సునీతా యాదవ్: ‘ఐపీఎస్‌ ఆఫీసర్‌ కావాలనుకుంటున్నా’

ప్రచురణ

గుజరాత్‌లో కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించి అర్థరాత్రి బయటకొచ్చిన ఇద్దరిని పోలీసు సునీతా యాదవ్ రోడ్డుపైనే నిలిపేశారు.

వాళ్ల కోసం వచ్చిన ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి కుమారుడిని కూడా నిలదీశారు. ఈ ఘటనతో ఆమెను సోషల్ మీడియాలో ఎంతో మంది అభినందించారు.

అయితే.. ఆ రోజు రాత్రి ఏం జరిగిందో, ఆమె తన ఉద్యోగానికి ఎందుకు రాజీనామా చేశారో ఆమె మాటల్లోనే..

‘‘నేను కానిస్టేబుల్‌ను కాదు. నేను ఎల్‌ఆర్‌ ఆఫీసర్‌ను. నా దగ్గర ఒక కానిస్టేబుల్, ఒక ఉన్నతాధికారి ఉన్నారు. నాకు తెలిసిన చాలా విషయాలు ఉన్నాయి. కానీ వాటన్నింటినీ నేను చెప్పలేను. ఎందుకంటే నా మీద విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. వీడియో వైరల్‌ కావడం, ఆడియో వైరల్ కావడం చివరి సీన్‌. మీడియా ముందుకు, సోషల్‌ మీడియాకు చేరేది కేవలం 10 శాతమే. కానీ దానికి ముందు అసలు సినిమా ఉంటుంది.

పోలీసులు 24గంటలు డ్యూటీ చేస్తుంటారు. చెప్పాలంటే సామాన్య వ్యక్తులు ఆత్మహత్య చేసుకునే టెన్షన్‌కన్నా పోలీసులు డబుల్‌ ఫ్రస్టేషన్‌కు, టెన్షన్‌కు గురవుతుంటారు. పోలీసులు ఎప్పుడూ కోపంగా ఉంటారని అంటుంటారు. ఎందుకంటే వారికి ఉన్న టెన్షన్లు అలాంటివి. వాళ్లు చేయాల్సిన పనులు అలా ఉంటాయి. వారు దేవుళ్లు కాదు. మామూలు మనుషులే. కాబట్టి నేను కోరేది ఏంటంటే వాళ్లతో కాస్త ప్రేమగా మాట్లాడండి. వాళ్లకు కూడా ప్రశాంతంగా ఉంటుంది. మానసిక ఒత్తిడి నుంచి కాస్త రిలీఫ్‌ ఫీలవుతారు. అరే,ఒరే అని మాట్లాడటం వల్ల మనసు మీద ఒత్తిడి పడుతుంది. ఈ ఒత్తిళ్లు వాళ్లు ఇంట్లో వాళ్ల మీద చూపిస్తుంటారు. ఇంట్లో ఏం చేసినా వాళ్లకు తిరుగులేదు. వీధిలో పిల్లిలాగా ఉండేవాళ్లు ఇంట్లో పులులవుతారు. బయట వాళ్ల మీద రకరకాల ఒత్తిళ్లు ఉంటాయి. అవి మీడియా కావచ్చు, ఉన్నతాధికారులు కావచ్చు. ఏదో ఒకదాని వల్ల వారి మనసు పాడవుతుంది. ఆ కోపాన్నంతా ఇంట్లో వాళ్ల మీద చూపిస్తారు.

నేను కూడా సామాన్యురాలినే. దేవతను కాదు. ఉన్నతాధికారిని కాదు. సాధారణ ఎల్‌ఆర్‌ ఆఫీసర్‌ను. ఈ ఉద్యోగం వల్ల నాకు గౌరవం వస్తుంది. నాలాగా ఉండాలనుకునే వారు చాలామంది ఉన్నారు. డిపార్ట్‌మెంట్‌లో అమ్మాయిలు చాలామంది పని చేస్తున్నారు. వాళ్లు కూడా విధి నిర్వహణలో సింగంలా ఉండాలనుకుంటారు. కానీ ఉన్నతాధికారులు వారిని అలా పని చేయనివ్వరు. ఈ డిపార్ట్‌మెంట్లో నేనొక్కదాన్నే కాదు. చాలామంది నిస్సహాయంగా ఉంటారు.

ఒక చిన్న సంఘటన జరిగింది. క్లుప్తంగా చెబుతాను. ఆ రోజు నాతోపాటు ఒక పోలీస్‌ మిత్రుడు ఉన్నారు. ఆయన నాకు సాక్షాత్తు దేవుడిలాంటివాడు. వచ్చిన వ్యక్తులు ఎవరో తెలియదు. ఆయన లేకపోయినట్లయితే ఆ రోజు నిర్భయ కాండ-2 జరిగేది. ప్రజలంతా ఈపాటికి కొవ్వొత్తులు పట్టుకుని ర్యాలీలు తీసేవారు. వాస్తవంగా నాకు న్యాయం కావాలి. కానీ నాకు ఇప్పుడు అది అంత అవసరం లేదు.

ఇటీవల ఓ పోలీస్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేశారు. నేను కూడా అలాగే నా భవిష్యత్తు కోసం రాజీనామా చేస్తున్నాను. నాకు పవర్‌ కావాలి. దాని కోసం నేను కష్టపపడాలి. నేను ఐపీఎస్‌ ఆఫీసర్‌ కావాలని అనుకుంటున్నాను. రేపు ఏమవుతుందో నాకు తెలియదు. నేను బతికుంటే నేను చాలా కష్టపడతాను. ఐపీఎస్‌ ఆఫీసర్‌ అయి నేనేంటో నిరూపిస్తాను. పవర్‌ ఉందని ఎవరైతే విర్రవీగుతున్నారో వారికి తెలిసి వచ్చేలా చేస్తాను. నేను మీడియా ముందుకు ఎందుకు రాలేదంటే నేను చేయాల్సిన అధికారిక పనులు, ప్రాసెస్‌ మిగిలి ఉన్నాయి. అవి పూర్తయ్యాక మీడియా ముందుకు వస్తాను’’.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)