హాలీవుడ్ సినిమాలను కాపీ కొట్టిన చైనా ఆర్మీ ప్రచార వీడియో దృశ్యాలు - BBC Newsreel

ప్రచురణ
చదివే సమయం: 3 నిమిషాలు

చైనా సైనిక ప్రచారంలో భాగంగా తయారుచేసిన వీడియోలో ట్రాన్స్‌ఫార్మర్స్, ది రాక్‌లాంటి హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ సినిమాలనుంచీ సీన్లు కాపీ కొట్టారని రిపోర్టులు తెలుపుతున్నాయి.

ఈ వీడియోలో...అణు సామర్థ్యం కలిగిన హెచ్-6 బాంబులతో కూడిన విమానాలు, పసిఫిక్ ద్వీపమైన గువాంలో యూఎస్ స్థావరాలుగా కనిపించేవాటిపై దాడి చేసినట్టు చిత్రీకరించారు.

ఈ వీడియోను చైనా వెబ్‌సైట్ సీనా వియబోలో దాదాపు 50 లక్షలసార్లు వీక్షించారని గణాంకాలు చెబుతున్నాయి.

అయితే హాలీవుడ్ సినిమాల దృశ్యాలను అనుకరించారంటూ వీక్షకులు గేలి చేసారు.

"చైనాలో కాపీరైట్ సమస్యలు లేకపోవడం అదృష్టమని" ఒకరు జోక్ చేసారు.

"ఇలాంటి దేశాల సినిమాలనుంచీ కాపీ కొట్టకండి…ట్విట్టర్లో అవమానాల పాలవుతాం. అది నాకు చాలా బాధగా ఉంటుంది" అని మరొకరు కామెంట్ చేసారు.

'గాడ్స్ ఆఫ్ వార్ - అటాక్' పేరుతో రెండు నిముషాల నిడివిగల వీడియోను చైనా వైమానిక దళం శనివారం విడుదల చేసింది.

'మాతృభూమిని రక్షించుకునేందుకు మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాం. మా పూర్తి సామర్థ్యాన్ని మాతృదేశ రక్షణకు వినియోగిస్తాం' అనే అర్థమొచ్చేట్లుగా ఒక సందేశాన్ని కూడా ఈ వీడియోకు జత చేసారు.

చైనా మిలటరీ వీడియోల కోసం దృశ్యాలను హాలీవుడ్ సినిమాల నుంచీ కాపీ కొట్టడం సాధారణమేనని చైనా సైన్యంతో దగ్గర సంబంధాలున్నవారు తెలిపినట్లుగా సౌత్ చైనా మార్నింగ్ న్యూస్ పేపర్ పేర్కొంది.

తాజ్ మహల్: ఆరు నెలల లాక్‌డౌన్ తరువాత సందర్శకులకు స్వాగతం

తాజ్ మహల్ తలుపులు తెరుచుకున్నాయి. లాక్‌డౌన్‌లో ఆరు నెలల తరువాత తాజ్‌ మహల్‌ను సందర్శించడానికి పర్యటకులను అనుమతించారు. ఈ చారిత్రక కట్టడం వద్దకు ఇన్ని నెలల పాటు సందర్శకులను అనుమతించకపోవడం ఇదే మొదటిసారి.

మార్చి నెలలో దేశమంతటా కరోనా లాక్‌డౌన్ విధించినప్పుడు తాజ్ మహల్ తలుపులను కూడా మూసేశారు. ఇప్పుడు ఈ కట్టడం వద్దకు రోజుకు 5 వేల మంది సందర్శకులను మాత్రమే అనుమతిస్తారు. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ కూడా కోవిడ్ రక్షణ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.

ప్రపంచంలోని అత్యంత పర్యటక ఆకర్షణల్లో ఒకటైన తాజ్‌ మహల్‌కు కరోనా లాక్ డౌన్ ముందు వరకు రోజుకు 70 వేల మంది సందర్శకులు వస్తుండేవారు.

17వ శతాబ్దం నాటి ఈ పాలరాతి సమాధిని మొగల్ రాజు షాజహాన్ తన రాణి ముంతాజ్ మహల్ జ్ఞాపకార్థం నిర్మించారు.

గతంలో 1978లో ఆగ్రాలో వరదలు వచ్చినప్పుడు ఒకసారి తాజ్ మహల్ సందర్శన రద్దు చేశారు. అంతకు ముందు 1971లో పాకిస్తాన్‌ - భారత్ యుద్ధం జరుగుతున్నప్పుడు స్వల్పకాలం పాటు దీన్ని మూసి ఉంచారు.

ఇప్పుడు తాజ్ మహల్‌ను పూర్తిగా సానిటైజ్ చేసి సందర్శనకు ప్రజలను అనుమతిస్తున్నారు. ఇక్కడి అధికారులు, సిబ్బంది మాస్కులు ధరించి సందర్శకులకు సహకరిస్తారు. పర్యటకులకు టెంపరేచర్ చెక్ చేస్తారు. గ్రూప్ ఫోటోలకు అనుమతి లేదు కానీ, సెల్ఫీలు తీసుకోవచ్చని అధికారులు తెలిపారు.

మహారాష్ట్ర భివండీలో కుప్పకూలిన మూడంతస్తుల భవనం.. 10 మంది మృతి

మహారాష్ట్ర థానే భివండీలో ఒక మూడంతస్తుల భవనం కూలిపోవడంతో 10 మంది చనిపోయారు. స్థానికులు 20 మందిని కాపాడారని వార్తా సంస్థ ఏఎన్ఐ చెప్పింది.

ఈ భవనంలో శిథిలాల కింద ఇప్పటికీ 20 నుంచి 25 మంది చిక్కుకుని ఉన్నట్టు భావిస్తున్నారు.

శిథిలాల నుంచి మరో ఐదుగురిని బయటకు తీశామని థానే మున్సిపల్ కార్పొరేషన్ అధికారి చెప్పారు.

చనిపోయిన వారిలో ఏడుగురు పిల్లలు ఉన్నారని అధికారులు తెలిపారు. ఘటనా స్థలంలో ఎన్డీఆర్ఎఫ్ సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

IPL 2020: సూపర్ ఓవర్‌లో కింగ్స్ ఎలెవన్‌ పంజాబ్‌ను ఓడించిన దిల్లీ కాపిటల్స్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండో మ్యాచ్‌లో ఫలితం సూపర్ ఓవర్ వరకూ వెళ్లింది. సూపర్ ఓవర్‌లో విజయానికి దిల్లీ ఆరు బంతుల్లో మూడు పరుగులు చేయాల్సి వచ్చింది.

మొహమ్మద్ షమీ ఒక వైడ్ వేశాక, రిషబ్ పంత్ రెండు పరుగులు చేయడంతో దిల్లీ సులభంగా విజయం అందుకుంది.

అంతకు ముందు సూపర్ ఓవర్‌లో పంజాబ్ టీమ్ రెండు వికెట్లు కోల్పోయి రెండు పరుగులే చేసింది.

కాగిసో రబాడా బౌలింగ్‌లో 2 పరుగులు చేసిన కేఎల్ రాహుల్ తర్వాత బంతికి అవుటవగా, తర్వాత బంతికే నికొలస్ పూరన్ కూడా క్లీన్ బోల్డ్ అయ్యాడు.

రెండు వికెట్లు పడిపోవడంతో పంజాబ్ జట్టు సూపర్ ఓవర్‌లో మూడు బంతులు ఆడి రెండు పరుగులే చేయగలిగింది.

సూపర్ ఓవర్‌కు ముందు

మొదట బ్యాటింగ్ చేసిన దిల్లీ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 157పరుగులు చేసింది. ఆ తర్వాత కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు కూడా 20 ఓవర్లలో 8 వికెట్లే కోల్పోయి 157 పరుగులు మాత్రమే చేయగలిగింది.

పంజాబ్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 60 బంతుల్లో 89 పరుగులు చేశాడు. కానీ జట్టు విజయానికి ఒక్క పరుగు కావాల్సిన సమయంలో అవుటయ్యాడు.

చివరి ఓవర్‌లో పంజాబ్ ఆరు బంతుల్లో 13 పరుగులు చేయాల్సి వచ్చింది. మయాంక్ అగర్వాల్ మొదటి మూడు బంతుల్లో 12 పరుగులు చేశాడు. అయితే చివరి రెండు బంతులకు రెండు వికెట్లు పడిపోవడంతో జట్టు ఓటమి పాలైంది.

దిల్లీ బౌలర్ మార్కస్ స్టోయినిస్ చివరి రెండు బంతుల్లో మయాంక్ అగర్వాల్, క్రిస్ జోర్డాన్‌లను అవుట్ చేసి మ్యాచ్‌ను సూపర్ ఓవర్‌కు చేర్చాడు.

అంతకు ముందు 21 బంతుల్లో 53 పరుగులు చేసి జట్టు స్కోరును 150 దాటించిన స్టోయినిస్ చివరి ఓవర్లో రనౌట్ అయ్యాడు. అతడి ఇన్నింగ్స్ లో 7 ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)