You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

కరోనావైరస్: ప్రపంచవ్యాప్తంగా 1,99,271.. భారత్‌లో 779 మంది మృతి

ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వివరాల ప్రకారం, కొత్త కేసులతో కలిపి భారత్‌లో మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 24,942కు పెరిగింది. వీటిలో 18,953 యాక్టివ్ కేసులు కాగా, 5,210 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకూ మొత్తం 779 మంది మృతి చెందారు.

లైవ్ కవరేజీ

  1. ఈక్వెడార్‌లో రోడ్ల మీదే మృతదేహాలు

    ఈక్వెడార్‌ దేశంలోనే అత్యంత పెద్ద నగరం, గ్వాయాస్ రాజధాని గ్వాయాక్విల్.

    25 లక్షల మంది ఉన్న ఈ నగరంలో కరోనావైరస్ వల్ల ఎన్ని మరణాలు సంభవించాయంటే, నగరంలో ఉన్న మార్చురీలన్నీ నిండిపోయాయి.

    మార్చురీ సిబ్బంది ఇన్ఫెక్షన్ వస్తుందేమో అని భయపడిపోయారు. దాంతో చాలా మార్చురీలను మూసేశారు.

    మార్చురీలో పనిచేసే కేటీ మేజికా మాట్లాడుతూ.. “మేం కార్లలో, అంబులెన్సుల్లో, ఇళ్లలో, రోడ్లపై ఉన్న ఎన్నో శవాలను చూశాం’’ అని చెప్పారు.

  2. జూన్ 30 వరకూ సభలు, సమావేశాలకు అనుమతుల్లేవ్ - యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

    జూన్ 30వ తేదీ వరకూ సభలు, సమావేశాలకు అనుమతులు ఇవ్వొద్దని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అధికారులకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలు జారీ చేసినట్లు సీఎంఓ ప్రకటించిందని ఏఎన్ఐ వార్తా సంస్థ ట్వీట్ చేసింది.

    పరిస్థితిని బట్టి తదుపరిర నిర్ణయాలు ఉంటాయని సీఎంఓ వెల్లడించింది.

  3. అమెరికాలో తెరుచుకున్న సెలూన్లు, స్పాలు, నిబంధనలు సడలించిన జార్జియా, ఓక్లహామా, అలాస్కా రాష్ట్రాలు

    అమెరికాలోని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కరోనావైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు విధించిన నిబంధనలను సడలించాయి.

    జార్జియా, ఓక్లహామాల్లో సెలూన్లు, స్పాలు తెరుచుకోగా, అలాస్కాలో రెస్టారెంట్లను తెరిచేందుకు అనుమతులు ఇచ్చారు.

    అయితే, ఈ రాష్ట్రాల్లోని కొన్ని నగరాలు మాత్రం లాక్‌డౌన్ నిబంధనలకు కట్టుబడి ఉండాలని నిర్ణయించాయి.

    కాగా, ఇలా లాక్‌డౌన్ నిబంధనలను సడలించడం ద్వారా కరోనావైరస్ ఉధృతి మళ్లీ పెరగొచ్చునని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

    మే నెల నుంచి ఇప్పటి వరకూ నిరుద్యోగులమయ్యామని దేశంలో 2.6 కోట్ల మంది చెబుతున్నారు. దీంతో వర్తక, వ్యాపారాలను తిరిగి ప్రారంభించాలని చాలా రాష్ట్రాలపై ఒత్తిడి పెరుగుతోంది.

    అమెరికాలో కరోనా కేసులు 9 లక్షలు దాటగా, కోవిడ్-19 సోకి మరణించిన వారి సంఖ్య 51 వేలు దాటింది. దాదాపు లక్ష మంది ఈ వ్యాధి నుంచి కోలుకున్నారు. మొత్తంగా దాదాపు 50 లక్షల మందికి పరీక్షలు నిర్వహించారు.

  4. ఆంధ్రప్రదేశ్‌లో వెయ్యి దాటిన కరోనా కేసులు

    రాష్ట్రంలో గత 24 గంటల్లో 61 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆంధ్రప్రదేశ్ కమాండ్ కంట్రోల్ రూమ్ ప్రకటించింది. 26 మంది కోలుకుని డివ్చార్జి అయ్యారు. ఒకరు చనిపోయారు.

    ఈ మేరకు 25వ తేదీ శనివారం ఉదయం 10 గంటలకు బులెటిన్ విడుదల చేసింది.

    రాష్ట్రంలో కోవిడ్-19 కేసుల సంఖ్య అధికారికంగా వెయ్యి మార్కును దాటింది. మొత్తం 1016 కేసులు నమోదయ్యాయని, అందులో 171 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారని, 31 మంది మరణించారని ప్రభుత్వం వెల్లడించింది. మరో 814 మంది చికిత్స పొందుతున్నారు.

    జిల్లాల వారీగా చూస్తే కృష్ణా జిల్లాలో గత 24 గంటల్లో 25 కేసులు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో 14 కేసులు నమోదయ్యాయి.

    మొత్తం కేసుల పరంగా చూస్తే.. కర్నూలు జిల్లాలో అత్యధికంగా 275 కేసులు నమోదు కాగా, ఆ తర్వాత గుంటూరు జిల్లాలో 209 కేసులు నమోదయ్యాయి. కృష్ణాలో 127, చిత్తూరులో 73, కడపలో 55, ప్రకాశంలో 53, అనంతపురంలో 51, పశ్చిమ గోదావరిలో 39, తూర్పు గోదావరిలో 37, విశాఖపట్నంలో 22, శ్రీకాకుళంలో 3 కేసులు నమోదయ్యాయి. విజయనగరం జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.

    కాగా, 25వ తేదీ శనివారం ఉదయం 10 గంటల వరకూ రాష్ట్రవ్యాప్తంగా 61,266 కోవిడ్-19 పరీక్షలు జరిపినట్లు ప్రభుత్వం ప్రకటించింది.

  5. మద్యం విక్రయాలకు, మార్కెట్లలోని షాపులకు అనుమతి లేదు – కేంద్ర హోం శాఖ వివరణ

    దేశవ్యాప్తంగా అన్ని దుకాణాలనూ తెరిచేందుకు అనుమతి ఇచ్చిన కేంద్ర హోం శాఖ తన ఆదేశాలకు వివరణ ఇచ్చింది. ఈ మేరకు 25వ తేదీ శనివారం ఉదయం పత్రికా ప్రకటన విడుదల చేసింది.

    ఈనెల 24వ తేదీ శుక్రవారం రాత్రి జారీ చేసిన ఆదేశాల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని షాపులూ తెరవొచ్చని, షాపింగ్ మాల్స్‌ లోని దుకాణాలను మాత్రం తెరవకూడదని వివరించింది.

    పట్టణ ప్రాంతాల్లో సైతం అన్ని దుకాణాలను తెరవొచ్చని, అవి నివాస ప్రాంతాల్లో ఉన్నప్పటికీ తెరవొచ్చని వివరించింది. అయితే, మార్కెట్లు, మార్కెట్ కాంప్లెక్సులు, షాపింగ్ మాల్స్ లోని దుకాణాలను మాత్రం తెరవకూడదని వివరించింది.

    ఈ కామర్స్ కంపెనీలు అన్ని రకాల నిత్యావసర సరుకులను విక్రయించొచ్చునని వెల్లడించింది.

    మద్యం విక్రయాలపై మాత్రం నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేసింది.

  6. దిల్లీలో తెరుచుకున్న షాపులు

    నెల రోజుల లాక్‌డౌన్ తర్వాత దిల్లీలోని లక్ష్మీ నగర్‌లో ఉన్న హార్డ్‌ వేర్ షాపులు తెరుచుకున్నాయని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.

    లాక్ డౌన్ కారణంగా మూసేసిన షాపుల్ని తెరిచేందుకు కేంద్ర హోం శాఖ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు ఇచ్చింది.

    అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టం కింద నమోదైన దుకాణాలను తెరిచేందుకు అనుమతి ఇచ్చింది. అయితే, కరోనా వైరస్ ఉధృతి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మాత్రం ఈ ఉత్తర్వులు అమలు కావు.

  7. దేశవ్యాప్తంగా అన్ని దుకాణాలనూ తెరవొచ్చు – ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర హోం శాఖ, కరోనావైరస్ ఉధృతి అధికంగా ఉన్న ప్రాంతాలు, రెడ్‌జోన్లు/కంటైన్‌మెంట్ జోన్లు, హాట్‌స్పాట్లుగా గుర్తించిన ప్రాంతాల్లో ఈ ఉత్తర్వులు అమలు కావు.

    అన్ని రాష్ట్రాలూ, కేంద్ర పాలిత ప్రాంతాల్లో షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టం కింద నమోదైన అన్ని దుకాణాలనూ తెరవొచ్చని కేంద్ర హోం శాఖ ఏప్రిల్ 24వ తేదీ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.

    ఈ ఉత్తర్వులను కేంద్ర హోం శాఖ కార్యదర్శి అన్ని రాష్ట్రాలూ, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు పంపించారు.

    ఈ మేరకు ఏప్రిల్ 15వ తేదీన జారీ చేసిన ఆదేశాలను సవరిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

    అంతకుముందు అన్ని షాపింగ్ కాంప్లెక్సులూ అన్న పదాన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలోని మార్కెట్ కాంప్లెక్సులుగా మార్చారు.

    మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధి లోపల, బయట ఉన్న.. షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టం కింద రిజిస్టర్ అయిన అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని షాపులు.. నివాస సముదాయాలు, మార్కెట్ కాంప్లెక్సుల్లోని షాపులతో సహా అన్ని షాపులూ తెరవొచ్చు. అయితే, వీటిలో 50 శాతం సిబ్బంది మాత్రమే పనిచేయాలి. వారంతా మాస్కులు ధరించి, సామాజిక దూరాన్ని పాటించాలి.

    అయితే, మల్టీబ్రాండ్, సింగిల్ బ్రాండ్ మాల్స్‌ లోని దుకాణాలకు మాత్రం ఈ ఉత్తర్వులు వర్తించవు. అంటే వాటిని తెరవడానికి వీల్లేదు.

    అయితే, కరోనావైరస్ ఉధృతి అధికంగా ఉన్న ప్రాంతాలు, రెడ్‌జోన్లు/కంటైన్‌మెంట్ జోన్లు, హాట్‌స్పాట్లుగా గుర్తించిన ప్రాంతాల్లో ఈ ఉత్తర్వులు అమలు కావని హోం శాఖ తెలిపిందని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.

    మార్చి 24వ తేదీన దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు.

    ఇప్పటి వరకూ దేశంలో పాలు, నిత్యావసరాలు, మందుల దుకాణాలను తెరిచేందుకు మాత్రమే ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తాజా ఉత్తర్వులతో అన్ని షాపులూ తెరుకుచుకునే అవకాశం ఉంది.

  8. లాక్‌డౌన్ ఎత్తేసే ప్లాన్ ప్రకటించిన ప్రధానమంత్రి.. బెల్జియంలో తెరుచుకోనున్న షాపులు, స్కూళ్లు

    దేశంలో కరోనావైరస్ నియంత్రణలను క్రమంగా ఎత్తేసే సమగ్ర ప్రణాళికలను బెల్జియం ప్రధాన మంత్రి సోఫీ విల్మీస్ ప్రకటించారు.

    1.14 కోట్ల జనాభా ఉన్న బెల్జియంలో 44 వేల మందికి పైగా ప్రజలకు కరోనావైరస్ సోకినట్లు నిర్థరణ అయ్యింది. 6,700 మందికి పైగా కోవిడ్-19 సోకి చనిపోయారు.

    కాగా, ప్రధానమంత్రి ప్రకటించిన ప్రణాళికల మేరకు..

    • మే 4వ తేదీ నుంచి వస్త్ర దుకాణాలు ప్రారంభం అవుతాయి. తాజా నిబంధనల ప్రకారం పౌర రవాణా వ్యవస్థల ద్వారా ప్రయాణించే 12 ఏళ్లు పైబడిన వారంతా మాస్కులు ధరించాల్సి ఉంటుంది. ఆ మాస్కుల్ని అందుబాటులో ఉంచే చర్యల్లో భాగంగా ఈ షాపుల్ని తెరుస్తారు.
    • మే 11వ తేదీ నుంచి అన్ని షాపులూ తెరుచుకుంటాయి.
    • మే 18వ తేదీ నుంచి పాఠశాలలు కూడా ప్రారంభం అవుతాయి. అయితే ప్రతి క్లాసులో 10 మంది విద్యార్థులు మాత్రమే ఉండాలని నిబంధన విధించారు.
    • జూన్ 8వ తేదీ నుంచి అన్ని కెఫేలూ, రెస్టారెంట్లూ ప్రారంభం అవుతాయి.

    కాగా, జర్మనీ దేశంలో ఇప్పటికే కొన్ని షాపులు ప్రారంభం కాగా, మే 4వ తేదీ నుంచి పాఠశాలల్ని కూడా ప్రారంభించనున్నారు.

  9. కరోనావైరస్ నుంచి ఎలా కాపాడుకోవాలి... లాక్‌డౌన్ ఒత్తిడి నుంచి ఎలా బయటపడాలి?

    కరోనా వైరస్ నుంచి రక్షించుకోవడానికి ఇబ్బడి ముబ్బడిగా అనేక చోట్ల నుంచి సలహాలు వస్తున్నాయి. అయితే, మనల్ని మనం రక్షించుకోవడానికి పాటించాల్సిన సూచనలు ఏమిటి?

    వైరస్ వ్యాప్తి చేయకుండా చూడటం ఎలా?

    మాస్క్‌లు, గ్లోవ్స్ పని చేస్తాయా?

    కోవిడ్ 19 సోకినట్లు ఎలా తెలుస్తుంది?

    ఈ లక్షణాలు ఉంటే ఏమి చెయ్యాలి?

    కోవిడ్ 19 ఎంత ప్రమాదకరం?

    దీనికి మందు ఉందా?

    ఈ సమయంలో మానసిక ఆరోగ్యం కాపాడుకోవడం ఎలా?

  10. భారత్‌లో కోవిడ్ కేసుల సంఖ్య 24,506

    దేశంలో కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 24,506కు చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపిందని ఏఎన్ఐ వార్తా సంస్థ ఒక ట్వీట్‌లో పేర్కొంది.

    ఈ కేసుల్లో 18,668 యాక్టివ్ కేసులు కాగా, 5063 మంది కోలుకున్నారు. 775 మంది చనిపోయారు.

    గత 24 గంటల్లో దేశంలో 1429 కొత్త కోవిడ్-19 కేసులు నమోదు కాగా, 57 మరణాలు నమోదయ్యాయి.

  11. కోవిడ్-19 టెస్ట్ కిట్ తయారు చేసిన దిల్లీ ఐఐటీ

    దిల్లీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) కోవిడ్-19ను గుర్తించే టెస్ట్ కిట్‌ను రూపొందించింది. దీనికి ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చి (ఐసీఎంఆర్) అనుమతి కూడా లభించిందని దిల్లీ ఐఐటీ పేర్కొంది.

    కరోనావైరస్ సోకిందో లేదో తెలుసుకోవడానికి ఈ కిట్ సాయంతో పరీక్ష నిర్వహిస్తారు.

    కేవలం మూడు నెలల్లోనే ఈ కిట్‌ను తయారు చేశామని ప్రొఫెసర్ వి పెరుమాళ్ ఏఎన్ఐ వార్తా సంస్థతో చెప్పారు. చౌకగా, భారీ సంఖ్యలో పరీక్షలు జరపేందుకు తమవంతు సాయం చేయాలనుకున్నామని ఆయన వెల్లడించారు.

    కాగా, దిల్లీ ఐఐటీ చౌక ధరల్లో లభ్యమయ్యే ఎన్95 మాస్కులను కూడా తయారు చేస్తోంది.

  12. ప్రపంచ దేశాల్లో పరిస్థితి ఎలా ఉంది?

    అమెరికా: గత 24 గంటల్లో 3 వేలకు పైగా మరణాలు నమోదయ్యాయి. మొత్తం మృతుల సంఖ్య 51 వేలు దాటింది. ఈ దేశంలో 8.9 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడిన వారి సంఖ్యతో పోల్చితే మరణాల శాతం తక్కువే ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.

    చైనా:కరోనావైరస్ పుట్టుకపై స్వతంత్ర అంతర్జాతీయ దర్యాప్తు జరిపించాలనే డిమాండ్‌ను చైనా తిరస్కరించింది. యూకేలో చైనా దౌత్యవేత్త ఒకరు బీబీసీతో మాట్లాడుతూ, ఇలాంటి డిమాండ్లు రాజకీయ దురుద్దేశాలతో కూడుకున్నవని, మహమ్మారి మీద చైనా చేస్తున్న పోరాటంపై నుంచి దృష్టి మళ్లించేలా చేస్తాయని అన్నారు.

    బెల్జియం: లాక్‌డౌన్ క్రమక్రమంగా తొలగించేందుకు దేశ ప్రధాని సోఫీ విల్మెస్ పూర్తి స్థాయి ప్రణాళికను ప్రకటించారు. కొత్త నిబంధనల ప్రకారం మే 11 నుంచి షాపులు తెరుచుకుంటాయి. ఆ తరువాత వారంలో పాఠశాలలు ప్రారంభమవుతాయి. అయితే, తరగతి గదిలో విద్యార్థులు పరిమిత సంఖ్యలో ఉండాలనే నియమం విధించారు. ఈ దేశంలో 44 వేలకు పైగా ప్రజలు కరోనావైరస్ బారిన పడ్డారు. 6,700 మంది చనిపోయారు.

    ఆస్ట్రేలియా - న్యూజీలాండ్: ఏప్రిల్ 25న ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ దేశాల్లో 'అంజాక్ డే' జరుపుకుంటారు. ఈ జాతీయ దినోత్సవాన్ని ప్రజలు సాధారణంగా ఎంతో గొప్పగా జరుపుకుంటారు. కానీ, కరోనావైరస్ లాక్‌డౌన్ నేపథ్యంలో ఈ జాతీయ దినోత్సవాన అమర వీరులకు ప్రజలు తమ ఇంటి వద్దే నిల్చుని క్యాండిల్ వెలిగించి నీరాజనాలు పలకాలని ప్రభుత్వం సూచించింది. దేశ చరిత్రలో ఇలా తొలిసారి జాతీయ వేడుకల్ని రద్దు చేయాల్సి రావడం విచారకరమని న్యజీలాండ్ ప్రధానమంత్రి జసిండా ఆర్డెర్న్ అన్నారు.

  13. బీబీసీ తెలుగు కరోనావైరస్ LIVE అప్‌డేట్స్ పేజీకి తిరిగి స్వాగతం

    కరోనావైరస్‌కు సంబంధించిన ప్రపంచవ్యాప్త సమాచారాన్ని మీరు ఈ లైవ్ పేజీలో ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఇప్పటివరకు ఉన్న ముఖ్యాంశాలు:

    - ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ బాధితుల సంఖ్య 27.9 లక్షలు దాటింది. దాదాపు 2 లక్షల మంది చనిపోయారు.

    - అమెరికాలో 51 వేల మందికి పైగా చనిపోయారు. స్పెయిన్‌లో 22 వేల మందిని వైరస్ బలి తీసుకుంది.

    - భారతదేశంలో 23,452 యాక్టివ్ కరోనాకేసులకు చికిత్స జరుగుతోంది. మృతుల సంఖ్య 723కు చేరింది. ఇప్పటివరకు 4,814 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.