You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

భారత కొత్త ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్.. ఎన్నికల్లో ఘన విజయం

ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌లో పార్లమెంటు ఉభయసభలైన రాజ్యసభ, లోక్‌సభలకు ఎన్నికైన, నామినేట్ అయిన మొత్తం 780 మంది ఎలక్టర్లకు గాను.. 725 మంది ఓట్లు వేశారు.

లైవ్ కవరేజీ

  1. జమ్మూ కశ్మీర్ పై ఓఐసీ ప్రకటనను ఖండించిన భారత్

    జమ్మూ కశ్మీర్ పై ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోపరేషన్ (ఓఐసీ) చేసిన ప్రకటన మత విద్వేషాలను రగిల్చే విధంగా ఉందని అంటూ భారత్ ఆ ప్రకటనను తీవ్రంగా ఖండించింది.

    ఓఐసీ చేసే ఇలాంటి ప్రకటనలు తీవ్రవాదాన్ని ప్రోత్సహించే మతపరమైన ఎజెండాను ప్రచారం చేసేందుకు అంకితం అయిందనే విషయాన్ని తెలియచేస్తాయని విదేశీ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి అన్నారు.

    ఓఐసీ సెక్రెటరీ జనరల్ చేసిన ప్రకటన మత విద్వేషాలను రగిల్చే విధంగా ఉందని అన్నారు. జమ్మూ, కశ్మీర్ భారత్ లో అంతర్భాగమని, వక్కాణించారు.

    జమ్మూ కశ్మీర్ లో మూడేళ్ళ క్రితం తీసుకున్న నిర్ణయాలకు ఫలితంగా ఇప్పుడిప్పుడేసామాజిక ఆర్ధిక అభివృద్ధి కనిపిస్తోంది" అని అన్నారు.

    "మానవ హక్కులను ఉల్లంఘిస్తూ, సరిహద్దుల్లో ప్రాంతీయ, అంతర్జాతీయ తీవ్రవాదాన్ని ప్రోత్సహించే వారి ఆదేశాల మేరకు ఓఐసీ ఇటువంటి ప్రకటనలు చేస్తోంది" అని అరిందమ్ బాగ్చి అన్నారు.

    కశ్మీర్ లో ఆర్టికల్ 370ను తొలగించి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఓఐసి శుక్రవారం కశ్మీర్‌లో మానవ హక్కుల గురించి ప్రస్తావిస్తూ భారత్ తన నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది.

    ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాల కనుగుణంగా జమ్మూ కశ్మీర్ సమస్యను పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఓఐసి అంతర్జాతీయ సమాజాన్ని కోరింది.

    భారత ప్రభుత్వం 2019లో జమ్మూ కశ్మీర్ ప్రత్యేక హోదాను తొలగించి ఆర్టికల్ 370 ను రద్దు చేసింది.

  2. ఉపరాష్ట్రపతి ఎన్నిక నేడే

    16వ భారత ఉప రాష్ట్రపతి ఎన్నికకు శనివారం ఓటింగ్ జరగనుంది.

    ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పదవీ కాలం ఆగస్టు 10తో ముగుస్తుంది.

    రాజ్యాంగం ప్రకారం ఉపరాష్ట్రపతి రాజ్యసభకు చైర్మన్‌గా కూడా వ్యవహరిస్తారు.

    ఈ సారి ఎన్డీయే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తమ అభ్యర్థిగా జగ్‌దీప్ ధన్‌ఖర్ పేరును ప్రకటించింది.

    మరో వైపు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు మార్గరెట్ ఆల్వాను ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో తమ అభ్యర్థిగా విపక్షాలు ప్రకటించాయి.

    కానీ, బహుజన్ సమాజ్ పార్టీ అధినేత మాయావతి ఎన్డీయే అభ్యర్థి జగ్‌దీప్ ధన్‌ఖర్‌కు తమ మద్దతు ప్రకటించింది.

    జగ్‌దీప్ ధన్‌ఖర్

    రాజస్థాన్‌లోని ఝున్ఝును జిల్లాలో కిథానా గ్రామంలో 1951లో మే 18న, జన్మించారు.

    ఆయన ఐదవ తరగతి వరకు గ్రామంలోనే చదువుకున్నారు.

    ఆ తర్వాత చితోర్ గఢ్ సైనిక్ స్కూలులో చదువుకున్నారు.

    జైపూర్ మహారాజ కాలేజీ నుంచి బి.ఎస్ సి హానర్స్ డిగ్రీ పొందారు

    రాజస్థాన్ యూనివర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌బీ పట్టా సంపాదించారు. ఆయన చదువులో ఎప్పుడూ టాపర్‌గా ఉండేవారు.

    మార్గరెట్ ఆల్వా

    దక్షిణకర్ణాటకకు చెందిన మార్గరెట్ ఆల్వా న్యాయవాద వృత్తిని అభ్యసించారు.

    కాంగ్రెస్‌లో చేరి పలు దశల్లో పార్టీ పదవులను చేపట్టారు.

    1974 నుంచి 1998 వరకు నాలుగుసార్లు రాజ్యసభ సభ్యురాలిగా పనిచేశారు.

    1999లో కర్ణాటకలోని కనారా నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు.

    2009 నుంచి 2012 వరకు ఉత్తరాఖండ్ గవర్నర్‌గా, 2012 నుంచి 2014 వరకు రాజస్థాన్ గవర్నర్‌గా పనిచేశారు. అదే సమయంలో గుజరాత్, గోవా రాష్ట్రాలకు గవర్నర్‌గా అదనపు బాధ్యతలు చేపట్టారు.

  3. హలో, గుడ్ మార్నింగ్!

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీని చూస్తూ ఉండండి. నిన్నటి లైవ్ పేజీకోసం ఇక్కడ క్లిక్ చేయండి.