హైదరాబాద్‌లో చిక్కుకుపోయినవారి కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు... ఏపీకి రావాలంటే షరతులు ఇవే.. - ప్రెస్ రివ్యూ

ప్రచురణ

లాక్‌డౌన్‌ వల్ల హైదరాబాద్‌లో చిక్కుకుపోయిన ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు స్వస్థలాలకు వచ్చేందుకు వీలుగా ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడపనుందని ‘ఈనాడు’ దినపత్రిక ఓ వార్త రాసింది.

ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పందన పోర్టల్‌లో దరఖాస్తు చేసుకున్నవారికే ప్రత్యేక బస్సుల్లో ప్రయాణించేందుకు అవకాశం కల్పించనున్నారు. స్వస్థలాలకు చేరుకున్న తర్వాత సంబంధిత జిల్లాలో క్వారంటైన్‌ కేంద్రంలో ఉండేందుకు అంగీకరించిన వారికే టిక్కెట్లు జారీ చేస్తారు.

ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలంటూ ఉన్నతాధికారులు అన్ని జిల్లాల ఆర్టీసీ రీజినల్‌ మేనేజర్లకు బుధవారం ఆదేశాలు పంపారు. ఏపీకి వస్తామంటూ హైదరాబాద్‌లో 8 వేల మంది, రంగారెడ్డి జిల్లా పరిధిలో 5 వేల మంది స్పందన పోర్టల్‌లో దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 13 వేల మందిని తీసుకొచ్చేందుకు బస్సు సర్వీసులు నడపనున్నారు.

ఏసీ బస్సుల్లో గరుడ ఛార్జీ, నాన్‌ ఏసీ బస్సుల్లో సూపర్‌ లగ్జరీ ఛార్జీ తీసుకోనున్నారు. ఈ బస్సులు మియాపూర్‌-బొల్లారం క్రాస్‌రోడ్‌, కూకట్‌పల్లి హౌసింగ్‌బోర్డ్‌, ఎల్బీనగర్‌లలో ప్రయాణికులను ఎక్కించుకున్న తర్వాత మధ్యలో ఎక్కడా ఆగకుండా నేరుగా గమ్యస్థానానికి చేరుకుంటాయి.

ముందుగా ఆన్‌లైన్‌ బుకింగ్‌కు అవకాశం ఇస్తారు. ఈ సర్వీసుల్లో కరెంట్‌ బుకింగ్‌ చేసుకునే వీలుండదు. ఈ బస్‌ సర్వీసులు రెండు, మూడు రోజుల్లో మొదలయ్యే అవకాశం ఉందని తెలిసింది.

ప్రభుత్వం దీనిపై అధికారికంగా ప్రకటన చేసిన వెంటనే ఆర్టీసీ అధికారులు ఈ-టికెట్‌ బుకింగ్‌కు అవకాశం ఇవ్వనున్నారు.

రెండో దశలో బెంగళూరు, చెన్నై నగరాల్లో ఉండిపోయిన ఏపీకి చెందిన వారినీ తీసుకొచ్చేందుకు సర్వీసులు నడపనున్నారు. బెంగళూరులో 2,700 మంది, చెన్నైలో 1,700 మంది స్పందన పోర్టల్‌లో పేర్లు నమోదు చేసుకున్నారు. తిరుగు ప్రయాణంలో ఏపీ నుంచి వెళ్లే వారికి ఈ సర్వీసుల్లో అవకాశం ఉండదని ఆర్టీసీ అధికారులు తెలిపారు.

అత్యవసర, ముఖ్యమైన పనులపై ప్రయాణించే వారికి పోలీసుశాఖ కొవిడ్‌ 19 పేరుతో ఈ-పాస్‌లు జారీ చేయనుంది. అవసరమైన వారు దరఖాస్తు చేసుకోవచ్చని ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ కార్యాలయం బుధవారం ఒక ప్రకటనలో సూచించింది.

అత్యవసర వైద్యం, కుటుంబంలో మరణం, సామాజిక పనులు, ప్రభుత్వ విధినిర్వహణ పనులపై ప్రయాణించే సమయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ముఖ్యమంత్రి దృష్టికి వచ్చిన నేపథ్యంలో.. సీఎం ఆదేశాల మేరకు పాస్‌లు మంజూరు చేస్తున్నట్లు తెలిపింది.

కొవిడ్‌-19 అత్యవసర ఈ-పాస్‌కు దరఖాస్తు చేసుకునే చిరునామా https: citizen.appolice.gov.in ఈ-పాస్‌ కోసం ఇచ్చిన వివరాలను ఆమోదిస్తే.. వాహన అత్యవసర ఈ-పాస్‌ను దరఖాస్తు చేసుకున్న వారి మొబైల్‌, మెయిల్‌ ఐడీకి పంపిస్తారు.

‘కృష్ణా నది 30 ఏళ్ల వరద లెక్కలివ్వండి’

కృష్ణా బేసిన్‌లో వరద జలాల లెక్కలను పూర్తిస్థాయిలో సమగ్ర అధ్యయనం చేశాకే కృష్ణా మిగులు జలాల విషయాన్ని తేల్చాలని కేంద్ర జల సంఘం (సీబ్ల్యూసీ), కృష్ణా నదీ బోర్డు నిర్ణయించినట్లు ‘సాక్షి’ దినపత్రిక ఓ కథనం ప్రచురించింది.

ఇరు రాష్ట్రాలు 30 ఏళ్ల వరద లెక్కలను సమర్పిస్తే వాటి ఆధారంగానే ఓ నిర్ణయానికి రావచ్చనే అభిప్రాయాన్ని సీడబ్ల్యూసీ, కృష్ణా బోర్డు వెలిబుచ్చాయి. ఈ నెలాఖరులోగా ఇరు రాష్ట్రాలు వరద జలాల డేటా సమర్పించాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలను ఆదేశించాయి.

మిగులు జలాలపై బుధవారం సీడబ్ల్యూసీ, కృష్ణా బోర్డు అధికారులు తెలంగాణ, ఏపీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. సీడబ్ల్యూసీ సీఈ విజయ్‌శరణ్, కృష్ణా బోర్డు తరఫున సాంకేతిక కమిటీ సభ్యకార్యదర్శి హరికేశ్‌మీనా, తెలంగాణ, ఏపీ అంతర్రాష్ట్ర జల వనరుల విభాగం సీఈలు నరసింహారావు, నాగేశ్వరరావు కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.

ఇరవై నిమిషాల పాటు సాగిన కాన్ఫరెన్స్‌లో తెలంగాణ తరఫున సీఈ నరసింహారావు మాట్లాడుతూ, ఈ ఏడాది ఏపీ తన వాటాకు మించి నీటిని వినియోగించిన అంశాన్ని దృష్టికి తెచ్చారు. వరద జలాలను సైతం ఎక్కువగా వినియోగించిందని, పోతిరెడ్డిపాడు ద్వారా అధికంగా నీటిని వినియోగించారని వెల్లడించారు. ఈ దృష్ట్యా వరద జలాలను ఇరు రాష్ట్రాలు ఏ రీతిన వినియోగించుకోవాలో వాటాలు నిర్ణయించాలని కోరారు.

ఏపీ తరఫున సీఈ మాట్లాడుతూ, ఈ నెలాఖరుతో వాటర్‌ ఇయర్‌ ముగుస్తున్నందున ఈ ఏడాది మిగులు జలాల వాటా ఎంత దక్కుతుందో చెప్పాలని కోరారు. అయితే దీనికి సీడబ్ల్యూసీ అభ్యంతరం చెబుతూ, ఇప్పటికిప్పుడు మిగులు జలాల వాటాలు తేల్చడం సాధ్యం కాదని తెలిపింది.

మిగులు జలాలపై బ్రజేశ్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ తేల్చే వరకు, ఇరు రాష్ట్రాలకు ఆమోదయోగ్యంగా ఉండే శాశ్వత పరిష్కారం కనుగొందామని సూచించింది. జూన్‌ మొదటి వారంలో మరోమారు కాన్ఫరెన్స్‌ నిర్వహిద్దామని తెలిపింది.

హైదరాబాద్‌లో రెమ్డిసివిర్‌ ఉత్పత్తి

కోవిడ్‌-19 చికిత్సలో కీలకంగా ఉపయోగిస్తున్న యాంటీవైరల్‌ ఔషధం ‘రెమ్డిసివిర్‌' ఇకపై హైదరాబాద్‌లో ఉత్పత్తి కాబోతున్నట్లు ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక ఓ వార్త రాసింది.

రెమ్డిసివర్ ఔషధ తయారీ, పంపిణీ కోసం హైదరాబాద్‌కు చెందిన హెటిరో ల్యాబ్స్‌.. అమెరికా సంస్థ గిలీడ్‌ సైస్సెస్‌తో నాన్‌-ఎక్స్‌క్లూజివ్‌ లైసెన్సింగ్‌ ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

కరోనా వైరస్‌ బాధితులకు ఉపశమనం కలిగిస్తున్న రెమ్డిసివిర్‌కు అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్‌ఎఫ్‌డీఏ) ఇప్పటికే అత్యవసర వినియోగ అనుమతి (ఎమర్జెన్సీ యూజ్‌ ఆథరైజేషన్‌) ఇచ్చింది. ఈ ఒప్పందం ద్వారా గిలీడ్‌ నుంచి సాంకేతికత బదిలీ అవుతుంది.

రెమ్డిసివిర్‌ ఔషధాన్ని వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు, వివిధ దేశాల నియంత్రణ సంస్థల ఆమోదంతో దీని ఉత్పత్తిని పెంచేందుకు ఈ ఒప్పందం దోహదపడుతుంది.

భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎమ్మార్‌) నుంచి అనుమతి పొందిన వెంటనే హైదరాబాద్‌లో ఈ రెమ్డిసివిర్‌ను తయారుచేయనున్నట్టు హెటిరో సంస్థ ప్రకటించింది. ప్రస్తుత సంక్లిష్ట సమయంలో భారత్‌తోపాటు ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఊరట కల్పించేలా గిలీడ్‌తో కీలక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం సంతోషదాయకమని హెటిరో గ్రూప్‌ సంస్థల చైర్మన్‌ డాక్టర్‌ బీ పార్థసారథిరెడ్డి తెలిపారు.

గిలీడ్‌తో కుదిరిన ఒప్పందం ప్రకారం సిప్లా సంస్థ యాక్టివ్‌ ఫార్మాస్యూటికల్‌ ఇంగ్రీడియంట్‌ (ఏపీఐ)ను తయారుచేసి అంతిమ ఉత్పత్తిని అదే బ్రాండ్‌ పేరిట 127 దేశాల్లో విక్రయించనుంది.

రెమ్డిసివిర్‌ ఉత్పత్తి, పంపిణీ కోసం హెటిరోతోపాటు మైలాన్‌ సంస్థ, ముంబై కేంద్రంగా పనిచేస్తున్న సిప్లా, నోయిడాలోని జుబిలెంట్‌ లైఫ్‌సైన్సెస్‌ సంస్థ కూడా గిలీడ్‌తో ఒప్పందాలు చేసుకున్నాయి.

మొత్తంగా నాలుగు దేశీయ ఫార్మా కంపెనీలతోపాటు పాకిస్థాన్‌కు చెందిన ఫిరోజ్‌సన్స్‌ ల్యాబొరేటరీస్‌ కూడా గిలీడ్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందాలు ఎక్కువకాలం కొనసాగితే అభివృద్ధి చెందుతున్న దేశాలకు భారత్‌, పాక్‌ భారీస్థాయిలో ఔషధాలను అందజేయగలుగుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

తెలంగాణలో కల్లు విక్రయాలకు అనుమతి

తెలంగాణలో కల్లు విక్రయాలకూ అనుమతినిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రిక ఓ వార్త ప్రచురించింది.

చెట్లు, మండువాల దగ్గర భౌతిక దూరాన్ని పాటిస్తూ కల్లు విక్రయాలు సాగించుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. కానీ... కరోనా కట్టడి ప్రాంతాలు, కల్లు కాంపౌండ్లు, కల్లు దుకాణాల్లో మాత్రం అమ్మకాలు జరపడానికి వీల్లేదని స్పష్టం చేసింది. తదుపరి ఉత్తర్వులు జారీచేసే వరకు వాటిని మూసే ఉంచాలని స్పష్టం చేసింది.

ఈ మేరకు సీఎస్‌, ఎక్సైజ్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఉత్తర్వులను జారీ చేశారు. లాక్‌డౌన్‌ ప్రారంభమైన మార్చి 22 నుంచి బార్‌ అండ్‌ రెస్టారెంట్ల మాదిరిగానే కల్లు దుకాణాలను కూడా మూసి ఉంచాలని ప్రభుత్వం ఆదేశించింది.

ఈనెల 6 నుంచి రాష్ట్రంలో మద్యం అమ్మకాలకు ప్రభుత్వం అనుమతించింది. ఈ నేపథ్యంలో కల్లు విక్రయాలకు కూడా అనుమతులివ్వాలంటూ గౌడ, గీత కార్మిక సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతూ వచ్చాయి.

మద్యం అమ్మకాలను అనుమతించినట్లుగానే కల్లు విక్రయాలను నిబంధనలతో అనుమతించాలని ఆ సంఘాల నేతలు విజ్ఞప్తి చేశారు. దీంతో ప్రభుత్వం కల్లు విక్రయాలను అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

కరోనా కట్టడి ప్రాంతాలు మినహా అన్ని జిల్లాల్లో కల్లు గీయవచ్చని, అమ్మకాలు జరపవచ్చని సూచించింది. కొవిడ్‌-19 మార్గదర్శకాల ప్రకారం తప్పకుండా భౌతిక దూరాన్ని పాటించాలని, ఇతర జాగ్రత్తలు తీసుకోవాలని వివరించింది.

కల్లు గీత, విక్రయాలకు ప్రభుత్వం అనుమతివ్వడంతో 3 లక్షల మంది గీత కార్మికులకు ప్రత్యక్షంగా, మరో 40 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి లభించనుందని ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌ తెలిపారు.

అయితే, కల్లు గీత, విక్రయాల కోసం ప్రభుత్వం ఇచ్చిన అనుమతి సంపూర్ణంగా లేదని కల్లు గీత కార్మిక, గౌడ సంఘాలు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఉత్తర్వులతో గీత కార్మికులకు పెద్దగా ఒరిగేదేమీ లేదని మండిపడుతున్నాయి. కల్లు కాంపౌండ్లు, దుకాణాలు లేనప్పుడు కల్లును ఎక్కడ విక్రయించాలని గౌడ సంఘం నేతలు ప్రశ్నిస్తున్నారు.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)