తెలంగాణలో కరోనావైరస్ పాజిటివ్ యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు.
గురువారం రాష్ట్రంలో కొత్తగా 27 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదవ్వగా, 58 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు.
కొత్త కేసుల్లో 13 జీహెచ్ఎంసీ పరిధిలో, 10 జోగులాంబ జిల్లాలో నమోదయ్యాయని ఆయన తెలిపారు.
రాష్ట్రంలో బుధవారం నాటికి 725 యాక్టివ్ కేసులు ఉండగా, గురువారం అది 693కు తగ్గినట్లు రాజేందర్ వివరించారు..
ఆయన చెప్పిన వివరాల ప్రకారం తెలంగాణలో గురువారం వరకూ మొత్తం 980 మంది కరోనావైరస్ బారినపడ్డారు. వారిలో 25 మంది మరణించగా, 262 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న సూర్యాపేట, గద్వాల్లలో, ఇదివరకు కరీంనగర్లో తీసుకున్నట్లే కఠిన చర్యలు తీసుకుంటున్నామని రాజేందర్ అన్నారు.
జిల్లాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా చూడాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారని, ఈ మేరకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారని రాజేందర్ తెలిపారు.
‘‘గాంధీ ఆస్పత్రిలో 99 శాతం కరోనా రోగులు ఉన్నారు. అక్కడి పరిస్థితులపై అధికారులు, వైద్యులతో సమీక్ష నిర్వహించాం.
ల్యాబ్స్ అన్నీ అందుబాటులోకి తెచ్చాం’’ అని వివరించారు.
నాలుగు లక్షల పీపీ కిట్లు, 4.5 లక్షల ఎన్95 మాస్కులు నిల్వ చేసినట్లు తెలిపారు. గచ్చిబౌలీలో కొత్తగా ఏర్పాటు చేసిన ఆసుపత్రి అందుబాటులోకి వచ్చిందని, త్వరలోనే అందులో సేవలు ప్రారంభిస్తామని అన్నారు.
‘‘రాష్ట్రంలో కేసులు తగ్గుతున్నాయి. మరణాల శాతాన్ని కూడా తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. వచ్చే రెండు, మూడు రోజుల్లో కేసులు ఇంకా తగ్గుతాయని ఆశిస్తున్నాం. క్యాన్సర్, కిడ్నీ, డయాలసిస్ లాంటి ఇతర సమస్యలున్నవారికి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నాం’’ అని చెప్పారు.