కరోనావైరస్: ప్రపంచవ్యాప్తంగా 20 లక్షలు దాటిన కోవిడ్ కేసులు, 1.28 లక్షల మరణాలు; భారత్‌లో బాధితులు 11,933, మృతులు 382

ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ కేసులు సంఖ్య 20 లక్షలు దాటింది. అమెరికాలో 6 లక్షలు దాటింది. భారతదేశంలో 11,933కి పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 1,28,886 మంది కోవిడ్ వ్యాధి బారిన పడి చనిపోయారు.

లైవ్ కవరేజీ

  1. ప్రపంచ ఆరోగ్య సంస్థకు నిధులు నిలిపివేస్తాం: ట్రంప్

    ట్రంప్

    ఫొటో సోర్స్, Getty Images

    ప్రపంచ ఆరోగ్య సంస్థకు అందించే నిధులను నిలిపివేస్తున్నామని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ప్రకటించారు.

    కరోనావైరస్ వ్యాప్తిని కట్టడి చేయడంలో ఆ సంస్థ తన కనీస బాధ్యతలను నిర్వర్తించడంలో విఫలమైందని ట్రంప్ విమర్శించారు.

  2. కరోనావైరస్‌పై లైవ్ అప్‌డేట్స్ పేజీకి స్వాగతం

    కరోనావైరస్‌పై ప్రపంచవ్యాప్తంగా వస్తున్న అప్‌డేట్స్‌ను మీరు ఎప్పటికప్పుడు బీబీసీ తెలుగు లైవ్ పేజీ ద్వారా తెలుసుకోవచ్చు.

    ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో పాటు జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలు ఈ పేజీలో వెంట వెంటనే అప్‌డేట్ అవుతాయి.

    ఈరోజు ఇప్పటివరకూ అందిన తాజా వార్తా విశేషాలు...

    ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ 19,73,715 మంది కరోనావైరస్ బారిన పడ్డారు. 1,25,910 మంది మృతి చెందారు. 4,85,674 మంది ఈ వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నారు.

    అమెరికాలో కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అమెరికాలో ఇప్పటి వరకు 6,05,193 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 25,757 మంది మరణించారు.

    భారత్‌లో కేసుల సంఖ్య 9,352కు చేరింది 324 మంది మరణించారు.

    తెలంగాణలో మంగళవారం ఒక్కరోజే 52 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 644కు చేరింది. ఏపీలో కోవిడ్ బాధితుల సంఖ్య 486కు పెరిగింది.

    గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇమ్రాన్ ఖేడావాలాకు నిర్వహించిన కరోనా పరీక్షల్లో పాజిటివ్ వచ్చింది.