You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

ఏక్‌నాథ్ శిందే: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం, డిప్యూటీ సీఎంగా ఫడణవీస్

శివసేన రెబెల్ నేత ఏక్‌నాథ్ శిందే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఉపముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు బీజేపీ నేత దేవేంద్ర ఫడణవీస్.

లైవ్ కవరేజీ

  1. 'మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై బీజేపీతో ఎలాంటి చర్చ జరగలేదు' - ఏక్‌నాథ్ షిండే

    మహరాష్ట్ర సీఎం పదవికి ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేయడంతో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై ఉత్కంఠ మొదలైంది.

    కాగా, మంత్రి పదవుల విషయంలో బీజేపీతో ఇప్పటి వరకు ఎలాంటి చర్చ జరగలేదని శివసేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ షిండే స్పష్టం చేశారు.

    ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా తరువాత మంత్రి పదవుల గురించి ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ విషయంలో ఎలాంటి వార్తలను నమ్మవద్దని ఏక్‌నాథ్ షిండే కోరారు.

    "ఎవరికి మంత్రి పదవి ఇస్తారు, ఎవరికి ఎన్ని పదవులు దక్కుతాయి వంటి విషయాల్లో ఇప్పటివరకు బీజేపీతో ఎలాంటి చర్చ జరగలేదు. త్వరలోనే ఈ విషయాలను పరిశీలిస్తాం. అప్పటివరకు ఎలాంటి మంత్రి పదవుల జాబితాను నమ్మవద్దు" అని ఏక్‌నాథ్ షిండే చెప్పారు.

  2. ఈ నల్లరేగడి నేల వ్యవసాయానికి పనికిరాదా.. కర్నూలు జిల్లా రైతులపై ఇక్రిశాట్ అధ్యయనంలో ఏం తేలింది?

  3. 'ఉడుత ఎక్కింది.. హైటెన్షన్ విద్యుత్ లైన్ తెగి పడింది' - ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ హెచ్ హరినాధరావు

    సత్య సాయి జిల్లా తాడిమర్రిలో ఆటోపై హైటెన్షన్ విద్యుత్ తీగ తెగిపడి మహిళా కూలీలు సజీవ దహనమైన ఘటనపై ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ హెచ్ హరినాధరావు స్పందించారు.

    కరంట్ పోల్ మీద ఉడుత ఎక్కడం వల్ల విద్యుత్ తీగ తెగి ఆటోపై పడిందని, ఈ ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోవడం విచారకరమని హరినాధరావు అన్నారు.

    ఈ ఘటనపై విచారణ జరిపి తక్షణం నివేదిక అందించాల్సిందిగా అనంతపురం సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్‌ను ఆదేశించారు.

    ప్రమాదంలో మరణించినవారికి అయిదు లక్షల చొప్పున, గాయపడినవారికి రెండు లక్షల చొప్పున తక్షణ ఆర్థిక సాయం ప్రకటించారు.

    క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని అనంతపురం ఎస్ఈని ఆదేశించారు.

    దీనిపై విజిలెన్స్ కమిటీ కూడా దర్యాప్తు చేస్తుందని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని చర్యలు తీసుకుంటామని సీఎండీ తెలిపారు.

  4. మహారాష్ట్ర: ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా.. మరోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటవుతుందా?

    ముఖ్యమంత్రి పదవికి శివసేన అధినాయకుడు ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేయడంతో మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం మరింత ముదిరింది.

    అసెంబ్లీ వేదికగా జూన్ 30న ఉద్ధవ్ ఠాక్రే బలాన్ని నిరూపించుకోవాలని మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి సూచించారు. దీనికి వ్యతిరేకంగా శివసేన నాయకులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అయితే, దీనిపై స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. ఈ పరిణామాల నడుమ ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

  5. ఫిలిప్పీన్స్ కొత్త అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్

    ఫిలిప్పీన్స్ కొత్త అధ్యక్షుడిగా ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్ ప్రమాణ స్వీకారం చేశారు.

    రోడ్రిగో డ్యుటెర్టె తరువాత పిలిప్పీన్స్ అధ్యక్షుడిగా మార్కోస్ ఎన్నికయ్యారు. ఈ ఏడాది మేలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఆయన 60 శాతం ఓట్లు సాధించారు.

    ఈ విజయంతో మార్కోస్ కుటుంబం ఫిలిప్పీన్స్‌లో తిరిగి అధికారంలోకి వచ్చింది. 1986 తిరుగుబాటు తరువాత మార్కోస్ కుటుంబం అధికారానికి దూరమైంది.

    ఆ దేశంలో మార్కోస్ జూనియర్‌ను ముద్దుగా బాంగ్-బాంగ్ అని కూడా పిలుస్తారు.

    మాజీ అధ్యక్షుడు రోడ్రిగో డ్యుటెర్టె కుమార్తె సారా డ్యుటెర్టె ఫిలిప్పీన్స్ ఉపాధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేశారు.

    మార్కోస్ జూనియర్ గురువారం మనీలాలోని నేషనల్ మ్యూజియంలో స్థానిక సమయం 12.00 గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు. దేశ, విదేశాల నుంచి పలువురు ప్రముఖులను ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించారు.

    మార్కోస్ జూనియర్ తండ్రి ఫెర్డినాండ్ 1965 నుంచి 1986 వరకు ఫిలిప్పీన్స్‌లో అధికారంలో ఉన్నారు.

    కానీ, 1986లో మార్కోస్ కుటుంబానికి వ్యతిరేకంగా లక్షలాది మంది తిరుగుబాటు చేశారు. దాంతో, మార్కోస్ కుటుంబం దేశం విడిచిపెట్టి హవాయికి పయనమైంది. అప్పుడు మార్కోస్ జూనియర్ వయస్సు 28 సంవత్సరాలు.

    దీని తరువాత, మార్కోస్ జూనియర్ 1991లో ఫిలిప్పీన్స్‌కు తిరిగి వచ్చారు.

  6. రాజస్థాన్: నేడు ఉదయ్‌పూర్ చేరుకోనున్న సీఎం అశోక్ గెహ్లాట్.. ఈరోజు జైపూర్‌లో బంద్

    మంగళవారం ఉదయ్‌పూర్‌లో టైలర్ కన్నయ్యలాల్ హత్య సంచలనం సృష్టించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్తతలు నెలకొన్నాయి.

    రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఈరోజు ఉదయపూర్ చేరుకోనున్నారు. వీరితో పాటు హోం శాఖ సహాయ మంత్రి రాజేంద్ర యాదవ్, డీజీపీ ఎంఎల్ లాటర్, ఇతర ఉన్నతాధికారులు కూడా ఉదయ్‌పూర్‌లో పర్యటించనున్నారు.

    మంగళవారం మధ్యాహ్నం ఇద్దరు వ్యక్తులు కన్నయ్యలాల్ దుకాణంలోకి ప్రవేశించి, ఆయన్ను గొంతు కోసి హత్య చేశారు.

    ఇద్దరు ప్రధాన నిందితులను అరెస్టు చేశారని, బుధవారం మొత్తం నలుగురిని అదుపులోకి తీసుకున్నారని రాజస్థాన్ పోలీస్ డీజీపీ ఎంఎల్ లాటర్ బీబీసికి చెప్పారు.

    ఈ హత్యపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ బృందం విచారణ జరుపుతోంది.

    మరోవైపు, జైపూర్‌లో హిందూ సంస్థలు ఒకరోజు బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈరోజంతా బంద్ కొనసాగుతుంది.

    జూలై 3 ఆదివారం భారీ స్థాయిలో నిరసన ప్రదర్శనలు జరిపేందుకు హిందూ సంస్థలు సిద్ధమవుతున్నాయి. సుమారు లక్ష మంది వీధుల్లోకి వచ్చి ఈ నిరసనల్లో పాల్గొంటారని అంచనా.

    కాగా, అన్ని రాజకీయ పార్టీలు, మత సంస్థలు, సాధారణ ప్రజలు సంయమనం పాటించాలని, రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడాలని సీఎం గెహ్లాట్ కోరారు. అశాంతిని, భయానక వాతావరణాన్ని ప్రేరేపించే వీడియోలను షేర్ చేయవద్దని విజ్ఞప్తి చేశారు.

    హత్య తరువాత, ముందు జాగ్రత్త చర్యగా రాజస్థాన్ అంతటా ఇంటర్నెట్ సేవలను నిలిపివేసారు. ఉదయపూర్‌లో 144 సెక్షన్ విధించారు.

  7. సత్య సాయి జిల్లా: బాధిత కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం ప్రకటించిన సీఎం

    శ్రీ సత్యసాయి జిల్లాలో జరిగిన ఆటో ప్రమాదం పట్ల ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ ప్రమాదంలో గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.

    మరణించిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని సీఎం అధికారులను ఆదేశించారు.

    పారిస్‌ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రికి ఘటన వివరాలను సీఎంఓ అధికారులు తెలియజేశారు.

  8. సత్య సాయి జిల్లాలో ఘోర ప్రమాదం.. ఆటోకు హైటెన్షన్ వైర్లు తగిలి అయిదుగురు మహిళా కూలీలు సజీవదహనం

    ఆంధ్రప్రదేశ్‌లోని సత్యసాయి జిల్లా తాడిమర్రి మండలంలో విద్యుత్ వైర్లు తెగి ఆటోపై పడడంతో అయిదుగురు మహిళా కూలీలు అక్కడికక్కడే సజీవదహనమయ్యారు.

    తాడిమర్రి మండలం గుండంపల్లి గ్రామానికి చెందిన 11 మంది కూలీలు పొలం పనుల నిమిత్తం చిల్ల కొండయ్య పల్లి గ్రామానికి ఆటోలు వెళ్తుండగా మార్గమధ్యంలో ఈ ప్రమాదం జరిగింది.

    ఈ ఘటనలో అయిదుగురు మహిళలు చనిపోయారని ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించామని ధర్మవరం రూరల్ సీఐ మన్సురుద్దీన్ బీబీసీతో చెప్పారు.

    సహాయక చర్యలు జరుగుతున్నాయని మరిన్ని వివరాలు తరువాత తెలియజేస్తామని ఆయన అన్నారు.

  9. హలో, గుడ్ మార్నింగ్!

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీ చూస్తూ ఉండండి.

  10. తెలంగాణ: న్యూడ్ చాట్‌లకు ఆహ్వానిస్తారు.. వీడియోలు తీసి బెదిరిస్తారు..