యుద్ధం ముగియాలంటే రష్యా మాతో మాట్లాడాల్సి ఉంటుంది: యుక్రెయిన్ అధ్యక్షుడు
యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ దేశ ప్రజలనుద్దేశించి మరోసారి వీడియోలో మాట్లాడారు. దాడి ఆపాలని, కాల్పుల విరమణ పాటించాలని రష్యాకు యుక్రెయిన్ భాషలోనూ, రష్యన్ భాషలోనూ ఆయన విజ్ఞప్తులు చేశారు.
‘‘శత్రుత్వాలకు ముగింపు పలకటానికి, సైనిక దాడిని ఆపటానికి రష్యా ఇప్పుడైనా, తర్వాతైనా మాతో మాట్లాడాల్సి ఉంటుంది. ఈ మాటలు ఎంత త్వరగా మొదలైతే, రష్యా నష్టాలు అంత తగ్గుతాయి’’ అని ఆయన పేర్కొన్నారు.
ఈ దాడులు ఆగేవరకూ తాము తమ దేశాన్ని రక్షించుకుంటూనే ఉంటామన్నారు. రాజధానిని విడిచి వెళ్లే ఉద్దేశం తనకు లేదని చెప్పారు. ఇప్పుడు రష్యాకు ప్రప్రధమ శత్రువును తానేనని తనకు తెలుసునని వ్యాఖ్యానించారు.
రాజధాని నగరంపై దాడి తీవ్రమవుతుందని జెలెన్స్కీ గత రాత్రే హెచ్చరించారు. స్థానిక కాలమానం ప్రకారం.. శుక్రవారం ఉదయం 4 గంటల నుంచి అనేకసార్లు క్షిపణి దాడులు జరిగాయని ఆయన ధృవీకరించారు.
సైనిక, పౌర ప్రాంతాల రెండిటి మీదా రష్యా దాడులు జరిగాయన్నారు. పౌరులు లక్ష్యంగా తాము దాడులు చేయటం లేదని రష్యా ఇంతకుముందు చెప్పింది.
అయితే.. శుక్రవారం ఉదయం కీవ్ నగరంలో పలు ప్రాంతాల్లో పేలుళ్లు జరిగాయి. వాటిలో నివాస భవనం కూడా ఉన్నట్లు కనిపిస్తోంది.