గుజరాత్లో
2002లో నరేంద్రమోదీ ప్రభుత్వం అసాంఘిక శక్తులు, అల్లరిమూకలకు గుణపాఠం నేర్పి,
రాష్ట్రంలో శాంతి నెలకొల్పిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు.
ఏఎన్ఐ వార్తా
సంస్థ కథనం ప్రకారం.. అమిత్ షా గుజరాత్లోని ఖేడా జిల్లా మహుదా పట్టణంలో శుక్రవారం
రాత్రి ఎన్నికల సభలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘అంతకుముందు
కాంగ్రెస్ అధికారంలో ఉన్న రోజుల్లో అల్లర్లు జరుగుతుండేవి. కానీ అసాంఘిక శక్తులు
అల్లర్లను రాజేయటానికి ప్రయత్నించటం 2002 సంవత్సరమే ఆఖరు. అప్పుడు వారికి గుణపాఠం
చెప్పి గుజరాత్ నుంచి పారదోలటం జరిగింది. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ శాశ్వత
శాంతిని నెలకొల్పింది’’ అని ఆయన పేర్కొన్నారు.
గుజరాత్లో 2002 ఫిబ్రవరి 27వ తేదీన గోద్రా రైల్వేస్టేషన్లో సబర్మతి ఎక్స్ప్రెస్లోని రెండు బోగీలకు నిప్పుపెట్టటంతో 58 మంది చనిపోయారు. ఆ ఘటన అనంతరం రాష్ట్రంలో భారీ ఎత్తున మత అల్లర్లు చెలరేగాయి. వేలాది మంది చనిపోయారు.
‘‘అమిత్ షా.. బిల్కిస్ రేపిస్టులను మీరు విడుదల చేశారు’’: ఒవైసీ
అమిత్ షా వ్యాఖ్యలపై ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు.
ఆయన గుజరాత్లోని అహ్మదాబాద్లో ముస్లింలు నివసించే జుహాపురాలో ఒక సభలో మాట్లాడుతూ.. ‘‘2002లో మీరు నేర్పిన పాఠం.. బిల్కిస్ రేపిస్టులను మీరు విడుదల చేస్తారని నేర్పారు. బిల్కిస్ మూడేళ్ల కూతురును హత్యచేసిన హంతకులను విడుదల చేస్తామని నేర్పారు. అహసాన్ జాఫ్రీని హత్య చేయవచ్చునని కూడా మీరు మాకు నేర్పారు’’ అని విమర్శించారు.
‘‘అమిత్ షా, 2020 దిల్లీ అల్లరిమూకలకు మీరు ఏ పాఠం నేర్పారు?’’ అని కూడా ఒవైసీ ప్రశ్నించారు.
వెజాల్పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఎంఐఎం మహిళా అభ్యర్థి జైనాబ్ షేక్ను గెలిపించాలని కోరారు.
‘‘మీరు కాంగ్రెస్ పార్టీకి కానీ, ఆమ్ ఆద్మీ పార్టీకి కానీ ఓటు వేస్తే మీ ఓటు వృధా అవుతుంది. మీ ఓటును ఉపయోగించుకోవటానికి ఏఐఎంఐఎంకు ఓటు వేయండి’’ అని ఒవైసీ వ్యాఖ్యానించారు.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్ 1, 5 తేదీల్లో రెండు విడతలుగా జరుగనున్నాయి.