You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

కరోనావైరస్: భారత్‌లో గత 24 గంటల్లో 1,775 పాజిటివ్ కేసులు, 77 మరణాలు... మొత్తం కేసుల సంఖ్య 35,365

భారతదేశంలో 24 గంటల వ్యవధిలో 77 కోవిడ్ మరణాలు నమోదు కావడం ఇదే మొదటిసారి. గురువారం 67 మంది మృతి చెందారు. 1,775 కొత్త కేసులతో కలిపి దేశంలోని కరోనా బాధితుల సంఖ్య 35,365కు చేరింది. ఇప్పటివరకు, 9,064 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు.

లైవ్ కవరేజీ

  1. లండన్ వృద్ధాశ్రమంలో కోవిడ్-19 వల్ల భారతీయ మహిళా సంపాదకురాలు మృతి

    బ్రిటన్‌లో నివసిస్తున్న ప్రముఖ భారతీయ జర్నలిస్ట్ గుల్షన్ ఈవింగ్.. లండన్‌లోని ఒక వృద్ధాశ్రమంలో కోవిడ్-19 వల్ల చనిపోయారు.

    ఆమె వయసు 92 సంవత్సరాలు. వృద్ధాశ్రమాలు, సంరక్షణాలయాల్లో కరోనావైరస్ ఇన్‌ఫెక్షన్ల విషయంలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో గుల్షన్ ఆ వైరస్‌కు బలయ్యారు.

    గుల్షన్ ప్రఖ్యాత భారతీయ మేగజీన్లు ఈవ్స్ వీక్లీ, స్టార్ అండ్ స్టైల్‌లకు 1966 నుంచి 1989 వరకూ ఎడిటర్‌గా పనిచేశారు. ఆమె ‘‘భారతదేశపు విఖ్యాత మహిళా సంపాదకురాలు’’ అని నోబెల్ బహుమతి గ్రహీత వి.ఎస్.నయీపాల్ ఒక సందర్బంలో అభివర్ణించారు.

    ఆమె.. హాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ హేమాహేమీలను ఇంటర్వ్యూ చేశారు. ప్రిన్స్ చార్లెస్, ఆల్ఫ్రెడ్ హిచ్‌కాక్ వంటి వారితో ఆమెకు మంచి సంబంధాలున్నాయి. దిలీప్ కుమార్, షమ్మీ కపూర్, నర్గీస్ వంటి దిగ్గజాలతో తరచుగా పార్టీల్లో పాల్గొనేవారు.

    ‘‘అమ్మ చాలా అదృష్టవంతురాలని అనిపిస్తుంది.ఆమె కెరీర్‌లో అధ్బుతంగా రాణించారు. ఆమె భర్తను ఆమెను ఆరాధించేవారు. ఆమె నిండుగా జీవించారు’’ అని గుల్షన్ కుమార్తె అంజలి తనతో పేర్కొన్నట్లు బీబీసీ ప్రతినిధి గీతా పాండే చెప్పారు.

  2. భారత్‌లో 35,043కు పెరిగిన కేసుల సంఖ్య.. మొత్తం మరణాలు 1,147

    భారతదేశంలో గడచిన 24 గంటల్లో కొత్తగా 1,993 కేసులు నమోదవటంతో మొత్తం కేసుల సంఖ్య శుక్రవారం నాటికి 35,043కు పెరిగాయని కుటుంబ, ఆరోగ్య సంక్షేమ మంత్రిత్వశాఖ చెప్పినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.

    ప్రస్తుతం 25,007 కేసులు కొనసాగుతున్నాయని.. 8,888 మంది రోగులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని వెల్లడించింది. ఒక రోగి వేరే దేశానికి వెళ్లిపోయారు.

    దేశంలో వైరస్ వల్ల గడచిన 24 గంటల్లో మరో 73 మంది చనిపోయారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,147కు పెరిగింది.

    అత్యధికంగా మహారాష్ట్రలో 10,498 కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో మృతుల సంఖ్య 459గా ఉంది.

    రెండో స్థానంలోని గుజరాత్‌లో 4,395 కేసులు ఉంటే.. 214 మంది చనిపోయారు.

    దిల్లీలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,515 కాగా, ఇప్పటివరకూ 59 మంది వైరస్‌కు బలయ్యారు.

    గోవా (7 కేసులు), త్రిపుర (2 కేసులు), అరుణాచల్ ప్రదేశ్ (1 కేసు), మణిపూర్ (2 కేసులు) రాష్ట్రాల్లో వైరస్ సోకిన రోగులందరూ కోలుకున్నారు. ఆయా రాష్ట్రాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు.

  3. ఈ ఒంటరి ఈల్‌కి వీడియో కాల్ చేస్తారా!

    ఒంటరిగా ఉండాల్సి రావటం కష్టంగానే ఉండొచ్చు. వీడియో కాల్స్ పుణ్యమా అని మనం మన ఆత్మీయులను చూస్తూ వారి యోగక్షేమాలను ఎప్పటికప్పుడు తెలుసుకోగలుగుతున్నాం. కానీ ఈల్స్ పరిస్థితి గురించి ఎప్పుడైనా ఆలోచించారా?

    టోక్యోలోని ఒక ఆక్వేరియం ఒక విజ్ఞప్తి చేసే వరకూ మేం కూడా ఆలోచించలేదు. టోక్యోలోని విఖ్యాత స్కైట్రీ టవర్‌లో గల సుమిదా ఆక్వేరియంలోకి సందర్శకులను అనుమతించటం లేదు. దీంతో ఇక్కడి ఈల్స్ మనుషులు ఎలా ఉంటారనేది మరచిపోతున్నాయి.

    ‘‘ఆక్వేరియంలోని ప్రాణులకు.. అప్పుడప్పుడు కనిపించే సంరక్షకులు తప్ప నరమానవులెవరూ కనిపించటం లేదు. అవి మనుషుల గురించి మరచిపోతున్నాయి’’ అని ఆ ఆక్వేరియం చెప్పింది.

    ముఖ్యంగా గార్డెన్ ఈల్స్.. సంరక్షకుడు అటుగా వెళ్లినపుడల్లా ఇసుకలోకి వెళ్లిపోయి దాక్కుంటున్నాయని తెలిపింది.

    దానివల్ల వాటి ఆరోగ్యాన్ని తనిఖీ చేసే అవకాశం ఉండటం లేదు. ఈ సమస్యను పరిష్కరించటానికి.. ఈల్స్ ట్యాంక్ ఎదురుగా కంప్యూటర్ ట్యాబెలెట్ గాడ్జెట్లు పెడుతున్నారు. జనం ఆ గాడ్జెట్లకు వీడియో కాల్స్ చేసి ఈల్స్‌కు తమ ముఖాలను చూపించాలని, వాటిని పలకరించాలని, వాటితో మాట్లాడాలని విజ్ఞప్తి చేశారు.

    కానీ.. మాట్లాడేటపుడు పెద్దగా అరవవద్దని.. ఈల్స్‌కు అరుపులంటే భయమని జాగ్రత్తలు చెప్పారు.

  4. కరోనా వైరస్ ‘మానవ సృష్టి కాదు’: అమెరికా ఇంటెలిజెన్స్

    కరోనా వైరస్ వుహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ నుంచి పుట్టుకొచ్చిందని తాను బలంగా నమ్ముతున్నానని అమెరికా అధ్యక్షుడు పేర్కొన్నట్లు ఇంతకు ముందు చెప్పాం.

    ట్రంప్ మాటలతోతో అమెరికా నిఘా విభాగం నేరుగా విభేదించలేదు. అయితే.. గురువారం ఒక అరుదైన బహిరంగ ప్రకటన చేస్తూ ‘‘ఆ వైరస్ మానవ సృష్టి కాదు.. జన్యు మార్పిడి చేసినదీ కాదు’’ అని మాత్రం చెప్పింది.

  5. పది లక్షల మంది.. కోవిడ్-19 నుంచి కోలుకున్నారు

    కోవిడ్-19 వ్యాధి నుంచి కోలుకున్న వారి సంఖ్య అధికారికంగా పది లక్షలు దాటిందని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ క్రోడీకరించిన లెక్కలు చెప్తున్నాయి.

    ప్రస్తుతం నిర్ధారిత కేసుల సంఖ్య 30 లక్షలకు పైగా ఉంది. అందులో అత్యధికులు కోలకుంటారు. కానీ.. నమోదు చేస్తున్న కేసుల సంఖ్యకు – కోలుకున్నవారి సంఖ్య నమోదుకు మధ్య తేడా ఉంది.

    కోలుకున్న వారి సంఖ్య ఏం చెప్తోంది?

    కరోనావైరస్ సమాచారం లాగానే.. 30 లక్షల కేసుల్లో పది లక్షల మంది కోలుకున్నారన్న సంఖ్యను కూడా జాగ్రత్తగా పరిశీలించాలి.

    కోవిడ్-19 మరణాల రేటు తక్కువగా ఉంది. దానర్థం.. ఈ వ్యాధి సోకిన 30 లక్షల మందీ దాదాపుగా కోలుకుంటారని. కాకపోతే కొన్నికేసులు కోలుకోవటానికి ఎక్కువ కాలం పట్టొచ్చు.

    కానీ ఖచ్చితంగా ఎంత మంది కోలుకుంటారు? అది వైరస్ వల్ల మరణాల రేటు మీద ఆధారపడి ఉంటుంది. అంటే.. ఈ వైరస్ సోకిన వారిలో ఎంత మంది చనిపోతారు అనే దాని మీద. ఆ సంఖ్య మనకింకా తెలీదు.

    మెడికల్ జర్నల్ ది లాన్సెస్ అంచనాల ప్రకారం.. కోవిడ్-19 మరణాల రేటు ఇన్‌ఫ్లుయెంజా (0.1 శాతం) కన్నా ఎక్కువగానూ.. సార్స్ (9.5 శాతం) కన్నా తక్కువగానూ ఉంది.

    వేరే చోటు నుంచి దిగుమతి అయిన కేసులు కానీ, టెస్టుల కొరత కానీ లేని ప్రయాణ ఓడల మీద కేసులను పరిశీలిస్తే.. మరణాల రేటు సుమారు ఒక శాతంగా ఉన్నట్లు కనిపిస్తోందని ఆ జర్నల్ పేర్కొంది.

    కానీ ప్రపంచ దేశాల్లో వైరస్ నిర్ధారణ పరీక్షల నిర్వహణ పరిస్థితుల్లో చాలా తేడాలు ఉన్నందువల్ల (ప్రయాణ ఓడల్లో ఉన్న విధంగా ఏ దేశంలోనూ 100 శాతం పరీక్షల రేటు లేదు).. నిర్ధారిత కేసులతో మరణాల నిష్పత్తిని మాత్రమే మనం చూడగలం.

    ఇక కేవలం తీవ్ర లక్షణాలు గల వారికి మాత్రమే పరీక్షలు నిర్వహిస్తున్నపుడు.. ‘‘మరణాల రేటు’’ 1 శాతం కన్నా ఎక్కువగా కనిపిస్తుంది.

    వాస్తవంలో.. చాలా మందికి వైరస్ సోకినా కూడా వారి లెక్కలు అధికారికంగా నమోదు కావు. అంటే మరణాల రేటు.. అధికారికంగా కనిపించే నిష్పత్తుల కన్నా తక్కువగా ఉంటుంది.

  6. దక్షిణ కొరియాలో వరుసగా మూడో రోజూ 10 లోపే కొత్త కేసులు

    దక్షిణ కొరియాలో శుక్రవారం నాడు కొత్తగా తొమ్మిది కరోనా కేసులు మాత్రమే నమోదయ్యాయి. కొత్త కేసుల సంఖ్య పది కన్నా తక్కువగా ఉండటం వరుసగా ఇది మూడో రోజు.

    తాజా తొమ్మిది కేసుల్లో ఎనిమిది కేసులు విదేశాల నుంచి వచ్చినట్లు భావిస్తున్నారు.

    రెండున్నర నెలల్లో మొదటిసారిగా గురువారం నాడు స్థానికంగా సోకిన కొత్త కేసేదీ నమోదు కాలేదు.

    దక్షిణ కొరియాలో ప్రస్తుతం 10,774 కరోనా కేసులు ఉంటే.. 248 మంది చనిపోయారు.

  7. మలేసియాలో మే 4 నుంచి వ్యాపారాల పున:ప్రారంభం

    మలేసియాలో వ్యాపారాలను చాలా వరకూ మే 4 నుంచి పున:ప్రారంభించటానికి అనుమతి ఇస్తున్నట్లు ప్రధానమంత్రి ముహియుద్దీన్ యాసిన్ ప్రకటించారని రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది.

    కానీ ఉద్యోగుల పెద్ద సంఖ్యలో గుమిగూడే సంస్థలు మాత్రం మూసివేసే ఉంటాయని చెప్పారు.

    దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించటానికి మార్చి 18వ తేదీ నుంచి నిత్యావసరం కాని వ్యాపారాలన్నిటినీ మూసివేశారు. పాఠశాలలను మూసివేసి, ప్రయాణాలను మీద పరిమితులు విధించారు.

    మలేసియాలో ప్రస్తుతం 6,000కు పైగా నిర్ధారిత కరోనా కేసులు ఉన్నాయని, 102 మంది చనిపోయారని జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ గణాంకాలు చెప్తున్నాయి.

  8. మాజీ క్రికెటర్‌ కంపెనీ రూపొందించిన వెంటిలేటర్‌కు ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్

    కరోనావైరస్ వ్యాప్తితో ప్రపంచవ్యాప్తంగా వెంటిలేటర్ల అవసరం భారీగా పెరిగింది. ఆరోగ్యం విషమించిన కోవిడ్-19 రోగులకు వెంటిలేటర్ల సాయంతో కృత్రిమ శ్వాస అందిస్తారు.

    కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో చాలా దేశాల్లో వెంటిలేటర్లకు తీవ్రమైన కొరత ఏర్పడింది.

    ఈ కొరతను తీర్చేందుకు గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఉన్న జ్యోతి సీఎన్‌సీ సంస్థ కేవలం 10 రోజుల్లోనే వెంటిలేటర్ నమూనాను రూపొందించి, ఉత్పత్తి చేస్తోంది. వాటిని తక్కువ ధరకే అందిస్తోంది.

  9. కోవిడ్-19కు మందు కనిపెట్టిన ఐఐసీటీ హైదరాబాద్, క్లినికల్ ట్రయల్స్‌ కు అనుమతి కోరిన సిప్లా

    హైదరాబాద్‌ నగరంలోని సీఎస్ఐఆర్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ కోవిడ్-19కు మందు కనిపెట్టిందని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ ప్రకటించింది.

    ఆ ప్రకటన మేరకు.. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చి (సీఎస్ఐఆర్) కోవిడ్-19కు సమర్థవంతంగా చికిత్స అందించేందుకు గాను 25 రకాల ఔషధాలను కనిపెట్టింది.

    ప్రపంచవ్యాప్తంగా చాలా ఔషధాలను ఉపయోగించి కరోనావైరస్ పేషెంట్లపై వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.

    ఈ నేపథ్యంలో కొత్త ఔషధాలను తయారు చేయడానికి కనీసం దశాబ్ధకాలం పడుతుందని, అందుకే త్వరగా ఔషధాలను కనిపెట్టేందుకు ఇప్పటికే వాడుకలో ఉన్న ఔషధాలను ఉపయోగించి, వాటికి మార్పులు చేసి కొత్త ఔషధాలను కనిపెట్టే పద్ధతిని సీఎస్ఐఆర్ అవలంభిస్తోంది.

    ఇలా కనిపెట్టిన 25 ఔషధాల్లో ప్రముఖమైనది ఫవిపిరవిర్ అనే యాంటీవైరస్ మెడిసిన్. దీనిని జపాన్ సంస్థ తయారు చేసింది. రష్యా, చైనా, జపాన్ దేశాల్లో సాధారణ ఫ్లూ జ్వరం చికిత్సకు దీన్ని వాడుతున్నారు.

    హైదరాబాద్‌లోని ఐఐసీటీ ఈ ఫవిపిరవిర్‌కు అనుకూలమైన, చౌకైన సింథటిక్ ఫార్ములాను కనుగొంది. దీనిని పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసేందుకు ప్రముఖ ఫార్మాసూటికల్ కంపెనీ అయిన సిప్లాకు ఈ ఫార్ములాను అందజేసింది.

    కోవిడ్-19 చికిత్సకు భారతదేశంలో ఈ మందును సిప్లా సంస్థ తయారు చేసి, మార్కెటింగ్ చేస్తుంది. అయితే, అంతకుముందు దీన్ని ఉపయోగించి కోవిడ్-19 సోకినవారిపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు సిప్లా సంస్థ కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన డీసీజీఐ అనుమతి కోరింది.

    సిప్లెన్జా (Ciplenza) పేరిట మార్కెట్లోకి రానున్న ఈ మందుతో సిప్లా జరిపే వైద్య పరీక్షలను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చి (ఐసీఎంఆర్) కూడా పర్యవేక్షిస్తుందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

    సీఎస్ఐఆర్, సిప్లా రెండూ కలసి భారతదేశంలోను, విదేశాల్లోనూ హెచ్ఐవీ ఔషధంతో పాటు చాలా మందుల్ని చౌక ధరల్లో అందించాయని ప్రభుత్వం వివరించింది.

  10. Remdesivir: ఈ ఔషధానికి కోవిడ్-19పై పోరాడే శక్తి కచ్చితంగా ఉందంటున్న అమెరికా

    ఎబోలా చికిత్సలో ఉపయోగించే ఓ ఔషధం కరోనావైరస్ రోగులు కోలుకోవడానికి సహకరిస్తోందని "స్పష్టంగా" తెలుస్తోందని అమెరికా అధికారులు తెలిపారు.

    రోగిలో వ్యాధి లక్షణాలు కొనసాగే కాలాన్ని రెమ్‌డెసివీర్ ఔషధం 15 రోజుల నుంచి 11 రోజుల వ్యవధికి తగ్గిస్తున్నట్టు ప్రపంచవ్యాప్తంగా వివిధ ఆస్పత్రుల్లో నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్‌లో తేలింది.

    కరోనావైరస్‌పై పోరుకు ప్రపంచం ఎదురుచూస్తున్న ‘మ్యాజిక్ బుల్లెట్’ ఇదేనా?

  11. కోవిడ్-19 నుంచి కోలుకున్న 10 లక్షల మంది ప్రజలు

    ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 సోకి, చికిత్స పొందిన 10,14,753 మంది ప్రజలు కోలుకున్నారు.

    జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీ గణాంకాల ప్రకారం.. మే 1వ తేదీ శుక్రవారం ఉదయం 8.30 గంటల వరకు ప్రపంచవ్యాప్తంగా 32,56,846 కరోనా పాజిటివ్ కేసులు ఉండగా, 2,33,388 మంది ఈ వైరస్ కారణంగా చనిపోయారు.

    కోలుకున్న వారిలో అత్యధికంగా అమెరికాలో 1,53,947 మంది ఉండగా, జర్మనీలో 1,23,500 మంది, స్పెయిన్‌లో 1,12,050 మంది ఉన్నారు.

    మరికొన్ని ముఖ్యాంశాలు:

    • క్రమంగా కరోనావైరస్ కేసుల సంఖ్య తగ్గుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్ ఎత్తేయాలని ఆస్ట్రేలియాలోని కొన్ని రాష్ట్రాలు నిర్ణయించాయి.
    • గురువారం సరికొత్త కరోనా పాజిటివ్ కేసులేమీ నమోదు కాలేదని దక్షిణ కొరియా తెలిపింది.
    • ఇండోనేసియాలో నిర్థరిత కేసుల సంఖ్య 10 వేలు దాటింది. ఆగ్నేయ ఆసియాలో కరోనావైరస్‌కు అత్యధికంగా ప్రభావితమైన సింగపూర్ తర్వాతి దేశం ఇండోనేసియా.
    • కరోనా మహమ్మారి వల్ల మార్చి నెల రెండోవారం నుంచి ఇప్పటి వరకూ 3 కోట్ల మంది అమెరికన్లు ఉద్యోగాలు కోల్పోయారు.
    • కరోనావైరస్ కేసులు నమోదయ్యే గరిష్ఠ దశను బ్రిటన్ దాటేసిందని దేశ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ చెప్పారు. కోవిడ్-19 బారినపడి, చికిత్స పొంది తిరిగి విధులకు హాజరైన తర్వాత ఆయన మాట్లాడుతూ.. లాక్‌డౌన్ ఎత్తేసేందుకు అవసరమైన వ్యూహాన్ని వచ్చేవారం రూపొందిస్తామని హామీ ఇచ్చారు.
  12. ‘పసుపు, జీలకర్ర, కొత్తిమీర, వెల్లుల్లి వాడండి.. రోగనిరోధక శక్తి పెంచుకోండి’ – ఏపీ ప్రభుత్వం

    స్వీయ సంరక్షణకు ఆయుష్ మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను అనుసరించి రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కోవిడ్-19 కమాండ్ కంట్రోల్ రూమ్ ప్రజలకు సూచించింది.

    ఈ మేరకు ఒక పాంప్లెట్‌ను రూపొందించింది.

    ప్రతిరోజూ సాధ్యమైనంత వరకు వేడినీటిని తాగాలని, ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు యోగ, ప్రాణాయామం, ధ్యానం చేయాలని, వంటల్లో నిత్యం పసుపు, జీలకర్ర, కొత్తిమీర, వెల్లుల్లి వంటివి వాడాలని అందులో పేర్కొంది.

    ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే టోల్ ఫ్రీ నెంబర్ 104కు ఫోన్ చేయాలని, లేదంటే 8297104104 నంబర్‌కు వాట్సాప్ చేయాలని సూచించింది.

  13. ‘ఆల్కహాల్‌తో చేతులు కడిగినప్పుడు కరోనావైరస్ పోతే.. తాగినప్పుడు గొంతు నుంచి కూడా పోతుంది’ - రాజస్థాన్ ఎమ్మెల్యే, మద్యం షాపుల్ని తెరవాలంటూ ముఖ్యమంత్రికి లేఖ

    రాష్ట్రంలో లిక్కర్ షాపుల్ని ప్రారంభించాలని కోరుతూ రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌కు సంగోడ్ నియోజకవర్గం నుంచి ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్ సింగ్ కుందన్‌పూర్ లేఖ రాశారని ఏఎన్ఐ వార్తా సంస్థ ఒక లేఖను ట్వీట్ చేసింది.

    ఆ లేఖలో మద్యం షాపుల్ని తెరవాలని కోరుతూ, కరోనావైరస్‌కు దీన్ని ముడిపెట్టిన విధానం ఇలా ఉంది.

    ‘‘ఆల్కహాల్‌తో చేతుల్ని కడుక్కుంటే కరోనావైరస్ తొలగిపోయినప్పుడు.. ఆల్కహాల్ తాగితే తప్పకుండా గొంతు నుంచి వైరస్ పోతుంది.’’

    లాక్‌డౌన్ వల్ల రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా మద్యం లభించడం లేదని, దీనివల్ల రాష్ట్రానికి ఆర్థికంగా ఎంతో నష్టం జరుగుతోందని ఎమ్మెల్యే తన లేఖలో పేర్కొన్నారు. అలాగే, నకిలీ మద్యం తాగి ఇద్దరు యువకులు చనిపోయారని ఒక వార్తా కథనాన్ని ప్రస్తావించారు.

    2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను లిక్కర్ ద్వారా 12 వేల కోట్ల ఆదాయాన్ని రాజస్థాన్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని, ఇప్పుడు లిక్కర్ అమ్మకాలు ఆగిపోవడం వల్ల ఆ ఆదాయం వచ్చేలా కనిపించడం లేదని వెల్లడించారు.

  14. ‘వుహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీయే కరోనావైరస్‌ పుట్టుకకు కేంద్రం’ – అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఆరోపణ

    ‘వుహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీయే కరోనావైరస్‌ పుట్టుకకు కేంద్రం’ – అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఆరోపణ

    ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఓ) చైనా పబ్లిక్ రిలేషన్స్ ఏజెన్సీలాగా వ్యవహరిస్తోందని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ విమర్శించారు. ఇందుకు డబ్ల్యుహెచ్‌ఓ సిగ్గుపడాలని ఆయన అన్నారు.

    కరోనావైరస్ వల్ల తలెత్తుతున్న కోవిడ్-19 వ్యాధికి పుట్టిల్లు వుహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీయే అని మీకు నమ్మకం కలిగించే దేనినైనా మీరు చూశారా? అని ప్రశ్నించగా.. ‘‘అవును. నేను చూశాను’’ అని ఆయన సమాధానం ఇచ్చారు. అయితే, ఆయన ఏం చూసిందీ స్పష్టంగా చెప్పలేదు.

    స్పష్టత ఇవ్వాలని కోరగా.. ‘‘నేను నీకు చెప్పలేదు. నీకు చెప్పేందుకు నాకు అనుమతి లేదు’’ అని ట్రంప్ తెలిపారు.

    ‘‘వాళ్లు (చైనా) ఏదైనా తప్పుగా చేశారా లేక ఒక తప్పుగా ప్రారంభమై తర్వాత మరొకటి చేశారా, లేక ఎవరైనా ఏదైనా ఉద్దేశ్యంతో చేశారా? నాకు ఆ ట్రాఫిక్ అర్థం కాలేదు, చైనాలోకి మాత్రం ప్రజల్ని అనుమతించట్లేదు, కానీ చైనా వాళ్లు మాత్రం మిగతా ప్రపంచంలోకి వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. అది చాలా తప్పు, ఈ కఠినమైన ప్రశ్నకు వాళ్లు సమాధానం చెప్పాలి’’ అని ట్రంప్ అన్నారు.

    ‘కోవిడ్-19 బయో వెపన్ కాదు’ - అమెరికా జాతీయ నిఘా సంస్థ

    కాగా, అంతకు ముందు.. కరోనావైరస్ ద్వారా వ్యాపిస్తున్న కోవిడ్-19 బయో వెపన్ కాదని అమెరికాకు చెందిన జాతీయ నిఘా సంస్థ డైరెక్టర్ కార్యాలయం తెలిపింది.

    ‘‘మనుషులు తయారు చేసింది కాదు. జన్యువులను మార్చి తయారు చేసింది కూడా కాదు’’ అని కూడా ఈ సంస్థ స్పష్టం చేసింది.

    అయితే, ఇది అనుకోకుండా ల్యాబొరేటరీ నుంచి లీక్ అయ్యిందా? అన్న అంశంపై మాత్రం ఈ సంస్థ ఇంకా స్పష్టత ఇవ్వలేదు.

    కరోనావైరస్ పుట్టుకకు కారణాలపై తాము ఇంకా విచారణ జరుపుతున్నామని వెల్లడించింది.

  15. బీబీసీ తెలుగు కరోనావైరస్ LIVEఅప్‌డేట్స్ పేజీకి తిరిగి స్వాగతం

    కరోనావైరస్ వార్తలను ఎప్పటికప్పుడు అందిస్తుంది బీబీసీ తెలుగు LIVE పేజి.

    ఇప్పటివరకు ముఖ్యాంశాలు:

    • కరోనావైరస్ బయో వెపన్ కాదని అమెరికాకు చెందిన జాతీయ నిఘా సంస్థ డైరెక్టర్ కార్యాలయం తెలిపింది. అయితే, ఇది అనుకోకుండా ల్యాబొరేటరీ నుంచి లీక్ అయ్యిందా? అన్న అంశంపై మాత్రం ఈ సంస్థ ఇంకా స్పష్టత ఇవ్వలేదు.
    • ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన ఏపీ వాసులు తిరిగి స్వస్థలాలకు రావాలనుకుంటే 08662424680 నంబర్‌కు కాల్ చేయాలని ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ కార్యదర్శి కృష్ణబాబు సూచించారు.
    • తమ రాష్ట్రానికి చెందిన వలస కార్మికుల్ని తిరిగి స్వస్థలాలకు తీసుకురావడానికి ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీని పశ్చిమ బెంగాల్‌కు చెందిన కాంగ్రెస్ ఎంపీ ఆధీర్ రంజన్ చౌధరి కోరారు.
    • గతంలో ఎన్నడూ లేనంతగా యూరోజోన్ జీడీపీ 2020 మొదటి త్రైమాసికంలో మైనస్ 3.8 శాతానికి పడిపోయింది.