తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ధోనీ క్రికెట్ అకాడమీలు వచ్చేస్తున్నాయి.. - ప్రెస్ రివ్యూ

ప్రచురణ

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో టీమ్‌ ఇండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని క్రికెట్‌ అకాడమీ (ఎంఎస్‌డీసీఏ)ల ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోందని ‘ఈనాడు’ ఒక కథనంలో తెలిపింది.

ఆ కథనం ప్రకారం.. ధోని అకాడమీల ఏర్పాటు దిశగా ఎంఎస్‌డీసీఏల వ్యవహారాలు పర్యవేక్షించే ఆర్కా స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌తో వ్యూహాత్మక ఒప్పందం చేసుకున్నట్లు బ్రెనియాక్స్‌ బీ శుక్రవారం ప్రకటించింది.

ఈ ఒప్పందంలో భాగంగా వచ్చే రెండేళ్లలో తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలో ఎంఎస్‌డీసీఏలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది.

‘‘ధోని మార్గనిర్దేశనంలోని క్రికెట్‌ అకాడమీలను వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసేందుకు ఆర్కా స్పోర్ట్స్‌ తో ఒప్పందం కుదుర్చుకోవడం ఆనందంగా ఉంది. వచ్చే రెండేళ్లలో తెలంగాణలో 15 ప్రాంతాల్లో ఈ అకాడమీలు ఏర్పాటు చేస్తాం. ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటకలో కలిపి మరో 25 అకాడమీల వరకు ఏర్పాటు చేస్తాం’’ అని బ్రెనియాక్స్‌ బీ డైరెక్టర్‌ వినోద్‌ కుమార్‌ వెల్లడించాడు.

భారత్‌లో వివిధ ప్రాంతాలతో పాటు దుబాయ్‌ (యూఏఈ), దోహా (ఖతార్‌)లో ధోని క్రికెట్‌ అకాడమీలున్నాయి.

'తూర్పు భారతదేశానికి చెందిన మహిళ 2024లో ప్రధానమంత్రి అవుతారు'

తూర్పు భారతదేశ మహిళ 2024లో ప్రధాని పీఠం అధిరోహించవచ్చని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ డెరెక్‌ ఓ బ్రెయిన్ వ్యాఖ్యానించినట్లు ‘సాక్షి’ ఒక కథనంలో తెలిపింది.

ఆ కథనం ప్రకారం.. ఇండియా టూడే కాన్‌క్లేవ్‌ ఈస్ట్‌ కార్యక్రమంలో పాల్గొన్న డెరెక్ పలు అంశాలపై స్పందిచారు.

‘‘దేశ ప్రజలు తమ కోసం పని చేసే ఓ పురుషుడు లేదా, ఓ మహిళ ప్రధానిగా రావాలని ఎదురుచూస్తున్నారు. తూర్పు భారతదేశానికి చెందిన మహిళ 2024లో ప్రధాని పదవి చేపడతారని అని నా నమ్మకం’’ అని చెప్పారు. తద్వారా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా 2024 ప్రధాని అభ్యర్థి అని ఆయన పరోక్షంగా వెల్లడించారు.

మోదీ, మమతల మధ్య అసలు ఎలాంటి పోలిక లేదన్నారు డెరెక్‌. ‘‘వారిద్దరి మధ్య ఉన్న ప్రధాన తేడా ఏంటంటే ఒకరు హామీలను నేరవేర్చే వారు. మరొకరేమో కేవలం ప్రచారానికే పరిమితం అవుతారు’’ అంటూ పరోక్షంగా దీదీపై ప్రశంసలు, మోదీపై విమర్శలు చేశారు.

‘‘బీజేపీ.. బెంగాల్‌లో కూడా మత రాజకీయాలు చేయాలని చేయాలని ప్రయత్నిస్తోంది. అందుకే అభివృద్ధి గురించి ప్రచారం చేయకుండా.. కేవలం మతపరమైన అంశాలనే ప్రచారం చేస్తోంది. ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నది గుజరాత్‌ జింఖానా బ్యాచ్‌. మతం తప్ప వారికి మరో అంశం తెలీదు’’ అంటూ డెరెక్‌ ఓ బ్రెయిన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుతం బెంగాల్‌లో ఎన్నికల దంగల్‌ నడుస్తోంది. ఈ ఏడాది పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. గతంలో బెంగాల్‌లో 18 సీట్లు సాధించిన బీజేపి ఈ సారి మరింత బలపడాలని భావిస్తోంది. బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మతకంగా తీసుకుంది బీజేపీ.

టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ కూడా ఎక్కడా తగ్గటం లేదు. ఢీ అంటే ఢీ అంటూ బీజేపీతో తలపడుతున్నారు. గత కొద్ది రోజులుగా బీజేపీ-టీఎంసీ మధ్య నడుస్తోన్న వార్‌ చూస్తే.. మోదీని సమర్థవంతంగా ఎదుర్కొగల నాయకురాలు దీదీనే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

నాలుగో రోజూ ‘పెట్రో’ మోత

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు వరుసగా నాలుగో రోజూ పెరిగాయని ‘ఆంధ్రజ్యోతి’ ఒక కథనంలో తెలిపింది.

ఆ కథనం ప్రకారం.. చమురు కంపెనీలు శుక్రవారం లీటరు పెట్రోల్‌ ధరను 31 పైసలు, డీజిల్‌ ధరను 35 పైసలు పెంచాయి. దీంతో దిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర ఆల్‌టైమ్‌ గరిష్ఠ స్థాయి రూ. 88.14కు, ముంబైలో రూ. 94.64కు చేరింది.

అదేవిధంగా ఢిల్లీలో లీటరు డీజిల్‌ ధర రూ. 78.38కి, ముంబైలో ఆల్‌టైమ్‌ గరిష్ఠ స్థాయి రూ. 85.32కు చేరుకుంది. నాలుగు రోజుల్లో పెట్రోల్‌ ధర రూ. 1.21, డీజిల్‌ ధర రూ. 1.25 పెరిగింది.

ఇక హైదరాబాద్‌లో శుక్రవారం లీటరు పెట్రోల్‌ ధర రూ. 91.65కు, డీజిల్‌ ధర రూ. 85.50కు ఎగబాకింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల్లో పెరుగుదల ఇందుకు ఆజ్యం పోస్తోంది.

జన్‌ధన్‌ ఖాతాదారులకు ఎస్బీఐ 2 లక్షల బీమా

ఎస్బీఐ జన్‌ధన్‌ ఖాతాదారులు.. రూపే జన్‌ ధన్‌ కార్డ్‌ కోసం దరఖాస్తు చేసుకుంటే రూ .2 లక్షల వరకు ప్రమాద బీమాను పొందవచ్చని ఆ బ్యాంకు తెలిపినట్లు ‘నమస్తే తెలంగాణ’ ఒక కథనంలో చెప్పింది.

ఆ కథనం ప్రకారం.. ‘ఇప్పుడే ఎస్బీఐ రూపే జన్‌ధన్‌ కార్డ్‌ కోసం దరఖాస్తు చేసుకోండి’ అంటూ బ్యాంక్‌ ట్వీట్‌ చేసింది.

ప్రధాన మంత్రి జన్‌ధన్‌ యోజన కింద 41.75 కోట్ల బ్యాంక్‌ ఖాతాలు తెరుచుకోగా, ఇందులో 35.96 కోట్ల ఖాతాలు ప్రస్తుతం నిర్వహణలో ఉన్నాయి. గ్రామీణ ప్రజలు, పట్టణాల్లోని గృహస్తులకు బ్యాంకింగ్‌ సేవలను అందించాలనే లక్ష్యంతో జన్‌ధన్‌ ఖాతాలను కేంద్రం పరిచయం చేసింది.

భారతీయులు ఎవరైనా ఈ ఖాతాను తీసుకోవచ్చు. వయసు పదేండ్లు అంతకుమించి ఉండాలి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)