You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

రష్యా అణు హెచ్చరిక... నాటో భయం అంతా దాని గురించే

రష్యా తమ అణ్వస్త్ర నిరోధక విధానాన్ని ‘స్పెషల్ అలర్ట్’లో పెట్టామని ప్రకటించింది. అది పశ్చిమ దేశాల ఆంక్షలపై పుతిన్ కోపానికి, నాటో నుంచి ప్రమాదం పొంచి ఉందంటూ ఆయన రేపుతున్న భయాందోళనలకు సంకేతంగా భావించవచ్చు.

లైవ్ కవరేజీ

  1. యుక్రెయిన్‌పై రష్యా దాడిని ఖండించిన డోనల్డ్ ట్రంప్, జెలెన్‌స్కీ ధైర్యంగల నాయకుడని వ్యాఖ్యలు

    అమెరికా మాజీ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్.. యుక్రెయిన్‌పై రష్యా దాడిని ఖండించారు. యుక్రెయిన్ ప్రజల కోసం తాను ప్రార్థిస్తున్నట్లు ట్రంప్ చెప్పారు.

    అయితే, మొదట్లో యుక్రెయిన్‌కు బలగాలు పంపాలని నిర్ణయించినప్పుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ మేధావి అని ట్రంప్ వ్యాఖ్యానించారు.

    అమెరికా కూడా తమ దక్షిణ సరిహద్దులను కాపాడుకునేందుకు అలానే ‘‘శాంతి పరిరక్షణ’’ దళాలను పంపించాలని ట్రంప్ సూచించారు.

    అయితే, ఫ్లోరిడాలో ప్రజలను ఉద్దేశించి ట్రంప్ ప్రసంగిస్తున్న వీడియోను రాయిటర్స్ వార్తా సంస్థ ప్రచురించింది. దీనిలో రష్యా దాడిని ట్రంప్ ఖండించారు. యుక్రెయిన్ ప్రజలకు ఆయన సంఘీభావం కూడా ప్రకటించారు.

    మరోవైపు యుక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీపైనా ట్రంప్ ప్రశంసలు కురిపించారు. ఆయన ధైర్యంగల నాయకుడని కొనియాడారు.

    అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌పైనా ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. మోసపూరితంగా అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ గెలిచారని, తను అధికారంలో ఉండుంటే, ఈ సంక్షోభం వచ్చేదికాదని అన్నారు.

    ‘‘మన ఎన్నికల్లో మోసం జరగకపోయుంటే, మళ్లీ నేనే అధ్యక్షుడిగా ఉండేవాణ్ని. అప్పుడు ఇలాంటి పరిస్థితి ఎప్పటికీ వచ్చేది కాదు’’అని ట్రంప్ వ్యాఖ్యానించారు.

    పుతిన్‌పై ప్రశంసలు కురిపిస్తూ చేసిన వ్యాఖ్యలను కూడా ట్రంప్ సమర్థించుకున్నారు. పుతిన్ తెలివైనవారని ఎందుకు అన్నాననంటే.. నాటో, ప్రపంచ నాయకులను ఆయన ఓడించారు అని వ్యాఖ్యానించారు.

    ‘‘పుతిన్ చాలా తెలివైనవారు. నిజానికి మన నాయకులు తెలివి తక్కువవారు.. అదే అసలైన సమస్య’’అని ట్రంప్ వ్యాఖ్యానించారు.

    అయితే, పుతిన్ తెలివైనవారంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను బైడెన్ విమర్శించారు.

  2. కీయెవ్‌లో రష్యా వైమానిక దాడులు.., కిటికీలు మూసే ఉంచాలని పౌరులకు సూచన

    యుక్రెయిన్‌పై రష్యా చేపడుతున్న వైమానిక దాడుల్లో రాజధాని కీయెవ్ శివార్లలోని వసిల్‌కోవ్ చమురు డిపో ధ్వంసమైంది.

    డిపోను అగ్ని కీలలు చుట్టుముట్టాయని, దాని నుంచి దట్టమైన పొగలు బయటకు వస్తున్నాని, ప్రజలు ఎవరూ బయటకు రావొద్దని యుక్రెయిన్ ప్రభుత్వం సూచించింది. ఇళ్ల కిటికీలు కూడా తెరవొద్దని ఆదేశించింది.

    చమురు డిపో నుంచి మంటలు వస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. దట్టమైన పొగలు వాటిలో కనిపిస్తున్నాయి.

    ఇప్పటివరకు ఈ దాడుల్లో 240 మంది మరణించారని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషనర్ (యూఎన్‌వోసీహెచ్‌ఆర్) తెలిపారు. మృతుల్లో 64 మంది పౌరులు కూడా ఉన్నట్లు వెల్లడించారు.

  3. ఇప్పటివరకు 240 మంది మరణించారు - ఐరాస, నీరు, విద్యుత్ లేకుండానే వేల మంది

    యుక్రెయిన్‌పై రష్యా దాడి మొదలై నేటితో నాలుగో రోజు. యుక్రెయిన్‌లోని చాలా నగరాల్లో భీకర పోరాటం జరుగుతోంది.

    ఇప్పటివరకు 240 మందికిపైగా ఈ దాడుల్లో మరణించారని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. మృతుల్లో 64 మంది పౌరులు కూడా ఉన్నట్లు తెలిపింది.

    దాడుల వల్ల మౌలిక సదుపాయాలు, ప్రజల ఇళ్లు చాలా ప్రాభావితం అవుతున్నాయని ఐరాస తెలిపింది. వేల మంది విద్యుత్, నీరు లేకుండా జీవించాల్సి వస్తోందని వివరించింది.

    మరోవైపు తమ ఇళ్లను విడిచి పారిపోతున్న పౌరుల సంఖ్య 1,60,000కుపైనే ఉందని ఐరాస వెల్లడించింది. వీరిలో యుక్రెయిన్‌లో ప్రధాన నగరాల నుంచి వేరే ప్రాంతాలకు వెళ్తున్న వారితోపాటు యుక్రెయిన్ విడిచి పారిపోతున్న వారు కూడా ఉన్నారు.

    రష్యా దాడితో శరణార్థుల సంక్షోభం చుట్టుముట్టే అవకాశముందని యుక్రేనియన్ ప్రభుత్వం అంచనా వేసింది. దాదాపు 50 లక్షల మంది నిరాశ్రయులయ్యే ముప్పుందని పేర్కొంది.

    దేశాన్ని విడిచి వెళ్లేందుకు సరిహద్దుల్లో 15 కి.మీ.లకుపైనే పొడవైన వరుసల్లో శరణార్థులు నిలబడుతున్నారు.

  4. యుక్రెయిన్: దేశం వదిలి వెళ్తున్న మహిళలు, పిల్లలు.. పోరాడుతున్న పురుషులు

  5. యుక్రెయిన్‌కు సాయం చేసేందుకు ముందుకు వచ్చిన ఎలాన్ మస్క్, స్టార్‌లింక్ ద్వారా ఇంటర్నెట్ అందిస్తామని వెల్లడి

    స్పేస్-ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్.. యుక్రెయిన్‌కు సాయం అందిస్తామని ప్రకటించారు.

    రష్యా వైమానిక దాడులతో యుక్రెయిన్‌లో చాలాచోట్ల ఇంటర్నెట్ సేవలు స్తంభించిపోయాయి. దీంతో స్టార్‌లింక్ శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ ద్వారా ఇంటర్నెట్ అందిస్తామని ఎలాన్ మస్క్ ప్రకటించారు.

    దేశంలో ఇంటర్నెట్ సేవలు అందించాలని యుక్రెయిన్ డిప్యూటీ ప్రధాని ట్విటర్‌లో ట్యాగ్ చేయడంతో ఎలాన్ మస్క్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

    ‘‘ఎలాన్ మస్క్.. మీరు అంగారకుడిపైకి మనుషులను పంపుతున్నాయి. అంతరిక్షంలోకి కూడా విజయవంతంగా రాకెట్‌ను పంపించారు. ఇక్కడ మాపై రష్యా రాకెట్లు దాడి చేస్తున్నాయి. మీరు స్టార్‌లింక్ ద్వారా మాకు ఇంటర్నెట్ సేవలు అందించగలరు’’అని యుక్రెయిన్ డిప్యూటీ ప్రధాని ట్వీట్ చేశారు.

    దీంతో స్టార్‌లింక్ టెర్మినళ్లు యుక్రెయిన్‌కు పంపుతున్నట్లు ఎలాన్ మస్క్ వెల్లడించారు.

    ఏమిటీ స్టార్‌లింక్?

    ఎలాన్‌ మస్క్ స్పేస్-ఎక్స్ సంస్థలో స్టార్‌లింక్ కూడా భాగం. ఉపగ్రహాల ద్వారా ఇది బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సేవలు అందిస్తోంది.

    అంటే ఎలాంటి ఫైబర్ ఆప్టిక్స్, కేబుల్, టవర్ లేకుండానే దీని సాయంలో ఇంటర్నెట్ సేవలు కల్పించొచ్చు.

  6. యుక్రెయిన్‌కు భారీగా తరలివస్తున్న ఆయుధాలు

    యుక్రెయిన్‌లోని పలు నగరాలపై శనివారం రాత్రి వైమానిక దాడులు జరిగాయి. యుక్రెయిన్‌కు మద్దుతుగా భారీగా ఆయుధాలను పంపుతున్నట్లు పశ్చిమ దేశాలు ప్రకటించాయి.

    జావెలిన్ యాంటీ-ట్యాంక్ క్షిపణులు, యాంటీ-ఎయిర్‌క్రాఫ్ట్ వ్యవస్థలు, శరీరాన్ని కప్పివుంచే రక్షణ వ్యవస్థలు తదితర 350 మిలియన్ డాలర్లు (రూ 2,627.64 కోట్లు) రక్షణ సామగ్రి పంపబోతున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది.

    1,000 యాంటీ-ట్యాంక్ గ్రెనేడ్ లాంచర్లు, 500 స్ట్రింగర్ క్షిపణులను వెంటనే పంపుతున్నట్లు జర్మనీ వెల్లడించింది.

    400 రాకెట్లు, 50 పంజెర్‌ఫాస్ట్-3 యాంటీ-ట్యాంక్ ఆయుధాలను పంపిస్తున్న నెదర్లాండ్స్ తెలిపింది.

    స్లొవేకియాలోని నాటో దళాలకు గగన తల రక్షణ వ్యవస్థను తరలించే అంశాన్ని పరిశీలిస్తున్న జర్మనీ, నెదర్లాండ్స్ తెలిపాయి.

    ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే ఎదుర్కొనేందుకు తూర్పు యూరప్‌కు మరిన్ని బలగాలను పంపుతున్నట్లు నాటో కూడా వెల్లడించింది.

  7. యుక్రెయిన్‌లో ఇప్పుడు ఏం జరుగుతోంది?, ఆయుధాలను పంపించిన జర్మనీ

    యుక్రెయిన్‌లో రాత్రి కర్ఫ్యూ అమలవుతోంది. అక్కడ జరుగుతున్న పరిణామాలు మీ కోసం..

    కీవ్ నగరం మొత్తం కర్ఫ్యూ విధించారు. రష్యా వైమానిక దాడులు జరుగుతున్న నేపథ్యంలో సోమవారం వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి.

    యుక్రెయిన్‌లో రెండో అతిపెద్ద నగరం ఖార్కియెవ్‌లో రష్యన్ దళాలతో తమ బలగాలు పోరాడుతున్నాయని స్థానిక అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఒఖ్తిర్కా నగరంలో భారీగా వైమానిక దాడులు జరుగుతున్నాయి.

    యుక్రెయిన్‌లో దాడి చేస్తున్న రష్యా బలగాలకు మద్దతుగా తమ సైనికుల్ని పంపినట్లు రష్యా చెచ్‌న్యా ప్రాంత నాయకుడు తెలిపారు.

    రష్యాపై ఐరోపా యూనియన్ విధిస్తున్న ఆంక్షలకు తాము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు హంగరీ ప్రధాని విక్టర్ ఒర్బన్ తెలిపారు.

    తాము దేశీయంగా తయారుచేసిన విధ్వంసకర ఆయుధాలను సరిహద్దుల గుండా యుక్రెయిన్‌కు జర్మనీ పంపిస్తోంది.

    రష్యా దాడి మొదలైనప్పటి నుంచీ ఇప్పటివరకు 1,20,000 మందికిపైగా ప్రజలు యుక్రెయిన్‌ను వీడి పారిపోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

  8. కీయెవ్‌లో వైమానిక దాడుల హెచ్చరికలు

    యుక్రెయిన్ రాజధాని నగరం కీయెవ్‌లో వైమానిక దాడుల హెచ్చరికలు వినిపిస్తున్నాయి. రష్యా దాడులపై ప్రజలను హెచ్చరించేందుకు ఈ హెచ్చరికలను చేస్తున్నారు.

    వీధుల్లో ఎవరైనా కనిపిస్తే, వారిని రష్యా ప్రతినిధులుగానే పరిగణిస్తామని కీయెవ్ నగర మేయర్ హెచ్చరించారు.

  9. బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం

    బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    యుక్రెయిన్‌పై రష్యా పూర్తిస్థాయి దాడి నాలుగో రోజు కొనసాగుతోంది. ఈ ఘర్షణలకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు ఈ లైవ్ పేజీలో అందిస్తాము.

    నిన్నటి లైవ్ పేజీ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.