You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘కేటీఆర్.. ఏపీకి రండి.. అభివృద్ధి చూపిస్తా’ – కేసీఆర్ను కలిశాక ఏపీ మంత్రి రోజా ఆహ్వానం
ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి ఆర్.కె. రోజా శుక్రవారం తన కుటుంబంతో సహా హైదరాబాద్లో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావును కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పొరుగు రాష్ట్రం గురించి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడినవని తాను అనుకోవటం లేదన్నారు.
లైవ్ కవరేజీ
వరికూటి రామకృష్ణ
శ్రీశైలం: పూర్వం చెంచులు ప్రారంభించిన ఒక కళ నేటికీ ఎలా కొనసాగుతోంది?
తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా గుండుతో కనిపిస్తే తిరుపతి వెళ్లొచ్చారా అని అడగటం సర్వసాధారణం. అలాగే కారు, జీపుల అద్దాల మీద రంగురంగు చాక్పీసులతో గీసిన చిత్రాలను చూడగానే అది శ్రీశైలం వెళ్లివచ్చిందని చెప్పకుండానే అర్థమై పోతుంది.
అసలు ఈ బొమ్మలు ఎందుకు వేస్తారు? వాటి చరిత్ర ఏమిటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.
ఉత్తర్ ప్రదేశ్: ‘మసీదుల్లో అభ్యంతకర పోస్టర్లు, వస్తువులు’
అయోధ్యలోని అనేక మసీదుల్లో అభ్యంతకర పోస్టర్లు, వస్తువులు విసిరిన ఘటనలో ఏడుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయోధ్యలో మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకు వీరు ప్రయత్నించారని వెల్లడించారు.
ఈ కేసుకు సంబంధించి మహేశ్ కుమార్ మిశ్ర, ప్రత్యూష్ శ్రీవాస్తవ, నితిన్ కుమార్, దీపక్ కుమార్ గౌర్ అలియాస్ గుంజన్, బ్రిజేశ్ పాండే, శత్రుజ్ఞన్ ప్రజాపతి, విమల్ పాండేలను అరెస్టు చేసినట్లు అయోధ్య సీనియర్ ఎస్పీ శైలేష్ కుమార్ పాండే తెలిపారు.
ఇటీవల దిల్లీలోని జహంగీర్పురీలో జరిగిన ఘటనలకు వ్యతిరేకంగా వీరు అయోధ్యలోని మసీదుల్లో అభ్యంతకర పోస్టర్లు, వస్తువులు విసిరినట్లుగా విచారణలో తేలిందని ఎస్పీ వెల్లడించారు.
మొత్తం 11 మంది నిందితులను గుర్తించగా వారిలో నలుగురు పరారీలో ఉన్నారని వివరించారు.
‘చిట్టగాంగ్ పోర్టు ఉపయోగించుకునేందుకు భారత్, బంగ్లాదేశ్ మధ్య కనెక్టివిటీ పెంచాలి’
రెండు దేశాల మధ్య కనెక్టివిటీ మరింత పెంచాలని తద్వారా భారత్లోని ఈశాన్య రాష్ట్రాలు బంగ్లాదేశ్లోని చిట్టగాంగ్ పోర్టును వాడుకోగలుగుతాయని ఆ దేశ ప్రధాని షేక్ హసీనా అన్నారు.
భారత విదేశాంగశాఖ మంత్రి జైశంకర్, ఢాకాలో హసీనాతో భేటీ అయిన సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారని బంగ్లాదేశ్ వార్తా సంస్థ ఢాకా ట్రిబ్యూన్ తెలిపింది.
ఈశాన్య భారత్లోని త్రిపుర, మిజోరాం, మణిపుర్, నాగాలాండ్ రాష్ట్రాలకు చిట్టగాంగ్ పోర్టు దగ్గరగా ఉంటుంది. అందువల్ల దాని సేవలను వినియోగించుకుంటే ఆ రాష్ట్రాల్లో ఆర్థిక కార్యకలాపాలు బాగా పెరిగే అవకాశం ఉంది.
24 గంటల్లో 3,377 కరోనా కొత్త కేసులు
గత 24 గంటల్లో 3,377 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి. 2,496 మంది కోలుకోగా 60 మంది చనిపోయారు. మొత్తం 17,801 కేసులు యాక్టివ్గా ఉన్నాయి.
జో బైడెన్: ‘యుక్రెయిన్కు రూ.2.5 లక్షల కోట్లు సాయం ఇస్తాం’
యుక్రెయిన్కు మరింత సాయం అందించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రతిపాదించారు.
సైనిక, ఆర్థిక, మానవీయ సాయంగా 33 బిలియన్ డాలర్లు అంటే సుమారు రూ.2.5 లక్షల కోట్లు అందించేందుకు ఆయన కాంగ్రెస్ అనుమతి కోరారు. అయితే తాము రష్యాను లక్ష్యంగా చేసుకోవడం లేదని తెలిపారు.
యుక్రెయిన్ తనను తాను రక్షించుకునేందుకు ఈ సాయం ఎంతో అవసరమని బైడెన్ చెప్పుకొచ్చారు.
ఆంటోనియో గ్యుటేరస్: ‘యుద్ధాన్ని ఆపడంలో యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ విఫలమైంది’
ఐక్యరాజ్యసమితి జనరల్ సెక్రటరీ ఆంటోనియో గ్యుటేరస్ యుక్రెయిన్ రాజధాని కీయెవ్లో పర్యటిస్తున్న సమయంలోనే ఆ నగరం మీద రాకెట్ దాడులు జరిగాయి. ఈ నేపథ్యంలో యుద్ధాన్ని ఆపడంలో ఐక్యరాజ్యసమితి సెక్యూరిటీ కౌన్సిల్ విఫలమైందని ఆయన విమర్శించారు.
‘ఇది తీవ్ర నిరాశకు గురి చేస్తోంది. పట్టలేని అసహనం, కోపం వస్తోంది. ఈ యుద్ధాన్ని ముందే నివారించడంలో కానీ ఆపడంలో కానీ యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ విఫలమైందని నేను స్పష్టంగా చెబుతున్నా.’ అని గ్యుటేరస్ అన్నారు.
ఇక యుక్రెయిన్కు సైనిక, ఆర్థిక, మానవీయ సాయంగా 33 బిలియన్ డాలర్లు అందించేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కాంగ్రెస్ను అనుమతి కోరారు.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం
హలో ఆల్, గుడ్ మార్నింగ్! బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం. అంతర్జాతీయ, జాతీయ, స్థానిక వార్తల లైవ్ అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేస్తూ ఉండండి.