బ్లాక్ ఫంగస్‌: ఇప్పటి వరకు 45,374 కేసులు, 4,300లకు పైగా మరణాలు

ప్రచురణ
చదివే సమయం: 2 నిమిషాలు

భారత్‌లో ప్రాణాంతక బ్లాక్ ఫంగస్‌తో ఇప్పటివరకు 4,300 మందికి పైగా చనిపోయారు.

భారత్‌లో 45,374 మందికి బ్లాక్ ఫంగస్‌ (మ్యూకర్ మైకోసిస్‌) సోకినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి మాన్సుక్ మాండవీయ తెలిపారు.

వీరిలో దాదాపు సగం మంది ఇప్పటికీ చికిత్స పొందుతున్నారు.

ఇది ప్రధానంగా కోవిడ్ - 19 రోగులపై ప్రభావం చూపిస్తుంది.

కరోనా నుంచి కోలుకున్న 12 నుంచి 18 రోజుల తర్వాత ఈ బ్లాక్ ఫంగస్ దాడి చేస్తుంది.

ముక్కు, కళ్లతో పాటు కొన్నిసార్లు మెదడులోకి వ్యాపిస్తుంది.

కరోనా చికిత్సలో వాడే స్టెరాయిడ్స్‌తో బ్లాక్ ఫంగస్‌కు సంబంధం ఉన్నట్లు డాక్లర్లు చెబుతున్నారు. ముఖ్యంగా డయాబెటిక్ రోగులకు ఇది మరింత ప్రమాదకరంగా మారుతుందని అంటున్నారు.

స్టెరాయిడ్స్ వాడకం వల్ల కరోనా రోగులకు ఊపిరితిత్తుల్లో మంట తగ్గిపోతుంది. కోవిడ్‌తో పోరాడే క్రమంలో శరీర రోగ నిరోధక వ్యవస్థ అతిగా స్పందించడం వల్ల జరిగే నష్టాన్ని ఈ స్టెరాయిడ్స్ కొంతమేరకు తగ్గిస్తాయి.

అయితే వీటిని వాడటం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా తగ్గుతుంది. అదే సమయంలో కరోనా బారిన పడిన డయాబెటిక్ రోగులకు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. మధుమేహం లేని వారికి కూడా షుగల్ లెవల్ పెరుగుతుంది.

రోగ నిరోధకత తగ్గడం వల్లే డయాబెటిక్ రోగుల్లో మ్యూకర్ మైకోసిస్ కేసులు పెరుగుతున్నట్లు భావిస్తున్నారు. వీరితో పాటు రోగ నిరోధకత తక్కువగా ఉండే క్యాన్సర్, హెచ్ఐవీ రోగులు కూడా సులువుగా ఈ వైరస్ బారిన పడుతున్నారు.

ఈ వ్యాధిని తగ్గించడానికి యాంటీ-ఫంగల్ ఇంజెక్షన్ ఏకైక ఔషధమని డాక్టర్లు చెబుతున్నారు.

మ్యూకర్ మైకోసిస్‌ ప్రభావం గుజరాత్, మహారాష్ట్రలో ఎక్కువగా ఉంది. ఇప్పటివరకు బ్లాక్ ఫంగస్‌తో ఈ రెండు రాష్ట్రాల్లో 1,785 మంది మరణించారు.

మ్యూకర్ మైకోసిస్ కేసులు, మరణాల సంఖ్యలో లెక్కకు రాని కేసులు భారీగా ఉన్నట్లు బెంగళూరుకు చెందిన కంటి వైద్య నిపుణుడు, బ్లాక్ ఫంగస్ కేసులకు చికిత్స అందించిన రఘురాజ్ హెగ్డే బీబీసీతో అన్నారు.

'సాధారణంగా మ్యూకర్ మైకోసిస్ వ్యాధి సోకిన తర్వాత వారాల నుంచి నెలల వ్యవధిలోనే మరణాలు సంభవిస్తాయి. కానీ వీటి లెక్కింపులో ప్రస్తుతం మన దగ్గర ఉన్న వ్యవస్థల పనితీరు సరిగా లేదు' అని ఆయన అన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో, చిన్న చిన్న ఆసుపత్రుల్లో రోగ నిర్ధారణ కష్టం కావడంతో బ్లాక్ ఫంగస్ కేసుల సంఖ్య తక్కువగా కనబడుతోంది. నగరాల్లోని పెద్ద ఆసుపత్రుల్లో చేరే కొన్ని కేసుల్ని మాత్రమే లెక్కలోకి తీసుకుంటున్నారని హెగ్డే తెలిపారు.

ఆసుపత్రికి రాకముందే చాలామంది రోగులు ఈ వైరస్‌తో మరణించారని డాక్టర్లు చెబుతున్నారు. ఇప్పటికే చికిత్స తీసుకొని బ్లాక్ ఫంగస్ నుంచి బయటపడిన చాలామందిలో వ్యాధి లక్షణాలు మళ్లీ కనబడుతున్నట్లు పేర్కొంటున్నారు.

'బ్లాక్ ఫంగస్ చికిత్స తీసుకొని కోలుకొని ఆసుపత్రి నుంచి వెళ్లిపోయిన రోగులు మళ్లీ ఆసుపత్రికి రావడం చూస్తున్నాం. ఇలా చేరుతున్న వారిలో కళ్లు, మెదడులో వైరస్ మరింత విస్తరించినట్లు గుర్తించాం' అని ముంబైకి చెందిన కంటి వైద్య నిపుణుడు డాక్టర్ అక్షయ్ బీబీసీతో చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)