దేశ రాజధాని దిల్లీలోని ముండ్కాలో శుక్రవారం సాయంత్రం
జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 27 మంది ప్రాణాలు
కోల్పోయారు. మరో 12 మంది గాయపడ్డారని ఔటర్ డీసీపీ సమీర్ శర్మ తెలిపారు.
ముండ్కా రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ నాలుగంతస్తుల
వాణిజ్య భవనంలో ఈ ప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారని,
క్షతగాత్రులను సంజయ్ గాంధీ ఆస్పత్రి, దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ ఆస్పత్రిలకు తరలించి
చికిత్స అందిస్తున్నారని దిల్లీ ఔటర్ డిస్ట్రిక్ట్ ఏసీపీ బీబీసీ ప్రతినిధికి చెప్పారు.
ఈ ప్రమాదంలో ఇప్పటివరకూ 27 మంది మృతదేహాలను వెలికితీసినట్లు దిల్లీ డిప్యూటీ చీఫ్ ఫైర్ ఆఫీసర్ సునీల్ చౌధరి తెలిపారు. భవనంలోని రెండో అంతస్తులో ఎక్కువ మంది చనిపోయినట్లు ఘటనా స్థలంలోని అగ్నిమాపక సిబ్బంది బీబీసీకి వివరించారు.
ఈ ప్రమాదంలో కొందరి ఆచూకీ తెలియటం లేదని వారి బంధువులు ఆందోళన చెందుతున్నారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్) కూడా సహాయ చర్యల్లో పాల్గొంది. మొత్తం 50 మందిని భవనం నుంచి రక్షించారు.
ఏఎన్ఐ వార్తా సంస్థ కథనం ప్రకారం.. ఈ భవనంలో కంపెనీలకు ఆఫీసు స్థలాన్ని అద్దెకిస్తుంటారు. మొదటి అంతస్తులో ఉన్న సీసీటీవీ కెమెరాలు, రౌటర్లు తయారు చేసే కంపెనీ ఆఫీసులో తొలుత మంటలు రాజుకున్నాయి. ఈ కంపెనీ యజమానులు పోలీసులు అదుపులో ఉన్నారు.
ఈ ఘోర అగ్నిప్రమాదం పట్ల రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షాలు తీవ్ర విచారం వ్యక్తంచేశారు.
ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి 2 లక్షల రూపాయలు పరిహారం అందిస్తామని మోదీ ఒక ట్వీట్లో చెప్పారు. అలాగే గాయపడిన వారికి రూ. 50 లక్షలు చొప్పున ఇస్తామన్నారు.
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈ అగ్నిప్రమాదం పట్ల దిగ్భ్రాంతి, విచారం వ్యక్తంచేశారు.
ఈ అగ్నిప్రమాదం గురించి దిల్లీలోని ముండ్కా పోలీస్ స్టేషన్కు శుక్రవారం సాయంత్రం 5.45 గంటలకు ఫోన్ ద్వారా సమాచారం అందినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.