You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

కరోనావైరస్: తెలంగాణలో మరో ఇద్దరి మృతి, 872కి పెరిగిన పాజిటివ్ కేసులు

భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 17,656కి పెరిగింది. ఇప్పటి వరకు ఈ వైరస్ బారిన పడి దేశంలో 559 మంది మరణించారు. తెలంగాణలో సోమవారం కొత్తగా 14 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇద్దరు మరణించారు. మొత్తం కరోనా కేసుల సంఖ్య 872కి, మృతుల సంఖ్య 23కి చేరింది.

లైవ్ కవరేజీ

  1. భారత్ లాక్‌డౌన్‌లో ఈరోజు నుంచి సడలింపులు ఇవే

    భారతదేశంలో ఈరోజు నుంచి లాక్‌డౌన్లో కొన్ని సడలింపుల అమలవుతాయి. అయితే, ఈ సడలింపులు దేశంలోని అన్ని రాష్ట్రాలకు వర్తించవు. తెలంగాణ వంటి కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే ఎలాంటి మినహాయింపులు లేవని స్పష్టం చేశాయి.

    ఈ రోజు నుంచి తెరుచుకునే రంగాలు:

    - వ్యవసాయం, హార్టికల్చర్ కార్యకలాపాలకు అనుమతి.

    - అన్ని రకాల ఆరోగ్య సేవలు. ఆయుష్ సేవలు.

    - ఉపాధి హామీ పనులు. శ్రామికులు భౌతిక దూరం పాటించాలి.

    - వ్యవసాయ అనుబంధ ఉత్పత్తులు, వాటి సరఫరా.

    - ఫార్మా కంపెనీలు, వైద్య పరికరాల కర్మాగారాలు.

    - టీ, కాఫీ, రబ్బరు తోటలు గరిష్టంగా 50% ఉద్యోగులతో పనిచేయడానికి అనుమతి.

    - చమురు, గ్యాస్ రంగానికి సంబంధించిన అన్ని కార్యకలాపాలు కొనసాగుతాయి.

    - పోస్టల్ సేవలు. పోస్టాఫీసులు తెరచి ఉంటాయి.

    - అత్యవసర సేవల కొనసాగింపు.

    - నిర్మాణ పనులకు అనుమతి.

    - హైవే ధాబాలు, ట్రక్కుల రిపేర్ షాపులు, ప్రభుత్వ సేవలతో అనుసంధానమైన కాల్ సెంటర్లు.

    - ఎలక్ట్రీషియన్లు, ఐటీ రిపేర్ చేసేవారు, ప్లంబర్లు, మోటారు మెకానిక్‌లు, వడ్రంగి పనివారు వంటి స్వయం ఉపాధితో జీవిస్తున్న వారికి అనుమతి.

    - గోశాలలు, ఇతర జంతు శాలలు తెరుచుకుంటాయి.

    - అయితే, ఈ సడలింపులేవీ హాట్ స్పాట్ జోన్లలో వర్తించవు.

    - గ్రామీణ ప్రాంతాలలోని పరిశ్రమలకు అనుమతి. భౌతిక దూరం తప్పనిసరి.

    - కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు పని చేస్తాయి.

    - నిత్యావసరాలు, పళ్ళు - కూరగాయలు, ఔషధాలు, పాలు, మాంసం, చేపలు, రేషన్ షాపులు తెరుచుకుంటాయి.

    - బ్యాంకులు, ఏటీఎంలు తెరిచి ఉంటాయి.

    - స్టాక్ మార్కెట్లు తెరిచి ఉంటాయి.

    లాక్‌డౌన్ కొనసాగే చోట్లు ఇవే:

    - మే 3 వరకు రైలు, మెట్రో, రోడ్డు, విమానయానాలు ఉండవు.

    - షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు, స్పోర్ట్స్ కాంప్లెక్సులు, స్విమ్మింగ్ పూల్స్, అమ్యూజ్మెంట్ పార్కులు, బార్లు, జిమ్‌లు, రెస్టారెంట్లు.

    - పాఠశాలలు, కళాశాలలు.

    - దేవాలయాలు, మసీదులు, గురువద్వారా, చర్చిలు, ఇతర మతపమైన ప్రదేశాలు. మతపరమైన కార్యక్రమాలకు కూడా అనుమతి లేదు.

    - పెళ్ళిళ్ళు, బహిరంగ కార్యక్రమాలు, సామాజిక వేడుకలు, సాంస్కృతిక కార్యక్రమాలు, రాజకీయ సభలు, సెమినార్లు, క్రీడాకార్యక్రమాలపై కూడా నిషేధం కొనసాగింపు.

    - అంత్యక్రియలకు 20 మందికి మించకూడదు.

  2. మసీదుల్లో రంజాన్ ప్రార్థనలు కొనసాగుతాయన్న పాకిస్తాన్

    కరోనావైరస్ వ్యాప్తిని నిరోధించడానికి రంజాన్ మాసంలో మసీదుల్లో సామూహిక ప్రార్థనలను రద్దు చేసిన పాకిస్తాన్ ప్రభుత్వం ఇస్లాం మత సంస్థల నుంచి వచ్చిన ఒత్తిడికి తలొగ్గింది.

    ప్రపంచవ్యాప్తంగా ఈ వారం రంజాన్ మాసం మొదలవుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు ఈ మాసంలో సామూహిక ప్రార్థనలు నిర్వహిస్తారు.

    అయితే, 50 ఏళ్ళ వయసు పైబడినవారు, పిల్లలు, ఫ్లూ లక్షణాలు ఉన్న వారిని మసీదులకు అనుమతించకూడదనే విషయంలో మత పెద్దలు ప్రభుత్వ ప్రతిపాదనతో అంగీకరించారు.

    మసీదుల నుంచి కార్పెట్లను తొలగించడం, నమాజు చేసే ప్రాంతాలను ప్రతిరోజూ శుభ్రం చేయడం, వ్యక్తుల మధ్య తగిన దూరం ఉండేలా చూడడం వంటి నియమాలను పాటించడం జరుగుతుందని మత పెద్దలు తెలిపారు. అలాగే, కరచాలనాలు, ఆలింగనాలపై ఆంక్షలు కొనసాగుతాయని తెలిపారు.

    ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు రంజాన్ మాసంలో మసీదులకు వెళ్ళి ప్రార్థనలు చేయాలని, అయితే కరోనావ్యాప్తి నిరోధానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సౌదీఅరేబియాలోని అత్యున్నత మత సంస్థ పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా ముస్లింలు ఎక్కడా గుంపులుగా ఉండకూడదని సూచించింది.

  3. బీబీసీ తెలుగు కరోనావైరస్ LIVE అప్‌డేట్స్ పేజీకి తిరిగి స్వాగతం

    ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య 24 లక్షలు దాటింది.

    అమెరికాలో కోవిడ్ బారిన పడి 40 వేలకు పైగా మృతి చెందారు.

    భారతదేశంలో వైరస్ సోకిన వారి సంఖ్య 17 వేలు దాటింది. అయిదు వందలకు పైగా ప్రజలు కోవిడ్ వ్యాధితో చనిపోయారు.

    తెలంగాణలో 809, ఏపీలో 603 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. నిన్నటివరకు రెండు రాష్ట్రాల్లో కలిపి 34 మంది చనిపోయారు.