You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కరోనావైరస్: ప్రపంచవ్యాప్తంగా 20 లక్షలు దాటిన కోవిడ్ కేసులు, 1.28 లక్షల మరణాలు; భారత్లో బాధితులు 11,933, మృతులు 382
ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ కేసులు సంఖ్య 20 లక్షలు దాటింది. అమెరికాలో 6 లక్షలు దాటింది. భారతదేశంలో 11,933కి పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 1,28,886 మంది కోవిడ్ వ్యాధి బారిన పడి చనిపోయారు.
లైవ్ కవరేజీ
బ్రిటన్లో12,868కి చేరిన మృతుల సంఖ్య
- బ్రిటన్లో గత 24 గంటల్లో 761 మంది కరోనా రోగులు చనిపోయారు.
- ఈ మహమ్మారి వల్ల దేశంలో మొత్తం మృతుల సంఖ్య 12868కి చేరింది.
- బ్రిటన్లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 98,746క చేరింది.
13 రోజుల్లోనే 10 లక్షలు పెరిగిన కరోనా కేసులు
ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ రోగుల సంఖ్య 20 లక్షలు చేరింది.
కేవలం 13 రోజుల్లో కరోనా కేసులు రెట్టింపు అయ్యాయంటే ఇది ఎంత వేగంగా వ్యాపిస్తోందో అంచనా వేయచ్చు.
కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏప్రిల్ 2 నాటికి 10 లక్షలకు చేరాయి. ఆ తర్వాత ఏప్రిల్ 15 నాటికి ఈ కేసులు 20 లక్షలు దాటాయి.
వుహాన్లో తాత్కాలిక ఆస్పత్రిని మూసేసిన చైనా
కరోనా వైరస్ వ్యాపించినప్పుడు సెంట్రల్ వుహాన్లో నిర్మించిన తాత్కాలిక ఆస్పత్రుల్లో ఒకదానిని చైనా మూసివేసింది.
జనవరిలో కేవలం పది రోజుల్లో నిర్మించిన ఈ ఆస్పత్రిలో మిగిలిన చివరి రోగులను మంగళవారం వేరే ఆస్పత్రులకు తరలించారు.
సెంట్రల్ హుబే ప్రావిన్సులో ప్రస్తుతం చికిత్స పొందుతున్న రోగుల సంఖ్య 300 లోపే ఉంది. ఈ సంఖ్య ఫిబ్రవరి మొదట్లో 10 వేలకు పైగా ఉండేది.
జనవరిలో ఈ ఆస్పత్రిని నిర్మించడాన్ని కొంతమంది తమ ఇళ్ల నుంచి లైవ్ స్ట్రీమింగ్లో చూశారు.
చైనా ఇప్పుడు మిగతా ప్రపంచానికి సాయం అందించడంపై దృష్టి పెట్టింది.
చైనా తయారు చేస్తున్న మందులు, ఇతర వైద్య పరికరాలను తీసుకెళ్లడానికి ప్రపంచంలోని చాలా దేశాల నుంచి చార్టర్ట్ విమానాలు, సైనిక విమానాలు, కార్గో విమానాల్లా మారిన ప్రయాణికుల విమానాలు దేశంలోకి వస్తున్నాయని ఆ దేశ ప్రముఖ టీవీ చానల్ సీసీటీవీ చెప్పింది.
ఏపీలో 14కు చేరిన కరోనా మృతుల సంఖ్య
ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 7 వరకు జరిగిన కోవిడ్19 పరీక్షల్లో కొత్తగా 23 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
కొత్తగా కర్నూలులో 13, గుంటూరులో 4, కడపలో 3, నెల్లూరులో 2, అనంతపూర్ జిల్లా 1 కేసు నమోదయ్యాయి.
వీటితో కలిపి రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 525కి పెరిగింది
ఇప్పటివరకూ మొత్తం 20మంది డిశ్ఛార్జ్ అయ్యారు.
ముగ్గురు కరోనా వల్ల చనిపోయినట్లు ఈరోజు గుర్తించడంతో మృతుల సంఖ్య 14కు చేరింది.
దిల్లీలో కశ్మీరీ గేట్ దగ్గర గుమిగూడిన కూలీలు
కశ్మీరీ గేట్ సమీపంలో యమునా నది కుదేసియా ఘాట్ దగ్గర వందలాది కార్మికులు లాక్డౌన్ ఉల్లంఘించి భారీగా గుమిగూడారు.
దిల్లీ ప్రభుత్వం వారిని వెంటనే వివిధ ప్రభుత్వ స్కూళ్లలో ఏర్పాటు చేసిన షెల్టర్లకు తరలించింది.
భారత్లో 392కు చేరిన కరోనా మృతులు
భారత్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 11,933కు చేరింది.
భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం ఇప్పటివరకూ కరోనా వల్ల దేశవ్యాప్తంగా 382 మంది చనిపోయారు.
చికిత్స తర్వాత డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1343కు చేరింది. దేశవ్యాప్తంగా రెండో దశ లాక్డౌన్ ప్రారంభమైంది. ఇది మే 3 వరకూ అమలు అవుతుంది.
దేశంలో ఇప్పటివరకూ కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ కాలేదని ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెప్పింది.
మూడు దేశాల్లో కరోనావైరస్ విలయం
ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20 లక్షలకు చేరుకుంది. వీటిలో ఆరు లక్షలకు పైగా కేసులు ఒక్క అమెరికాలోనే నమోదయ్యాయి.
అమెరికా జాన్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం కరోనా డాష్బోర్డ్ గణాంకాల ప్రకారం అమెరికాలో కరోనా పాజిటివ్ రోగుల సంఖ్య 6 లక్షల 9 వేలకు పైనే ఉంది. కరోనా కేసుల్లో స్పెయిన్ రెండో స్థానంలో ఉంది. ఇక్కడ లక్షా 77 వేల మందికి పైగా పైగా కరోనా రోగులు ఉన్నారు. ఇక ఇటలీలో కరోనా రోగుల సంఖ్య లక్షా 62 వేలు దాటింది.
ప్రపంచవ్యాప్తంగా కరోనా వల్ల లక్షా 28 వేల మందికి పైగా మృతిచెందారు. అమెరికాలో ఇప్పటివరకూ 26 వేల మందికి పైగా చనిపోయారు. ఇటలీలో మరణాల సంఖ్య 21 వేలు దాటగా, స్పెయిన్లో 18,759 మృతులు నమోదయ్యాయి.
మొరాదాబాద్లో వైద్య సిబ్బంది, పోలీసులపై రాళ్ళ దాడి
మొరాదాబాద్లో ఒక కోవిడ్-19 రోగి ఇటీవల చనిపోయారు. దాంతో, ఆ రోగి కుటుంబ సభ్యులను క్వారెంటైన్కు తీసుకువెళ్ళడానికి వెళ్ళిన వైద్య సిబ్బంది, పోలీసులపై కొందరు వ్యక్తులు రాళ్ళతో దాడి చేశారు.
స్థానికులు చేసిన ఈ దాడిలో ఒక డాక్టర్, ఫార్మసిస్ట్ సహా ముగ్గురు గాయపడ్డారని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.
ఈ ఘటనపై ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ తీవ్రంగా స్పందించారు. "డాక్టర్లు, వైద్య సిబ్బంది,పారిశుధ్య సిబ్బంది, పోలీసు అదికారులు ఈ సంక్షోభ సమయంలో రాత్రింబగళ్ళు పని చేస్తున్నారు. వారి మీద దాడి చేయడం క్షమించరాని నేరం. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్, ఎన్ఎస్ఏల కింద దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటాం. ప్రబుత్వ ఆస్తులకు కలిగిన నష్టానికి పరిహారం చెల్లించేలా చేస్తాం" అని అన్నారు.
మొరాదాబాద్ సీనియర్ పోలీస్ సూపరింటెండెంట్ అమిత్ పాఠక్ కూడా, "సెక్షన్ 144, ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ల ఉల్లంఘన జరింది. దాడికి బాధ్యులైన వారిపై నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద చర్యలు తీసుకుంటాం" అని అన్నారు.
ఛత్తీస్గఢ్లో 3 నెలల పసిపాపకు కరోనావైరస్
ఛత్తీస్గఢ్ రాజధాని రాయిపూర్లోని ఎయిమ్స్ (ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్)లో కరోనావైరస్ సోకిన మూడు నెలల పాపకు రక్షణ కల్పిస్తున్న నర్సులు.
భారత్లో 170 జిల్లాలు హాట్స్పాట్స్
భారతదేశంలో ఇప్పటివరకు 11,439 మందికి కరోనావైరస్ సంక్రమించింది. ఈ వ్యాధి వల్ల దేశంలో 377 మంది చనిపోయారు. అయితే, 1,305 మంది కోవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ తెలిపారు.
దేశంలోని అన్ని జిల్లాలలను హాట్ స్పాట్, నాన్-హాట్ స్పాట్, గ్రీన్ జోన్లు అనే మూడు వర్గాలుగా విభజించామని ఆయన చెప్పారు.
కోవిడ్ కేసులు అత్యధికంగా ఉన్న జిల్లాలను హాట్ స్పాట్ కేంద్రాల జాబితాలో చేర్చారు. 170 జిల్లాలు హాట్స్పాట్ జోన్లో ఉన్నాయి. అంటే, ఏప్రిల్ 20 తరువాత కూడా ఈ ప్రాంతాల్లో లాక్డౌన్ నుంచి వెసలుబాటు ఉండే అవకాశం లేదు.
అయితే, దేశంలో కమ్యూనిటీ ట్రాన్సిమిషన్ కేసులు లేవని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
WHOపై ట్రంప్ వ్యాఖ్యలు ప్రమాదకరమన్న బిల్, మిలిండా గేట్స్
ప్రపంచ ఆరోగ్య సంస్థకు నిధులను నిలిపివేస్తామని ట్రంప్ ప్రకటించడం ప్రమాదకరమని మైక్రోసాప్ట్ వ్యవస్తాపకుడు బిల్ గేట్స్, ఆయన భార్య మిలిండా గేట్స్ అన్నారు.
ఇది వినడానికి ఎంత ప్రమాదకరంగా ఉందో దాని పర్యవసానం కూడా అంతే ప్రమాదకరంగా ఉంటుందని వార వ్యాఖ్యానించారు.
"ప్రపంచానికి ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ అవసరం మున్నెన్నడూ లేనంత ఎక్కువగా ఉంది" అని గేట్స్ అన్నారు. ఆయన ఆధ్వర్యంలోని మైక్రోసాప్ట్, ప్రపంచ ఆరోగ్య సంస్థకు భారీగా విరాళాలు ఇచ్చే సంస్థల్లో ఒకటి.
జర్మనీలో మూడు వేలు దాటిన మరణాలు
జర్మనీలో ఇప్పటివరకూ కరోనావైరస్ సోకి మరణించినవారి సంఖ్య మూడు వేలు దాటింది.
రాబర్ట్ కోచ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ సమాచారం ప్రకారం గత 24 గంటల్లో జర్మనీలో కరోనావైరస్ కారణంగా 285 మంది మరణించారు.
దీంతో మొత్తం మరణాల సంఖ్య 3,254కు చేరుకుంది.
ఇప్పటివరకూ దేశంలో 1.27 లక్షల మంది కోవిడ్-19 బారినపడ్డారు. వీరిలో సగానికిపైగా మంది కోలుకున్నారు.
డబ్ల్యూహెచ్ఓ అవసరం ఇప్పుడే ఎక్కువ: బిల్ గేట్స్
డబ్ల్యూహెచ్ఓ అవసరం ప్రపంచానికి ఇప్పుడే చాలా ఎక్కువగా ఉందని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ అన్నారు.
డబ్ల్యూహెచ్ఓకు నిధులు నిలిపివేస్తామని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో బిల్ గేట్స్ ఈ వ్యాఖ్య చేశారు.
‘‘ప్రపంచమంతా ఆరోగ్య సంక్షోభం ఎదుర్కంటున్న సమయంలో డబ్ల్యూహెచ్ఓకు నిధులు ఆపేయడం ప్రమాదమని అనిపిస్తుంది. డబ్ల్యూహెచ్ఓ కృషి వల్ల కోవిడ్-19 వ్యాప్తి వేగం తగ్గింది. వాళ్ల పనిని ఆపితే, ఆ స్థానాన్ని ఎవరరూ భర్తీ చేయలేరు’’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.
గుజరాత్లో ఒక్క రోజే 52 కేసులు
ఇవాళ ఒక్క రోజే గుజరాత్లో కొత్తగా 52 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, ఇద్దరు మరణించారని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
ఇప్పటి వరకు గుజరాత్లో మొత్తం కేసుల సంఖ్య 695కు చేరింది. 30 మంది చనిపోయారు.
ఏపీలో 500 దాటిన పాజిటివ్ కేసులు, కొత్తగా 19 కేసులు నమోదు
ఆంధ్రప్రదేశ్లో కరోనావైరస్ బారిన పడిన వారి సంఖ్య 502కు చేరిందని ప్రభుత్వం తెలిపింది.
మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి బుధవారం (ఇవాళ) ఉదయం వరకు నిర్వహించిన కోవిడ్-19 పరీక్షల్లో కొత్తగా 19 కేసులు నిర్ధరణ అయ్యాయి.
పశ్చిమ గోదావరిలో 8, కర్నూల్లో 6, గుంటూరులో 4, కృష్ణ జిల్లాలో ఒక కేసు నమోదయ్యాయి.
రాష్ట్రంలో ఇప్పటి వరకు 16 మంది డిశ్చార్జ్ అయ్యారు. 11 మంది మరణించారు. ప్రస్తుతం 475 మంది చికిత్స పొందుతున్నారు.
లాక్డౌన్కు సంబంధించి కొత్త మార్గదర్శకాలు విడుదలు చేసిన కేంద్రం
‘డబ్ల్యూహెచ్ఓకు వనరులను తగ్గించేందుకు ఇది సమయం కాదు’, ట్రంప్ ప్రకటనపై ఐరాస సెక్రటరీ జనరల్ స్పందన
డబ్ల్యూహెచ్ఓకు నిధులు నిలిపివేస్తామంటూ అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనపై ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ స్పందించారు.
కోవిడ్-19 ఎలా వచ్చింది? ప్రపంచమంతా ఎలా పాకింది? అనే విషయాలపై అవలోకనం చేసుకోవాల్సిన సమయం ఉంటుందని... కానీ, అది ఇప్పుడు మాత్రం కాదని ఆంటోనియో అన్నారు.
డబ్ల్యూహెచ్ఓ కార్యకలాపాలకు వనరులను తగ్గించేందుకు కూడా ఇది సమయం కాదని ఆయన వ్యాఖ్యానించారు.
న్యూజీలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ కూడా డబ్ల్యూహెచ్ఓ మద్దతుగా మాట్లాడారు.
‘‘ఇలాంటి క్షిష్ట సమయంలో మనకు నమ్మకమైన సలహాలు, సమాచారం కావాలి. డబ్ల్యూహెచ్ఓ అవి అందిస్తుంది. ఆ సంస్థకు మా మద్దతు కొనసాగుతుంది’’ అని అన్నారు.
‘‘సంక్షోభం రోజురోజుకీ ముదురుతున్న కొద్దీ ట్రంప్ తన రాజకీయ వ్యూహాలు ఏమిటో బయటపెట్టుకుంటున్నారు. డబ్ల్యూహెచ్ఓను నిందించాలి. చైనాను నిందించాలి. రాజకీయ ప్రత్యర్థులను నిందించాలి. ఇదివరకటి అధ్యక్షులను నిందించాలి’’ అని అమెరికా హౌస్ ఫారెన్ అఫైర్స్ కమిటీ ఛైర్మన్ ఎలియట్ ఎంగెల్ విమర్శించారు.
ఎలియట్ అమెరికాలోని ప్రతిపక్ష డెమొక్రటిక్ పార్టీ నాయకుడు.
భారత్లో 11వేలు దాటిన కేసులు
భారత్లో కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 11 వేలను దాటింది.
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ బుధవారం ఉదయం 8 గంటలకు విడుదల చేసిన సమాచారం ప్రకారం దేశంలో ఇప్పటివరకూ కరోనావైరస్ 11,439 మందికి సోకింది.
వీరిలో 1,305 మంది కోలుకున్నారు. 377 మంది మరణించారు.
9,756 మంది చికిత్స పొందుతున్నారు.
తిరుమలలో మే 3 వరకూ దర్శనం బంద్
తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడి ఆలయంలో దర్శనం కోసం భక్తులను మే 3 వరకూ అనుమతించకూడదని నిర్ణయం తీసుకున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు.
ఆలయంలో పూజలు, వివిధ కార్యక్రమాలన్నింటి నిర్వహణలో సామాజిక దూరం పాటిస్తున్నట్లు ఆయన చెప్పారు.