కొత్త పార్లమెంటు భవనం భారత్‌కు గర్వ కారణం: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్- Newsreel

ప్రచురణ
చదివే సమయం: 3 నిమిషాలు

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రజలకు ఇచ్చిన సందేశంలో.. పార్లమెంటు సెంట్రల్ విస్టా ప్రాజెక్టును ప్రస్తావించారు.

''పార్లమెంటరీ వ్యవస్థపై మన ప్రజాస్వామ్యం వేళ్లూనుకుంది. భారత 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ కొత్త ప్రాజెక్టును ప్రారంభించడం చరిత్రాత్మక నిర్ణయం. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం అభివృద్ధి పథంలో ఈ ఘట్టం చిరస్మరనీయంగా మిగిలిపోతుంది''అని కోవింద్ అన్నారు.

''మన ప్రజాస్వామ్యం.. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం. అంటే పార్లమెంటు మన ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటిది. ఇది దేశ ప్రజలకు గర్వకారణం''అని ఆయన అన్నారు.

''స్వాతంత్ర్య దినోత్సవం మనకు స్వేచ్ఛా పండుగ. మనకు తెలిసిన, తెలియని అనేక మంది స్వాతంత్ర్య సమరయోధుల పోరాటం ఫలితంగా మనం కలలు కన్న స్వాతంత్ర్యం సిద్ధించింది. వారు గొప్ప త్యాగాలు చేశారు. ఆ అమరవీరులకు నా వందనాలు.''

జమ్మూకశ్మీర్‌లో కొత్త వెలుగులు..

జమ్మూకశ్మీర్‌లో కొత్త వెలుగులు వికసిస్తున్నాయని రామ్‌నాథ్ కోవింద్ అన్నారు.

''ప్రజాస్వామ్యం, చట్టాలను అనుసరించి పాలనపై నమ్మకమున్న అందరితో భారత ప్రభుత్వం చర్చలు మొదలుపెట్టింది. కొత్తగా అందివస్తున్న అవకాశాలను జమ్మూకశ్మీర్ యువత అందిపుచ్చుకోవాలి. తమ ఆకాంక్షలను ప్రజాస్వామ్యబద్ధమైన సంస్థల సాయంతో నెరవేర్చుకోవాలి''అని ఆయన అన్నారు.

కరోనావైరస్ వ్యాప్తి నడుమ భారత్ ఎదుర్కొంటున్న ఇబ్బందులను కూడా రామ్‌నాథ్ ప్రస్తావించారు. టోక్యో ఒలింపిక్స్‌లో అద్భుత ప్రదర్శనతో పతకాలు సాధించిన క్రీడాకారులను ఆయన అభినందించారు.

నరేంద్ర మోదీ: ఆగస్టు 14ను 'పార్టిషన్ హారర్స్ రిమెంబరెన్స్ డే'గా పాటిద్దామన్న ప్రధాని

భారత స్వాతంత్ర్య దినం ఆగస్టు 15కు ఒక రోజు ముందు ఆగస్టు 14ను 'పార్టిషన్ హారర్స్ రిమెంబరెన్స్ డే' (దేశ విభజన బీభత్స స్మృతి దినం)గా పాటిద్దామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.

"దేశ విభజన గాయాలను ఎప్పటికీ మరిచిపోలేం. ఆ మతి లేని ద్వేషపూరిత హింసకు మన సోదర సోదరీమణులు లక్షలాది మంది బలయ్యారు. మన ప్రజల బాధలు, త్యాగాలను స్మరించుకునేందుకు ఆగస్ట్ 14ను 'పార్టిషన్ హారర్స్ రిమెంబరన్స్ డే'గా పాటిద్దాం" అని మోదీ ట్వీట్ చేశారు.

"దేశ విభజన సమయంలో జరిగిన దారుణాల స్మృతి దినం సామాజిక విభజన, అసమానత అనే విషాన్ని తొలగించి ఐకమత్యం, సామాజిక సామరస్యం, మానవ సాధికారతను మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని మనకు గుర్తు చేస్తూనే ఉండాలి" అని మరో ట్వీట్‌లో చెప్పారు.

బీబీసీ మాస్కో ప్రతినిధికి వీసా నిరాకరించిన రష్యా

మాస్కోలోని తమ ప్రతినిధి వీసా పునరుద్ధ రణను నిరాకరించడాని బీబీసీ ఖండించింది. ఇది మీడియా స్వేచ్ఛపై ప్రత్యక్ష దాడి అని వ్యాఖ్యానించింది.

ప్రస్తుతం మాస్కోలో ఉన్న సారా రెయిన్స్‌ఫోర్డ్‌ 'బహిష్కరణ' గురించి పునరాలోచించాలని బీబీసీ రష్యా అధికారులను కోరింది.

వీసా గడువు ముగియడంతో ఈ నెలాఖరు లోపు రెయిన్స్‌ఫోర్డ్ తమ దేశాన్ని వీడి వెళ్లాల్సి ఉంటుందని రష్యా అధికారిక మీడియా ప్రకటించింది.

రష్యా జర్నలిస్టులకు బ్రిటన్ వీసాలు నిరాకరించినందుకు ప్రతీకారంగానే ఈ చర్యలు తీసుకున్నట్లు ఆ ప్రకటనలో తెలిపింది.

"సారా రెయిన్స్‌ఫోర్డ్ స్వదేశానికి తిరిగి వెళ్తున్నారు. మాకున్న సమాచారం ప్రకారం ఈ బీబీసీ మాస్కో ప్రతినిధి వీసాను పొడిగించడం లేదు. ఎందుకంటే, మీడియా రంగంలో బ్రిటన్ మా నియమాలన్నింటినీ ఉల్లంఘించింది" అని చెబుతూ, "దానికి తగిన ప్రతిస్పందనే సారా రెయిన్స్‌ఫోర్డ్ బహిష్కరణ" అని ఆ ప్రకటనలో వెల్లడించారు.

దీనిపై బీబీసీ డైరెక్టర్ జనరల్ టిమ్ డేవ్ కూడా స్పందించారు.

"సారా రెయిన్స్ ఫోర్డ్ బహిష్కరణ మీడియా స్వేచ్ఛపై ప్రత్యక్ష దాడి. దీనిని మేం నిస్సంకోచంగా ఖండిస్తున్నాం. సారా అసాధారణమైన, నిర్భయంగా వ్యవహరించే జర్నలిస్ట్. రష్యన్ అనర్గళంగా మాట్లాడే సారా అంతకు ముందు సోవియట్ యూనియన్ గురించి స్వతంత్ర, లోతైన రిపోర్టింగ్ చేశారు. ఆమె ప్రపంచవ్యాప్తంగా ఉన్నకోట్లాది బీబీసీ ప్రేక్షకులకు వార్తలు అందిస్తున్నారు" అని అన్నారు.

"ఈ నిర్ణయంపై పునరాలోచించాలని మేం రష్యా అధికారులను కోరుతున్నాం. ఈలోపు మేం ఆ ప్రాంతంలో ఘటనలను స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా రిపోర్ట్ చేయడం కొనసాగిస్తాం" అని టిమ్ అన్నారు.

ఒక బ్రిటిష్ జర్నలిస్టును రష్యా నుంచి బహిష్కరించడం పదేళ్లలో ఇదే మొదటిసారి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)