You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

అమిత్ షా: ‘తెలంగాణ నిజాంను, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పీకి పారేస్తాం’

భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ నిర్వహించిన ప్రజా సంగ్రామ యాత్ర రెండో దశ ముగింపు కార్యక్రమంలో అమిత్ షా మాట్లాడుతూ.. ‘‘తెలంగాణలో నిజాంను మార్చేస్తాం. రజాకార్ల ఒడిలో కూర్చున్న కేసీఆర్‌ను మార్చేస్తాం’’ అని ప్రకటించారు.

లైవ్ కవరేజీ

పృథ్వి రాజ్ and ఆలమూరు సౌమ్య

  1. గోధుమల ఎగుమతులపై భారత్ నిషేధం

    గోధుమల ఎగుమతులపై భారతదేశం నిషేధం విధించింది. ఈ నిషేధం తక్షణమే అమలులోకి వచ్చింది.

    దీనికి సంబంధించి ప్రభుత్వం నోటిఫికేషన్‌ను కూడా జారీ చేసింది. దేశీయ మార్కెట్‌లో గోధుమల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక సమాచారం.

    భారతదేశంతో పాటు పొరుగు దేశాలు, అవసరాల్లో ఉన్న ఇతర దేశాల్లో ఆహార భద్రతకు ముప్పు పొంచివుందని ప్రభుత్వం ఆ నోటిఫికేషన్‌లో పేర్కొంది.

    ‘‘దేశంలోని సమగ్ర ఆహార భద్రతను నిర్వహించటానికి, పొరుగు దేశాలు, అవసరాల్లో ఉన్న ఇతర దేశాలకు మద్దతు ఇవ్వటానికి ఈ నిర్ణయం’’ తీసుకున్నట్లు ప్రభుత్వం చెప్పింది.

    అయితే.. ఇప్పటికే కాంట్రాక్టు కుదిరిన ఎగుమతులకు ఈ నిషేధ ఉత్తర్వులు వర్తించవు. అలాగే ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతితో నిర్దిష్ట షరతుల మేరకు ఎగుమతులు కొనసాగుతాయి.

  2. నేడు తెలంగాణకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. ట్విటర్‌లో కేటీఆర్, కవితల ప్రశ్నల వర్షం, సురేఖ అబ్బూరి, బీబీసీ ప్రతినిధి

    భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర నేటితో ముగియనుంది. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడలో నిర్వహిస్తున్న బహిరంగ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొననున్నారు.

    శనివారం సాయంత్రం 5 గంటలకు అమిత్ షా ఈ సభలో పాల్గొనబోతున్నారని బీజేపీ చెబుతోంది

    ఏప్రిల్ 14న అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఆలంపూర్‌లో రెండో విడత పాదయాత్రను బండి సంజయ్ ప్రారంభించారు. ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి జిల్లాల్లో 31 రోజుల పాటు సుమారు 400 కిలోమీటర్లకు పైగా బండి సంజయ్ నడిచారు.

    ఇదిలావుంటే.. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, ఎంఎల్‌సీ కల్వకుంట్ల కవితలు రాష్ట్రానికి అమిత్ షా రాకను స్వాగతిస్తూనే ఆయనపై ప్రశ్నలు సంధించారు.

    తెలంగాణ రాష్ట్రం పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్షా పూరితంగా వ్యవహరిస్తోందని.. తాము అడుగుతున్న ప్రశ్నలకు అమిత్ షా వివరణ ఇవ్వాలని కోరుతూ కేసీఆర్ పలు ప్రశ్నలతో కూడిన పోస్ట్‌ను ట్వీట్ చేశారు.

    ‘‘ఆకాశాన్ని తాకుతున్న ద్రవ్యోల్బనానికి, పెరిగిన నిరుద్యోగం, మతపరమైన అల్లర్లకు మీ సమాధానం ఏంటి? ఈ రోజు మీరు తెలంగాణ ప్రజలను కలిసినప్పుడు గత 8 సంవత్సరాలలో తెలంగాణకు ఒక్క IIT, IIM, IISER, IIIT, NID, మెడికల్ కాలేజీ లేదా నవోదయ పాఠశాలలు ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు విఫలమైందో వివరించాలి’’ అని కవిత ట్విటర్ ద్వారా ప్రశ్నించారు.

  3. ఆంధ్రప్రదేశ్:చలో రాజ్‌భవన్‌కు విద్యార్థి సంఘాల పిలుపు, శంకర్ వడిశెట్టి, బీబీసీ కోసం

    ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో విద్యార్థి సంఘాలు ఆందోళ‌న‌కు పిలుపునిచ్చాయి. విద్యార్థి స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల‌ని, ఖాళీ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేయాల‌ని డిమాండ్ చేస్తూ ఛ‌లో రాజ్ భ‌వ‌న్‌కి పిలుపునిచ్చాయి.

    దాంతో పోలీసులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. రాజ్‌భ‌వ‌న్ రోడ్డులో ఆంక్ష‌లు విధించారు. రాజ్‌భవన్ ముట్టడి పిలుపు చట్ట విరుద్ధమని ప్ర‌క‌టించారు.

    రాజ్‌భవన్ పరిసర ప్రాంతాల్లో సెక్షన్ 144, సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమ‌లులో ఉంద‌ని విజ‌య‌వాడ సీపీ కాంతిరాణా టాటా ప్ర‌క‌టించారు. నిబంధనలు అతిక్రమిస్తే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు.

    వివిధ విద్యార్థి సంఘాలు ఉమ్మ‌డిగా ఈ నిర‌స‌న‌కు పిలుపునిచ్చాయి. ఇప్ప‌టికే ప‌లు సంఘాల కార్యాల‌యాల వ‌ద్ద పోలీసులు నిఘా ఉంచారు. రాజ్‌భ‌వ‌న్ ప‌రిస‌రాల్లో అద‌న‌పు బ‌ల‌గాల‌ను దింపారు.

    ఎట్టి ప‌రిస్థితుల్లోనూ రాజ్‌భ‌వ‌న్ వ‌ద్ద నిర‌స‌న‌ల‌కు అవ‌కాశం లేకుండా చేయాల‌ని పోలీసులు య‌త్నిస్తున్నారు. మ‌రోవైపు గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్ దంప‌తులు తిరుమ‌ల‌లో ప‌ర్య‌టిస్తున్నారు.

  4. దక్షిణాది రాష్ట్రాలను భయపెడుతున్న మరో వైరస్‌, తెలుగు రాష్ట్రాలలో పరిస్థితి ఏంటి?

  5. దిల్లీలో ఘోర అగ్నిప్రమాదం.. 27 మంది మృతి

    దేశ రాజధాని దిల్లీలోని ముండ్కాలో శుక్రవారం సాయంత్రం జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 12 మంది గాయపడ్డారని ఔటర్ డీసీపీ సమీర్ శర్మ తెలిపారు.

    ముండ్కా రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ నాలుగంతస్తుల వాణిజ్య భవనంలో ఈ ప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారని, క్షతగాత్రులను సంజయ్ గాంధీ ఆస్పత్రి, దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ ఆస్పత్రిలకు తరలించి చికిత్స అందిస్తున్నారని దిల్లీ ఔటర్ డిస్ట్రిక్ట్ ఏసీపీ బీబీసీ ప్రతినిధికి చెప్పారు.

    ఈ ప్రమాదంలో ఇప్పటివరకూ 27 మంది మృతదేహాలను వెలికితీసినట్లు దిల్లీ డిప్యూటీ చీఫ్ ఫైర్ ఆఫీసర్ సునీల్ చౌధరి తెలిపారు. భవనంలోని రెండో అంతస్తులో ఎక్కువ మంది చనిపోయినట్లు ఘటనా స్థలంలోని అగ్నిమాపక సిబ్బంది బీబీసీకి వివరించారు.

    ఈ ప్రమాదంలో కొందరి ఆచూకీ తెలియటం లేదని వారి బంధువులు ఆందోళన చెందుతున్నారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డీఆర్ఎఫ్) కూడా సహాయ చర్యల్లో పాల్గొంది. మొత్తం 50 మందిని భవనం నుంచి రక్షించారు.

    ఏఎన్ఐ వార్తా సంస్థ కథనం ప్రకారం.. ఈ భవనంలో కంపెనీలకు ఆఫీసు స్థలాన్ని అద్దెకిస్తుంటారు. మొదటి అంతస్తులో ఉన్న సీసీటీవీ కెమెరాలు, రౌటర్లు తయారు చేసే కంపెనీ ఆఫీసులో తొలుత మంటలు రాజుకున్నాయి. ఈ కంపెనీ యజమానులు పోలీసులు అదుపులో ఉన్నారు.

    ఈ ఘోర అగ్నిప్రమాదం పట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలు తీవ్ర విచారం వ్యక్తంచేశారు.

    ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి 2 లక్షల రూపాయలు పరిహారం అందిస్తామని మోదీ ఒక ట్వీట్‌లో చెప్పారు. అలాగే గాయపడిన వారికి రూ. 50 లక్షలు చొప్పున ఇస్తామన్నారు.

    దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈ అగ్నిప్రమాదం పట్ల దిగ్భ్రాంతి, విచారం వ్యక్తంచేశారు.

    ఈ అగ్నిప్రమాదం గురించి దిల్లీలోని ముండ్కా పోలీస్ స్టేషన్‌కు శుక్రవారం సాయంత్రం 5.45 గంటలకు ఫోన్ ద్వారా సమాచారం అందినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.

  6. బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం

    గుడ్ మోర్నింగ్!

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    అంతర్జాతీయ, జాతీయ, స్థానిక వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీని ఫాలో అవండి.