You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

హుజూరాబాద్‌‌లో 23,855 ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ విజయం

ఉత్కంఠను రేపిన తెలంగాణలోని హుజురాబాద్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ విజయం సాధించారు. ఆంధ్రప్రదేశ్‌లోని బద్వేల్‌ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ సుధ విజయం సాధించారు.

లైవ్ కవరేజీ

  1. ప్రజాతీర్పును శిరసావహిస్తాం- హరీష్ రావు

    హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాలపై తెలంగాణ మంత్రి హరీష్ రావు కూడా వరుస ట్వీట్లు చేశారు.

    ప్రజా తీర్పును శిరసావహిస్తామని ఆయన తన ట్వీట్‌లో తెలిపారు.

    గెలిచినప్పుడు గర్వం ప్రదర్శించలేదన్న హరీష్ రావు, ఓటమి పాలైనప్పుడు కుంగిపోమని అన్నారు.

  2. ‘మీరు మా దేశంలో చాలా పాపులర్.. మా పార్టీలో చేరండి’ - మోదీతో ఇజ్రాయెల్ ప్రధాని

  3. హుజూరాబాద్‌పై కేటీఆర్ ట్వీట్: ‘ఒక్క ఎన్నికల ఫలితానికి అంత ప్రాధాన్యం, ప్రభావం ఉండదు’

    హుజూరాబాద్ ఎన్నికల ఫలితాలపై మంత్రి కేటీఆర్ ఒక ట్వీట్ చేశారు.

    అందులో ఆయన "గత 20 ఏళ్లలో టీఆర్ఎస్ ఎన్నో ఎత్తుపల్లాలను చూసింది. ఈ ఒక్క ఎన్నికల ఫలితానికి పెద్దగా ప్రాధాన్యం, ప్రభావం ఉండదు" అన్నారు.

    గెల్లు శ్రీనివాస్ స్ఫూర్తిదాయకమైన పోరాటం చేశారంటూ అభినందనలు తెలిపారు.

    భవిష్యత్ పోరాటాల్లో ముందుగు సాగేందుకు టీఆర్ఎస్ కార్యకర్తలందరూ మరింత దృఢ సంకల్పంతో పనిచేయాలని కోరుతున్నానని అన్నారు.

  4. ఈటల రాజేందర్: ‘75 ఏళ్ల ప్రజాస్వామ్య చరిత్రలో ఇంత చిల్లరగా ఏ ఎన్నికలూ జరగలేదు’

    హుజురాబాద్ ఉప ఎన్నికలో ప్రలోభాలు, వేధింపులకు గురిచేసినప్పటికీ ప్రజలు తనను దీవించారని, ఈ విజయాన్ని వారికే అంకితమిస్తున్నానని బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు.

    తోలు ఒలిచి చెప్పులు కుట్టించినా వారి రుణం తీర్చుకోలేనిదని వ్యాఖ్యానించారు.

    ఈ ఎన్నికల్లో విజయం కోసం వందల కోట్ల రూపాయల డబ్బు, లారీల కొద్ది మద్యం పంపిణీ చేశారని ఆరోపించారు. చిన్న స్థాయి, పెద్ద స్థాయి ఉద్యోగులపై బెదిరింపులతో పాటు, ప్రతీ కుటుంబాన్ని వేధించారని ఆక్షేపించారు.

    ‘‘ఎన్నికల నిర్వహణ కోసం ఎలక్షన్ కమిషన్ నియమించిన ఉద్యోగులు అక్రమాలకు పాల్పడ్డారు. పోలీసులు, రెవిన్యూ అధికారులు కూడా ఇందులో భాగమయ్యారు.’’

    ‘‘కులం పేరుతో రాజకీయాలు చేశారు. పోలీసులే దగ్గరుండి ఎస్కార్ట్ చేసి మరీ డబ్బులు తెప్పించారు. మద్యం పంపిణీ చేశారు. అక్రమాలకు అధికారులే అండగా నిలిచారు. ఇలాంటి పనులకు పోలీసులు సహాయం చేయడం చాలా బాధాకరం. ఈ చరిత్ర పునరావృతం కాకూడదు.’’

    ‘‘ఈ అక్రమాలపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తాం. గతం తరహాలోనే రాబోయే కాలంలో కూడా ప్రజల కోసమే పనిచేస్తాను.’’

    ‘‘చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఓటుకు డబ్బులు పంచుతున్నారని ప్రజలు ధర్నాలకు దిగడం హుజురాబాద్‌లోనే జరిగింది.

    75 ఏళ్ల ప్రజాస్వామ్య చరిత్రలో ఇంత చిల్లరగా, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా జరిగిన ఏకైక ఎన్నిక హుజురాబాద్ ఉప ఎన్నిక. ’’

    ‘‘ఇక్కడ జరిగిన దోపిడీలు, అక్రమాలు, దుర్మార్గాలను ప్రపంచానికి స్వేచ్ఛగా చూపెట్టలేకపోయాం. వాటి గురించి రాయలేకపోయాం. కవులు, కళాకారులు, మేధావులు ఇక్కడి పరిస్థితి గురించి బాధపడ్డారే కానీ గొంతెత్తే ప్రయత్నం చేయలేదు. ప్రజల్ని చైతన్యవంతం చేయడంలో చాలా పెద్ద లోపం జరిగింది.’’

    ‘‘కేసీఆర్ ప్రజల్ని, ప్రజాస్వామ్యాన్ని, ధర్మాన్ని నమ్ముకోలేదు. ఇప్పుడే ఆ మూడే చెంప చెళ్లుమనేలా చేశాయి. తెలుగు బిడ్డలంతా ఈ ఫలితం కోసం ఎదురుచూశారు.

    నా గెలుపును కోరుకున్న వారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నా.’’

    ‘‘రాబోయే కాలంలో రాష్ట్రంలో నెలకొన్న ‘డబ్బుల రాజ్యం, అణిచివేత రాజ్యం, దోపిడి రాజ్యం’ ఇలాంటి అంశాలపై పోరాటం చేస్తాం.

    అన్యాయాలపై పోరాడే గొంతుకుకు ఈటల అండగా ఉంటారు. సమస్యలపై ఉద్యమించే వారికి అండగా నిలుస్తాం. ఇక ముందు కూడా ఉద్యమ బిడ్డగానే కొనసాగుతా’’ అని ఈటల పేర్కొన్నారు.

    ఈటల రాజేందర్‌తో పాటు బీజేపీ నాయకుడు జి. వివేక్ కూడా ఉన్నారు.

  5. హుజూరాబాద్: ఈ గెలుపు ఈటల రాజేందర్‌దా, బీజేపీదా? బండి సంజయ్ సమాధానమేంటి?

    హుజూరాబాద్‌లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుపు నేపథ్యంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ బీబీసీతో మాట్లాడారు.

  6. అస్సాంలోని 5 అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీ కూటమిదే గెలుపు

    అస్సాం రాష్ట్రంలో జరిగిన 5 ఉప ఎన్నికల్లో బీజేపీ కూటమి విజయం సాధించింది. ఇందులో 3 స్థానాల్లో బీజేపీ గెలుపొందగా... మిగతా రెండు స్థానాల్లో యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ (యూపీపీఎల్) నెగ్గింది.

    భవానీపూర్ నియోజక వర్గంలో ఫణి తాలుక్దార్ (బీజేపీ), మరియానీ స్థానంలో రూప్‌జ్యోత్ కుర్మి, తారా స్థానంలో సుశాంత్ బోర్గోహైన్ గెలుపొందారు.

    యూపీపీఎల్ అభ్యర్థులు గోసాయ్‌గావ్, తమల్పూర్ స్థానాల్లో గెలుపొందారు.

    బీహార్‌లోని రెండు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో నితీశ్ కుమార్ సారథ్యంలోని అధికార జేడీయూ పార్టీ విజయం సాధించింది.

    దీంతో 243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీలో జేడీయూ ఎమ్మెల్యేల సంఖ్య 43 నుంచి 45కు పెరిగింది.

    తారాపూర్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని జేడీయూ అభ్యర్థి రాజీవ్ రంజన్ సింగ్ 3821 ఓట్ల మెజార్టీతో గెలుచుకున్నారు. ఆయనకు మొత్తం 78,966 ఓట్లు పోలయ్యాయి.

    75,145 ఓట్లే సాధించిన ఆర్‌జేడీ అభ్యర్థి అరుణ్ కుమార్ ఓటమి పాలయ్యారు.

    కుశేశ్వర్ స్థాన్ అసెంబ్లీ ఉపఎన్నికలో జేడీయూ అభ్యర్థి అమన్ భూషన్ హజారి 12,698 ఓట్ల మెజార్టీతో, సమీప అభ్యర్థి, ఆర్‌జేడీ నేత గణేశ్ భర్తీపై గెలుపొందారు.

    ఈ ఎన్నికల్లో అమన్‌కు 59,882 ఓట్లు, గణేశ్‌కు 47,184 ఓట్లు నమోదయ్యాయి.

    ఫలితాల అనంతరం ఆర్‌జేడీ నేత తేజస్వీ యాదవ్ ట్వీట్ చేశారు.

    ‘‘పూర్తి సామర్థ్యంతో మేం 2 ఉప ఎన్నిక స్థానాల్లో పోటీ చేశాం. 5 అధికార పార్టీల కూటమికి వ్యతిరేకంగా పోరాడిన మాకు గతంలో కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఓటరు యజమానులకు హృదయపూర్వక ధన్యవాదాలు. అధికారంలోకి వచ్చాక గ్రామాల పరిస్థితిని మరిచిపోయారు. బీహార్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. వారు కోరుకున్నట్లే మార్పు జరుగుతుంది’’ అని ట్వీట్‌లో రాసుకొచ్చారు.

  7. బీజేపీ శ్రేణుల సంబరం

    హుజురాబాద్ ఉపఎన్నికలో బీజేపీ పార్టీ ఘన విజయం సాధించింది. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌పై ఈటల రాజేందర్ గెలుపొందారు. హుజురాబాద్ అసెంబ్లీ స్థానం కైవసం కావడంతో తెలంగాణ బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఈ సంబరాల్లో పాల్గొన్నారు.

  8. ఒకప్పుడు కేసీఆర్‌ కుడిభుజం.. ఈటల రాజేందర్ రాజకీయ ప్రస్థానం..

  9. 23,855 ఓట్ల మెజార్టీతో గెల్లు శ్రీనివాస్‌పై ఈటల రాజేందర్ గెలుపు

    హుజురాబాద్ అసెంబ్లీ స్థానం మళ్లీ ఈటల రాజేందర్ వశమైంది.

    ఉప ఎన్నికలో ఆయన 23,855 ఓట్ల మెజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌పై ఘన విజయం సాధించారు.

    చివరిదైన 22వ రౌండ్‌లో ఈటలకు 1,333 ఓట్ల ఆధిక్యం లభించింది. దీంతో ఓవరాల్‌గా 23,855 ఓట్ల మెజార్టీ లభించింది.

    ఈ రౌండ్‌లో బీజేపీకి 5,048 ఓట్లు రాగా, టీఆర్‌ఎస్‌కు 3,715 ఓట్లు వచ్చాయి.

    పోస్టల్ బ్యాలెట్లతో కలిపి ఈటల ఖాతాలో 1,07,022 ఓట్లు చేరగా... టీఆర్ఎస్‌కు 83,167 ఓట్లు, కాంగ్రెస్‌కు 3014 ఓట్లు పోలయ్యాయి.

    మొత్తం 22 రౌండ్ల పాటు కౌంటింగ్ జరగగా.... కేవలం 8, 11 రౌండ్లలో మాత్రమే టీఆర్ఎస్ పార్టీ ఆధిక్యం కనబరిచింది. మిగిలిన అన్ని రౌండ్లలో బీజేపీ ఆధిపత్యమే కొనసాగింది.

  10. బీజేపీకి 22,735 ఓట్ల ఆధిక్యం

    హుజురాబాద్ ఉప ఎన్నికలో 21 రౌండ్లు పూర్తయ్యేసరికి బీజేపీకి 22,735 ఓట్ల ఆధిక్యం దక్కింది.

    ఈ రౌండ్‌లో ఈటలకు 5151 ఓట్లు, టీఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు 3431 ఓట్లు పోలయ్యాయి.

    ఓవరాల్‌గా బీజేపీ ఖాతాలో 1,01,732 ఓట్లు చేరగా, టీఆర్‌ఎస్‌కు 78,997 ఓట్లు లభించాయి.

  11. 20వ రౌండ్లు పూర్తయ్యేసరికి బీజేపీకి 21,015 ఓట్ల ఆధిక్యం

    హుజురాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ విజయం ఖరారైంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

    20 రౌండ్లు పూర్తయ్యేసరికి ఈటల ఓవరాల్‌గా 21,015 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఈ రౌండ్‌లో బీజేపీకి 5,269 ఓట్లు, తెరాసకు 3,795 ఓట్లు లభించాయి.

    ఓవరాల్‌గా బీజేపీకి 96,581 ఓట్లు, టీఆర్‌ఎస్‌కు 75,566 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ ఖాతాలో 2,767 ఓట్లు ఉన్నాయి.

  12. ఈటలకు 19,541 ఓట్ల ఆధిక్యం

    హుజురాబాద్ ఉపఎన్నిక కౌంటింగ్ 19 రౌండ్లు పూర్తయ్యేసరికి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఓవరాల్‌గా 19,541 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

    ఈ రౌండ్‌లో ఆయన ఏకంగా 3,047 ఓట్ల ఆధిక్యాన్ని సాధించారు.

    19 రౌండ్‌లో ఈటలకు 5,916 ఓట్లు, శ్రీనివాస్ యాదవ్‌కు 2,869 ఓట్లు పోలయ్యాయి.

  13. డాక్టర్ దాసరి సుధకు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అభినందనలు

    బద్వేలు ఉప ఎన్నికలో ఘన విజయం సాధించిన వైసీపీ అభ్యర్థి డాక్టర్ దాసరి సుధను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అభినందించారు.

    శాసన సభ్యురాలిగా డాక్టర్ సుధను గెలిపించిన ప్రజలకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు.

    ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

  14. 18వ రౌండ్‌లోనూ బీజేపీకే ఆధిక్యం

    హుజురాబాద్‌లో ఈటల రాజేందర్ ఆధిక్యం కొనసాగుతోంది. 18వ రౌండ్‌లో ఆయనకు 1,876 ఓట్ల ఆధిక్యం లభించింది. మొత్తమ్మీద ఆయన 16,494 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

    ఈ రౌండ్‌లో ఆయనకు 5,611 ఓట్లు రాగా, గెల్లు శ్రీనివాస్‌కు 3,735 ఓట్లు పోలయ్యాయి.

    ఓవరాల్‌గా బీజేపీకి 85,396 ఓట్లు, తెరాసకు 68,902 ఓట్లు, కాంగ్రెస్ 2,563 ఓట్లు లభించాయి.

  15. కౌంటింగ్ వేళ, టీఆర్ఎస్ పార్టీ ఆఫీసు వద్ద పరిస్థితి ఇదీ..

    హుజూరాబాద్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ముందంజలో ఉన్నారు. ఈ నేపథ్యంలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద దృశ్యాలు ఇవి..

  16. 17వ రౌండ్ ముగిసేసరికి 14,618 ఓట్ల ఆధిక్యంలో ఈటల

    హుజురాబాద్ ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఓవరాల్‌గా 14,618 ఓట్ల ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు.

    17వ రౌండ్ పూర్తయ్యేసరికి బీజేపీకి 79,785 ఓట్లు, తెరాసకు 65,167 ఓట్లు, కాంగ్రెస్‌కు 2,469 ఓట్లు పోలయ్యాయి.

    ఈ రౌండ్‌లో ఈటలకు 5,610, గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు 4,187, వెంకట్ నర్సింగ్ రావుకు 203 ఓట్లు వచ్చాయి.

  17. 13,195 ఆధిక్యంలో ఈటల

    హుజురాబాద్ ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధిక్యం 13,195కు చేరింది. 16 రౌండ్లు పూర్తయ్యే సరికి బీజేపీకి మొత్తం 74,175 ఓట్ల పోలవ్వగా, టీఆర్‌ఎస్‌కు 60,980 ఓట్లు వచ్చాయి.

    ఈ రౌండ్‌లో గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు 3,977 ఓట్లు రాగా, ఈటలకు మరో 1,712 ఓట్లు అధికంగా పోలయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థికి 135 ఓట్లు పోలయ్యాయి.

  18. 15 రౌండ్లు ముగిసేసరికి 11,483 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ

    హుజురాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ జోరు కొనసాగుతోంది. 15 రౌండ్లు పూర్తయ్యేసరికి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 11,483 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

    15వ రౌండ్‌లో బీజేపీకి 5,407, తెరాసకు 3,358, కాంగ్రెస్‌కు 149 ఓట్లు లభించాయి. ఈ రౌండ్‌లో ఈటలకు 2,049 ఓట్ల ఆధిక్యం దక్కింది.

    ఓవరాల్‌గా బీజేపీకి 68,486 ఓట్లు, టీఆర్‌ఎస్‌కు 57,003 ఓట్లు పోలయ్యాయి.

  19. 14వ రౌండ్‌: 9,434 ఓట్ల ఆధిక్యంలో ఈటల

    బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధిక్యం 9,434 ఓట్లకు చేరింది. 14వ రౌండ్‌లో ఆయనకు ప్రత్యర్థి కంటే 1046 ఓట్లు అధికంగా లభించాయి.

    14వ రౌండ్‌లో బీజేపీకి 4,736 ఓట్లు, తెరాసకు 3700 ఓట్లు, కాంగ్రెస్‌కు 152 ఓట్లు లభించాయి. ఓవరాల్‌గా ఈటలకు 63,079, గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు 53,645, వెంకట్ నర్సింగ్ రావుకు 1982 ఓట్లు పోలయ్యాయి.

  20. 13వ రౌండ్‌లోనూ బీజేపీకి ఆధిక్యం

    హుజురాబాద్ ఉప ఎన్నిక కౌంటింగ్‌లో 13వ రౌండ్ ముగిసేసరికి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఓవరాల్‌గా 8,388 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

    13వ రౌండ్‌లో ఈటలకు 4,836, తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌కు 2, 971 ఓట్లు వచ్చాయి. దీంతో ఈ రౌండ్‌లో ఈటలకు 1,865 ఓట్ల ఆధిక్యం లభించింది.

    ఓవరాల్‌గా ఇప్పటివరకు బీజేపీకి 58,333 ఓట్లు, తెరాసకు 49, 945 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ ఖాతాలో 1,830 ఓట్లు ఉన్నాయి.