పార్లీ జీ: లాక్‌డౌన్‌లో రికార్డు స్థాయి విక్రయాలు... ఎలా పెరిగాయి?

ప్రచురణ
చదివే సమయం: 2 నిమిషాలు

దేశంలో క‌రోనావైర‌స్ వ్యాప్తిని అడ్డుకునేందుకు విధించిన లాక్‌డౌన్‌ కాలంలో పార్లీ కంపెనీ ఉత్ప‌త్తులు రికార్డు స్థాయిలో అమ్ముడ‌య్యాయి.

పార్లీ-జీ బిస్కెట్స్ షేర్ విలువ అయితే దాదాపు ఐదు శాతం పెరిగింది. పోటీ ఎక్కువ‌గా ఉండే బిస్కెట్ల రంగంలో షేర్ విలువ ఇలా పెర‌గ‌డం అరుద‌ని మార్కెట్‌ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

లాక్‌డౌన్‌లో కార్మికులు వ‌ల‌స బాట ప‌ట్టిన త‌రుణంలో రికార్డు స్థాయి విక్ర‌యాలు ఎలా సాధ్య‌మ‌య్యాయి? కోవిడ్‌-19 ప్ర‌భావం సంస్థ‌పై ఎంత వ‌ర‌కు ప‌డింది?

అంద‌రికీ పంచేందుకు వీలుగా

"ఏప్రిల్‌, మే నెల‌ల్లో పార్లీ ఉత్ప‌త్తులు రికార్డు స్థాయిలో అమ్ముడ‌య్యాయి. లాక్‌డౌన్ స‌మ‌యంలో చాలా మంది వీటిని కొనుగోలు చేశారు. ఆహార పంపిణీ కోసం ప్ర‌భుత్వాల‌తోపాటు, స్వ‌చ్ఛంద సంస్థ‌లూ పార్లీజీ బిస్కెట్ల వైపు మొగ్గు చూపాయి. త‌క్కువ ధ‌ర‌కే బిస్కెట్లు విక్ర‌యించ‌డ‌మే దీనికి కార‌ణం. పైగా పార్లీ బిస్కెట్ల‌లో గ్లూకోజ్ స్థాయిలు ఎక్కువ‌గా ఉంటాయి" అని పార్లీ ప్రోడ‌క్ట్స్ సీనియ‌ర్ కెట‌గిరీ హెడ్ మ‌యాంక్ షా పీటీఐతో చెప్పారు.

"విక్ర‌యాలు రికార్డు స్థాయిలో జ‌రిగాయి. అందుకే మార్కెట్ షేర్ 4.5 నుంచి 5 శాతం మ‌ధ్య పెరిగింది" అని తెలిపారు.

మ‌రోవైపు లాక్‌డౌన్ స‌మ‌యంలో కార్మికుల కొర‌త కూడా త‌మ‌ను వేధించింద‌ని పార్లీ ప్రోడ‌క్ట్స్ మార్కెటింగ్ మేనేజ‌ర్ కృష్ణారావు బుద్ధా బీబీసీతో మాట్లాడుతూ పేర్కొన్నారు.

"ఆ స‌మ‌యంలో మాకు కార్మికుల కొత‌ర పెద్ద స‌వాల్‌గా మారింది. దాదాపు 15 నుంచి 20 శాతం వ‌ర‌కు ఉత్ప‌త్తిపై ఇది ప్ర‌భావం చూపింది" అని ఆయ‌న అన్నారు.

లాక్‌డౌన్‌లో బిస్కెట్లకు డిమాండ్ పెరిగింది...

లాక్‌డౌన్‌లో త‌మ బిస్కెట్ల‌కు ఆద‌ర‌ణ ఎలా పెరిగిందో కృష్ణారావు వివ‌రించారు. "లాక్‌డౌన్ వ‌ల్ల ఎక్కువ మంది ఇంటి భోజ‌నమే తినాల్సిన అవ‌స‌రం వ‌చ్చింది. దీంతో ప్యాకేజీ ఫుడ్‌కు డిమాండ్ పెరిగింది. రోజూ ప‌ప్పు, చ‌పాతీ, కూర‌లు తిన‌డంతో పిల్ల‌ల‌తోపాటు పెద్ద‌లు కూడా చిరుతిండ్లవైపు మొగ్గుచూపారు. దీంతో బిస్కెట్ల‌తోపాటు నూడుల్స్‌, డ్రైఫ్రూట్స్ లాంటి జంక్ ఫుడ్స్ విక్ర‌యాలు పెరిగాయి."అయితే విప‌రీతంగా పెరిగిన డిమాండ్‌ను తాము పూర్తిగా అందుకోలేక‌పోయామ‌ని ఆయ‌న అన్నారు. "సిబ్బంది స‌రిగా అందుబాటులో లేక‌పోవ‌డంతోపాటు స్థానికంగా విధించిన ఆంక్ష‌లూ అవ‌రోధాలుగా మారాయి. చాలా మంది బిస్కెట్ల‌ను కొనుగోలు చేసి ఇంట్లో దాచుకున్నారు. ఫ‌లితంగా మార్కెట్లో షెల్ఫ్‌లు ఖాళీ అయ్యాయి." డిమాండ్ పెరిగినా తమ ఉత్ప‌త్తుల ధ‌ర‌ల్లో ఎలాంటి మార్పూ చేయ‌లేద‌ని ఆయ‌న చెప్పారు. "ప్ర‌స్తుతం చ‌మురు, పంచ‌దార‌, గోధుమ పిండి.. ఇలా ఏ స‌ర‌కుల్లోనూ ధ‌ర‌లు పెరిగిన‌ట్లు క‌నిపించ‌లేదు. అందుకే మేము ధ‌ర‌ల‌ను కూడా పెంచ‌లేదు." ప్ర‌భుత్వం కొంత‌వ‌ర‌కు తాము సాయం చేసింద‌ని ఆయ‌న అన్నారు. "50 శాతం ఉద్యోగుల‌తో త‌యారీకి అనుమ‌తి ఇచ్చారు. దీంతో ఉత్ప‌త్తి కొన‌సాగించ‌గ‌లిగాం. ప్ర‌స్తుతం నిత్య‌వ‌స‌ర వ‌స్తువులు పెర‌గ‌కుండా ప్ర‌భుత్వం చూడాలి. అంతేకాదు ఉద్యోగాల క‌ల్ప‌నపైనా ప్ర‌భుత్వం దృష్టి పెట్టాలి. ఫ‌లితంగా ప్ర‌జ‌ల చేతిలోకి డబ్బులు వ‌స్తాయి. ఆర్థిక వ్య‌వ‌స్థ కూడా గాడిన ప‌డుతుంది."అని ఆయ‌న అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)