You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కశ్మీర్: టెలిఫోన్, ఇంటర్నెట్ సేవల పాక్షిక పునరుద్ధరణ, సోమవారం నుంచి తెరుచుకోనున్న స్కూళ్ళు, ఆఫీసులు
కశ్మీర్లో ల్యాండ్లైన్ టెలిఫోన్ సర్వీసులను పాక్షికంగా పునరుద్ధరిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. కశ్మీర్ లోయలోని 100 ఫోన్ ఎక్ఛేంజిల్లో 17 పనిచేస్తున్నాయని అధికారులు తెలిపారు.
ఆదివారం సాయంత్రంలోగా అత్యధిక టెలిఫోన్ ఎక్ఛేంజిలు పనిచేస్తాయని వారు చెప్పారు.
ఇంటర్నెట్, మొబైల్ ఫోన్ సేవలపై నిషేధం కొనసాగుతోంది.
జమ్ము ఐదు జిల్లాల్లో 2జీ స్పీడ్తో ఇంటర్నెట్ సేవలు ప్రారంభించారు.
జమ్ము-కశ్మీర్ ప్రిన్సిపల్ సెక్రటరీ(ప్లానింగ్ కమిషన్) రోహిత్ కాంసల్ "ఉదయం నుంచి కశ్మీర్ లోయలో 35 పోలీస్ స్టేషన్ల పరిధిలోని ప్రాంతాల్లో ఆంక్షలు సడలించాం" అని చెప్పారు.
ఆదివారం సాయంత్రం నుంచి కొన్ని సున్నితమైన ప్రాంతాల మినహా కశ్మీర్ లోయలోని అన్ని టెలిఫోన్ ఎక్ఛేంజిలు పనిచేయడం ప్రారంభిస్తాయని అన్నారు.
జమ్ములో ల్యాండ్లైన్, మొబైల్ ఫోన్లు మొదట నుంచీ పనిచేస్తున్నాయని ఆయన చెప్పారు.
జమ్మూ: ఐదు జిల్లాల్లో మొబైల్ సేవల పునరుద్ధరణ
జమ్ము డివిజన్లోని జమ్మూ, రియాసీ, సాంబా, కఠువా, ఉధంపూర్ జిల్లాల్లో 2జీ ఇంటర్నెట్ సేవలు ప్రారంభయ్యాయని జర్నలిస్ట్ మోహిత్ కంధారీ చెప్పారు.
అటు ముస్లిం మెజారిటీ జిల్లాలు రాజౌరీ, పూంఛ్, కిష్తావాడ్, దోడా, రాంబన్లో ఇంకా ఇంటర్నెట్ సేవలు ప్రారంభించలేదు.
"సోమవారం నుంచి మేం అన్ని ప్రైమరీ, మిడిల్ స్కూళ్లను తెరవాలని అనుకుంటున్నాం. అదే రోజు నుంచి ప్రభుత్వ కార్యాలయాలన్నీ పనిచేస్తాయని కూడా మేం ముందే చెప్పాం" అని ప్రిన్సిపల్ సెక్రటరీ అన్నారు.
"ఇప్పటివరకూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినట్లు రిపోర్ట్ రాలేదు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా మొదలైంది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా సాధారణ పరిస్థితి ఉందని తెలుస్తోంది" అని చెప్పారు.
12 రోజుల తర్వాత సేవలు ప్రారంభం
ఆగస్టు 5న జమ్మూకశ్మీర్కు స్వయం ప్రతిపత్తిని రద్దు చేసినప్పటి నుంచి కశ్మీర్లో ముందెన్నడూ లేనంత స్థాయిలో భద్రతాపరమైన ఆంక్షలు అమలవుతున్నాయి.
స్థానిక రాజకీయ నాయకులు సహా వందల మందిని ప్రభుత్వం నిర్బంధంలో ఉంచింది.
జమ్మూలో ల్యాండ్లైన్ సేవలు సాధారణంగానే ఉన్నాయి. ఈ ప్రాంతంలోని ఐదు జిల్లాల్లో మొబైల్ సేవలను కూడా పునరుద్ధరించినట్లు అధికారులు తెలిపారు.
కశ్మీర్లో ఇంటర్నెట్, ఇతర సమాచార వ్యవస్థలను స్తంభింపజేయడంతో అక్కడి నుంచి బయటి ప్రపంచానికి వార్తలు చేరవేయడం మీడియాకు చాలా కష్టమైంది.
దాదాపు ఐదు దశాబ్దాల్లో తొలిసారిగా కశ్మీర్ సమస్యపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(యూఎన్ఎస్సీ) ఈ నెల 16న న్యూయార్క్లో చర్చించింది.
చైనా, పాకిస్తాన్ అభ్యర్థన మేరకు ఏర్పాటైన ఈ సమావేశం రహస్యంగా సాగింది.
భారత్, పాకిస్తాన్ భద్రతా మండలి సభ్య దేశాలు కానందున ఉభయ దేశాలూ ఈ సమావేశంలో పాల్గొనలేదు.
భేటీ ముగిశాక భారత్, చైనా, పాకిస్తాన్ రాయబారులు మీడియాతో మాట్లాడారు.
ఆర్టికల్ 370 సవరణ భారత అంతర్గత వ్యవహారమని, ఇందులో అంతర్జాతీయ జోక్యం తగదని ఐరాసలో భారత రాయబారి, శాశ్వత ప్రతినిధి వ్యాఖ్యానించారు. "మా జీవితాలు ఎలా ఉండాలో అంతర్జాతీయ సంస్థలు చెప్పాల్సిన అవసరం లేదు. వంద కోట్లకు పైగా జనాభా ఉన్న దేశం మాది" అన్నారు.
జిహాద్ గురించి, హింస గురించి ఒక దేశం మాట్లాడుతోందని, హింసాత్మక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని పాకిస్తాన్ను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు.
భద్రతా మండలి సమావేశం జరపడాన్ని పాకిస్తాన్ రాయబారి మలీహా లోధీ స్వాగతించారు. కశ్మీర్ వివాదాన్ని అంతర్జాతీయంగా గుర్తించారనేందుకు ఇదే ఆధారమన్నారు. ఇది భారత ఆంతరంగిక సమస్య కానేకాదన్నారు.
కశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్యసమితి తీర్మానం ప్రకారం పరిష్కరించుకోవాలని, ఇప్పుడు కశ్మీర్ పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారిందని చైనా వ్యాఖ్యానించింది.
ఇవి కూడా చదవండి:
- రోడ్డు లేదని టీచర్కు గుర్రాన్ని కొనిచ్చిన గ్రామస్థులు
- శ్రీనగర్లో రాళ్లు రువ్విన ఘటన జరిగింది: భారత హోం శాఖ
- ఆర్కిటిక్ కాలుష్యం: స్వచ్ఛమైన మంచు ఖండంలో ప్లాస్టిక్ విష పదార్థాలా...
- ఈ 'భారత ఎడిసన్' గురించి ఎంతమందికి తెలుసు...
- కశ్మీరీ యువతి డైరీలో ఆ అయిదు రోజులు
- మనుషుల అవయవాలు జంతువుల్లో వృద్ధి - ఈ పరిశోధనల లక్ష్యం ఏంటి
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)