హుజురాబాద్ ఉప ఎన్నికలో ప్రలోభాలు, వేధింపులకు గురిచేసినప్పటికీ ప్రజలు తనను
దీవించారని, ఈ విజయాన్ని వారికే అంకితమిస్తున్నానని బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు.
తోలు ఒలిచి చెప్పులు కుట్టించినా వారి రుణం తీర్చుకోలేనిదని వ్యాఖ్యానించారు.
ఈ ఎన్నికల్లో విజయం కోసం వందల కోట్ల రూపాయల డబ్బు, లారీల కొద్ది మద్యం పంపిణీ
చేశారని ఆరోపించారు. చిన్న స్థాయి, పెద్ద స్థాయి ఉద్యోగులపై బెదిరింపులతో పాటు,
ప్రతీ కుటుంబాన్ని వేధించారని ఆక్షేపించారు.
‘‘ఎన్నికల నిర్వహణ కోసం ఎలక్షన్ కమిషన్ నియమించిన ఉద్యోగులు అక్రమాలకు
పాల్పడ్డారు. పోలీసులు, రెవిన్యూ అధికారులు కూడా ఇందులో భాగమయ్యారు.’’
‘‘కులం పేరుతో రాజకీయాలు చేశారు. పోలీసులే దగ్గరుండి ఎస్కార్ట్ చేసి మరీ
డబ్బులు తెప్పించారు. మద్యం పంపిణీ చేశారు. అక్రమాలకు అధికారులే అండగా నిలిచారు.
ఇలాంటి పనులకు పోలీసులు సహాయం చేయడం చాలా బాధాకరం. ఈ చరిత్ర పునరావృతం కాకూడదు.’’
‘‘ఈ అక్రమాలపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తాం. గతం తరహాలోనే రాబోయే
కాలంలో కూడా ప్రజల కోసమే పనిచేస్తాను.’’
‘‘చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఓటుకు డబ్బులు పంచుతున్నారని ప్రజలు ధర్నాలకు
దిగడం హుజురాబాద్లోనే జరిగింది.
75 ఏళ్ల ప్రజాస్వామ్య చరిత్రలో ఇంత చిల్లరగా, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం
చేసేలా జరిగిన ఏకైక ఎన్నిక హుజురాబాద్ ఉప ఎన్నిక. ’’
‘‘ఇక్కడ జరిగిన దోపిడీలు, అక్రమాలు, దుర్మార్గాలను ప్రపంచానికి స్వేచ్ఛగా చూపెట్టలేకపోయాం.
వాటి గురించి రాయలేకపోయాం. కవులు, కళాకారులు, మేధావులు ఇక్కడి పరిస్థితి గురించి
బాధపడ్డారే కానీ గొంతెత్తే ప్రయత్నం చేయలేదు. ప్రజల్ని చైతన్యవంతం చేయడంలో చాలా
పెద్ద లోపం జరిగింది.’’
‘‘కేసీఆర్ ప్రజల్ని, ప్రజాస్వామ్యాన్ని, ధర్మాన్ని నమ్ముకోలేదు. ఇప్పుడే ఆ మూడే
చెంప చెళ్లుమనేలా చేశాయి. తెలుగు
బిడ్డలంతా ఈ ఫలితం కోసం ఎదురుచూశారు.
నా గెలుపును కోరుకున్న వారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నా.’’
‘‘రాబోయే కాలంలో రాష్ట్రంలో నెలకొన్న ‘డబ్బుల రాజ్యం, అణిచివేత రాజ్యం, దోపిడి
రాజ్యం’ ఇలాంటి అంశాలపై పోరాటం చేస్తాం.
అన్యాయాలపై పోరాడే గొంతుకుకు ఈటల అండగా ఉంటారు. సమస్యలపై ఉద్యమించే వారికి
అండగా నిలుస్తాం. ఇక ముందు కూడా ఉద్యమ బిడ్డగానే కొనసాగుతా’’ అని ఈటల పేర్కొన్నారు.
ఈటల రాజేందర్తో పాటు బీజేపీ నాయకుడు జి. వివేక్ కూడా ఉన్నారు.