వైజాగ్: హెచ్‌పీసీఎల్‌లో అగ్ని ప్రమాదం: Newsreel

ప్రచురణ
చదివే సమయం: 4 నిమిషాలు

విశాఖపట్నంలోని హెచ్‌పీసీఎల్ రిఫైనరీలో అగ్నిప్రమాదం సంభవించింది.

ఒక్కసారిగా మంటలు, దట్టమైన పొగ కనిపించాయని స్థానికులు చెబుతున్నారు.

ప్రమాద తీవ్రతను చెబుతూ మూడు సార్లు సైరన్ మోగించడంతో ఉద్యోగులంతా ఒక్కసారిగా బయటకు వచ్చేశారు.

హెచ్‌పీసీఎల్ ఓల్డ్ టెర్మినల్‌లోని సీడీయూ యూనిట్‌లో ప్రమాదం జరిగినట్లు ఉద్యోగులు చెబుతున్నారు.

ప్రమాద సమాచారం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నారు. వివిధ పరిశ్రమల నుంచి కూడా అగ్నిమాపక వాహనాలు చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి.

సహాయ చర్యల కోసం ఇండియన్ నేవీ అధికారులు కూడా ప్రమాద స్థలానికి చేరుకున్నారు.

ఎవరూ గాయపడలేదు: కలెక్టర్ వినయ్ చంద్

హెచ్‌పీసీఎల్‌లో మంటలు అదుపులోకి వచ్చాయని.. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని, ప్రాణనష్టం లేదని కలెక్టర్ వినయ్ చంద్ చెప్పారు.

అరగంటలో మంటలు అదుపు చేశారని, స్థానికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు.

ఏప్రిల్ 14 తర్వాత తొలిసారి దేశంలో 2 లక్షల కంటే తక్కువగా నమోదైన కరోనా కేసులు

గత 24 గంటల్లో భారత్‌లో 1,96,427 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

గత నెల రోజుల్లో రోజువారీ నమోదవుతున్న కరోనా కేసులు 2 లక్షల కంటే తగ్గడం ఇదే మొదటిసారి.

ఏప్రిల్ 14 తర్వాత మొదటిసారి 24 గంటల్లో కరోనా కేసులు 2 లక్షలకంటే తక్కువగా నమోదయ్యాయి.

కోవిడ్-19 వల్ల గత 24 గంటల్లో 3,511 మంది చనిపోయారు.

కొత్త కేసులతో కలిసి దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,69,48,874కు పెరిగింది. వీటిలో 25,86,782 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

కోవిడ్ వల్ల మొత్తం మృతుల సంఖ్య 3,07,231కు పెరిగింది.

దేశంలో ఇప్పటివరకూ మొత్తం 2,40,54,861 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

ఇప్పటివరకూ దేశంలో మొత్తం 19,85,38,999 డోసుల వ్యాక్సీన్ వేశారు.

టూల్‌కిట్ కేసులో ట్విటర్ ఇండియా కార్యాలయానికి వెళ్లిన దిల్లీ పోలీసుల బృందం

'టూల్‌కిట్' కేసులో దర్యాప్తు కోసం దిల్లీ పోలీసుల బృందం సోమవారం రాత్రి ట్విటర్ ఇండియా కార్యాలయానికి వెళ్లింది.

దిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ ఈ కేసులో సోమవారం మధ్యాహ్నమే ట్విటర్ ఇండియాకు నోటీసు పంపించింది.

దిల్లీ పోలీస్ స్పెషల్ సెల్‌కు చెందిన ఒక టీమ్ దిల్లీ, గురుగ్రామ్‌లోని ట్విటర్ ఇండియా ఆఫీసులకు వెళ్లిందంటూ వార్తా ఏజెన్సీ పీటీఐ చెప్పింది.

పీటీఐ వివరాల ప్రకారం దిల్లీ పోలీసుల టీమ్ నియమిత ప్రక్రియ కింద ట్విటర్ ఇండియాకు నోటీసులు ఇవ్వడానికి ఆ ఆఫీసుకు వెళ్లింది.

"నోటీసులను సంబంధిత వ్యక్తికి అందించడం కోసమే ఆ కార్యాలయాలకు వచ్చామని పోలీసు బృందం చెప్పినట్లు" కొన్ని వర్గాల ద్వారా తెలిసిందని న్యూస్ ఏజెన్సీ పేర్కొంది.

దిల్లీ పోలీసుల బృందం ట్విటర్ ఇండియా కార్యాలయానికి వెళ్లడంపై కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి రణదీప్ సింగ్ సూర్జేవాలా వరుస ట్వీట్లు చేశారు.

యూపీ మాజీ ముఖ్యమంత్రి ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్ కూడా దిల్లీ పోలీసుల చర్యలను ఖండించారు.

దీనివల్ల బీజేపీ అంతర్జాతీయ ఇమేజ్‌ను మరింత దిగజారుస్తుంది. రాజకీయ నాయకులే కాదు, చాలామంది దీని గురించి మాట్లాడుతున్నారు అన్నారు.

ట్విటర్ ఇండియాకు గతంలో చీఫ్‌గా పనిచేసిన రహీల్ ఖుర్షీద్ "దిల్లీ పోలీసులు, ట్విటర్ ఇండియా మధ్య ఏళ్ల నుంచీ సమాచారం ఇచ్చిపుచ్చుకునే వ్యవస్థ ఉంది" అని ట్వీట్ చేశారు.

తాజా కేసు దేనికి సంబంధించినది

ఈ టూల్‌కిట్‌ కేసు బీజేపీ జాతీయ ప్రతినిధి సంబిత్ పాత్రా చేసిన ఆరోపణలకు సంబంధించినది.

బీజేపీ, దేశం ఇమేజ్‌ను కించపరచడానికి కాంగ్రెస్ టూల్‌కిట్ ఉపయోగిస్తోందని కొన్నిరోజుల క్రితం సంబిత్ పాత్రా ఆరోపించారు.

మే 18న బీజేపీ ప్రతినిధి సంబిత్ పాత్రా, పార్టీ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ నాలుగేసి పేజీల రెండు వేరువేరు డాక్యుమెంట్ల స్క్రీన్ షాట్లు ట్వీట్ చేశారు.

వీటిలో ఒక డాక్యుమెంట్ కోవిడ్-19 గురించి కాగా, మిగతావి సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్‌కు సంబంధించినవి.

అది కాంగ్రెస్ టూల్‌కిట్ అని ఇద్దరు నేతలు ఆ ట్వీట్స్‌లో ఆరోపించారు. దేశంలో మహమ్మారి గురించి, మోదీ ప్రభుత్వం ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఆ పార్టీ ఈ టూల్‌కిట్ తయారు చేసిందన్నారు.

మోదీ ప్రభుత్వాన్ని కించపరిచేలా 'సూపర్ స్ప్రెడర్ కుంభ్, మ్యూటెంట్ స్ట్రెయిన్ కోసం 'మోదీ స్ట్రెయిన్' లాంటి పదాలను ఉపయోగించాలని, ఈద్‌కు మాత్రం 'హ్యాపీ సోషల్ గేదరింగ్' అనేది వాడాలని కాంగ్రెస్ తమ వలంటీర్లకు, కార్యకర్తలకు చెప్పిందని నేతలు ఆరోపించారు.

కాంగ్రెస్ దీనిపై కేసు కూడా నమోదు చేసింది. దీంతో, ట్విటర్ ఈ నేతల ట్వీట్లను 'మేనిపులేటెడ్ మీడియా' కేటగిరీలో పెట్టింది.

'మేనిపులేటెడ్ మీడియా' అంటే ఎవరైనా ట్వీట్ చేసిన ఫొటోలు, వీడియోలు, స్క్రీన్ షాట్ల ప్రామాణికతపై సందేహాలు ఉంటే, వాటిని ఎడిట్ చేయడం, లేదా మార్పులు చేర్పులు చేశారని భావిస్తే, అలాంటి వాటిని ట్విటర్ 'మేనిపులేటెడ్ మీడియా' కేటగిరీలో పెడుతుంది.

సంబిత్ పాత్రా ఆరోపణలకు సమాధానంగా కాంగ్రెస్ రీసెర్చ్ డిపార్ట్‌మెంట్ చీఫ్ రాజీవ్ గౌడా బీబీసీతో మాట్లాడారు.

"మేం ఎప్పుడూ అలాంటి ఏ డాక్యుమెంట్ తయారు చేయలేదు. దేశం ఇంత పెద్ద సంక్షోభంలో ఉన్నప్పుడు, చాలా చేయల్సిన బీజేపీ, యూత్ కాంగ్రెస్‌ను తప్పుపట్టడంలో మునిగిపోయింది. అసలు విషయం నుంచి ప్రజల దృష్టిని మళ్లిస్తోంది" అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)