You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

జార్జియా, పెన్సిల్వేనియాల్లో జో బైడెన్ ముందంజ... జార్జియాలో రీకౌంటింగ్

పెన్సిల్వేనియాలో తన ఆధిక్యం తగ్గిపోతుండటంతో కౌంటింగ్ నిలిపివేయాలంటూ ట్రంప్ బృందం కోర్టునాశ్రయించింది. అయితే దీనికి ఫెడరల్ జడ్జి నిరాకరించారు. మరోవైపు, ప్రతి ఓటు లెక్కించాల్సిందేనని బైడెన్ కోరారు.

లైవ్ కవరేజీ

  1. న్యూహాంప్‌షైర్ చట్టసభకు టీనేజర్ ఎన్నిక

    ఈశాన్య అమెరికాలోని న్యూహాంప్‌షైర్ రాష్ట్ర చట్టసభకు ఒక టీనేజర్ ఎన్నికయ్యారు.

    అమెరికాలో పిన్న వయసులో ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వారిలో ఆయన ఒకరని స్థానిక మీడియా తెలిపింది. ఆయన పేరు టోనీ లాబ్రాంచే. వయసు 18 ఏళ్లు.

    ఆమ్‌హెర్ట్స్ ప్రతినిధిగా డెమొక్రటిక్ పార్టీ తరపున టోనీ ఎన్నికయ్యారు. న్యూహాంప్‌షైర్ రాష్ట్ర చరిత్రలో 'స్టేట్ రెప్రజెంటేవివ్‌'గా ఎన్నికైన తొలి స్వలింగ సంపర్కుడిని తానేనని ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో రాశారు.

    తాను పదేళ్ల వయసులో క్యాన్సర్ బారిన పడ్డానని, దేశంలో వైద్యం బాగా ఖరీదైనదైపోవడం తనను ఆలోచింపజేసిందని, అందుకే రాజకీయాల్లోకి వచ్చానని ఉద టెలిగ్రాఫ్’పత్రికతో టోనీ చెప్పారు.

    తాను ఇంతకుముందు క్యాన్సర్‌ను జయించానని, ఇప్పుడు ఎన్నికల్లో విజయం సాధించానని ఆయన సంతోషం వ్యక్తంచేశారు.

  2. ఆరిజోనాలో తగ్గిన బైడెన్ ఆధిక్యం

    ఆరిజోనాలో అధ్యక్షుడు ట్రంప్ మీద బైడెన్ ఆధిక్యం గురువారం కన్నా తగ్గింది.

    ఈ బాటిల్ గ్రౌండ్ స్టేట్‌లో ఇంతకు ముందు 47,000 ఓట్లుగా ఉన్న బైడెన్ ఆధిక్యం ఇప్పుడు 43,570 ఓట్లకు తగ్గింది.

    రాష్ట్రంలో అతిపెద్ద కంట్రీ అయిన మరికోపా కంట్రీలో ఇంకా ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.

    ఇక్కడ 75 శాతం మంది తమ ఓటు హక్కు వినియోగించుకోవడంతో, 20 లక్షల ఓట్లు పోలయినట్లు తెలిసింది.

    మరికోపాలో ఇంకా లక్షా 42 వేల ఓట్లు లెక్కించాల్సి ఉంది.

    కొన్ని న్యూస్ చానళ్లు ఆరిజోనాలో బైడెన్ గెలిచారని ఇప్పటికే చెబుతున్నాయి.

    కానీ బీబీసీ అలా చెప్పడం తొందరపాటే అవుతుందని భావిస్తోంది.

  3. మోసాలు జరిగినట్లు ఆధారాలు లేవు: పెన్సిల్వేనియా రిపబ్లికన్ సెనేటర్

    అధ్యక్షుడు ట్రంప్‌ను విమర్శిస్తున్న సొంత పార్టీవారిలో పెన్సిల్వేనియా రిపబ్లికన్ సెనేటర్ పాట్ టూమీ కూడా ఒకరయ్యారు. గురువారం నాడు వైట్‌హౌస్‌లో అధ్యక్షుడు చెప్పిన వివరాలపై ఆయన వివాదం లేవనెత్తారు.

    "నిన్న రాత్రి అధ్యక్షుడు అలా మాట్లాడ్డం చూశాను, చాలా కష్టంగా అనిపించింది" అని ఆయన బీబీసీకి చెప్పారు.

    "ఎన్నికల్లో మోసాలు, దొంగ ఓట్లు భారీగా జరిగాయని అధ్యక్షుడి ఆరోపణలు ఏమాత్రం రుజువు కాలేదు. ఇక్కడ ఏదైనా తప్పు జరిగినట్లు నాకు ఎలాంటి సమాచారం లేదు" అన్నారు.

    "ప్రతి ఎన్నికల్లోనూ అవకతవకలు జరుగుతుంటాయి. అవి సాధారణంగా చాలా చిన్నవిగా, కొన్ని చోట్లే జరుగుతుంటాయి" అని ఆయన వ్యాఖ్యానించారు.

    టూమే 2022లో తిరిగి ఎన్నిక కావాల్సి ఉంది. పెన్సిల్వేనియాలో ఓట్లు మొత్తం లెక్కించడానికి ఎంత సమయం పడుతుందో కూడా తనకు తెలీదని ఆయన చెప్పారు.

    ‘‘దానికి ఎంత టైం పడుతుందో, అంత పడుతుంది. మిగతా ఓట్లు డెమాక్రాట్లకు పోవచ్చు. కానీ ఈ సమయంలో మాకు ఏం తెలీదు. అందుకే అది తెలుసుకోడానికి మేం ఒక పద్ధతిని పాటిస్తాం’’ అన్నారు.

  4. జార్జియాలో రీకౌంటింగ్

    రాష్ట్రంలో అద్యక్ష ఎన్నికల ఓట్లను రీకౌంటింగ్ నిర్వహిస్తామని జార్జియా సెక్రటరీ ఆఫ్ స్టేట్ బ్రాడ్ రాఫెన్స్ బెర్గర్ ప్రకటించారు.

    ఇక్కడ ఇంకా 4,169 ఓట్లు ఇంకా లెక్కించాల్సి ఉంది. సైనికులు పోస్టులో పంపిన 8,000లకు పైగా ఓట్లు ఇంకా చేరలేదు. ఈరోజు ముగిసేలోపు అవి వస్తేనే వాటిని లెక్కిస్తామని ఆయన చెప్పారు.

    "ప్రస్తుతానికి జార్జియా గురించి అప్పుడే ఏం చెప్పలేం. మార్జిన్ చాలా తక్కువగా ఉంది. జార్జియాలో రీకౌంటింగ్ ఉంటుంది" అన్నారు.

    "మా రాష్ట్ర ఎన్నికల గురించి ఆసక్తి సరిహద్దులను దాటి పోయింది. ఈ సమయంలో జార్జియాలో తుది లెక్కలు మొత్తం దేశం మీద భారీ ప్రభావం చూపుతుంది" అని చెప్పారు.

    ప్రధాన ప్రత్యర్థుల మధ్య ఓట్ల తేడా ‘‘ఒక పెద్ద హైస్కూల్ కంటే తక్కువగా ఉండొచ్చు’’ అని రాఫెన్స్ బెర్గర్ సహాయకుడు గేబ్రియల్ స్టెర్లింగ్ చెప్పారు.

    రాష్ట్రంలో ఎన్నికలను స్టెర్లింగ్ పర్యవేక్షించారు. పోటీ చాలా హోరాహోరీగా ఉండడం కూడా రీకౌంటింగ్‌కు కారణమన్నారు.

    జార్జియాలో అవకతవకలు, మోసాలు విస్తృతంగా జరిగినట్లు తాము చూడలేదని ఆయన చెప్పారు.

  5. ఈ ఎన్నికలు అప్పుడే ముగిసిపోలేదు: ట్రంప్ లాయర్లు

    స్వింగ్ స్టేట్ పెన్సిల్వేనియాలో బైడెన్ ముందంజలో ఉన్నారని, ఆయన అది గెలిస్తే అధ్యక్షుడు అవుతారని వస్తున్న వార్తలపై ట్రంప్ లాయర్లు ఒక ప్రకటన విడుదల చేశారు.

    "ఈ ఎన్నిక అప్పుడే ముగిసిపోలేద"ని ట్రంప్ తరఫు లాయర్ మాట్ మోర్గాన్ అన్నారు.

    "నాలుగు రాష్ట్రాల్లో వచ్చిన ఫలితాలఆధారంగా జో బైడెనే విజేత అని తప్పుగా చెబుతున్నారు. అవి ముగియడానికి ఇంకా చాలా దూరంలో ఉన్నాయి" అన్నారు

    జార్జియాలో ఓట్లు సరిగా లెక్కించలేదని, పెన్సిల్వేనియా ఎన్నికల పరిశీలకులకు జడ్జి మరింత యాక్సెస్ ఇవ్వాలని ఆదేశించినా, వారిని కౌంటింగ్ దగ్గరకు సరిగా అనుమతించలేదని ఆయన నిరాధార ఆరోపణలు చేశారు.

    ఆరిజోనాలో బైడెన్ గెలుస్తారని చాలా న్యూస్ చానళ్లు చెప్పడాన్ని మోర్గాన్ తప్పుబట్టారు. నెవాడాలో వేలాది ఓట్లు సరిగా వేయలేదని కూడా చెప్పారు.

    "అధ్యక్షుడుగా నేనే గెలుస్తానని చెప్పుకుంటున్న బైడెన్, ఈ రాష్ట్రాల మీదే ఆధారపడుతున్నారు. కానీ, చివరికి కౌంటింగ్ అంతా ముగిశాక ట్రంప్ మళ్లీ ఎన్నికవుతారు" అన్నారు.

    ఓటింగ్‌లో మోసాలు జరిగాయని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లభించలేదు. ట్రంప్ న్యాయవాదులు తమ వాదనలకు ఎలాంటి ఆధారాలు సమర్పించలేదు.

  6. ఇక ఫలితం తేలిపోయే సమయం వచ్చింది..., ఆంథోని జుర్చర్, బీబీసీ నార్త్ అమెరికా ప్రతినిధి

    ఇక ఎంతో సమయం పట్టదు. శుక్రవారం నాడు జార్జియాలో డోనాల్డ్ ట్రంప్ మీద జో బైడెన్ ముందంజ వేశారు. తాజాగా పెన్సిల్వేనియాలో సైతం తుది ఓట్ల లెక్కలు విడుదలవటంతో బైడెన్ ఆధిక్యంలోకి వచ్చారు.

    ఇంకా మిగిలిన రాష్ట్రాల ఫలితాలు రావాల్సి ఉన్నా.. జార్జియాలో బైడెన్ గెలిస్తే ఆ రాష్ట్రానికి చెందిన 16 ఎలక్టరల్ ఓట్లతో ఎలొక్టరల్ కాలేజీ టై అవుతుంది. పెన్సిల్వేనియాలో గనుక ఆయన గెలిచినట్లయితే.. ఫలితం ఏకపక్షమవుతుంది. అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌథం బైడెన్ సొంతమవుతుంది.

    రెండు రాష్ట్రాల్లో ఫలితాల సరళి స్పష్టంగా ఉంది. కొత్తగా లెక్కించే ఓట్లలో బైడెన్ ఎక్కువ ఓట్లు సంపాదిస్తున్నారు. రెండు రాష్ట్రాల్లోనూ ఆయన ఆధిక్యం పెరగబోతోంది. జార్జియాలో లెక్కించాల్సి ఉన్న బ్యాలట్లు తక్కువే ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఓట్ల తేడా చాలా తక్కువగా ఉండొచ్చు. అంటే.. రీకౌంటింగ్ కోరటానికి వీలుండే స్థాయిలోనే ఉండొచ్చు.

    ఇక పెన్సిల్వేనియాలో ఓట్ల లెక్కలు పూర్తయ్యేసరికి బైడెన్ ఆధిక్యం ఇంకా పెరగవచ్చు. నిజానికి 2016లో ట్రంప్ సాధించిన ఆధిక్యం కన్నా ఇప్పుడు బైడెన్ ఎక్కువ ఆధిక్యం సాధించే పరిస్థితి కనిపిస్తోంది.

    ఎన్నికల ఫలితాల ప్రక్రియ గత కొద్ది రోజులుగా నాటకీయంగా మారటానికి.. ఈ రాష్ట్రాల్లో నేరుగా వేసిన ఓట్లను లెక్కించిన తర్వాత.. పోస్టల్ ఓట్లను లెక్కించటమే కారణం. పైగా నేరుగా వేసిన ఓట్లలో ఎక్కువ భాగం ట్రంప్ వైపు మొగ్గుచూపితే.. పోస్టల్ ఓట్లలో అత్యధిక భాగం బైడెన్‌కు వచ్చాయి.

    ఈ ప్రక్రియను రివర్స్‌లో చేసి ఉన్నట్లయితే.. అంటే ముందు పోస్టల్ బ్యాలట్లను లెక్కించి, ఆ తర్వాత నేరుగా వేసిన బ్యాలట్లను లెక్కించినట్లయితే ఫలితాలు మొదటి నుంచీ మరింత స్పష్టంగా కనిపించేవి.

    ఈ గొడవంతా సద్దుమణిగాక.. అవే ఫలితాలు ఉంటాయి. డెలవేర్‌లో బైడెన్ నవ్వుతూ ఉంటారేమో.

  7. పెన్సిల్వేనియాలో బైడెన్ ముందంజ

    పెన్సిల్వేనియా ఎన్నికల అధికారుల నుంచి తాజా ఫలితాలు వచ్చాయి.

    ఓట్ల లెక్కింపులో డోనాల్డ్ ట్రంప్ మీద డెమోక్రాట్ అభ్యర్థి జో బైడెన్ స్వల్ప ఆధిక్యం సాధించారు.

    బైడెన్ ప్రస్తుతం 5,587 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

    రాష్ట్రంలో 95 శాతం మేర ఓట్ల లెక్కింపు పూర్తయింది.

    ఈ రాష్ట్రంలో గెలిస్తే అధ్యక్షుడిగా ఎన్నికవటానికి అవసరమైన 270 ఎలొక్టరల్ కాలేజీ ఓట్లు బైడెన్ ఖాతాలో పడినట్లే.

  8. మనం ఫలితాలకు ఎంత దగ్గరగా ఉన్నాం

    ఎన్నికల కౌంటింగ్ మొదలై మూడు రోజులు అవుతోంది. తర్వాత అధ్యక్షుడు ఎవరు అవుతారో మనకు ఇప్పటికీ తెలీడం లేదు.

    కానీ మనకు కచ్చితంగా అది తెలిసే సమయం దగ్గరపడింది.

    ప్రస్తుతం డెమాక్రాట్ జో బైడెన్ 253 ఎలక్టోరల్ ఓట్లతో, డోనల్డ్ ట్రంప్ 214 ఓట్లతో ఉన్నారు. ఇద్దరూ 270 మ్యాజిక్ ఫిగర్ అందుకోడానికి పోటీపడుతున్నారు.

    99 శాతం కౌంటింగ్ పూర్తైన జార్జియాలో స్వల్ప ఆధిక్యంలో ఉన్న బైడెన్ గెలిస్తే, దానితోపాటూ నెవడా, ఆరిజోనా, విస్కాన్సిన్‌లోని దేన్నైనా గెలుచుకోగలిగితే ఆయన వైట్‌హౌస్ పీఠం ఎక్కుతారు.

    పెన్సిల్వేనియాలో ఉన్న 20 కూడా చేజిక్కించుకుంటే ఆయనకు అవసరమైనదానికంటే ఎక్కువ మెజారిటీనే లభిస్తుంది.

  9. జార్జియాలో ఆధిక్యంలో బైడెన్

    ఇంకా ఓట్ల లెక్కింపు జరుగుతున్న కీలక రాష్ట్రాల్లో ఒకటైన జార్జియాలో డెమాక్రాట్ అభ్యర్థి జో బైడెన్‌ మొదటిసారి ఆధిక్యంలో ఉన్నట్టు సీఎన్ఎన్ చెప్పింది.

    జార్జియాలో 99 శాతం ఓట్లు లెక్కించారని చెప్పిన డెసిషన్ డెస్క్ బైడెన్ స్వల్ప ఆధిక్యంలో ఉన్నట్టు చెప్పింది.

    జార్జియాలో బైడెన్ ట్రంప్ కంటే 900 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నట్టు క్లేటన్ కంట్రీ నుంచి వచ్చిన స్థానిక రిపోర్టుల కూడా చెబుతున్నాయి.

    బీబీసీ రిజల్ట్స్ సిస్టమ్, అమెరికా పార్టనర్ సీబీఎస్ కూడా జో బైడెన్ జార్జియాలో 917 ఓట్ల ఆధిక్యంలో ఉన్నట్లు చూపిస్తున్నాయి.

  10. ఇప్పటికీ గెలిచే అవకాశం ఇద్దరికీ ఉందా. ఎలా?

    బైడెన్ విజయం దిశగా వెళ్తున్నట్టు కనిపిస్తున్నా, డోనల్డ్ ట్రంప్ ఇప్పటికీ ఎన్నికల్లో విజయం సాధించే అవకాశం ఉంది.

    అమెరికా అధ్యక్ష ఎన్నికలను ఎలక్టోరల్ కాలేజీ నిర్ణయిస్తుంది. ప్రతి రాష్ట్రంలోని ఓటర్లు ఎలక్టర్లను ఎన్నుకుంటారు. తర్వాత కొన్ని వారాలకు వారు కలిసి విజేతను నిర్ణయించడానికి ఓటు వేస్తారు.

    ప్రతి ఎలక్టర్‌కు ఒక ఎలక్టోరల్ ఓటు ఉంటుంది. రాష్ట్రానికి ఉన్న ఎలక్టోరల్ ఓట్లు ఆ రాష్ట్ర జనాభాను బట్టి ఉంటాయి. అంటే ఎక్కువగా టెక్సస్‌కు 38 ఉంటే కాలిఫోర్నియాకు 55 ఉంటే తక్కువగా డెలవేర్‌కు 3, ఇడాహోకు 4 ఇలా ఉంటాయి. అధ్యక్ష పీఠం చేజిక్కించుకోవాలంటే అభ్యర్థికి ఈ మొత్తం 538 ఓట్లలో సగం కంటే ఒక ఓటు ఎక్కువ కావాలి.

    ఇప్పటికే 253 ఎలక్టోరల్ ఓట్లు సాధించిన బైడెన్‌కు వైట్ హౌస్ పీఠాన్ని అదుకోడానికి ఇక 17 ఓట్లు వస్తే చాలు. పెన్సిల్వేనియాలో(20) మొత్తం ఓట్లు ఆయనకే వస్తే తర్వాత అధ్యక్షుడు ఆయనే అవుతారు. (అదే జరిగితే చట్టపరంగా సవాలు చేసేందుకు ట్రంప్ లాయర్లు సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు.)

    కానీ నెవాడా(6)లో కూడా ఆధిక్యంలో ఉన్న బైడెన్, ఆరిజోనా(11)లో ముందంజలో ఉన్నారు. వీటితో ఆయనకు సరిగ్గా 270 స్థానాలు వస్తాయి. అలాంటప్పుడు రిపబ్లికన్లతో హోరాహోరీ పోరు ఉన్న జార్జియా(16)లో ఆయనకు గెలవాల్సిన అవసరం కూడా రాదు.

    డోనాల్డ్ ట్రంప్ కూడా తృటిలో విజయం సాధించవచ్చు. తిరిగి అధ్యక్షుడు కావడానికి ఆయన పెన్సిల్వేనియాపైనే ఆశలు పెట్టుకోవాల్సి ఉంటుంది. కానీ, ఇక్కడ పోస్టల్ బాలెట్లు, హాజరవని ఓట్లు లెక్కిస్తుండడంతో ఆయన ఆధిక్యం తగ్గుతూ వస్తోంది. దీనితోపాటూ ఆరిజోనా(11), నెవాడా(6), జార్జియా(16), నార్త్ కెరోలినా(15) రాష్ట్రాల్లో ఇంకా కౌంటింగ్ పూర్తి కాలేదు. పెద్దగా కలత చెందాల్సిన అవసరం లేకుండా ఇవి ట్రంప్‌కు మద్దతిస్తున్నాయి.

    అంటే బైడెన్‌ అధ్యక్షుడు కావడానికి పెన్సిల్వేనియా గెలుచుకోవడం లేదంటే మిగతా నాలుగు రాష్ట్రాల్లో ఏ రెండింటినో సొంతం చేసుకుంటే చాలు.

  11. అమెరికాలో రికార్డు సంఖ్యలో రోజువారీ కరోనా కేసులు

    ఒక వైపు అమెరికా అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్ ఇంకా జరుగుతుంటే, మరోవైపు కరోనా కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి.

    గురువారం ఒక్క రోజే అమెరికాలో లక్షా 20 వేల కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో అంతకు ముందు రోజు(బుధవారం) కేసుల రికార్డును బద్దలైంది.

    అమెరికా కరోనాకు అత్యంత తీవ్రంగా ప్రభావితమైంది.

    జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ గణాంకాల ప్రకారం దేశంలో మొత్తం కేసుల సంఖ్య 96 లక్షలు దాటగా, ఇప్పటివరకూ కోవిడ్-19తో 2 లక్షలా 34 వేల మంది చనిపోయారు,

  12. నెవాడాలో ఎన్నికల కౌంటింగ్‌పై దావా వేసిన ట్రంప్ పార్టీ

    ఇతర కీలక రాష్ట్రాల్లో చట్టపరమైన మార్గాలను అనుసరించినట్లే ట్రంప్ పార్టీ నెవాడాలో కూడా దావా వేసింది.

    ఇప్పటికే అనేకసార్లు కోర్టు ముందుకు తీసుకెళ్లిన ఫిర్యాదులతో పాటు ట్రంప్‌ బృందం నెవాడాలో కౌంటింగ్ నిలిపివేయాలంటూ దావా వేసినట్టు ఏబీసీ వార్తా సంస్థ తెలిపింది.

    ఆధారాలేమీ చూపించకుండా వేసిన ఈ దావాలో...క్లార్క్ కౌంటీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని, పోస్టల్ ఓట్లను ధృవపరచడంలో అవకతవకలు జరిగాయని, 3000 మందికి పైగా ఓటు హక్కులేనివారు ఓట్లు వేశారని పేర్కొన్నారు.

    బైడెన్ అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రాల్లో లేదా ట్రంప్ ఓడిపోతున్న స్థానాల్లో ఎన్నికల్లో మోసాలు, అవకతవకలు జరుగుతున్నాయని ట్రంప్ పదే పదే ఆరోపించారు.

    ప్రస్తుతం నెవాడాలో బైడెన్ ముందంజలో ఉన్నారు.

    లెక్కింపులో మిగిలిన ఓట్లు ట్రంప్‌కు వస్తాయన్న ఆశతో ఇప్పటివరకూ నెవాడాలో ఓట్ల లెక్కింపు కొనసాగించాలని ట్రంప్ మద్దతుదారులు కోరారు.

  13. జో బైడెన్‌కు భద్రత పెంపు దిశగా ఏర్పాట్లు!

    అమెరికా సీక్రెట్ సర్వీస్ శుక్రవారం నుంచి జో బైడెన్‌కు భద్రతను పెంచనుంది. అతి త్వరలోనే ఆయన విజయం సాధించినట్లు ఫలితాలు వచ్చే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వాషింగ్టన్ పోస్ట్ వెల్లడించింది.

    శుక్రవారం బైడెన్ ప్రసంగించే అవకాశం ఉందని ఆయన ప్రచార బృందం తెలియచేయడంతో సీక్రెట్ సర్వీస్‌ అదనపు ఏజెంట్లను నియమించింది.

    సీక్రెట్ సర్వీస్ ప్రతినిధి కేథరిన్ మిల్హోన్ దీనిపై వ్యాఖ్యానించేందుకు నిరాకరించారు. ఉన్నత స్థాయి వ్యక్తుల భద్రతకు సంబంధించిన వివరాలను ఏజెన్సీ బహిరంగంగా చర్చించదని చెప్పారు. దీనిపై బైడెన్ వర్గం కూడా ఎలాంటి వ్యాఖ్యా చేయలేదు.

    ప్రస్తుతం బైడెన్, ఆయన ప్రచార బృందం డెలావర్‌లోని ఓ కన్వెన్షన్ సెంటర్‌లో ఉన్నారు.

  14. నెవాడాలో 3,062 సార్లు అక్రమాలు జరిగాయంటూ రిపబ్లికన్ల ఆరోపణ

    నెవాడా ఓట్ల లెక్కింపులో 3,602 సార్లు మోసం జరిగినట్లు తమ దృష్టికి వచ్చిందని అమెరికా అటార్నీ జనరల్ విలియం బార్‌కు నెవాడా రిపబ్లికన్ పార్టీ ఫిర్యాదు చేసింది.

    రాష్ట్రం నుంచి వేరే ప్రాంతాలకు వలస వెళ్లిన వారు ఇక్కడ ఓటింగ్‌లో పాల్గొంటున్నట్లు తాము గుర్తించినట్లు పార్టీ పేర్కొంది.

    నెవాడాలో ట్రంప్ కంటే బైడెన్ కాస్త ముందున్నారు. వీరి మధ్య తేడా 11,400 ఓట్ల వరకు ఉంది. ఇక్కడ 89 శాతం బ్యాలెట్ల లెక్కింపు పూర్తైంది.

  15. పెన్సిల్వేనియా కౌంటింగ్ నిలిపివేతకు నిరాకరణ

    తన ఆధిక్యం తగ్గిపోతున్న కీలక రాష్ట్రాల్లో కౌంటింగ్‌ను నిలిపివేయాలంటూ చట్టపరమైన మార్గాలను అనుసరించినట్లు ఇదివరకే డోనల్డ్ ట్రంప్ స్పష్టంచేశారు.

    అయితే, ట్రంప్ అభ్యర్థనను పెన్సిల్వేనియాలోని ఫెడరల్ జడ్జి తిరస్కరించారు.

    ట్రంప్ దాఖలుచేసిన అభ్యర్థనతోపాటు తమ ఎన్నికల పరిశీలకులను కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతించడం లేదంటూ రిపబ్లికన్లు చేస్తున్న ఆరోపణలపై జడ్జి పాల్ డైమండ్ స్పందించారు. ఎన్నికలను పర్యవేక్షించేందుకు డెమొక్రాట్లతోపాటు రిపబ్లికన్ల ప్రతినిధులూ 60 మందిని అనుమతిస్తున్నట్లు చెప్పారు.

    ‘‘రిపబ్లికన్లను అనుమతించేందుకు న్యాయ వ్యవస్థ జోక్యం అవసరం ఏముంది? ఎన్నికల అధికారులే వారిని అనుమతించి ఉండాల్సింది’’అని డైమండ్ వ్యాఖ్యానించారు.

    అయితే, రిపబ్లికన్లను లోపలకు రాకుండా అడ్డుకుంటున్నారన్న ఆరోపణలను పెన్సిల్వేనియా అధికారులు తోసిపుచ్చారు.

  16. ట్రంప్ ఆరోపణలపై మనం పోరాడాలి: బైడెన్

    ప్రతి ఓటునూ లెక్క పెట్టాలంటూ డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ వరుస ట్వీట్లు చేశారు. కీలకమైన రాష్ట్రాల్లో పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపును అడ్డుకోవాలంటూ కోర్టులను ఆశ్రయించిన ట్రంప్ చర్యలతో ఆయన విభేదించారు.

    ‘‘ఎన్నికల ప్రక్రియను నిలిపివేసేందుకు జరుగుతున్న చర్యలపై మనం పోరాడటానికి చరిత్రలో ఎన్నడూ లేనంత కృషి చేస్తున్నాం’’అంటూ బైడెన్ ట్వీట్ చేశారు.

    ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న చోట ట్రంప్ ఆధిక్యం క్రమంగా తగ్గుతూ వస్తోంది. పెన్సిల్వేనియా, జార్జియాల్లో ఇది స్పష్టంగా తెలుస్తోంది.

  17. అమెరికా ఎన్నికల ఫలితాలు: అధ్యక్షుడు ఎవరైనా భారత్‌తో సంబంధాలు ఎలా ఉంటాయి?

    అమెరికా అధ్యక్ష పీఠం డోనల్డ్ ట్రంప్, జో బైడెన్‌లలో ఎవరికి దక్కినా, ఆ దేశంతో భారత్ సంబంధాల్లో వచ్చే మార్పులు పెద్దగా ఉండవని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. భారత్ విషయంలో డెమొక్రటిక్ పార్టీ, రిపబ్లికన్ పార్టీ అనుసరించే విదేశాంగ వైఖరిలో పెద్దగా తేడా లేకపోవడమే వారు ఇలా చెబుతుండటానికి కారణం.

    ట్రంప్‌తో భారత ప్రధాని మోదీ దోస్తీ చూసినవారికి, బైడెన్ గెలిచినా అమెరికా.. భారత్‌తో అలాగే ఉంటుందా ఉన్న సందేహం రావొచ్చు.

    అయితే, ఈ విషయమై విదేశాంగ శాఖలోని అధికారులు, నిపుణులు మరీ ఎక్కువ ఆలోచించడం లేదు.

    అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్న ఆసక్తి ఉంది గానీ, దాని వల్ల భారత్‌తో సంబంధాలు ఎలా మారతాయోనన్న బెంగ మాత్రం భారత విదేశాంగ శాఖలో కనిపించడం లేదు.

  18. అమెరికా ఎన్నికల ఫలితాలు – ప్రస్తుతం ఏం జరుగుతోంది?

    బీబీసీ తెలుగు లైవ్ కవరేజీకి స్వాగతం.

    ఇప్పుడే ఈ పేజీని చూస్తున్నవారి కోసం ఇంతవరకూ ఏం జరిగిందో క్లుప్తంగా ఓసారి చూద్దాం.

    ప్రస్తుత అధ్యక్షుడు రిపబ్లికన్ డోనల్డ్ ట్రంప్ మరోసారి ఆధారాలు లేని ఆరోపణలు చేశారు. బ్యాటిల్‌గ్రౌండ్ స్టేట్స్ జార్జియా, పెన్సిల్వేనియాల్లో పోస్టల్ ఓట్లు లెక్కించే కొద్దీ తన ఆధిక్యం తగ్గిపోతుండటంతో ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలకు దిగారు.

    ఆయన ప్రత్యర్థి, డెమొక్రటిక్ పార్టీ నేత జో బైడెన్.. అందరూ సంయమనంతో ఉండాలని సూచించారు. తను కచ్చితంగా గెలుస్తానని మరోసారి ధీమా వ్యక్తం చేశారు.

    కీలకమైన రాష్ట్రాలైన పెన్సిల్వేనియా, నెవాడా, ఆరిజోనా, జార్జియా, నార్త్ కరోలినాల్లో కౌంటింగ్ కొనసాగుతోంది.

    కేవలం పెన్సిల్వేనియాలో లేదా మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో రెండింట్లో రిపబ్లికన్లు గెలిస్తే చాలు.. జో బైడెన్‌ను విజేతగా ప్రకటించవచ్చు. ట్రంప్ గెలవాలంటే పెన్సిల్వేనియాతో పాటు మరో మూడు రాష్ట్రాల్లో కూడా విజయం సాధించాల్సి ఉంటుంది.

  19. రిపబ్లికన్లు ట్రంప్‌కు మద్దతునివ్వలేదంటూ ఆయన కుమారుల ఆరోపణ

    పెన్సిల్వేనియా, జార్జియాల్లో ట్రంప్ ఆధిక్యం తగ్గిపోతోంది, నెవాడాలో ప్రత్యర్థి జో బైడెన్‌ను అందుకోవడం కష్టంగా మారుతోంది. దీంతో ట్రంప్ మద్దతుదారులు రిపబ్లికన్లపై ఆరోపణలకు దిగారు. మరింత ప్రభావమంతంగా ఓటర్లను ఆకట్టుకోవడంలో రిపబ్లికన్లు విఫలమయ్యారని అన్నారు.

    దీనికి ట్రంప్ కుమారులు ఎరిక్ ట్రంప్, డోనల్డ్ ట్రంప్ జూనియర్‌లు కూడా మద్దతు తెలిపారు.

  20. ఓట్ల లెక్కింపు ఆపేయాలంటూ డోనల్డ్ ట్రంప్ కేసులు వేస్తున్నారు... ఎందుకు?

    అమెరికా అధ్యక్ష పోటీలో విజేతల తుది ఫలితం ఇంకా వెల్లడి కానప్పటికీ పోటీలో ఉన్న ఇరువురు అభ్యర్థులు జో బైడెన్, డోనాల్డ్ ట్రంప్ మాత్రం గెలుపు తమదంటే తమదేనని స్వీయ ప్రకటన చేసేసుకున్నారు. ఇరు వర్గాలకు చెందిన మద్దతుదారులు ఈ ఎన్నికల ఫలితాలపై న్యాయపోరాటాలకు సిద్ధమవుతున్నారు.

    విజేతను నిర్ణయించేందుకు కీలకంగా ఉండే విస్కాన్సిన్, పెన్సిల్వేనియా, మిషిగన్, జార్జియా రాష్ట్రాలలో ఓట్ల లెక్కింపు ప్రక్రియను ట్రంప్ మద్దతుదారులు సవాలు చేస్తున్నారు.

    అయితే, మిషిగన్‌లో బైడెన్ గెలిచినట్లు బీబీసీ భావిస్తోంది. ఆయన విస్కాన్సిన్‌లో గెలిచినట్లు అమెరికా మీడియా చెబుతోంది. పెన్సిల్వేనియాలో ఇంకా ఎటువంటి ఫలితం వెలువడలేదు.

    ఈ మూడు రస్ట్ బెల్ట్ రాష్ట్రాలలో గనక బైడెన్ విజయం సాధిస్తే ఆయన దేశాధ్యక్షుడిగా గెలిచినట్లే.

    నెవాడా, అరిజోనాలో కూడా డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు.

    గత 120 సంవత్సరాలలో ఎన్నడూ లేనంతగా ఈ సారి66.9 శాతం పోలింగ్ నమోదయిందని యూఎస్ ఎలక్షన్ ప్రాజెక్ట్ నివేదిక చెబుతోంది.

    ఇప్పటి వరకు లెక్కించిన ఓట్ల ప్రకారం బైడెన్ కి 7.50 కోట్ల మంది ఓటర్ల మద్దతు లభించిందని.. ఇంత అధికంగా మెజారిటీ ఇప్పటి వరకూ ఎవరికీ రాలేదని ఈ నివేదిక తెలిపింది. డోనాల్డ్ ట్రంప్‌కి 6.72 కోట్ల మంది ఓట్లు వేశారు. ఇది 2016 కంటే 40 లక్షలు ఎక్కువ.