హుజూరాబాద్‌‌లో 23,855 ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ విజయం

ఉత్కంఠను రేపిన తెలంగాణలోని హుజురాబాద్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ విజయం సాధించారు. ఆంధ్రప్రదేశ్‌లోని బద్వేల్‌ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ సుధ విజయం సాధించారు.

లైవ్ కవరేజీ

  1. 12వ రౌండ్ ముగిసేసరికి 6523 ఓట్ల ఆధిక్యంలో ఈటల

    హుజురాబాద్ ఉపఎన్నిక కౌంటింగ్‌లో భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధిపత్యం కొనసాగుతోంది.

    12 రౌండ్‌లో ఈటలకు 1217 ఓట్ల ఆధిక్యం లభించింది. ఈ రౌండ్‌లో ఈటలకు 4849 ఓట్లు రాగా, తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌కు 3632 ఓట్లు వచ్చాయి.

    దీంతో ఓవరాల్‌గా ఈటల 6523 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

    అంతకుముందు 11వ రౌండ్‌లో తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌కు 385 ఓట్ల స్వల్ప ఆధిక్యం లభించింది.

    మొత్తంగా 8, 11 రౌండ్‌లలో మాత్రమే టీఆర్‌ఎస్‌కు ఆధిక్యం లభించింది.

  2. ఎనిమిదో రౌండ్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి శ్రీనివాస్ యాదవ్‌కు స్వల్ప ఆధిక్యం... మొత్తంగా ఈటల ముందంజ

    హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఎనిమిదో రౌండ్ ఫలితాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు స్వల్ప ఆధిక్యం లభించింది.

    ఈ ఒక్క రౌండ్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కంటే ఆయనకు 162 ఓట్లు ఎక్కువగా వచ్చాయి.

    అయితే, మొత్తం ఎనిమిది రౌండ్లను కలిపి చూస్తే, శ్రీనివాస్ యాదవ్ కంటే ఈటల 3270 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

    మొదటి రౌండ్ నుంచీ ఈటల ఆధిక్యం కొనసాగుతూనే వచ్చింది. ఒక్క ఎనిమిదో రౌండ్‌లోనే శ్రీనివాస్ యాదవ్‌కు స్పల్ప ఆధిక్యం వచ్చింది. మొత్తంగా చూసినప్పుడు ఈటల ఆధిక్యంలో ఉన్నారు.

  3. వైద్య సేవల నుంచి ప్రజాసేవలోకి

    డాక్టర్ సుధ

    ఫొటో సోర్స్, ysrcp

    కడప జిల్లా బద్వేలు శాసన సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో డాక్టర్ దాసరి సుధ విజయం సాధించారు.

    ఆమె, దివంగత శాసన సభ్యుడు డాక్టర్ వెంకట సుబ్బయ్య భార్య.

    బద్వేలు ఎమ్మెల్యేగా ఉన్న వెంకట సుబ్బయ్య మరణంతో ఆ స్థానానికి ఉప ఎన్నికలు ప్రకటించాల్సి వచ్చింది.

    దాంతో, వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ సుధ ఎన్నికల బరిలోకి దిగారు. భారీ మెజారిటీతో సునాయాసంగా విజయం సాధించారు.

    పూర్తి కథనం కోసం ఈ కింది లింక్‌పై క్లిక్ చేయండి

  4. 3,186కు పెరిగిన ఈటల ఆధిక్యం

    ఈటల

    ఫొటో సోర్స్, EETALA/TWITTER

    హుజూరాబాద్ ఉపఎన్నిక కౌంటింగ్ ఆరో రౌండ్ పూర్తయ్యేనాటికి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధిక్యం 3,186కు పెరిగింది.

    ఈటలకు మొత్తంగా 26,983 ఓట్లు రాగా, టీఆర్‌ఎస్ అభ్యర్థి శ్రీనివాస యాదవ్‌కు 23,797 ఓట్లు వచ్చాయి.

  5. 90 వేల ఆధిక్యంతో బద్వేలులో సుధ గెలుపు

    డాక్టర్ సుధ

    ఫొటో సోర్స్, YCP Badvel

    బద్వేలు ఉప ఎన్నికలో వైసీపీ నాయకురాలు డాక్టర్ దాసరి సుధ భారీ మెజారిటీతో గెలిచారు.

    సమీప పత్యర్థి అయిన బీజేపీ నాయకుడు పి సురేశ్‌పై ఆమె 90 వేలకుపైగా ఓట్ల తేడాతో విజయం సాధించారు.

    ఆమెకు 1,12,072 ఓట్లు దక్కగా, సురేశ్‌కు 21,661 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థికి 6,217 ఓట్లు దక్కాయి. నోటాకు 3,649 ఓట్లు పడ్డాయి.

  6. బద్వేలు ఉప ఎన్నికల్లో విజయం ఖాయం చేసుకున్న వైసీపీ, భారీ మెజార్టీ దిశగా పయనం

    సుధ

    ఫొటో సోర్స్, YCP Badvel

    ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో అధికార వైసీపీ విజయం దిశగా సాగుతోంది.

    ఆపార్టీ అభ్యర్థి డాక్టర్ దాసరి సుధ భారీ ఆధిక్యం దిశగా సాగుతున్నారు. మొత్తం 12 రౌండ్లకు గానూ ఇప్పటి వరకూ 8 రౌండ్ల ఫలితాలు అధికారికంగా ప్రకటించారు. ఆమెకు భారీ ఆధిక్యం కనిపిస్తోంది.

    8 రౌండ్లలో కలిపి మొత్తం వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధ 96,036 ఓట్లు సాధించారు. ఆమెకు సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి పి సురేశ్‌కి 19,028 ఓట్లు దక్కాయి. దాంతో వైసీపీ అభ్యర్థి సుమారుగా 77వేలకు పైబడిన ఓట్ల ఆధిక్యం కనిపిస్తోంది.

    కాంగ్రెస్ తరుపున బరిలో దిగిన మాజీ ఎమ్మెల్యే కమలమ్మకి ఇప్పటి వరకూ 5515 ఓట్లు లభించాయి. మరో 4 రౌండ్ల ఫలితాలు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. అయితే ఇప్పటికే డాక్టర్ సుధ విజయం ఖాయమైంది.

    డాక్టర్ సుధ భర్త డాక్టర్ వెంకట సుబ్బయ్య 2019 సాధారణ ఎన్నికల్లో బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున విజయం సాధించారు.

    అయితే ఆయన కొంతకాలం క్రితం అనారోగ్యంతో మరణించడంతో ఉప ఎన్నికలు తప్పనిసరి అయ్యాయి. ఈ ఎన్నికల బరిలో దిగేందుకు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ విముఖత చూపింది. మరణించిన వారి కుటుంబ సభ్యులు బరిలో ఉండడంతో సంప్రదాయాన్ని అనుసరించి తాము పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు టీడీపీ ప్రకటించింది.

    జనసేన కూడా బరిలో దిగలేదు. కానీ బీజేపీ అభ్యర్థికి మద్దుతుగా నిలిచింది. ఈ నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షం బరిలో లేకపోవడంతో పోటీ ఏకపక్షంగా సాగినట్టు కనిపిస్తోంది. వైసీపీ అభ్యర్థి వైపు ఓటర్లు మొగ్గు చూపడంతో ఆ పార్టీకి భారీ విజయం దక్కుతున్నట్టు స్పష్టమైంది.

    ఈ ఫలితాలు అధికార పార్టీ నేతలను ఆనందంలో ముంచాయి. నామినేషన్లకు ముందే లక్ష ఓట్ల మెజారిటీ సాధించాలని ముఖ్యమంత్రి తన పార్టీ నేతలకు నిర్దేశించారు.

  7. బద్వేలులో 77 వేల ఓట్ల ఆధిక్యానికి సుధ

    సుధ

    ఫొటో సోర్స్, YCP Badvel

    బద్వేలులో వైసీపీ ఆధిక్యం మరింత పెరిగింది.

    తొమ్మిదో రౌండ్ ముగిసేనాటికి వైసీపీ నాయకురాలు డాక్టర్ సుధ.. బీజేపీ అభ్యర్థి పి సురేశ్‌పై 77 వేల ఓట్లు ఆధిక్యంలో ఉన్నారు.

  8. దేశవ్యాప్తంగా ఉప ఎన్నికలలో ఎక్కడ ఎవరు ఆధిక్యంలో ఉన్నారు?

    కౌంటింగ్

    ఫొటో సోర్స్, Getty Images

    హుజూరాబాద్, బద్వేలుతోపాటు దేశంలోని మరికొన్ని నియోజకవర్గాలకూ అక్టోబరు 30న ఉప ఎన్నికలు నిర్వహించారు. మొత్తం 14 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతం దాద్రా నగర్ హవేలీలోని 3 పార్లమెంటు స్థానాలు, 29 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి.

    ప్రస్తుతం ఈ అన్ని నియోజకవర్గాల కౌంటింగ్ జరుగుతోంది.

    ఒక లోక్‌సభ స్థానంలో శివసేన ఆధిక్యంలో ఉండగా, మరోచోట బీజేపీ, వేరొకచోట కాంగ్రెస్ ముందంజలో ఉన్నాయి.

    హిమాచల్ ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి బ్రిగేడియర్ కుశాల్ ఠాకుర్, కాంగ్రెస్ అభ్యర్థి ప్రతిభా సింగ్ మధ్య పోటీ హోరాహోరీగా ఉంది. ఠాకుర్‌పై ప్రతిభ దాదాపు నాలుగు వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

    మధ్యప్రదేశ్‌లోని ఖంద్వారాలో కాంగ్రెస్ అభ్యర్థి రాజ్‌నారాయణ్ సింగ్‌పై బీజేపీ అభ్యర్థి ధ్యానేశ్వర్ పాటిల్ 8,000 పైచిలుకు ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

    మరోవైపు దాద్రానగర్ హవేలీలో బీజేపీ అభ్యర్థి మహేశ్ భాయ్‌పై శివసేన అభ్యర్థి కళాబెన్ దేల్కర్ ఆధిక్యంలో ఉన్నారు.

    అసెంబ్లీ నియోజకవర్గాలలో ఇలా..

    బిహార్‌లోని కుశేశ్వర్ స్థాన్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఆర్జేడీ అభ్యర్థి అమన్ భూషణ్ ఆధిక్యంలో ఉన్నారు. అసోంలోని రెండు నియోజకవర్గాల్లోనూ బీజేపీ ముందంజలో ఉంది.

    హిమాచల్‌లోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ రెండు చోట్ల ఆధిక్యంలో ఉంది. ఒకచోట స్వతంత్ర అభ్యర్థి ముందంజలో ఉన్నారు.

    హరియాణాలో ఒకచోట ఇండియన్ నేషనల్ లోక్ దళ్, మరొకచోట బీజేపీ ఆధిక్యంలో ఉన్నాయి. రాజస్థాన్‌లో రెండు నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ ముందంజలో ఉంది.

    పశ్చిమ బెంగాల్‌లోని ఎన్నికలు నిర్వహించిన నాలుగు స్థానాల్లో రెండు చోట్ల బీజేపీపై తృణమూల్ భారీ ఆధిక్యంలో ఉంది.

  9. హుజూరాబాద్‌లో కొనసాగుతున్న బీజేపీ ఆధిక్యం

    రాజేందర్

    ఫొటో సోర్స్, FACEBOOK/ETELA-RAJENDER

    హుజూరాబాద్‌లో బీజేపీ ఆధిక్యం కొనసాగుతోంది.

    మూడో రౌండ్ ముగిసేనాటికి టీఆర్‌ఎస్ అభ్యర్థి శ్రీనివాస్ యాదవ్‌పై రాజేందర్ 1273 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

  10. బద్వేల్‌లో భారీ ఆధిక్యంలో వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధ

    డాక్టర్ సుధ

    ఫొటో సోర్స్, bbc

    బద్వేలు ఉప ఎన్నిక లెక్కింపు అయిదు రౌండ్లు పూర్తయింది.

    అయిదు రౌండ్లు ముగిససేటప్పటికి వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధ 42,824 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

  11. బద్వేలులో వైసీపీ ఆధిక్యం

    బద్వేలులో వైసీపీ ఆధిక్యంలో ఉంది. 4 రౌండ్ల తర్వాత 32,545 ఓట్ల ఆధిక్యంలో డాక్టర్ సుధ ఉన్నారు.

    బద్వేలు

    ఫొటో సోర్స్, EC

  12. హుజూరాబాద్‌లో బీజేపీ ఆధిక్యం

    హుజూరాబాద్‌లో బీజేపీ ఆధిక్యంలో ఉందని ఎన్నికల కమిషన్ తెలిపింది.

    రెండో రౌండ్ పూర్తయ్యేసరికి 358 ఓట్ల ఆధిక్యంలో ఈటల రాజేందర్ ఉన్నారు.

    బీజేపీ ఆధిక్యం

    ఫొటో సోర్స్, EC

  13. హుజూరాబాద్‌లో ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు ఇలా

    హుజూరాబాద్‌లో ఓట్ల లెక్కింపు కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.

    హుజూరాబాద్‌‌లో ఇలా
    ఫొటో క్యాప్షన్, హుజూరాబాద్‌‌లో ఇలా
    హుజూరాబాద్‌‌లో ఇలా
    ఫొటో క్యాప్షన్, హుజూరాబాద్‌‌లో ఇలా
    BBC

    ఫొటో సోర్స్, హుజూరాబాద్‌‌లో ఇలా

    ఫొటో క్యాప్షన్, హుజూరాబాద్‌‌లో ఇలా
  14. బద్వేలు బాలయోగి పాఠశాలలో

    బద్వేలు ఉప ఎన్నిక ఓట్లను బద్వేలులోని బాలయోగి గురుకుల పాఠశాలలో లెక్కిస్తున్నారు.

    మొత్తం 12 రౌండ్లలో ఓట్లు లెక్కించనున్నారు. మధ్యాహ్నం లోగా తుది ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.

    ఓట్ల లెక్కింపు కోసం 4 హాళ్లలో 28 టేబుళ్లు ఏర్పాటు చేశారు. సూపర్ వైజర్, మైక్రో అబ్జర్వర్ల పర్యవేక్షణలో ఓట్ల లెక్కింపు జరగుతోంది.

    మొత్తంగా 281 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరిగిందని, ఓటింగ్‌లో ఉపయోగించిన ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరిచామని రిటర్నింగ్ అధికారి తెలిపారు. అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ తెరిచామని వివరించారు.

  15. కరీంనగర్ ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీలో హుజూరాబాద్ ఓట్ల లెక్కింపు

    హుజూరాబాద్ ఓట్ల లెక్కింపు
    ఫొటో క్యాప్షన్, హుజూరాబాద్ ఓట్ల లెక్కింపు

    కరీంనగర్‌లోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీలో ఉదయం ఎనిమిది గంటల నుంచి హుజూరాబాద్ ఓట్ల లెక్కింపు ప్రారంభం అయింది.

    ఎమ్మెల్యే పదవికి ఈటల రాజేందర్ రాజీనామాతో ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహించారు. ఆయన బీజేపీ నుంచి బరిలో దిగారు.

    గెల్లు శ్రీనివాస యాదవ్‌ను తమ అభ్యర్థిగా టీఆర్ఎస్ ప్రకటించింది. కాంగ్రెస్ నుంచి బల్మూరి వెంకట నరసింగ రావు పోటీ చేశారు.

    ఈ ముగ్గురు కాకుండా మరో 27 మంది పోటీలో ఉన్నారు. అంటే మొత్తం 30 మంది ఎన్నికల బరిలో ఉన్నారు.

    స్థానిక పరిస్థితులను బట్టి ప్రధాన పోటీ బీజేపీ, టీఆర్ఎస్‌ల మధ్యే ఉంటుందని రాజకీయ నిపుణులు మొదటి నుంచి విశ్లేషిస్తున్నారు. దీంతో ఫలితాలపై అంతటా ఆసక్తి నెలకొంది.

  16. ‘బీబీసీ న్యూస్ తెలుగు’ లైవ్ పేజీకి స్వాగతం

    నమస్త! ‘బీబీసీ న్యూస్ తెలుగు’ లైవ్ పేజీకి స్వాగతం. తెలంగాణలోని హుజూరాబాద్, ఆంధ్రప్రదేశ్‌లోని బద్వేల్ ఉప ఎన్నికల ఫలితాల అప్‌డేట్స్‌తోపాటు బ్రిటన్‌లో జరుగుతున్న కాప్26 సదస్సు, ఇతర జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం ఈ పేజీ చూస్తూ ఉండండి.