దాద్రా నగర్ హవేలీ ఎంపీ మోహన్ అనుమానాస్పద స్థితిలో మృతి -Newsreel

ప్రచురణ

దాద్రా నగర్ హవేలీ ఎంపీ మోహన్ దేల్కర్ అనుమానాస్పద స్థితిలో మరణించారు. ముంబయిలోని సీ గ్రీన్ హోటల్‌లో ఆయన శవమై కనిపించారని ముంబయి నగర అదనపు పోలీస్ కమిషనర్ సత్యనారాయణ చౌదరీ బీబీసీకి ధ్రువీకరించారు.

ఆయన ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు చెబుతున్నారు. గుజరాతీ భాషలో రాసి ఉన్న ఒక లేఖ లభ్యమైందని తెలిపారు.

58 ఏళ్ల మోహన్ దేల్కర్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2019కి ముందు ఆయన దాద్రా నగర్ హవేలీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు.

పుదుచ్చేరిలో కుప్పకూలిన కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రాజీనామా

పుదుచ్చేరిలో కాంగ్రెన్‌ ప్రభుత్వం కుప్పకూలింది. సోమవారం శాసనసభలో జరిగిన బలపరీక్షలో తన మెజారిటీని నిరూపించుకోవడంలో ముఖ్యమంత్రి నారాయణ స్వామి విఫలమయ్యారు.

సభలో సీఎం నారాయణస్వామి విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కానీ, ఆ తీర్మానంపై ఓటింగ్‌ జరగకముందే ఆయనతో పాటు, కాంగ్రెస్ పార్టీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. దీంతో విశ్వాస తీర్మానం వీగిపోయినట్టుగా స్పీకర్ ప్రకటించారు.

సీఎం నారాయణస్వామి రాజీనామా

సభ నుంచి నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లిన నారాయణ స్వామి లెఫ్ట్‌నెంట్ గవర్నర్ తమిళిసైకి తన రాజీనామాను సమర్పించినట్టు వెల్లడించారు.

తన మంత్రివర్గ సభ్యులు, కాంగ్రెస్, డీఎంకే ఎమ్మెల్యేలు, స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేశారని నారాయణ స్వామి తెలిపారు.

తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కుట్ర జరిగిందని, ఇది ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడమేనని ఆయన వ్యాఖ్యానించారు.

"కేంద్రంలోని బీజేపీ, ఎన్ఆర్ కాంగ్రెస్, ఏఐఏడీఎంకే కలిసి మా ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కుట్ర చేశాయి.

ఇది ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడమే. పుదుచ్చేరి ప్రజలు వారికి సరైన రీతిలో బుద్ధి చెబుతారు" అని నారాయణ స్వామి అన్నారు.

పలువురు ఎమ్మెల్యేల రాజీనామా తర్వాత, సభలో కాంగ్రెస్, డీఎంకే సంకీర్ణ ప్రభుత్వ బలం 11కు పడిపోయింది. ప్రతిపక్షానికి 14 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)