ఆంధ్రప్రదేశ్లో వివిధ పథకాల లబ్దిదారులకు డీబీటీ విధానంలో
పథకాల పంపిణీకి ఏపీ హైకోర్టు అనుమతించింది.
అంతకుముందు ఎన్నికల కమిషన్ అధికారులు
విధించిన పరిమితిని పాక్షికంగా సడలించింది. ఎన్నికలకు ముందు నగదు పంపిణీకి
అనుమతిచ్చేది లేదంటూ ఈసీ చెప్పగా, పలువురు లబ్దిదారులు కోర్టుని
ఆశ్రయించారు.
దానిపై విచారించిన కోర్టు గురువారం సాయంత్రం తీర్పును ఇచ్చింది. ఈనెల
11నుంచి 13వరకు ఎటువంటి పథకాల పంపిణీకి
అనుమతి లేదని తెలిపింది.
10వ తేదీ ఒక్కరోజుకి
మినహాయింపునిచ్చింది. దాంతో శుక్రవారం నాడే లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేసే
ప్రక్రియకు ఏపీ అధికారులు శ్రీకారం చుట్టారు.
జనవరి 23నాడు బటన్ నొక్కిన ఆసరా పథకానికి రూ. 6,394 కోట్లు, ఫిబ్రవరి 28న బటన్ నొక్కిన వైఎస్సార్ షాదీ తోఫా, కళ్యాణమస్తు
పథకాలకు రూ. 78 కోట్లు, జగనన్న
విద్యాదీవెన కోసం రూ. 708 కోట్లు చొప్పున జమచేయబోతున్నారు. ఈ
పథకానికి మార్చి 1న బటన్ నొక్కారు.
వాటితో పాటుగా రైతుల ఇన్ఫుట్ సబ్సిడీ కింద మార్చి 6న బటన్ నొక్కిన దానికి రూ. 1,294 కోట్లు, వైఎస్సార్ చేయూత పథకానికి మార్చి 7న బటన్ నొక్కిన రూ. 5,060 కోట్లు,మార్చి 14న బటన్ నొక్కిన వైఎస్సార్ ఈబీసీ నేస్తం లబ్దిదారులకు రూ. 629 కోట్లు కలిపి మొత్తం రూ. 14,165 కోట్లను జమచేసేందుకు కోర్టు అనుమతితో ఏపీ అధికారులు సన్నద్ధమయ్యారు.
అయితే ఈ పథకాల గురించి ప్రచారం గానీ, విజయోత్సవాలు గానీ జరపకూడదంటూ కోర్టు షరతు విధించింది.
కోర్టు అనుమతించిన నేపథ్యంలో ఈసీ నుంచి కూడా ఆదేశాలు కోసం ఎదురుచూస్తున్నట్టు ఏపీ ఆర్థిక శాఖ అధికారులు బీబీసీకి తెలిపారు. ఈసీ నుంచి సానుకూల స్పందన వస్తే నిధులు విడుదల చేసేందుకు అంతా సిద్ధం చేశామని అంటున్నారు. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఈసీ ఉత్తర్వులు విడుదల కావాల్సి ఉంది.