లాక్డౌన్ ఎత్తేస్తారా? దానిని ఎప్పుడు, ఎలా ముగిస్తారు? ఈ ప్రశ్నకు సమాధానం కోసం మనం గత కొన్ని రోజులుగా రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రకటనలపై ఒక కన్నేద్దాం.
మనకు వేరే దారి లేదు. లాక్డౌన్ కొనసాగించాలి. ఏప్రిల్ 15 తర్వాత కూడా లాక్డౌన్ కొనసాగించాలని నేను గౌరవ ప్రధానమంత్రికి అపీల్ చేస్తున్నాను. దానికి ఏమాత్రం వెనకాడాల్సిన అవసరం లేదు.
-కె.చంద్రశేఖరరావు, తెలంగాణ ముఖ్యమంత్రి
ఏప్రిల్ 14 తర్వాత లాక్డౌన్ కొనసాగించవచ్చు అనిమీడియాలో గత కొన్ని రోజులుగా చెబుతున్నారు. అది చూస్తున్న ప్రజలు పరిస్థితి అర్థం చేసుకుంటున్నారు. ఏప్రిల్ 14 తర్వాత ఏమవుతుంది అనేది ఇప్పుడప్పుడే చెప్పలేం. మా రాష్ట్రంలో ఒక్క కేసు ఉన్నా లాక్డౌన్ తెరవడం మంచిది కాదు.
-అవనీశ్ అవస్థీ, యూపీ హోంశాఖ అదనపు ప్రధాన కార్యదర్శి
కేంద్రం రాష్ట్రాలను దీనిపై సలహా కోరింది. రాష్ట్రాలు తమ పరిస్థితులను బట్టి దీనిపై నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. లాక్డౌన్ అమలు చేసిన మొట్టమొదటి రాష్ట్రంరాజస్థాన్.
-అశోక్ గెహ్లాత్, రాజస్థాన్ ముఖ్యమంత్రి
మహారాష్ట్ర ప్రభుత్వం వివిధ ప్రాంతాల్లో దశలవారీగా లాక్డౌన్ ఎత్తివేయడం గురించి ఆలోచిస్తోంది.
-రాజేశ్ టోపే, ఆరోగ్య మంత్రి, మహారాష్ట్ర
ఏప్రిల్ 14 లేదా ఏప్రిల్ 20న లాక్డౌన్ ఎత్తివేస్తే, అస్సాం బయట ఉన్న అసామియా యువతీయువకులు అందరూ ఒకేసారి రాష్ట్రంలోకి వస్తారు. వారందరినీ 14 రోజులు క్వారంటైన్కు పంపడం అసాధ్యం, ప్రభుత్వం దగ్గర ప్రస్తుతం వారందరినీ పెట్టడానికి తగినన్ని క్వారంటైన్ కేంద్రాలు లేవు.
-హిమంత్ బిస్వా శర్మ, ఆరోగ్య మంత్రి, అస్సాం
ఈ ప్రకటనలన్నీ దేశంలోని పెద్ద రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అధికారులు చేసినవి. ఇవన్నీ చూస్తుంటే ఏప్రిల్ 14 తర్వాత దేశవ్యాప్తంగా ఒకేసారి లాక్డౌన్ ఎత్తివేయడం సాధ్యం కాదు అనే విషయం స్పష్టం అవుతోంది.
కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ వైపు నుంచి కూడా కొన్ని ఆంక్షలు విధిస్తామని చెబుతున్నాయి.
అయితే ఈ లాక్డౌన్ ఎలా ఎత్తివేస్తారు? ప్రభుత్వం బ్లూ ప్రింట్ ఏంటి? ఈ విషయాలను తెలుసుకోడానికి ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియాతో బీబీసీ మాట్లాడింది. ప్రభుత్వం కోవిడ్-19 కోసం ఏర్పాటు చేసిన 11 కమిటీల్లో ఒకదానికి ఆయన అధ్యక్షుడు కూడా.