You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

కరోనావైరస్: తెలంగాణలో 52 కొత్త కేసులతో కలిపి 644కు చేరిన కోవిడ్ బాధితులు, ఏపీలో 483

ప్రపంచవ్యాప్తంగా 20 లక్షలకు చేరువలో కరోనావైరస్ కేసులు, 1.21,897 మంది మృతి. అమెరికాలో 5.83 లక్షల కరోనా బాధితులు, 23,709 మృతులు. కోవిడ్ బాధితుల సంఖ్య 10 వేలు దాటిన భారత్‌లో ఇప్పటివరకు 353 మంది చనిపోయారు.

లైవ్ కవరేజీ

  1. 14వ తేదీ వరకు ముఖ్యాంశాలు...

    • భారత్‌లో దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను మే 3వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు.
    • ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ 19,73,715 మంది కరోనావైరస్ బారిన పడ్డారు. 1,25,910 మంది మృతి చెందారు. 4,85,674 మంది ఈ వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నారు.
    • అమెరికాలో కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అమెరికాలో ఇప్పటి వరకు 6,05,193 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 25,757 మంది మరణించారు.
    • భారత్‌లో కేసుల సంఖ్య 9,352కు చేరింది 324 మంది మరణించారు.
    • తెలంగాణలో కొత్తగా 52 కేసులు నమోదయ్యాయి. దాంతో, రాష్ట్రంలో మొత్తం కోవిడ్ బాధితుల సంఖ్య 644కు చేరింది.
    • ఏపీలో 10 కొత్త కేసులతో కలిపి కోవిడ్ బాధితుల సంఖ్య 483కు పెరిగింది.
  2. గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్, సీఎం, డిప్యూటీ సీఎంను కలిసిన తర్వాత వచ్చిన ఫలితాలు

    గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇమ్రాన్ ఖేడావాలాకు నిర్వహించిన కరోనా పరీక్షల్లో పాజిటివ్ వచ్చింది.

    అంతకు ముందు ఆయన ఈరోజు మధ్యాహ్నం ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్‌ను కలిశారు. వారితో రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై చర్చించారు.

    ముఖ్యమంత్రిని కలిసి వచ్చిన తర్వాత ఆయనకు కరోనా ఉన్నట్టు టెస్ట్ ఫలితాలు వచ్చాయి.

    బీబీసీతో మాట్లాడిన షాపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గ్యాసుద్దీన్ షేక్ జియాసుద్దీన్ దీనిని ధ్రువీకరించారు.

    "ఖేడావాలాకు రెండు రోజుల నుంచి జ్వరం ఉంది. జ్వరం ఉండడంతో వైద్యులు ఆయనకు పరీక్షలు చేశారని, ఈరోజు వచ్చిన ఫలితాల్లో ఆయనకు కరోనా పాజిటివ్ వచ్చింది" అన్నారు.

    గుజరాత్‌లో ఈరోజు బయటపడిన 33 కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 650కి చేరుకుంది.

  3. తెలంగాణలో కొత్తగా 52 కేసులు నమోదు, ఒకే కుటుంబంలో 17 పాజిటివ్ కేసులు

    తెలంగాణలో కొత్తగా ఈరోజు 52 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 516కు చేరింది.

    రాష్ట్రంలో ఈరోజు ఒకరు మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 18కి చేరింది.

    ఈరోజు రాష్ట్రంలో ఏడుగురు డిశ్చార్జ్ అయ్యారు. వీరితో కలిపి ఇప్పటివరకూ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయినవారి సంఖఅయ 110కి చేరింది.

    గ్రేటర్ హైదరాబాద్‌లో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. కొత్త కేసులతో కలిసి ఈ సంఖ్య 249కి చేరింది.

    ఈరోజు నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 644కు చేరింది.

    ఒకే కుటుంబంలో 17 కరోనా పాజిటివ్ కేసులు

    హైదరాబాద్ లో ఒకే కుటుంబానికి చెందిన 17 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు ధ్రువీకరించారు. వీరిలో 10 నెలల శిశువు కూడా ఉన్నట్టు చెబుతున్నారు.

    ఈ కుటుంబానికే చెందిన ఒక 60 ఏళ్ల మహిళ ఏప్రిల్ 10న మృతిచెందడంతో ఇవి వెలుగులోకి వచ్చాయి.

    హైదరాబాద్ తలాబ్‌ కట్ట ప్రాంతంలో నివసించే ఈ కుటుంబానికి చెందిన మొత్తం 41 మందికి కోవిడ్-19 పరీక్షలు నిర్వహించగా వీరిలో 17 మందికి పాజిటివ్ వచ్చింది.

    పాజిటివ్ వచ్చిన అందరినీ గాంధీ ఆస్పత్రికి తరలించిన అధికారులు, ఇదే కుటుంబంలోని మిగతా 24 మందిని క్వారంటైన్‌కు తరలించారు.

    కుటుంబంలోని మహిళకు అసలు వైరస్ ఎలా సోకింది అనేదానిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తెలంగాణలో ఒకే కుటుంబానికి చెందినవారిలో ఇంత మందికి కరోనా పాజిటివ్ రావడం ఇదే మొదటిసారి.

    ఈ కుటుంబంలో 10 నెలల శిశువు నుంచి 12 ఏళ్ల లోపు పిల్లలు ఆరుగురు ఉన్నట్లు సమాచారం.

    భారత్‌లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10,815కు చేరింది.

    దేశంలో ఇప్పటివరకూ కరోనా వల్ల 353 మంది చనిపోయారు.

  4. ఏపీలో ఈరోజు 10 కొత్త కరోనా కేసులు నమోదు

    ఆంధ్రప్రదేశ్‌లో ఈరోజు కొత్తగా పది కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో గుంటూరులో 5, అనంతపురంలో 3, కడప జిల్లాలో 2 కేసులు ఉన్నాయి.

    కొత్త కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 483కు చేరింది.

    ఈరోజు కొత్తగా ఇద్దరు డిశ్చార్జ్ అయ్యారు. వీరితో కలిపి మొత్తం డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 16కు చేరింది.

    కరోనాతో రాష్ట్రంలో 9 మంది మృతిచెందారు.

  5. బ్రిటన్‌లో 12 వేలు దాటిన కరోనా మృతులు

    బ్రిటన్‌లో కరోనా మృతుల సంఖ్య 12 వేలు దాటింది.

    బ్రిటన్‌లో గత 24 గంటల్లో 778 మంది మరణించారు.

    వీటితో కలిపి ఈ మహమ్మారితో బ్రిటన్‌లో చనిపోయిన మొత్తం మృతుల సంఖ్య 12 వేలు దాటింది.

    దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కూడా 93,873కు చేరింది.

  6. ఏపీలో మే 3 వరకూ ఏపీఎస్ఆర్టీసీ రిజర్వేషన్ల నిలిపివేత

    ఆంధ్రప్రదేశ్‌లో అత్యవసర సేవలు అందిస్తున్న 13 వేల మందికి జారీ చేసిన పాసుల కాలపరిమితిని అధికారులు మే 3 వరకూ పొడిగించారు.

    లాక్‌డౌన్ కొనసాగే మే 3 వరకూ ఏపిఎస్ఆర్టీసీ బస్సుల రిజర్వేషన్లు కూడా నిలిపివేశారు.

    ఏపీలో ఇప్పటివరకూ ఎంత మందికి కరోనా పరీక్షలు చేశారు, వీరిలో ఎంతమందికి పాజిటివ్ వచ్చిందో వివరాలు విడుదల చేశారు.

    ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం కరోనా వైద్య పరీక్షలు : 10,505

    పాజిటివ్ కేసులు: 473, నెగటివ్‌ : 10,032

    రాష్ట్రంలో క్వారంటైన్‌ కేంద్రాలు: 338,

    ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నవారు : 5,864

    సిద్ధంగా ఉన్న బెడ్లు : 59,686

    ప్రస్తుతం రాష్ట్రంలోని 473 కేసుల్లో 14 మంది డిశ్చార్జి అయ్యారు.

    ఇప్పటివరకూ కరోనాతో 9 మంది చనిపోయారు. (అనంతపురం 2, కృష్ణ 3, గుంటూరు 2, కర్నూలు 1, నెల్లూరు 1)

    ప్రస్తుతం ఏపీలో 450 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

    ఏపీలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో గుంటూరులో అత్యధికంగా 109 కేసులు నమోదయ్యాయి. కర్నూలులో 91 పాజిటివ్ కేసులు ఉన్నాయి.

  7. గల్ఫ్‌ లో చిక్కుకుపోయిన పాకిస్తాన్ కార్మికులు

    కరోనా మహమ్మారితో గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాలు కోల్పోయిన వేలాది పాకిస్తాన్ కార్మికులు తమను స్వదేశానికి పంపించే ఏర్పాట్లు చేయాలని ఆయా దేశాల ప్రభుత్వాలకు వేడుకుంటున్నారు..

    11 వేల మందికి పైగా పాకిస్తానీ కార్మికులు గత కొన్నిరోజులుగా ఉద్యోగాలు కోల్పోయారు.

    ఆంక్షల వల్ల వారు స్వదేశానికి చేరుకోలేకపోతున్నారు. కొందరు తమ దగ్గర ఉన్న డబ్బు, ఆహారం కూడా అయిపోయాయని చెప్పారు.

    గల్ఫ్ దేశాల్లో ఉన్న 40 వేల మంది పాకిస్తానీల్లో 1800 మందిని పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ మంగళవారం స్వదేశానికి తీసుకొచ్చింది.

    వీరిలో ఎక్కువ మంది మధ్యప్రాచ్యంలోనే ఉన్నారు.

  8. గత 24 గంటల్లో దేశంలో 1463 కరోనా కేసుల నమోదు

    భారత్‌లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10,815కు చేరింది.

    దేశంలో ఇప్పటివరకూ కరోనా వల్ల 353 మంది చనిపోయారు.

    గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1463 కరోనా కేసులు నమోదయ్యాయి.

    ఇప్పటివరకూ ఒకే రోజు నమోదైనకేసుల్లో ఇది అత్యధికం.

    ఇప్పటివరకూ 1190 మంది కరోనా రోగులు డిశ్చార్జ్ అయ్యారని ప్రభుత్వం చెప్పింది.

  9. బాంద్రా స్టేషన్ దగ్గర భారీగా గుమిగూడిన వలస కార్మికులు

    ముంబయి బాంద్రా రైల్వే స్టేషనులో మంగళవారం వేలసంఖ్యలో జనం గుమిగూడారు.

    లాక్‌డౌన్ ఈరోజు నుంచి ఎత్తివేస్తారని, రైళ్ల రాకపోకలు మళ్లీ మొదలవుతాయనే ఆశతో వారంతా అక్కడికి వచ్చారని చెబుతున్నారు.

    బాంద్రా స్టేషన్‌లో గుమిగూడిన వారిలో ఎక్కువ మంది వలస కార్మికులు ఉన్నారు. వారు తమ సొంత రాష్ట్రాలకు వెళ్లడానికి అనుమతించాలని డిమాండ్ చేశారు.

    అయితే స్టేషన్‌లో భారీగా జనం గుమిగూడారనే సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు.

    అందరినీ అక్కడనుంచి వెళ్లిపోవాలని కోరారు. వారిని స్టేషన్ నుంచి వెళ్లగొట్టడానికి లాఠీచార్జి కూడా చేశారు అని ఏఎన్ఐ చెప్పింది.

  10. లాక్‌డౌన్ గురించి డబ్ల్యుహెచ్ఓ ఏం చెబుతోంది?

    అత్యధిక కరోనా కేసులు, మరణాలు నమోదైన తర్వాత కొన్ని దేశాలు, ఆంక్షలు ఎత్తివేయాలని భావిస్తున్నాయి.

    లాక్‌డౌన్ సడలించాలని భావిస్తున్న దేశాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆరు ప్రమాణాలను జారీ చేసింది.

    • కరోనా ట్రాన్స్‌ మిషన్ అడ్డుకోవాలి.
    • వైద్య శాఖ ప్రతి కేసునూ, ప్రతి కాంటాక్టునూ గుర్తించి, ఐసొలేట్ చేసి, వారికి చికిత్స అందించగలిగే సామర్థ్యంతో ఉండాలి
    • ఆస్పత్రులు, నర్సింగ్ హోంలు లాంటి ప్రత్యేక ఏర్పాట్లలో మహమ్మారి వల్ల వచ్చే ప్రమాదాన్ని తగ్గించగలగాలి.
    • ప్రజలు వెళ్లడానికి వీలుగా కార్యాలయాలు, స్కూళ్లు, ఇతర ప్రాంతాల్లో నివారణ చర్యలు పాటించడం చాలా కీలకం.
    • దిగుమతుల సమస్యలను చక్కదిద్దాలి.
    • కొత్త ప్రమాణాలకు తగ్గట్టు నడుచుకునేలా, సర్దుకుపోయేలా సమాజంలో అందరికీ వివరించాలి.

    లాక్‌డౌన్ ఎప్పుడు ఎత్తేయాలి. రెండోసారి వైరస్‌కు గురికాకుండా ఏం చేయాలి అనే విషయంలో చైనా, దక్షిణకొరియా నేర్పిన పాఠాలు ఇవి.

    ఏ దేశమైనా ప్రస్తుతం ఈ ఆరు ప్రమాణాలూ పాటించగలగాలి.

    అయితే పరిస్థితిని మెరుగ్గా ఎదుర్కున్నామని చెబుతున్న చైనా, దేశంల కొత్తగా బయటపడ్డ కరోనా కేసులు బయటి నుంచి వచ్చినవే అని చెబుతోంది.

    పూర్తిగా లాక్‌డౌన్ విధించని దక్షిణ కొరియా కూడా మహమ్మారి వ్యాపించినప్పటి నుంచి స్కూళ్లు మూసేయడం లాంటి ఆంక్షలు విధించింది. విస్తృత పరీక్షలు నిర్వహించింది. అలా కరోనా కేసులను తగ్గించగలిగింది. అది ఎక్కువమందికి వ్యాపించకుండా సమర్థంగా అడ్డుకుంది.

  11. కాలనీలను కంటైనర్లతో సీల్ చేస్తున్న పాక్ పోలీసులు

    కరోనా హై-రిస్క్ కాలనీల్లోకి రాకపోకలను అడ్డుకునేందుకు కరాచీ పోలీసులు భారీ షిప్పింగ్ కంటైనర్లు ఉపయోగిస్తున్నారు.

    "నగరంలో ఘోరంగా ప్రభావితమైన ప్రాంతాలను సీల్ చేశాం, ఆయా ప్రాంతాల్లో టెస్టింగ్ సదుపాయాలను కూడా పెంచుతున్నాం" అని ఆ ప్రాంత ముఖ్యమంత్రి చెప్పారు.

    కానీ కరాచీ నగరంలో మురికివాడలు భారీగా ఉన్నాయి. సామాజిక దూరం పాటించాలని అధికారులు పదే పదే చెబుతున్నా జనం పట్టించుకోవడం లేదు.

    పాకిస్తాన్‌లోని లాహోర్, ముల్తాన్ లాంటి పెద్ద నగరాల్లో కూడా ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది.

    పాకిస్తాన్‌లో 5 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకూ 90 మంది చనిపోయారు.

  12. కరోనావైరస్: యూరప్‌లో తాజా పరిస్థితి

    • స్పెయిన్ దేశంలో నిర్మాణ ప్రాంతాల్లో, పరిశ్రమల్లో కార్యకలాపాలు సోమవారం నుంచి ప్రారంభించేందుకు అనుమతి ఇచ్చింది. ఇటలీ, ఆస్ట్రియా కొన్ని రిటైల్ వ్యాపారాలను పరిమిత స్థాయిలో కొనసాగించేందుకు అనుమతించాయి. సంక్షోభం కొనసాగుతున్నా, ఈ దేశాల్లో ఆహార పదార్థాలు, మందులు అమ్మే దుకాణాలను తెరిచే ఉంచారు.
    • ఐదు వారాల లాక్‌డౌన్ తర్వాత ఇటలీలో పుస్తకాలు, స్టేషనరీ, పిల్లల బట్టల లాంటి కొన్ని షాపులు మళ్లీ తెరిచారు. కంప్యూటర్ల ఉత్పత్తి, పేపర్ తయారీ కూడా మళ్లీ మొదలైంది. కానీ కఠిన నిబంధనలను అమలు చేస్తున్నారు. ఇటలీలో మృతుల సంఖ్య 20,465కు చేరింది. ఇది యూరప్‌లో అత్యధికం. కానీ ఇన్ఫెక్షన్ రేటు తగ్గింది.
    • ఇటలీ తర్వాత దేశంలో లాక్‌డౌన్ అత్యంత కఠినంగా అమలు చేసిన దేశం ఆస్ట్రియా. ఇక్కడ ఇప్పుడు పార్కుల్లో అనుమతిస్తున్నారు. హార్డ్ వేర్, చిన్న షాపులు మళ్లీ తెరిచారు. కానీ జనాలు ఇళ్లలోనే ఉండాలని ఇప్పటికీ కోరుతున్నారు. బయటికి వెళ్లేవారికి మాస్కులు తప్పనిసరి చేశారు.
    • రష్యాలో కోవిడ్-19 ఇన్ఫెక్షన్ల రికార్డు స్థాయిలో పెరిగాయి. గత 24 గంటల్లో 2774 పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు చెప్పారు. దీంతో రష్యాలో మొత్తం కరోనా రోగుల సంఖ్య 21,102కు చేరింది. ఇక్కడ 170 మంది చనిపోయారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన బోల్షోయ్ థియేటర్‌కు చెందిన 34 మంది సభ్యులు కరోనా పాజిటివ్‌గా తేలారు.
    • సైబీరియాలో నిస్ నగరంలోని ఒక కేర్ హోంలో ఉన్న 140 మందికి కరోనా రావడంతో పోలీసులు ఆ హోం మేనేజర్‌ను అరెస్ట్ చేశారు. ఇక్కడ లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి 12 ఏళ్ల జైలు శిక్ష విధిస్తున్నారు.
  13. హీత్రూ విమానాశ్రయం దాదాపు ఖాళీ

    కరోనావైరస్ వల్ల లండన్ హీత్రూ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికుల సంఖ్య 90 శాతం పడిపోయినట్లు అక్కడి అధికారులు చెప్పారు.

    ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో హీత్రూ ఎయిర్‌పోర్ట్ ఒకటి. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే మార్చిలో 52 శాతం ప్రయాణికులు తగ్గారు.

    సరకు రవాణా విమాన సేవలు కొనసాగుతుండడంతో ఈ విమానాశ్రయంలో ప్రస్తుతం రెండు రన్-వేలను మాత్రమే ఉపయోగిస్తున్నారు.

    కరోనావైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా విమానాల్లో ప్రయాణించేవారి సంఖ్య దారుణంగా పడిపోయింది.

    అమెరికాలోని అట్లాంటా హార్ట్స్ ఫీల్డ్-జాక్సన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో మామూలుగా రోజుకు 2600 విమానాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ రద్దీకి తగ్గట్టు ఇక్కడ 63 వేల మంది ఉద్యోగులు పనిచేస్తుంటారు.

    "ప్రస్తుతం మా విమానాశ్రయంలో 1200 విమానాలు తిరుగుతున్నాయి. అవి దాదాపు ఖాళీగా ఉంటున్నాయి". అని ఆ విమానాశ్రయం జనరల్ మేనేజర్ చెప్పారు.

  14. పీపీఈ కిట్ల కోసం షారూఖ్ ఖాన్ విరాళం

    మహారాష్ట్రలో కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న వైద్య సిబ్బంది కోసం 25,000 పీపీఈ కిట్లకు నిధులు అందిస్తున్నట్లు బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ చెప్పారు.

    దేశంలో కరోనా వైరస్ నియంత్రణ కోసం ఇంతకు ముందు షారూఖ్ తన సాయం ప్రకటించారు.

    తన నాలుగు అంతస్తుల ఆఫీసు భవనాన్ని కోవిడ్-19 రోగులకు చికిత్సలు అందించేందుకు ఉపయోగించుకోవచ్చు అని చెప్పిన షారూఖ్, వారికి ఉచిత భోజనం కూడా అందిస్తానని ప్రకటించారు.

  15. లాక్‌డౌన్ ఎత్తివేసే ‘సంపూర్ణ’ అధికారం నాకు ఉంది: ట్రంప్

    కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో అమెరికావ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ను ఎత్తివేసేందుకు తనకు ‘సంపూర్ణ’ అధికారం ఉందని ఆ దేశ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ అన్నారు.

    కానీ, అమెరికా రాజ్యాంగం ప్రకారం శాంతిభద్రతల అంశం రాష్ట్రాల పరిధిలో ఉంటుంది.

    అమెరికా తూర్పు, పశ్చిమ తీరాల్లోని పది రాష్ట్రాలు... ప్రజలు ఇళ్లలోనే ఉండేలా విధించిన కఠినమైన ఆంక్షలను ఎత్తివేయాలని భావిస్తున్నాయి.

    అయితే, ఏ దేశంలోనూ లేనంతగా అమెరికాలో కరోనావైరస్ విజృంభించింది. 5.5 లక్షలకుపైగా మంది దీని బారినపడ్డారు. 23 వేలకుపైగా మంది ప్రాణాలు కోల్పోయారు. ‌న్యూయార్క్‌లో దీని ప్రభావం తీవ్రంగా ఉంది.

    అమెరికా ఆర్థిక వ్యవస్థను తిరిగి తెరుచుకునేలా చేసే ప్రణాళికలకు తమ ప్రభుత్వం తుదిరూపు ఇస్తోందని సోమవారం మీడియాతో ట్రంప్ అన్నారు. మే 1న ఆంక్షలను సడలించవచ్చని సంకేతాలు ఇచ్చారు.

    అయితే, ఒకదాని తర్వాత ఒకటిగా రాష్ట్రాల్లో విధించిన ఆంక్షలను రద్దు చేసే అధికారం అధ్యక్షుడికి ఉంటుందా అని పాత్రికేయులు ట్రంప్‌ను ప్రశ్నించారు.

    దానికి ఆయన.. ‘‘అధికారం సంపూర్ణం... ఆ విషయం గవర్నర్లకు కూడా తెలుసు. కానీ మేం రాష్ట్రాలతో కలిసి వెళ్తాం’’ అని బదులిచ్చారు.

    తనకు సంపూర్ణ అధికారం కల్పించేలా చాలా నిబంధనలు ఉన్నాయని ట్రంప్ అన్నారు. అయితే, అవేంటో ఆయన ప్రస్తావించలేదు.

    రాష్ట్రాల్లో గానీ, ప్రాంతీయ స్థాయిలో గానీ ప్రజా ఆరోగ్యానికి సంబంధించి పెట్టిన ఆంక్షలను ఎత్తివేసే అధికారం అధ్యక్షుడికి ఉండదని న్యాయ నిపుణులు అంటున్నారు.

    ప్రస్తుత ఆంక్షలను ఎత్తివేసే అధికారం తమకు ఉంటుందని కొందరు గవర్నర్లు అంటున్నారు. ట్రంప్ ప్రభుత్వం జోక్యం అవసరం లేకుండానే ఆర్థిక కార్యకలాపాలను తిరిగి ప్రారంభించే ప్రణాళికలపై చర్చిస్తున్నట్లు చెప్పారు.

  16. ఏపీలో కొత్తగా 34 కేసులు... మొత్తం సంఖ్య 473

    ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 34 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకూ రాష్ట్రంలో ఈ ఇన్ఫెక్షన్ బారినపడ్డవారి సంఖ్య 473కు చేరుకుంది.

    ఈ కొత్త కేసులన్నీ సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి మంగళవారం ఉదయం 9 గంటల వరకూ తేలినవి.

    వీటిలో గుంటూరులో 16, కృష్ణలో 8, కర్నూలులో 7, అనంతపూర్‌లో 2, నెల్లూరులో 1 చొప్పున కేసులు నమోదయ్యాయి.

    ఇప్పటివరకూ ఏపీలో కరోనావైరస్ పాజిటివ్ సోకినట్లు నిర్ధారణైనవారిలో 14 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని, తొమ్మిది మంది మరణించారని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ‌అనంతపూర్‌లో ఇద్దరు, కృష్ణలో ముగ్గురు, గుంటూరులో ఇద్దరు, కర్నూలులో ఒకరు, నెల్లూరులో ఒకరు ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొంది.

    గత 24 గంటల్లో 2010 శాంపిల్స్‌ను పరీక్షిస్తే, వాటిలో 41 పాజిటివ్‌గా తేలాయని వెల్లడించింది.

  17. మే 3 వరకూ లాక్‌డౌన్ : ప్రధాని మోదీ

    కరోనావైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు లాక్‌ డౌన్‌ను మే 3వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు.

    కేంద్ర ప్రభుత్వం తొలుత ప్రకటించిన 21 రోజుల లాక్‌డౌన్ గడువు‌ నేటితో ముగుస్తోంది.

    ఈ నేపథ్యంలోనే మంగళవారం మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. లాక్‌డౌన్ పొడగింపు గురించి ప్రకటించారు.

  18. భారత్‌లో పది వేలు దాటిన కేసులు

    భారత్‌లో కరోనావైరస్ పాజిటివ్ కేసులు పది వేల మార్కును దాటాయి.

    కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ మంగళవారం ఉదయం విడుదల చేసిన సమాచారం ప్రకారం దేశంలో ఇప్పటివరకూ నమోదైన కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 10,363.

    వీరిలో 1,035 మంది కోలుకున్నారు. 339 మంది మరణించారు.

    8,988 మంది చికిత్స పొందుతున్నారు.

  19. కరోనాపై పోరాటంలో ‘అతి చిన్న’ మహిళ

    ప్రపంచంలోనే ‘అతి చిన్న’ మహిళ జ్యోతి ఆమ్గె కరోనావైరస్‌పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నారు.

    ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలంటూ మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో పోలీసులతో కలిసి ఆమె ప్రచారం చేస్తున్నారు.

    జ్యోతి వయసు 26 ఏళ్లు. ఎత్తు 64 సెంటీమీటర్లు, అంటే సుమారు రెండు అడుగులు.

  20. ఉదయం 10 గంటలకు ప్రధాని ప్రసంగం

    కరోనావైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు, కేంద్ర ప్రభుత్వం తొలుత ప్రకటించిన 21 రోజుల లాక్‌డౌన్ గడువు ఇవాల్టితో పూర్తవుతుంది.

    ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం 10 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు.

    లాక్‌డౌన్‌ను ఇంకా పొడిగిస్తారా? సడలిస్తారా? అన్నది ప్రధాని ప్రకటించే అవకాశం ఉంది.

    రోజురోజుకీ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో ఇప్పటికే దేశంలోని తెలంగాణ, ఒడిశా, పంజాబ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాలు పొడిగిస్తున్నట్లు ప్రకటించాయి.

    ఈ అంశంపై ఇటీవల రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్సు నిర్వహించి, సుదీర్ఘంగా చర్చించారు.