You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కరోనా లాక్డౌన్: ఏపీలో 162, తెలంగాణలో 229కి చేరిన మొత్తం కేసులు
ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఓ కొత్త కేసు నమోదైంది. దీంతో కరోనా రోగుల సంఖ్య 162కి చేరింది. నలుగురు ఈ వ్యాధి బారినుంచి కోలుకున్నారు. ఒకరు చనిపోయారు. తెలంగాణలో ఈరోజు కొత్తగా 75 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 229కి చేరింది. 11 మంది చనిపోయారు. 32 మంది కోలుకున్నారు.
లైవ్ కవరేజీ
ఆంధ్ర ప్రదేశ్లో మరో కేసు నమోదు
ఏపీలో మరో కరోనావైరస్ పాజిటివ్ కేసు నమోదైంది.
దీంతో మొత్తం కేసుల సంఖ్య 162కు చేరింది.
ఈరోజు విశాఖపట్నంలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది.
ఇప్పటివరకు నలుగురు రోగులు కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
లండన్ నుంచి వచ్చి కరోనా పాజిటివ్ లక్షణాలతో కాకినాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తిని ఉదయం డిశ్చార్జ్ చేశారు.
తాజాగా ఒంగోలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 23 ఏళ్ల యువకుడు కూడా డిశ్చార్జ్ అయ్యారు. ఆయన కూడా యూకే నుంచి ఇండియాకి వచ్చిన తర్వాత కరోనా లక్షణాలతో క్వారంటైన్కు వెళ్లారు.
ప్రధాని పిలుపు మేరకు అంతా దీపాలు వెలిగించండి: కేసీఆర్
ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఆదివారం(ఏప్రిల్ 5) రాత్రి 9 గంటలకు తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా దీపాలు వెలిగించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కోరారు.
కరోనా వైరస్పై పోరుకు సంఘీభావ సంకేతంగా, ప్రజల ఐక్యతను చాటేలా దీపాలు వెలిగించి కార్యక్రమం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
భారత్లో కేసులు 2547.. మృతులు 62
భారత్లో కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 2547కి చేరింది.
వీరిలో 163 మందికి వ్యాధి నయమై డిశ్చార్జి కాగా 62 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని ఫోన్.. కరోనా కట్టడి చర్యలపై సంభాషణ
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు భారత ప్రధాని నరేంద్రమోదీతో ఫోన్లో సంభాషించారు.
కరోనావైరస్ వ్యాప్తి నిరోధానికి తీసుకుంటున్న చర్యలు, ఈ విషయంలో రెండు దేశాల మధ్య సాంకేతిక సహకారానికి సంబంధించి ఇద్దరు నేతలు చర్చించారు.
ఏపీలో 259 మంది ఖైదీల విడుదల
కరోనా వైరస్ నేపథ్యంలో ఇప్పటికే 259 మందిని మధ్యంతర బెయిల్పై విడుదల చేయగా మిగిలిన వారు భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నామని ఏపీ జైళ్ల శాఖ తెలిపింది.
విడుదల అయిన వారంతా ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్, హౌస్ ఐసోలేషన్లో ఉండాలి.
నెల రోజుల తర్వాత తిరిగి వారి వారి జైళ్లకు వెళ్లాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ మహ్మద్ హసన్ రేజా అన్ని జైళ్ల అధికారులకు మార్గదర్శకాలు జారీ చేశారు.
దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడనున్న బ్రిటన్ రాణి
బ్రిటన్ రాణి ఆదివారం దేశ ప్రజలనుద్దేశించి టీవీలో మాట్లాడుతారని బకింగ్హామ్ ప్యాలస్ వర్గాలు ప్రకటించాయి. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ఆమె మాట్లాడతారు.
93 ఏళ్ల రాణి సాధారణంగా క్రిస్మస్ సందేశం వినిపిస్తారు. మిగతా సందర్భాల్లో మాట్లాడడం అరుదు.
తెలంగాణలో కొత్తగా 75 కరోనావైరస్ పాజిటివ్ కేసులు.. మొత్తం 229
తెలంగాణలో శుక్రవారం(ఏప్రిల్ 3, 2020) కరోనావైరస్తో ఇద్దరు మరణించారని.. కొత్తగా 75 పాజిటివ్ కేసులను గుర్తించామని వైద్య, ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు.
శుక్రవారం గుర్తించిన కొత్త కేసులతో కలిపి తెలంగాణలో ఇంతవరకు 229 కేసులు నమోదయ్యాయి.
వీరిలో శుక్రవారం 15 మందితో కలిపి ఇంతవరకు మొత్తం 32 మందికి నయం కాగా వారిని డిశ్చార్జి చేశారు. ప్రస్తుతం తెలంగాణలో 186 యాక్టివ్ కేసులున్నట్లు మంత్రి తెలిపారు.
దిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ నుంచి వచ్చినవారందరినీ గుర్తించామని.. వారిని, వారి కుటుంబీకుల్లో కరోనావైరస్ లక్షణాలున్నవారిని ఐసోలేషన్ కేంద్రాలకు తరలించి పరీక్షలు చేయిస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్రాలకు రూ.17,287.08 కోట్లు విడుదల చేసిన కేంద్రం
ఆంధ్రప్రదేశ్, అస్సాం, హిమాచల్ ప్రదేశ్, కేరళ, మణిపుర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, పంజాబ్, సిక్కిం, తమిళనాడు, త్రిపుర, ఉత్తరాఖండ్, పశ్చిమబెంగాల్లకు 15వ ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారం రావాల్సిన రూ. 6,195.08 కోట్లు సహా మొత్తం రూ.17,287.08 కోట్లను వివిధ రాష్ట్రాలను ఈ కోవిడ్ సంక్షోభ సమయంలో ఆదుకునేందుకు విడుదల చేసినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
, ‘రాజ్యసభ ఎన్నికలు వాయిదా.. కొత్త తేదీలు తరువాత ప్రకటిస్తాం’
రాజ్యసభ ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తారన్నది తరువాత ప్రకటిస్తామని వెల్లడించింది.
ఆర్నెళ్ల వరకు ఏపీలో వైద్యులు, నర్సులు, సిబ్బంది అంతా ఎస్మా పరిధిలోకి..
కరోనా వ్యాప్తి నిరోధానికి చేపడుతున్న చర్యలకు ఎలాంటి విఘాతం కలగకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య సర్వీసులను 6 నెలల పాటు ఎస్మా పరిధిలోకి తీసుకొస్తూ జీవో జారీ చేశారు.
అన్ని వైద్య సర్వీసులు, డాక్టర్లు, నర్సులు, ఆరోగ్య సేవల సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు.. వైద్య పరికరాల కొనుగోలు, రవాణా, నిర్వహణ.. ఔషధాల తయారీ, అంబులెన్సు సర్వీసులు వంటివన్నీ దీని పరిధిలోకి వస్తాయని పేర్కొన్నారు. పనిచేయడానికి ఎవరైనా నిరాకరిస్తే ఈ చట్ట ప్రకారం శిక్షించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది.
ఈ దేశమేమీ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ కాదు: అసదుద్దీన్ ఒవైసీ
‘‘ఈ దేశమేమీ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ కాదు. భారత ప్రజలు కూడా ఆశలు, స్వప్నాలు ఉన్న మనుషులే. భారత ప్రధానమంత్రీ.. 9 నిమిషాల గిమ్మిక్కుల స్థాయికి మా జీవితాలను కుదించేయొద్దు. రాష్ట్రాలకు మీరందించే సాయం ఏమిటి.. పేదలకు మీరందించే ఉపశమనం ఏమిటన్నది మాకు తెలియాలి’’ అని ఏఐఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ట్వీట్ చేశారు.
జ్వరం తగ్గలేదు.. మరికొంత కాలం ఐసోలేషన్లోనే ఉంటాను: బోరిస్ జాన్సన్
తనలో ఇంకా కరోనా వైరస్ లక్షణాలు కనిపిస్తుండడంతో మరికొంత కాలం సెల్ఫ్ ఐసోలషన్లో ఉంటానని బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ తెలిపారు.
సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ వీడియోలో ఆయన తాను ప్రస్తుతం బాగానే ఉన్నప్పటికీ, 7 రోజుల ఐసోలేషన్ పూర్తి చేసుకున్నప్పటికీ ఇంకా శరీర ఉష్ణోగ్రత కొంచెం ఎక్కువగా ఉన్నందున ప్రభుత్వ సూచనల ప్రకారం ఐసోలేషన్లో ఉంటానని చెప్పారు.
సీఎం జగన్కు చంద్రబాబు మరో లేఖ
కరోనావైరస్ను కట్టడి చేయాలంటే ప్రభుత్వ విభాగాలన్నీ సమన్వయంతో పనిచేయాలని టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ మేరకు ఆయన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి లేఖ రాశారు.
రాష్ట్రంలో ప్రస్తుతం అవసరమైన మాస్కులు, పీపీఈ కిట్లు తయారీకి విశాఖలోని మెడ్టెక్ జోన్ను ఉపయోగించుకోవాలని సూచించారు.
రైతుల నుంచి పంటను ప్రభుత్వమే కొనుగోలు చేసి వారిని ఆదుకోవాలని కోరారు. నిత్యవసరాలు, కూరగాయలు ఇళ్ల వద్దే అందుబాటులోకి తేవాలని.. నిత్యవసరాల సరఫరాకు సిటీ బస్సులు, పల్లెవెలుగు సర్వీసులు ఉపయోగించుకోవాలని సూచించారు.
ఆర్టీజీఎస్ను నీరుగార్చడం వల్ల ప్రజలు, ప్రభుత్వం మధ్య వారధి దూరమైందని.. అన్న క్యాంటీన్ల మూసివేత వల్ల ఇప్పుడు పేదలకు రూ. 5 భోజనం దొరికే అవకాశం లేకుండా పోయిందని ఆయన తన లేఖలో విమర్శించారు.
దేశంలో కొత్తగా 336 పాజిటివ్ కేసులు.. మొత్తం 2301.. మరణాలు 56
దేశంలో నిన్నటి నుంచి కొత్తగా మరో 336 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు.
దీంతో మొత్తం కేసుల సంఖ్య 2301కి చేరిందని చెప్పారు.
ఇప్పటివరకు 56 మంది మరణించారని.. నిన్న(గురువారం) ఒక్క రోజే 12 మంది చనిపోయారన్నారు.
కరోనా రోగుల చికిత్సకు నైటింగేల్ ఆసుపత్రి ప్రారంభం
యూకేలో కేవలం తొమ్మిది రోజుల్లో నిర్మించిన ఎన్హెచ్ఎస్ నైటింగేల్ ఆసుపత్రి ప్రారంభమవుతోంది.
కరోనావైరస్ బాధిత రోగులకు ఇంటెన్సివ్ కేర్ చికిత్స అందించేందుకు వీటిని సిద్ధం చేశారు. తూర్పు లండన్లోని ఎక్సెల్ ఎగ్జిబిషన్ సెంటర్ను 4 వేల పడకల ఆసుపత్రిగా మార్చారు.
కరోనా బీరు తయారీని ఆపేసిన కంపెనీ
కరోనా పేరుతో బీరు తయారుచేసే మెక్సికోకు చెందిన కంపెనీ తన ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేసింది. తాజాగా కరోనావైరస్ సంక్షోభం ప్రపంచాన్ని కుదిపేస్తున్న సమయంలో ఈ బీరు సేల్స్ పడిపోయిందన్న ప్రచారం జరుగుతోంది, అయితే, ఆ కంపెనీ దాన్ని ఖండిస్తోంది. మెక్సికోలో తయారయ్యే ఈ బీరును 180 దేశాలకు ఎగుమతి చేస్తున్నారు.
తబ్లిగీ జమాత్కు ఏ దేశం నుంచి ఎంతమంది హాజరయ్యారంటే..
నిజాముద్దీన్లోని మర్కజ్లో నిర్వహించిన తబ్లిగీ జమాత్కు ఏ దేశం నుంచి ఎంతమంది హాజరయ్యారో తెలిపే జాబితా ఇది.
లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారంటూ తండ్రిపై పోలీసులకు ఫిర్యాదు
దిల్లీలోని వసంత్కుంజ్లో 30 ఏళ్ల వ్యక్తి ఒకరు తన తండ్రి లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వద్దన్నా వినకుండా రోజూ బయటకు వెళ్లి వస్తున్నారని ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
కరోనావైరస్ రోగులకు ఆహారం, మందుల సరఫరాకు రోబోలు
చెన్నైలోని స్టాన్లీ వైద్య కళాశాల ఆసుపత్రిలో కోవిడ్-19 రోగులకు, కరోనవైరస్ లక్షణాలున్న రోగులకు ఆహారం, మందులు అందించడానికి రోబోలను వినియోగించడం ప్రారంభించారు.