లైవ్ పేజీ అప్డేట్స్ సమాప్తం
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్స్ను ఇంతటితో ముగిస్తున్నాం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్డేట్స్తో రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.
ధన్యవాదాలు.
అదానీ గ్రూప్ కంపెనీల షేర్ల ధరలు ఒక్కసారిగా ఉవ్వెత్తున పెరగడంతో, గౌతమ్ అదానీ మళ్లీ ప్రపంచ సంపన్నుల టాప్ 20 జాబితాలో చోటు దక్కించుకున్నారు.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్స్ను ఇంతటితో ముగిస్తున్నాం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్డేట్స్తో రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.
ధన్యవాదాలు.

ఫొటో సోర్స్, Getty Images
అదానీ గ్రూప్ కంపెనీల షేర్ల ధరలు ఒక్కసారిగా ఉవ్వెత్తున పెరగడంతో, గౌతమ్ అదానీ మళ్లీ ప్రపంచ సంపన్నుల టాప్ 20 జాబితాలో చోటు దక్కించుకున్నారు.
స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన గౌతమ్ అదానీకి చెందిన 10 కంపెనీల షేర్లు కూడా ర్యాలీ చేశాయి. కొన్ని షేర్ల ధరలు 20 శాతం వరకు పెరిగాయి.
దీంతో అదానీ గ్రూప్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.11.6 లక్షల కోట్ల మార్క్కు చేరుకుంది.
బ్లూమ్బర్గ్ బిలీనియర్స్ ఇండెక్స్ ప్రకారం, గౌతమ్ అదానీ సంపద ఒక్కరోజులోనే 6.5 బిలియన్ డాలర్లకు పెరిగింది. దీంతో అదానీ నికర సంపద 66.7 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
సంపద పెరగడంతో గౌతమ్ అదానీ ప్రపంచ సంపన్నుల జాబితాలో 19వ స్థానానికి చేరుకున్నారు. ఈ జాబితాలో ముకేష్ అంబానీ 13వ స్థానంలో ఉన్నారు.
అదానీ-హిండెన్బర్గ్ కేసులో సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని రిజర్వులో పెట్టడంతో అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు పెరిగాయి.

ఫొటో సోర్స్, ANI
భార్యాభర్తల గొడవ కారణంగా మునిచ్ నుంచి బ్యాంకాక్ వెళ్లాల్సిన లుఫ్తాన్సా ఫ్లైట్ను దిల్లీకి మళ్లించారు. ఈ ఘటన బుధవారం ఉదయం జరిగింది.
''విమానంలో ప్రయాణికుల ప్రవర్తన ఇబ్బందికరంగా ఉందని క్యాబిన్ క్రూ (విమానం సిబ్బంది) చెప్పడంతో ఈ నిర్ణయం తీసుకున్నారని, ఇది భార్యాభర్తల మధ్య గొడవ''గా చెప్పినట్లు వార్తా సంస్థ ఏఎన్ఐ తెలిపింది.
''భార్యాభర్తల మధ్య గొడవకు కారణాలు తెలియనప్పటికీ, వారిద్ధరి గొడవ వల్ల విమానాన్ని దిల్లీకి డైవర్ట్ చేశారు'' అని దిల్లీ ఎయిర్పోర్ట్ ఏవియేషన్ సెక్యూరిటీ చెప్పినట్లు ఏఎన్ఐ పేర్కొంది.
మొదట పాకిస్తాన్లోని ఒక విమానాశ్రయంలో ల్యాండింగ్కు అనుమతి కోరినప్పటికీ, ల్యాండింగ్కు అక్కడ సాధ్యం కాలేదు.
ఆ తర్వాత విమానం దిల్లీలో ల్యాండ్ అయింది. అనుచితంగా ప్రవర్తించిన భర్తను విమానం నుంచి కిందకు దించేసి విమానాశ్రయ భద్రతా సిబ్బందికి అప్పగించారు.
అయితే, ఈ విషయంపై విమానయాన సంస్థ 'లుఫ్తాన్సా ఎయిర్' స్పందించాల్సి ఉందని ఏఎన్ఐ తెలిపింది.

ఫొటో సోర్స్, UGC
నిర్మల్ జిల్లా భైంసాలో అర్థరాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీజేపీ కార్యకర్తలు, పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో పలువురికి గాయాలు కాగా పోలీసు వాహనాల అద్దాలు ధ్వంసం అయ్యాయి.
ముధోల్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి రామారావ్ పటేల్ సమీప బంధువు ఇంట్లో భారీ మొత్తంలో డబ్బులు నిల్వ చేశారన్న సమాచారంతో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ తమ వెంట ఉండే పోలీస్ భద్రతతో సోదాలకు వెళ్లింది.
కొద్దిసేపట్లోనే అక్కడ భారీగా పోగైన బీజేపీ కార్యకర్తలు సోదాలను అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో ఫ్లయింగ్ స్క్వాడ్ అక్కడి నుంచి వెనక్కి వచ్చి.. కొద్దిసేపటి అనంతరం అదనపు బలగాలతో సోదాలకు వెళ్లింది.
అయితే, అర్ధరాత్రి సమయంలో మాస్కులు ధరించి, ముందస్తు సమాచారం లేకుండా ఇంట్లో చొరబడటంతో భయభ్రాంతులకు లోనయ్యామని, సోదాలు జరిగిన ఇంటి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
ప్రస్తుతం భైంసాలో నెలకొన్న పరిస్థితులపై ఏఎస్పీ కాంతిలాల్ పాటిల్ బీబీసీతో మాట్లాడారు.
ఎన్నికల విధుల్లో భాగంగా ఫ్లయింగ్ స్క్వాడ్కు రక్షణగా వెళ్తే, పోలీసులు సోదాలు చేశారనడం సరికాదని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, UGC
‘ఫ్లయింగ్ స్క్వాడ్ సోదాలకు వారు సహకరించలేదు. దీంతో సోదాలు అసంపూర్తిగా ముగిశాయి. 144 సెక్షన్ను ఉల్లంఘించి పెద్ద సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు పోగయ్యారు. పోలీసులపై భౌతిక దాడికి దిగి వాహనాల అద్దాలు ధ్వంసం చేశారు. ఈ ఘటనలో పాల్గొన్న వారందరినీ గుర్తించి కేసులు నమోదు చేస్తాం. భైంసాలో పరిస్థితులు అదుపులోనే ఉన్నాయి. స్థానిక పోలీసులతో పాటు రెండు బెటాలియన్ల సీఆర్పీఎఫ్ అదనపు బలగాలు ఇక్కడ ఉన్నాయి’’ అని ఏఎస్పీ కాంతిలాల్ తెలిపారు.
ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని ఏఎస్పీ చెప్పారు.

ఫొటో సోర్స్, @pushkardhami/X
ఉత్తరాఖండ్లోని సిల్క్యారా సొరంగంలో నుంచి 17 రోజుల తర్వాత సురక్షితంగా బయటపడిన 41 మంది కార్మికులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం రాత్రి ఫోన్లో మాట్లాడారు.
కార్మికులతో ప్రధాని మోదీ మాట్లాడుతున్న ఫోటోలను ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి, బీజేపీ సోషల్ మీడియా 'ఎక్స్'(ట్విటర్)లో పోస్ట్ చేశారు.
''సిల్క్యారా సొరంగం నుంచి క్షేమంగా బయటికి తీసుకొచ్చిన కార్మికులతో ప్రధాన మంత్రి ఫోన్లో మాట్లాడారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు'' అని సీఎం రాశారు.
సహాయక చర్యల్లో పాల్గొన్న వారి సమష్టి కృషికి, మానవత్వానికి నిదర్శనమని ప్రధాన మంత్రి పేర్కొన్నట్లు తెలిపారు.
సొరంగంలో చిక్కుకున్న 41 మందిని రక్షించిన తర్వాత వారిని 30 కిలోమీటర్ల దూరంలోని చిన్యాలిసౌర్ ఆస్పత్రికి తరలించారు. వారిని వీలైనంత త్వరగా ఆస్పత్రికి తరలించేందుకు అధికార యంత్రాంగం గ్రీన్చానల్ ఏర్పాటు చేసింది. అప్పటికే ఆస్పత్రిలో ఆక్సిజన్తో కూడిన 41 బెడ్లను ఏర్పాటు చేసింది.
ప్రస్తుతం కార్మికులు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.
అలాగే, ప్రమాదం నుంచి బయటపడిన కార్మికులకు లక్ష రూపాయల చొప్పున అందజేయనున్నట్లు ఉత్తరాఖండ్ సీఎం ప్రకటించారు. కార్మికులకు జీతంతో కూడిన15 లేదా 30 రోజులు సెలవు ఇవ్వాలని కంపెనీలను కోరనున్నట్లు చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.