You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
హయా సోఫియాలో 86 ఏళ్ల తరువాత ప్రార్థనలు
హయా సోఫియాను మళ్లీ మసీదుగా మార్చాలని టర్కీ అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చిన తరువాత తొలిసారి శుక్రవారం నాడు ఇస్లాం మత ప్రార్థనల కోసం తెరుచుకుంది.
"ముస్లింలు ఎంతో ఉద్వేగంగా ఉన్నారు. ప్రారంభ ప్రార్థనలలో పాల్గొనాలన్న ఉత్సాహం అందరిలో కనిపిస్తోంది" అని ఇస్తాంబుల్ గవర్నర్ అలీ యెర్లికయా అన్నారు.
1500 ఏళ్ల చరిత్రగల ఈ ప్రపంచ వారసత్వ సంపద 1934 నుంచీ మ్యూజియంగా కొనసాగుతోంది.
ఈ నెల మొదట్లో టర్కీ కోర్టు.. హయా సోఫియా భవనం మసీదుగా తప్ప మరే విధంగానూ కొనసాగడం చట్టబద్ధంగా సాధ్యం కాదని తీర్పునిస్తూ అందులో ఉన్న మ్యూజియంను రద్దు చేసింది.
ఆ తరువాత, జులై 24 (శుక్రవారం) నుంచి ఈ భవనం మత ప్రార్థనలకు తెరుచుకుంటుందని టర్కీ అధ్యక్షుడు రెసెప్ ఎర్దవాన్ ప్రకటించారు.
ఈ భవనాన్ని మసీదుగా మార్చాలన్న నిర్ణయంపై ప్రపంచవ్యాప్తంగా అనేక మత, రాజకీయ వర్గాల నుంచి విమర్శలు వచ్చాయి.
ఒకప్పటి చర్చి, మసీదుగా మారి తరువాత మ్యూజియం అయిన ఈ భవనం మళ్లీ మసీదుగా మారింది.
ప్రార్థనలు ఎలా జరగనున్నాయి?
ప్రార్థనలకు హాజరు కాబోతున్నవారు "సొంత మాస్కు, ప్రార్థనకు అవసరమైన రగ్గు, సహనం, అవగాహన" తో రావాలని, కోవిడ్-19 వ్యాప్తి పట్ల జాగ్రత్తతో వ్యవహరించాలని గవర్నర్ యెర్లికయా గురువారం ఇచ్చిన ఒక టీవీ ప్రసంగంలో కోరారు.
ప్రార్థనలు ప్రారంభమయ్యే రోజు హెల్త్కేర్ వర్కర్లు అందుబాటులో ఉంటారని తెలిపారు.
ఈ స్థలంలో ఒకేసారి 1000 మంది ప్రార్థనలు చేసుకోవచ్చని టర్కీ మత వ్యవహారాల మంత్రి అలీ ఇర్బాస్ తెలిపారు.
భవనం లోపల ప్రార్థనలకు అనుకూలంగా మార్పులు చేశామని, ఇది రాత్రంతా కూడా తెరిచి ఉంటుందని ఆయన తెలిపారు.
కాగా టర్కీ అధ్యక్షుడు ఎర్దవాన్ కూడా తొలి రోజు ప్రార్థనలకు హాజరయ్యారు.
ఈ తీర్పు ఎందుకు వివాదాస్పదమైంది?
టర్కీలోని ఇస్లాం మద్దతుదారులు హయా సోఫియాను మసీదుగా మార్చాలని ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నారు. కానీ సెక్యులర్ వర్గాలు ఈ డిమాండ్ను వ్యతిరేకిస్తూ వచ్చాయి.
జులై 10 న ఈ భవనాన్ని మసీదుగా మార్చాలని దేశాధ్యక్షుడు ఎర్డోగన్ ప్రకటించినప్పుడు అనేక విమర్శలు వెల్లువెత్తాయి.
"ఈ నిర్ణయం బాధాకరం. శాంటా సోఫియాను తలుచుకుని నేను బాధపడుతున్నాను" అని పోప్ ఫ్రాన్సిస్ తెలిపారు.
ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని లేదంటే దేశం ముక్కలైపోయే ప్రమాదం ఉందని వరల్డ్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్ పిలుపునిచ్చింది.
అయితే అధ్యక్షుడు ఎర్డోగన్ ఈ నిర్ణయానికి పూర్తి మద్దతు తెలిపారు. ఇస్తాంబుల్ను జయించిన ఫతిః దస్తావేజుల్లో కోరిన విధంగా హయా సోఫియాను మళ్లీ మసీదుగా మార్చడం జరిగిందని సమర్థించారు. అయితే ఈ భవనం ముస్లింలకు, ఇతర మతస్థులకు, విదేశీయులకు కూడా అందుబాటులో ఉంటుందని, ఎవరైనా సరే ఈ భవనాన్ని సందర్శించవచ్చని ఆయన తెలిపారు.
హయా సోఫియా చరిత్ర ఏంటి?
ఈ చారిత్రక కటడం ఇస్తాంబుల్లోని ఫతిః జిల్లాలో బోస్పరస్ పశ్చిమ భాగాన గోల్డన్ హార్న్ హార్బర్కికి సమీపంలో ఉంది.
1500 ఏళ్ల చరిత్ర గల హయా సోఫియా చర్చిని క్రీ.శ. 537వ సంవత్సరంలో బైజాంటిన్ చక్రవర్తి జస్టీనియన్ -I కట్టించారు. తరువాత దాదాపు 1,000 సంవత్సరాలు ఇది ప్రపంచంలోనే అతిపెద్ద క్రైస్తవ మత కేంద్రంగా కొనసాగింది.
1453లో బైజాంటియన్ సామ్రాజ్యాన్ని ఓడించిన ఒట్టోమన్ సుల్తాన్ మెమ్మద్ II ఈ నగరాన్ని ఆక్రమించుకున్నప్పుడు దీన్ని మసీదుగా మార్చేశారు. ఈ భవనానికి నాలుగు మీనార్లను జతపరిచారు.
1934లో మత సామరస్యాన్ని చాటే దిశగా ఈ మసీదును మ్యూజియంగా మార్చివేసింది టర్కీ.
అప్పటినుంచీ హయా సోఫియా టర్కీలో అత్యంత సందర్శనీయమైన పర్యటక ప్రదేశంగా నిలిచింది. గత ఏడాది 37 లక్షల మంది పర్యటకులు ఈ భవనాన్ని సందర్శించారు.
ఇవి కూడా చదవండి:
- రిలయన్స్ జియో 5జీ వస్తోంది.. కానీ భారతీయులు ఎన్నాళ్లు ఎదురు చూడాలి?
- చైనా - భారత్ మధ్య 45 ఏళ్లుగా లేనంత గొడవలు ఇప్పుడెందుకు?
- భారత్ - చైనా 1962 యుద్ధం: పిరికిపందల చర్యా లేక నమ్మకద్రోహమా?
- వ్యాక్సిన్ త్వరలో వచ్చేస్తుందనుకుంటే అది అత్యాశే: ప్రపంచ ఆరోగ్య సంస్థ
- తూర్పుగోదావరి జిల్లాలో ఒక వ్యక్తి నుంచి 100 మందికి కరోనావైరస్.. ఎలా వ్యాపించింది?
- హైదరాబాద్ నుంచి ఇప్పటివరకు ఎంతమంది వెళ్లిపోయారు
- సెక్స్ వర్కర్లు ఆ దేశంలో రెయిన్ కోట్ ఎందుకు వేసుకుంటున్నారు?
- చైనా, ఇరాన్ల సీక్రెట్ డీల్: భారత్కు ఎంత నష్టం
- పాకిస్తాన్ నిర్మిస్తున్న ఆనకట్టపై భారత్ ఎందుకు అభ్యంతరం చెబుతోంది?
- అక్కడ అమ్మాయి పేరు ఎవరికీ చెప్పకూడదు.. పెళ్లి పత్రాల్లో రాయరు, మరణ ధ్రువీకరణల్లో ఉండదు
- ఆంధ్రప్రదేశ్లో కరోనావైరస్ హాట్ స్పాట్గా మారిన తూర్పు గోదావరి
- భారత జనాభా ఈ శతాబ్దం చివరికి ఎందుకు తగ్గుతుంది... తగ్గితే ఏమవుతుంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)