స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్: ప్రధానమంత్రికి నేరుగా రిపోర్ట్ చేసే రహస్య దళం

ప్రచురణ

1962లో ఏర్పడిన స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ వాస్తవానికి భారత సైన్యంలో భాగం కాదు. ఇది భారత ఇంటెలిజెన్స్ ఏజన్సీ.. రిసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్ (ఆర్ఏడబ్ల్యూ)లో భాగం.

హిందుస్తాన్ టైమ్స్‌లో వచ్చిన ఒక కథనం ప్రకారం ఈ సంస్థ కార్యకలాపాలను చాలా రహస్యంగా ఉంచుతారు. బహుశా భారత సైన్యానికి కూడా తెలియకపోవచ్చు.

డైరెక్టర్ జనరల్ ఆఫ్ సెక్యూరిటీ ద్వారా వీరు ప్రధానమంత్రికి నేరుగా రిపోర్ట్ చేస్తారు. అందుకే వీరు చేసే పనులు సామాన్య ప్రజలకు తెలియవు.

ఇంటెలిజెన్స్ బ్యూరో వ్యవస్థాపక అధ్యక్షుడు భోలానాథ్ మల్లిక్, అప్పటి ఒడిశా ముఖ్యమంత్రి బీజూ పట్నాయక్ సలహాలమేరకు హిమాలయా సరిహద్దు ప్రాంతాల్లో చైనీయులతో తలపడగలిగే టిబెటన్ గెరిల్లా బృందాన్ని తయారుచేయాలని అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఆలోచన చేశారు.

యుద్ధ సమయంలో చైనా సరిహద్దుల్లోకి ప్రవేశించి ఇంటెలిజెన్స్ ఆపరేషన్లు నిర్వహించాలనే లక్ష్యంతో మొదలైన ఎస్ఎఫ్ఎఫ్‌కు మొట్టమొదటి ఇన్‌స్పెక్టర్ జనరల్‌గా మాజీ మేజర్ జనరల్ సుజాన్ సింగ్ ఉబాన్ వ్యవహరించారు.

సుజాన్ సింగ్ ఉబాన్, రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటిష్ భారత సైన్యం తరపున '22 మౌంటెన్ రెజిమెంట్' కమాండర్‌గా ఉన్నారు. అందువల్ల ఎస్ఎఫ్ఎఫ్‌ను 'ఎస్టాబ్లిష్మెంట్ 22' అని కూడా పిలుస్తారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)