నరేంద్ర మోదీ: ‘కరోనా ఇంకా ముగియలేదు, పరీక్షలు పెంచండి’

చైనాతో సహా ఇతర దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భారత్‌లో కరోనా పరిస్థితిపై గురువారం మోదీ ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు.

లైవ్ కవరేజీ

  1. చైనాలో కోవిడ్ కేసులు పెరగడంపై డబ్ల్యూహెచ్ఓ ఆందోళన

    చైనాలో కోవిడ్

    ఫొటో సోర్స్, Getty Images

    చైనాలో కోవిడ్ 19 కొత్త వేవ్‌లో కేసులు పెరిగిపోతున్నాయని, ఆస్పత్రులు నిండిపోతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది.

    డబ్ల్యూహెచ్‌ఓ ఎమర్జెన్సీ చీఫ్ డాక్టర్ మైఖేల్ ర్యాన్ మాట్లాడుతూ, రోగుల సంఖ్యను తక్కువగా ఉందని అధికారులు చెబుతున్నప్పటికీ, ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు (ఐసీయూలు) నిండిపోతున్నాయని అన్నారు.

    అయితే, బుధవారం ఈ కొత్త వేరియంట్ కారణంగా ఎవరూ చనిపోయినట్లు సమాచారం లేదు. కానీ, వాస్తవంలో కరోనావైరస్ ప్రభావం ఎక్కువగా ఉందన్న అనుమానాలు వెలువడుతున్నాయి.

    గత కొన్ని రోజులుగా బీజింగ్ సహా పలు నగరాలలో ఆస్పత్రులు కోవిడ్ రోగులతో నిండిపోతున్నాయి.

    2020 నుంచి చైనా జీరో కోవిడ్ పాలసీని అవలంబిస్తోంది. అయితే, ఇటీవల ఈ కఠినమైన కోవిడ్ నిబంధనలపై నిరసనలు వెల్లువెత్తడంతో చైనా ప్రభుత్వం రెండు వారాల క్రితం నియమాలను సడలించింది.

    నిబంధనలు ఎత్తివేసినప్పటి నుంచి కోవిడ్ కేసులలో పెరుగుదల కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో, వృద్ధులు, రిస్క్ ఎక్కువ ఉన్నవారి మధ్య మరణాల రేటు పెరగవచ్చన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

    చైనా అధికారిక సమాచారం ప్రకారం, మంగళవారం అయిదుగురు, సోమవారం ఇద్దరు కరోనా కారణంగా మరణించారు.

    కరోనా మహమ్మారి ప్రస్తుత స్థితి గురించి వాస్తవాలు తెలియజేయాలని డాక్టర్ ర్యాన్ చైనాను కోరారు.