మన్మోహన్ సింగ్‌కు అస్వస్థత, దిల్లీలోని ఎయిమ్స్‌లో చేరిక

ప్రచురణ
చదివే సమయం: 2 నిమిషాలు

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ దిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్లో చేరారు.

ఛాతీ నొప్పితో బాధపడుతున్న ఆయనను ఎయిమ్స్ హాస్పటల్లో చేర్చారని ఏఎన్ఐ వార్తాసంస్థ వెల్లడించింది.

మరో వార్తా సంస్థ పీటీఐ కూడా ఈ విషయాన్ని వెల్లడించింది. కార్డియో-థొరాసిక్ వార్డులో మన్మోహన్ సింగ్ ప్రస్తుతం అబ్జర్వేషన్‌లో ఉన్నారని పేర్కొంది.

కాంగ్రెస్ అధికార ప్రతినిధి జయ్‌వీర్ షెర్గిల్ ఈ సమాచారాన్ని ధ్రువీకరించారు.

ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు తన ట్విటర్ హ్యాండిల్ ద్వారా వెల్లడించారు.

మన్మోహన్ సింగ్ 2004లో అనూహ్య పరిణామాల మధ్య భారత ప్రధాని పదవిని చేపట్టారు. ఆ తర్వాత 2014 వరకూ పదేళ్ల పాటు భారత ప్రధానిగా ఉన్నారు.

పంజాబ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా తన కెరీర్ ప్రారంభించిన మన్మోహన్ సింగ్ తర్వాత కాలంలో భారతదేశంలో ఎగుమతులు, దిగుమతులపై కేంబ్రిడ్జిలో రీసెర్చ్ చేశారు. కేంబ్రిడ్జి నుంచి తిరిగి వచ్చిన వెంటనే ఆయను విదేశీ వాణిజ్య విభాగంలో సలహాదారుగా నియమించారు.

మన్మోహన్ సింగ్ ప్రణాళికా సంఘం ఛైర్మన్‌గా, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా, యూజీసీ ఛైర్మన్‌గా పని చేశారు. 1991లో ప్రధాని నరసింహారావు ఆయనను ఆర్థికమంత్రిగా నియమించారు.

''మన్మోహన్ సింగ్‌కు సొంతంగా ప్రసంగాలు చేయడం అసలు వచ్చేది కాదు. ఆయన గొంతు చాలా సన్నగా ఉండేది. అందువల్ల ఏదైనా విషయాన్ని ఆయన గట్టిగా చెప్పలేకపోయేవారు. దేశప్రజలను ఉద్దేశించి ఎప్పుడైనా మాట్లాడాల్సి వస్తే మొదట చాలా ప్రాక్టీస్ చేసేవారు. 2004లో మొదటిసారి ఎర్రకోట నుంచి దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడాల్సి వచ్చినపుడు, మన్మోహన్ తన ప్రసంగాన్ని బాగా ప్రాక్టీస్ చేశారు. అయితే క్రమంగా బాగా మాట్లాడ్డం రావడంతో ఆ ప్రాక్టీస్ మానేశారు. ఆయనకు హిందీ చదవడం వచ్చేది కాదు. ఆయన ప్రసంగాన్ని ఉర్దూలోగానీ, గుర్ముఖి లిపిలోగాని రాసుకునేవారు'' అని మన్మోహన్ ప్రధానిగా ఉన్నప్పుడు మీడియా సలహాదారుగా పనిచేసిన సంజయ్ బారు 'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్' పుస్తకంలో రాశారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)