లు ఒక యూట్యూబ్ వీడియోలో కనిపిస్తోంది. చేతికి తెల్లటి బ్యాండ్ కట్టుకున్న ఒక సైనికుడు, ఒక ట్యాంకులను ఈ వీడియోలో చూడవచ్చు.

    వీడియోలో కనిపిస్తున్న ప్రాంతం ఖెర్సాన్ అని బీబీసీ స్వతంత్రంగా ధృవీకరించింది.

  15. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పోలండ్, హంగేరీలకు ఏపీ ప్రతినిధులు

    యుక్రెయిన్ సరిహద్దుల నుంచి తెలుగు విద్యార్ధుల తరలింపుకు ఏర్పాట్లను ముమ్మరం చేసింది ఏపీ ప్రభుత్వం.

    ఆ మేరకు పోలండ్, హంగేరీలకు ఏపీ ప్రతినిధులను పంపాలని సీఎం జగన్ అదేశించారు.

    తెలుగు విద్యార్ధుల వివరాలను ఏపీ ప్రభుత్వం విదేశాంగ శాఖకు అందించింది.

  16. ఖార్కియెవ్‌లో రష్యా బాంబు దాడిలో నలుగురు మృతి చెందారు

    ఖార్కియెవ్‌లో ఈరోజు ఉదయం రష్యా బాంబు దాడిలో నలుగురు మృతి చెందినట్లు అత్యవసర సేవల సిబ్బంది తెలిపారు.

    స్థానిక కాలమానం 08:10 (06:10 జీఎంటీ) గంటల సమయంలో యుక్రెయిన్ సెక్యూరిటీ సర్వీస్, కరాజిన్ నేషనల్ యూనివర్శిటీకి చెందిన భవనాలపై క్షిపణి దాడి జరిగింది.

    ఈ భవనాలకు అంటుకున్న మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్న అగ్నిమాపక సిబ్బందిని ఫొటోల్లో చూడవచ్చు.

    రష్యా సైన్యం, ఖార్కియెవ్‌ను "పాక్షికంగా చుట్టుముట్టిందని", యుక్రెయిన్ సైన్యం, రష్యా బలగాలతో "వీరోచితంగా" పోరాడుతోందని నగర మేయర్ తెలిపారు.

  17. యుక్రెయిన్‌ను ఆక్రమించుకోవడం రష్యాకు "చాలా కష్టం" - బ్రిటన్ రక్షణ కార్యదర్శి బెన్ వాలెస్

    యుక్రెయిన్‌లోని ప్రధాన నగారాల్లోకి ప్రవేశించడం ద్వారా రష్యా "పెను సవాలు" ఎదుర్కోనుందని, యుక్రెయిన్ సాయుధ దళాలు, పౌరులు కూడా రష్యా సైన్యాన్ని తిప్పికొట్టడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తారని బ్రిటన్ రక్షణ కార్యదర్శి బెన్ వాలెస్ అన్నారు.

    ప్రధాన పట్టణ కేంద్రాలను చుట్టుముట్టడం, "విచక్షణారహితంగా" బాంబు దాడి చేయడం రష్యా సైనిక సిద్ధాంతంలో భాగమని, జనాభాను విచ్ఛిన్నం చేసి, మిగిలినదాన్ని ఆక్రమించుకోవడం వారి ప్రణాళిక అని ఆయన అన్నారు.

    కానీ, యుక్రెయిన్ భౌగోళిక పరిమాణం చాలా పెద్దది. జనాభా కూడా ఎక్కువే. ఇక్కడ దాదాపు నాలుగు కోట్ల నలభై లక్షల మంది నివసిస్తున్నారు. ఇంత పెద్ద దేశాన్ని ఆక్రమించుకోవడం రష్యాకు అంత సులువు కాదని బెన్ వాలెస్ అన్నారు.

    "ఇలాంటప్పుడే ప్రాణనష్టం పెరుగుతుంది" అని చెప్తూ చెచ్న్యాలో రష్యా అనుభవాలు, అఫ్గానిస్తాన్‌లో రష్యా, ఇరాక్‌లో పశ్చిమ దేశాల అనుభవాలను ఉటంకించారు.

    బీబీసీ బ్రేక్‌ఫాస్ట్ కార్యక్రమంలో మాట్లాడుతూ, "పెద్ద సైనిక బలగంతో ఒక దేశాన్ని ఆక్రమించుకోవడం ఒక రకం. కానీ, 4.4 కోట్ల జనాభా ఉన్న ప్రాంతాన్ని ఆక్రమించుకుని అందులో మీరు ఉండకూడదు అనడం మరో రకం. ఇది చాలా భిన్నమైనది" అని బెన్ వాలెస్ అన్నారు.

  18. వట్టి చేతులతో రష్యా ట్యాంకుకు ఎదురు నిలిచిన యుక్రెయిన్ పౌరుడు

    ఓ యుక్రెయిన్‌ వ్యక్తి వట్టి చేతులతో రష్యా యుద్ధ ట్యాంకును ఆపేందుకు ప్రయత్నించారు.

    ట్యాంకు ఎదురుగా మోకాళ్లపై కూర్చుని ఆయన నిరసన తెలిపారు.

  19. ఇప్పటివరకు 5,840 రష్యా సైనికులు మరణించారంటున్న యుక్రెయిన్

    యుక్రెయిన్‌పై రష్యా దాడి ప్రారంభమైనప్పటి నుంచి 5,840 రష్యా సైనికులు ప్రాణాలు కోల్పోయారని యుక్రెయిన్ చెబుతోంది.

    యుద్ధం మొదలైన దగ్గర నుంచి రష్యా చవిచూసిన నష్టాలన్నింటినీ ప్రాథమిక గణాంకాలు తెలుపుతున్నాయని యుక్రెయిన్ సైన్యం పేర్కొంది.

    బీబీసీ ఈ వాదనను స్వతంత్రంగా ధృవీకరించలేదు. కానీ, ఈ యుద్ధంలో రష్యా భారీగా నష్టపోయిందని బ్రిటన్ రక్షణ శాఖ విశ్వసిస్తోంది.

    యుక్రెయిన్ వాదన ప్రకారం ఇప్పటివరకు రష్యాకు జరిగిన నష్టం

    5,840 సైనికులు

    30 విమానాలు

    31 హెలికాప్టర్లు

    211 ట్యాంకులు

    862 సాయుధ పెట్రోలింగ్ వాహనాలు (ఏపీవీ)

    85 ఫిరంగి వ్యవస్థలు

    9 విమాన నిరోధక (యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్) వ్యవస్థలు

    60 ఇంధన ట్యాంకులు

    355 వాహనాలు

    40 ఎంఎల్ఆర్ఎస్ రాకెట్ లాంచర్లు (పట్టుబడ్దవి)

  20. యుక్రెయిన్‌లో రష్య దాడులు ఏడవ రోజు కూడా కొనసాగుతున్నాయి

    యుక్రెయిన్‌పై రష్యా దాడి మొదలై ఇవాళ్టికి ఏడవ రోజు.

    యుక్రెయిన్‌లోని పలు నగరాల్లో ఈరోజు ఉదయం నుంచీ వైమనిక దాడుల సైరన్లు వినిపిస్తూనే ఉన్నాయి.

    ఉత్తరం, దక్షిణం, తూర్పు దిక్కుల నుంచి రష్యా దాడి చేస్తోంది.

    రష్యన్ పారాట్రూపర్లు యుక్రెయిన్‌లో దిగి పోరాటం చేస్తున్నాయని యుక్రెయిన్ ప్రభుత్వం తెలిపింది.

    ప్రాంతీయ పోలీసు విభాగం భవనం, కరాజిన్ విశ్వవిద్యాలయంలోని కొంత భాగం రాకెట్ దాడికి దెబ్బతిన్నాయని రిపోర్టులు చెబుతున్నాయి.

    బాంబు దాడిలో కనీసం 21 మంది మరణించగా, 112 మంది గాయపడ్డారని ఖార్కియెవ్ నగర మేయర్ తెలిపారు. యుక్రెయిన్‌లో రెండవ అతిపెద్ద నగరమైన ఖార్కియెవ్ సరిహద్దుల నుంచి 30 మైళ్ల దూరంలో ఉంది. ఇక్కడ ఎక్కువగా మాట్లాడే భాష రష్యన్.