రైతుల నిరసన ఉధృతం: ‘నేడు రైతుల నిరాహార దీక్ష.. మద్దతుగా తానూ నిరశన చేస్తానన్న కేజ్రీవాల్ - Newsreel

ప్రచురణ
చదివే సమయం: 2 నిమిషాలు

వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ దిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులు తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తూ.. సోమవారం ఒక రోజు నిరాహార దీక్ష చేయనున్నట్లు రైతు సంఘాల నాయకులు ప్రకటించారు.

కుండ్లి, టికారి, పాల్వాల్, ఖాజీపూర్ సరిహద్దుల్లో నిరసన చేస్తున్న రైతులందరూ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరాహార దీక్ష చేపడతారని చెప్పారు. అదే సమయంలో దేశవ్యాప్తంగా జిల్లా ప్రధాన కార్యాలయంలో రైతులు ప్రదర్శనలు నిర్వహిస్తారని కూడా చెప్పారు.

రైతుల ఆందోళనకు మద్దతుగా తాను కూడా సోమవారం ఒక రోజు నిరాహార దీక్ష చేస్తానని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఆప్ కార్యకర్తలందరూ కూడా నిరాహార దీక్ష చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వం మొండివైఖరిని విడనాడి రైతుల డిమాండ్లను ఆమోదించాలని కోరారు.

యునైటెడ్ కిసాన్ మోర్చా నాయకులు ఆదివారం సాయంత్రం దిల్లీ సింఘు సరిహద్దు వద్ద మీడియా సమావేశంలో మాట్లాడారు.

మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయటం, కనీస మద్దతు ధర హామీ చట్టాలు అమలు చేయటం, ప్రతిపాదిత విద్యుత్ బిల్లును రద్దు చేయటంతో పాటు.. గడ్డిని దగ్ధం చేసే సమస్యకు సంబంధించి రైతులను వేధించటం నిలిపివేయాలన్నవి తమ డిమాండ్లుగా రైతు సంఘాల సమాఖ్య యునైటెడ్ కిసాన్ మోర్చా చెప్పింది. ఈ నాలుగు డిమాండ్లు మినహా మిగతా డిమాండ్లతో యునైటెడ్ కిసాన్ మోర్చాకు సంబంధం లేదని పేర్కొన్నారు.

బీకేయూ భాను సంఘటన్.. తమ యునైటెడ్ కిసాన్ మోర్చాలో భాగం కాదని.. చిల్లా సరిహద్దులో ఆందోళన నుంచి వైదొలగాలన్నది బీకేయూ భాను సంఘం వ్యక్తిగత నిర్ణయమని వారు చెప్పారు.

''యునైటెడ్ కిసాన్ మోర్చా ఉద్యమానికి బీకేయూ భాను సంఘటన్‌తో సంబంధం లేదు. మా ఉద్యమం మునుపటిలాగే కొనసాగుతుంది'' అని ఉద్ఘాటించారు.

''నిన్న రైతు నాయకుడు వి.ఎం.సింగ్ చేసిన ప్రకటన ఆయన వ్యక్తిగత ప్రకటన. ఎ.ఐ.కె.ఎస్.సి.సి. సమావేశం తరువాత వి.ఎం. సింగ్‌ను కన్వీనర్ పదవి నుంచి తొలగించారు. వి.ఎం.సింగ్ చేసిన ఎటువంటి ప్రకటనతోనూ యునైటెడ్ కిసాన్ మోర్చాకు సంబంధం లేదు'' అని వారు స్పష్టంచేశారు.

పాల్వాల్ ధర్నాకు చేరుకున్న మధ్యప్రదేశ్ రైతుల వాహనాలకు చట్టవిరుద్ధంగా చలాన్లు విధిస్తున్నారని, హరియాణా పోలీసుల నియంతృత్వాన్ని యునైటెడ్ కిసాన్ మోర్చా ఖండిస్తోందని చెప్పారు.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు కోవిడ్ పాజిటివ్

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా తనకు కోవిడ్-19 పాజిటివ్‌ నిర్ధారణ అయిందని ఆదివారం సాయంత్రం ట్విటర్‌లో వెల్లడించారు.

''వైరస్ సోకిన లక్షణాలు కనిపించటంతో నేను కరోనా టెస్ట్ చేయించుకున్నాను. పాజిటివ్‌గా నిర్ధారణ అయింది'' అని ఆయన ట్వీట్ చేశారు. ప్రస్తుతం వైద్యుల సలహామేరకు ఇంట్లోనే ఐసొలేషన్‌లో ఉన్నానని ఆయన తెలిపారు.

కొద్ది రోజులుగా తనను కలిసిన వారందరూ కరోనావైరస్ పరీక్షలు చేయించుకోవాలని నడ్డా సూచించారు.

ఇదిలావుంటే.. దేశవ్యాప్తంగా గడచిన 24 గంటల్లో కొత్తగా 30,254 కోవిడ్ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.

దీంతో దేశంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 98.57 లక్షలు దాటింది. వీరిలో 93.57 లక్షల మంది డిశ్చార్జ్ అవ్వగా.. ప్రస్తుతం 3,56,546 కేసులు కొనసాగుతున్నాయి.

గత 24 గంటల్లో కొత్తగా 391 మంది కోవిడ్ వల్ల మరణించారు. మొత్తం మరణాల సంఖ్య 1,43,019గా నమోదైంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)