You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ప్రణబ్ ముఖర్జీకి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి
భారత మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ప్రణబ్ ముఖర్జీ సోమవారం సాయంత్రం కన్నుమూశారు. ఆయన భౌతిక కాయానికి మంగళవారం మధ్యాహ్నం దిల్లీలో సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తిచేశారు.
ఆయన మెదడులో గడ్డ కట్టిన రక్తాన్ని తొలగించేందుకు శస్త్రచికిత్స కోసం ఆగస్ట్ 10న దిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆస్పత్రిలో చేర్చారు.
శస్త్రచికిత్స తరువాత ఆయనకు కోవిడ్-19 పాజిటివ్గా నిర్ధరణ కావడంతో చికిత్స అందించారు.
అయితే.. సర్జరీ అనంతరం ప్రణబ్ ముఖర్జీ కోమాలోకి వెళ్లారు. ఆర్మీ ఆస్పత్రిలో వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తూ ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు సమాచారం తెలియజేస్తున్నారు.
ప్రణబ్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ సోమవారం సాయంత్రం 6 గంటల తర్వాత ట్విటర్లో వెల్లడించారు.
ఆగస్టు 10వ తేదీన ప్రణబ్ స్వయంగా.. తాను చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లినపుడు కోవిడ్ పరీక్షలో పాజిటివ్గా వచ్చిందని ట్వీట్ చేశారు.
అప్పటికి వారం రోజులుగా తనను కలిసి వారందరూ ఐసొలేట్ అయ్యి.. కోవిడ్ టెస్టులు చేయించుకోవాలని కోరారు.
అదే ఆయన ఆఖరి ట్వీట్ అయింది.
భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ భౌతికకాయానికికి పూర్తి సైనిక లాంఛనాల మధ్య మంగళవారం నాడు అంత్యక్రియలు నిర్వహించారు.
దిల్లీలోని లోధి శ్మశానవాటికలో కోవిడ్-19 ఆంక్షలు పాటిస్తూ, కుటుంబ సంప్రదాయాల ప్రకారం మంగళవారం మధ్యాహ్నం సుమారు రెండు గంటల సమయంలో ఆయన అంత్యక్రియలు జరిగాయి. సైనికులు గౌరవ వందనం సమర్పించారు.
కోవిడ్-19 దృష్ట్యా గన్ క్యారేజీకి బదులుగా ఓ అంబులెన్స్లో ప్రణబ్ మృతదేహాన్ని శ్మశానానికి తీసుకువచ్చారు.
అంతకుముందు, ఈరోజు ఉదయమే ప్రణబ్ మృతదేహాన్ని ఆర్మీ ఆసుపత్రి నుంచి 10 రాజాజీ మార్గ్లోని ఆయన అధికారిక నివాసానికి తరలించారు.
అక్కడ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, కాంగ్రెస్ నాయకులు మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ, గులాం నబీ ఆజాద్, దీల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తదితరులు ప్రణబ్కు నివాళులు అర్పించారు.
ఏడు రోజులు సంతాప దినాలు
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ గౌరవార్థం కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఏడు రోజులు సంతాప దినాలు ప్రకటించింది.
ప్రణబ్ మరణం పట్ల రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా ప్రభుత్వ, రాజకీయ, వివిధ రంగాల ప్రముఖుల నుంచి సోషల్ మీడియాలో సంతాప సందేశాలు వెల్లువెత్తాయి.
ప్రణబ్ కుమార్ ముఖర్జీ 1935, డిసెంబరు 11న బెంగాల్ (ఇప్పుడు పశ్చిమ బెంగాల్)లోని మిరాఠీ గ్రామంలో జన్మించారు.
2012 నుంచి 2017 వరకు భారతదేశ రాష్ట్రపతిగా ఉన్నారు. రాష్ట్రపతి పదవి చేపట్టకముందు 2009 నుంచి 2012 వరకు ఆయన కేంద్ర ఆర్థిక మంత్రిగా పనిచేశారు.
2012లో ప్రతిభా పాటిల్ పదవీ విరమణ తరువాత ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి పదవిని చేపట్టి 2017 వరకు కొనసాగారు.
2019లో ప్రతిష్టాత్మకమైన భారతరత్న పురస్కారాన్ని అందుకున్నారు.
"బెంగాల్లోని ఒక చిన్న దీపపు వెలుగు నుంచి దిల్లీ షాండ్లియర్ వెలుగు జిలుగులను చేరుకునే క్రమంలో నేను అనేక ఒడుదొడుకులను ఎదుర్కొన్నాను" అని తన జీవన ప్రయాణాన్ని ఆయన ఓ సందర్భంలో వివరించారు.
కాంగ్రెస్ హయాంలో సంక్షోభ పరిష్కర్తగా పేరుగాంచిన ప్రణబ్ ముఖర్జీ తన రాజకీయ ప్రస్థానంలో అనేక పదవులను చేపట్టారు.
రాజకీయల్లో వివాదరహితుడిగా పేరు తెచ్చుకున్నారు.
రాజకీయ ప్రస్థానం
ప్రణబ్ ముఖర్జీ రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చారు. ప్రణబ్ తండ్రి కమద్ కింకర్ ముఖర్జీ స్వతంత్ర పోరాటంలో పాల్గొని అనేక సంవత్సరాలు జైల్లో గడిపారు. స్వాతంత్ర్యం తరువాత 1952 నుంచి 1964 వరకూ పశ్చిమ బెంగాల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో భారత జాతీయ కాంగ్రెస్ తరపున సభ్యుడిగా ఉన్నారు. ఆయన తల్లి పేరు రాజ్యలక్ష్మి ముఖర్జి.
ప్రణబ్ ముఖర్జీ చదువు, ఉద్యోగం కోల్కతాలో సాగింది. చదువు ముగిసిన తరువాత అధ్యాపకుడిగా, విలేకరిగా పనిచేసిన తరువాత 1969లో రాజ్యసభ సభ్యునిగా ఎన్నిక కావడంతో ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది.
తరువాత నాలుగుసార్లు 1975, 1981, 1993, 1999 లలో రాజ్యసభ సభ్యులుగా ఎన్నికయ్యారు.
2004లో లోక్సభకు ఎన్నికయ్యారు. అప్పటి నుంచి 2012లో రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టేవరకూ లోక్సభలో కొనసాగారు.
గాంధీ కుటుంబానికి సన్నిహితుడిగా ఉంటూ ‘‘మ్యాన్ ఆఫ్ ఆల్ సీజన్స్" గా గుర్తింపు పొందారు.
కేబినెటెలో 1993-95 వరకూ వాణిజ్య మంత్రిగా, 1995-96, 2006-09 ల లో విదేశీ వ్యవహరాల మంత్రిగా, 2004-06 వరకు రక్షణ మంత్రిగా, 2009-12 వరకూ ఆర్థిక మంత్రిగా పదవులు నిర్వహించారు.
ఆర్థిక మంత్రిగా...
భారత ఆర్థిక వ్యవస్థకు మొదటి సంస్కర్తగా ముఖర్జీ గుర్తింపు పొందారు.
1982-84 మధ్య బాలన్స్ ఆఫ్ పేమెంట్ తరుగుదలను అదుపులో పెట్టి, కేంద్ర ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచే విధానాలను తీసుకురావడంలో ముఖర్జీ ప్రముఖ పాత్ర వహించారు.
అంతేకాకుండా ఐఎంఎఫ్ చివరి విడత రుణ సహాయాన్ని వెనక్కి తిరిగి ఇచ్చేయడం ద్వారా ఆర్థిక మంత్రిగా తన సమర్థతను చాటుకున్నారు.
ఇందిరాగాంధీ మరణానంతరం కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి పశ్చిమ బెంగాల్లో రాష్ట్రీయ సమాజవాదీ కాంగ్రెస్ (ఆర్ఎస్సీ)ను స్థాపించారు. మూడేళ్ల తరువాత ఈ పార్టీని భారత జాతీయ కాంగ్రెస్లో విలీనం చేశారు.
1991-96 వరకూ ప్రధాని పీవీ నరసింహరావు అధ్యక్షతన ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్గా బాధ్యతలు నిర్వహించారు.
ఈ కాలంలోనే మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా, ప్రధాని పీవీ నేతృత్వంలో ఆర్థిక సంస్కరణలు చేపట్టారు.
2008లో పద్మ విభూషణ్ పురస్కరాన్ని గ్రహించారు.
మళ్లీ 2009 లో ఆర్థికమంత్రిగా పదవిని చేపట్టారు. 2010-11 బడ్జెట్ ప్రసంగంలో మొట్టమొదటిసారిగా ప్రజా రుణాన్ని తగ్గించే లక్ష్యాన్ని ప్రకటించారు. ద్యవ్యలోటును తగ్గిస్తూ, వృద్ధిరేటుని పెంచే వివిధ ఆర్థిక విధానాలను రూపొందించారు.
అంతర్జాతీయంగానూ గుర్తింపు
ప్రణబ్ ముఖర్జీ దేశప్రభుత్వంలోనే కాకుండా అంతర్జాతీయ సంస్థల్లో కూడా ముఖ్యమైన స్థానాలను అధిష్టించారు.
భారత ఆర్థికమంత్రిగా ఉన్న కాలంలోనే ఆఫ్రికన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ), ఇంటర్నేషనల్ మోనటరీ ఫండ్ (ఐఎంఎఫ్), వరల్డ్ బ్యాంకులలో బోర్డ్ ఆఫ్ గవర్నర్లలో ఒకరిగా వ్యవహరించారు.
వ్యక్తిగత జీవితం
ప్రణబ్ ముఖర్జీ 1957లో సువ్రా ముఖర్జీని వివాహమాడారు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.
పెద్ద కుమారుడు అభిజిత్ ముఖర్జీ కూడా పార్లమెంట్ సభ్యుడిగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో అభిజిత్ ఓటమి పాలయ్యారు.
కుమార్తె శర్మిష్ఠ కాంగ్రెస్ పార్టీ నేత. ప్రణబ్ ముఖర్జీ చాలా పుస్తకాలు కూడా రాశారు. వాటిల్లో "థాట్స్ అండ్ రిఫ్లెక్షన్స్ (2014), ద టర్బులెంట్ ఇయర్స్ (2016), కొయిలేషన్ యియర్స్ (2017) విమర్శకుల ప్రశంసలు పొందాయి.
రాష్ట్రపతి, ప్రధాని సంతాపం
‘‘మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అస్తమయం గురించి వినగానే నా మనసు దిగ్భ్రాంతికి గురైంది. ఆయన మరణం ఒక శకానికి ముగింపు. ప్రణబ్ ముఖర్జీ కుటుంబానికి, స్నేహితులకు, దేశ ప్రజలందరికీ నా ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నాను’’ అంటూ రాష్ట్రపతి కోవింద్ సంతాపం తెలిపారు.
ప్రణబ్ ముఖర్జీ మరణంపై ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.
‘‘భారత రత్న శ్రీ ప్రణబ్ ముఖర్జీ మరణంతో భారతదేశం విషాదంలో మునిగింది. ఆయన మన దేశ అభివృద్ధి పథంలో చెరగని ముద్ర వేశారు. ఒక సమర్థుడైన విద్యావంతుడుగా, అత్యున్నత రాజనీతిజ్ఞుడుగా ఆయన రాజకీయాలకు అతీతంగా సమాజంలోని అన్ని వర్గాల నుంచీ ప్రశంసలు అందుకున్నారు’’ అంటూ సంతాపం వ్యక్తంచేశారు.
ప్రణబ్ ముఖర్జీ మృతికి కాంగ్రెస్ ట్విటర్లో సంతాపం వ్యక్తం చేసింది.
‘‘ప్రణబ్ ముఖర్జీ మరణం మమ్మల్ని తీవ్రంగా బాధించింది. భారత మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతల్లో ఒకరైన ప్రణబ్ ముఖర్జీ ఆయన చిత్తశుద్ధి, కరుణకు ఎప్పటికీ చిరస్మరణీయులుగా ఉంటారు. ఆయన కుటుంబం, దేశంతో కలిసి మేం ప్రార్థిస్తున్నాం’’ అని పేర్కొంది.
ప్రణబ్ ముఖర్జీ మృతి దేశానికి వ్యూహాత్మక నష్టమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఒక ట్వీట్లో విచారం వ్యక్తంచేశారు. ఆయన గత ఐదు దశాబ్దాలుగా దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఆయన కుటుంబానికి సంతాపం తెలిపారు.
''మాజీ భారత రాష్ట్రపతి, భారత రత్న ప్రణబ్ ముఖర్జీ మరణం తీవ్ర విషాదం నింపింది. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో ప్రణబ్ ముఖర్జీ కీలక పాత్ర పోషించారు'' అని కేటీఆర్ సంతాపం తెలిపారు.
కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్, హర్షవర్దన్, స్మృతి ఇరానీలతోపాటూ మమతా బెనర్జీ, విజయసాయిరెడ్డి, నారా లోకేష్, సినీ నటులు మహేశ్ బాబు, నాగబాబు కూడా ప్రణబ్ ముఖర్జీ మృతికి ట్విటర్లో సంతాపం తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- దేశ భాషలందు తెలుగు: 50 ఏళ్లలో 2 నుంచి 4వ స్థానానికి
- తమిళ విద్యార్థులను ఆకట్టుకున్న ఈ టీచర్ తెలుగాయనే
- నల్లమల: సంపర్కం, ఆవాసం కోసం పులుల మధ్య పోరాటం
- మరో 10వారాల్లో పాకిస్తాన్ ఖజానా ఖాళీ!
- ఉత్తర, దక్షిణ కొరియాల్లాగా భారత్-పాకిస్తాన్ దగ్గరవడం సాధ్యమేనా?
- ‘పాకిస్తాన్ ఆందోళన’కు కారణమైన ఇస్రో 100వ స్వదేశీ శాటిలైట్ విశేషాలివే
- Reality check: చైనీస్.. పాకిస్తాన్ అధికారిక భాషగా మారిందా?
- కశ్మీర్ విలీనానికి 70 ఏళ్లు: భారతదేశంలో ఇలా కలిసింది
- ‘కశ్మీర్పై భారత్కు ఇజ్రాయెల్ దారి చూపిస్తోందా?’
- హైదరాబాద్ పేరెత్తకుంటే.. కశ్మీర్ను పాకిస్తాన్కు వదిలేస్తామని పటేల్ చెప్పింది నిజమేనా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)