You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

తుర్కియే, సిరియాలలో 41వేలకు చేరుకున్న భూకంపం మృతుల సంఖ్య

కూలిపోయిన భవనాల కింద మృతదేహాల కోసం ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.

లైవ్ కవరేజీ

  1. భారత్‌లోని బీబీసీ కార్యాలయాల్లో ముగిసిన ఆదాయ పన్ను శాఖ అధికారుల ‘సర్వే’

  2. లైవ్ పేజీ అప్‌డేట్స్ సమాప్తం

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం.

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.

  3. జీవీఎంసీ: వివాదంగా మారిన రూ.15 వేలు గిఫ్టు కార్డులు

  4. అస్సాం: బాల్య వివాహాల కేసుల్లో ముస్లింలనే ఎక్కువగా అరెస్ట్ చేస్తున్నారా

  5. బంగ్లాదేశ్‌లో తెలుగు వారి ఇళ్లు కూల్చివేత... అసలు వారు అక్కడకు ఎలా వెళ్లారు... ఎందుకు వెళ్లారు

  6. ఫహద్ అహ్మద్‌తో స్వరా భాస్కర్ పెళ్లి

    పొలిటికల్ యాక్టవిస్ట్ ఫహద్ అహ్మద్‌ను బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ పెళ్లి చేసుకున్నారు.

    కొంతకాలంగా వారిద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు.

    స్వరా భాస్కర్ తండ్రి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మాజీ సైనికాధికారి సి.ఉదయ్ భాస్కర్.

  7. ఉత్తరప్రదేశ్: బుల్డోజర్‌తో ఇంటిని కూల్చేందుకు ప్రయత్నం... మంటల్లో కాలిపోయిన తల్లి, కూతురు... అసలు ఏం జరిగింది

  8. బీబీసీ కార్యాలయాల్లో ఐటీ శాఖ ‘సర్వే’ను ఖండించిన మంత్రి హరీశ్ రావు

    బీబీసీ కార్యాలయాల్లో ఆదాయ పన్ను శాఖ అధికారుల ‘సర్వే’ను తెలంగాణ మంత్రి హరీశ్ రావు ఖండించారు.

    ‘వార్తలు వేస్తావా... ఐటీ, ఈడీ(లను) తోలుతా అంటే దేశం పరువు పోదా? వార్తలో నిజంగా తప్పు ఉంటే ఖండించాలి. ఏది నిజమో చెప్పాలి. ప్రజల ముందుకొచ్చి మాట్లాడాలి. కానీ ఇది పద్ధతి కాదు.

    బీబీసీ అంటే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సంస్థ. దాని మీద దాడి చేసి దేశం పరువు తీసేలా కేంద్రం వ్యవహరిస్తోంది’ అని మంత్రి హరీశ్ రావు అన్నారు.

    యాదగిరిగుట్టలో 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

  9. బీబీసీ కార్యాలయాల్లో ఐటీ శాఖ ‘సర్వే’ను ఖండించిన పాత్రికేయ సంఘాలు

    బీబీసీ కార్యాలయాల్లో ఆదాయ పన్ను శాఖ అధికారుల ‘సర్వే’ను తెలుగు పాత్రికేయ సంఘాలు ఖండించాయి. కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ హైదరాబాదులో పాత్రికేయులు నిరసన తెలిపారు.

    సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద జరిగిన నిరసనలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్-టీడబ్ల్యూజేఎఫ్, హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్‌-హెచ్‌యూజే నాయకులు పాల్గొన్నారు. దిల్లీ, ముంబయిలోని బీబీసీ కార్యాలయాల్లో ఐటీ శాఖ ‘సర్వే’ను వాళ్లు ఖండించారు.

    ప్రధాని నరేంద్ర మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ ప్రదర్శించిన కొన్ని వారాల తర్వాతే ఆదాయ పన్ను శాఖ అధికారులు ఈ ‘సర్వే’ చేపట్టారని జర్నలిస్టు సంఘాల నాయకులు అన్నారు.

    ‘ఇది మీడియా స్వేచ్ఛపై జరుగుతున్న దాడి. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే సంస్థలను తమ దారికి తెచ్చుకునే కుట్రలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తమ ఏజెన్సీలను ఉసిగొల్పుతోంది. మీడియా స్వేచ్ఛకు సంకెళ్లు వేయాలనుకోవడం తగదు" అని టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బసవ పున్నయ్య వ్యాఖ్యానించారు.

    ఈ నిరసన ప్రదర్శనలో హెచ్‌యూజే అధ్యక్షులు అరుణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి జగదీష్, ఆర్గనైజింగ్ సెక్రటరీ నాగవాణి, హెచ్‌యూజే నాయకులు పద్మరాజు, ఇతర జర్నలిస్టులు పాల్గొన్నారు.

  10. జీవీఎంసీ: ‘రూ.100 కోట్ల ఆస్తులు ఉన్న కార్పొరేటర్లకు రూ.15 వేలు గిఫ్ట్ కూపన్ ఎందుకు ఇచ్చారు?’

  11. తెలంగాణ: కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్‌ను సందర్శించిన పంజాబ్ సీఎం

    ప్రవీణ్ శుభం, బీబీసీ కోసం

    మంచి పాలనా వ్యవస్థలు ఎక్కడున్నా వాటిని తమ ప్రజలకు అందించడం పాలకుల పని అని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ అన్నారు.

    తెలంగాణ రాష్ట్రం నీటి పారుదల రంగంలో ఒక మాడల్ గా ఉందని, పంజాబ్‌లో దీన్ని అమలు చేస్తామని, అలాగే పంజాబ్‌లో అమలు చేస్తున్న బస్తీ దవాఖానను తెలంగాణలో ప్రవేశపెట్టారని అన్నారు.

    దిల్లీ రాష్ట్రంలో అమలవుతున్న విద్యావ్యవస్థ ఆదర్శంగా తీసుకుని తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వం అదే తరహాలో ముందుకుపోతోందని తెలిపారు.

    తెలంగాణ పర్యటనలో భాగంగా ఈ రోజు భగవంత్ మాన్ తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా నిర్మించిన కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్, ఎర్రవెల్లి చెక్ డ్యామ్, మిషన్ కాకతీయలో భాగంగా పునరుద్ధరించిన పాండవుల చెరువును పరిశీలించారు.

    తెలంగాణ నీటిపారుదల, భూగర్భ జల శాఖ అధికారులు ఆయనకు పలు అంశాలను వివరించారు. ఈ సందర్భంగా పలువురు రైతులతో సీఎం భగవంత్ మాన్ ముచ్చటించారు.

    భగవంత్ మాన్ ఇంకా ఏమన్నారంటే.. "దేశవ్యాప్తంగా రైతులు తీవ్ర సమస్యల్లో ఉన్నారు. పంటలకు గిట్టుబాటు ధర దక్కడం లేదు. పంజాబ్‌లో బావులు, బోర్లతోనే పంటలు ఎక్కువగా సాగుచేస్తున్నారు. అయితే, తెలంగాణలో కాలువల ద్వారా పంటలకు నీరందున్నట్టుగా పంజాబ్‌లోనూ చేస్తాం".

    గజ్వేల్‌లో రైతులతో భగవంత్ మాన్ ముచ్చటించారు. ఈ సందర్భంగా.. "బతికుంటే మళ్లీ కలుద్దాం.. కలవాలంటే బతకాలంటూ’’ భగవంత్ మాన్ కవిత వినిపించారు.

    అరవింద్ కేజ్రీవాల్ వచ్చాక దిల్లీ అన్ని విషయాల్లో అభివృద్ది చెందిందని,ఉచిత కరెంట్, విద్యా వ్యవస్థ, బస్తీ దవాఖానలు అక్కడాా వచ్చాయన్నారు.

    మంచి మనసున్న నాయకుడు ఉంటే ఆ ప్రాంతాలు ఎల్లప్పుడూ అభివృద్దిలో దూసుకుపోతాయని అన్నారు. తమకు డల్లాస్, లండన్, ఆస్ట్రేలియా, సింగపూర్ అవసరం లేదని పాత పంజాబ్‌లా తయరుచేస్తే చాలని అన్నారు.

  12. నేపాల్ ఎంపీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలుడు.. ఎంపీ తల్లికి తీవ్ర గాయాలు

    నేపాల్ ఎంపీ చంద్ర భండారి ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలడంతో ఆయనకు, ఆయన తల్లి హరికళ భండారికి తీవ్ర గాయలయ్యాయి.

    నేపాల్‌లో కీర్తిపూర్ బర్న్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిద్దరినీ తదుపరి చికిత్స కోసం విమానంలో ముంబై తీసుకురానున్నారని ఏఎన్ఐ తెలిపింది.

    చంద్ర భండారికి 25 శాతం కాలిన గాయాలు కాగా, ఆయన తల్లికి 80 శాతం కాలిపోయిందని కీర్తిపూర్ ఆస్పత్రి తెలిపింది.

    ఖాట్మండులోని బుద్ధనగర్‌లో ఉన్న వారి ఇంట్లో బుధవారం స్థానిక సమయం రాత్రి 10.30 గంటలకు వంట గ్యాస్ సిలిండర్ పేలింది.

    వెంటనే వారికి కీర్తిపూర్ ఆస్పత్రిలో చేర్చారు. అయితే, వారిరువురికీ తీవ్ర గాయాలు కావడంతో వేరే దేశంలోని బర్న్స్ స్పెషల్ ఆస్పత్రికి తీసుకెళ్లాలని, నేపాల్‌లో అది సాధ్యం కాదని కీర్తిపూర్ ఆస్పత్రి తెలిపింది.

    చంద్ర భండారి, ఆయన తల్లి ఇంట్లో నిదురిస్తుండగా గ్యాస్ సిలిండర్ పేలిందని ఆయన పర్సనల్ సెక్రటరీ భువన్ భుశాల్ తెలిపినట్టు ఏఎన్ఐ పేర్కొంది.

  13. ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

    ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. మూడు గ్రాడ్యుయేట్, రెండు టీచర్ నియోజకవర్గాల ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ మొదలయ్యింది.

    ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానానికి పీడీఎఫ్ అభ్యర్థిగా డాక్టర్ కోరెడ్ల రమాప్రభ నామినేషన్ దాఖలు చేశారు.

    విశాఖ లోని డాబాగార్డెన్ వద్ద బాబాసాహెబ్ అంబెడ్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి కలెక్టర్ కార్యాలయంకు ర్యాలీగా వెళ్ళారు.

    తనకు 250 కు పైగా ప్రజాసంఘాల మద్దతు ఉందని ఆమె ప్రకటించారు.

  14. ‘‘నాకు 11 ఏళ్ల వయసులోనే నన్ను డిజిటల్ సెక్స్ స్లేవ్‌గా మార్చాడు. ఇప్పుడు కేసు వేశాను’’

  15. కన్నా లక్ష్మీనారాయణ బీజేపీకి రాజీనామా

    శంకర్ వడిసెట్టి, బీబీసీ కోసం

    ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ అధిష్టానం తీరుతో అసంతృప్తిగా ఉన్నట్టు ఆయన చెప్పారు.

    ఇటీవల నిర్వహించిన జాతీయ కార్యవర్గ సమావేశాలకు ఆయన దూరమయ్యారు. భీమవరంలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు కూడా ఆయన హాజరు కాలేదు.

    ఈ నేపథ్యంలో, కన్నా లక్ష్మీనారాయణ పార్టీ నుంచి రాజీనామా చేస్తారనే ప్రచారం జరిగింది. దానికి, అనుగుణంగానే పార్టీ జాతీయ నాయకత్వం తీరు మీద అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆయన రాజీనామా లేఖను సమర్పించారు.

    రాష్ట్రంలో నలుగురు వ్యక్తుల తీరుతో పార్టీ అభాసపాలవుతుందంటూ ఆయన తన రాజీనామా లేఖలో ఆరోపించారు.

    ఈ పరిస్థితులు సహించలేక తాను పార్టీ నుంచి బయటికొస్తున్నట్టు, ప్రాథమిక సభ్యత్వానికి, పదవులకు రాజీనామా చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు.

    కన్నా లక్ష్మీనారాయణ ఈరోజు పార్టీ కార్యకర్తలు, సన్నిహితులతో సమావేశమైన తరువాత తన రాజీనామా వివరాలను అధికారికంగా ధృవీకరించారు.

    దీని తరువాత ఆయన ఏ పార్టీలో చేరుతారన్నది చర్చనీయాంశంగా మారింది. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని ఆయన వెల్లడించారు.

    లక్ష్మీనారాయణ గతంలో సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వైయెస్సార్ ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా ఉన్నారు.

    రాష్ట్ర విభజన అనంతరం, 2014 తరువాత ఆయన కాంగ్రెస్ వీడి బీజేపీలో చేరారు. కొద్ది కాలంలోనే ఆయనకు రాష్ట్ర అధ్యక్ష పదవి వచ్చింది. సుమారు నాలుగేళ్ల పాటు ఆయన ఆ పదవిని నిర్వహించారు.

    రెండేళ్ల క్రితం ఆయనను తొలగించి సోము వీర్రాజుకు పార్టీ పగ్గాలు అప్పగించారు. అప్పటి నుంచి కన్నా లక్ష్మీనారాయణ అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నేడు రాజీనామా ప్రకటించారు.

  16. 'ఆది మహోత్సవ్' కార్యక్రమాన్ని ప్రారంభించిన మోదీ

    ప్రధాని నరేంద్ర మోదీ నేడు దిల్లీలో 'ఆది మహోత్సవ్' కార్యక్రమాన్ని ప్రారంభించారు.

    దిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియంలో ఈ మెగా నేషనల్ ట్రైబల్ ఫెస్టివల్ ప్రారంభోత్సవం జరిగింది.

    గిరిజన స్వాతంత్య్ర సమరయోధుడు బిర్సా ముండా చిత్రపటానికి మోదీ పూలమాలలు వేసి నివాళులర్పించారు.

    కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి అర్జున్ ముండా కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

  17. నిక్కీ యాదవ్ మర్డర్: గర్ల్‌ఫ్రెండ్‌ను చంపి ఫ్రిజ్‌లో పెట్టి, మరుసటి రోజే ఇంకో అమ్మాయితో పెళ్లి, ఈ కేసులో పోలీసులు ఏం చెప్పారు?

  18. తుర్కియే-సిరియా భూకంపం: మృతుల సంఖ్య 41,000 దాటింది

    తుర్కియే సిరియాలలో భూకంపంలో మరణించిన వారి సంఖ్య 41,000 దాటిందని రాయిటర్స్ పేర్కొంది.

    ఫిబ్రవరి 6న సంభవించిన తీవ్ర భూకపం తుర్కియే, సిరియాలను అతలాకుతలం చేసింది.

    పది రోజులు దాటినా, ఇంకా ఎంతోమంది శిథిలాల కింద చిక్కుకుని ఉన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

    లక్షలాది మంది మానవతా సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఎంతోమంది నిరాశ్రయులయ్యారు.

    ప్రాణాలతో బయటపడినవారు గడ్డ కట్టిన చలిలో ఇల్లు, వాకిలి లేక అవస్థలు పడుతున్నారని రాయిటర్స్ తెలిపింది.

    తుర్కియేలో కొంతవరకు మెరుగ్గా మానవతా సహాయం అందుతున్నప్పటికీ, సిరియాలో పలు ప్రాంతాలకు చేరుకోవడం కష్టంగా ఉందని ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది.

    ముఖ్యంగా, వాయువ్య సిరియాలో ప్రజల స్థితిగతుల గురించి ఆందోళన చెందుతున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ బుధవారం పేర్కొంది.

    తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న ఈ ప్రాంతానికి సహాయక చర్యలు అందించడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది.

    తుర్కియే నుంచి సరిహద్దులు దాటి సిరియాకు చేరుకునేందుకు మరిన్ని మార్గాలు తెరవాలని సిరియా అధ్యక్షుడు బషర్ అల్-అస్సాద్‌ను డబ్ల్యూహెచ్ఓ కోరినట్లు రాయిటర్స్ తెలిపింది.

  19. పాకిస్తాన్‌లో పెట్రోల్ ధర రూ. 270 దాటింది

    పాకిస్తాన్‌లో ఆర్థిక సంక్షోభం మరింత ముదురుతోంది. ద్రవ్యోల్బణం అధికంగా ఉంది. ఆహార పదార్థాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.

    పెట్రోలు ధరలు బాగా పెరిగాయి.

    పాకిస్తాన్ ప్రభుత్వం బుధవారం పెట్రోల్‌పై రూ.22, హైస్పీడ్ డీజిల్‌పై రూ.17 పెంచింది.

    దీంతో, పెట్రోల్ లీటర్ రూ.272, హైస్పీడ్ డీజిల్ లీటరు రూ.280 కానుంది.

    గురువారం నుంచి ఈ ధరలు అమలులోకి రానున్నాయి.

    కిరోసిన్ ధర కూడా లీటర్ రూ.202కి చేరింది.

    పాకిస్తాన్ విదేశీ మారకద్రవ్య నిల్వలు ఖాళీ అయే ప్రమాదంలో ఉన్నాయి. ఒక నెల దిగుమతులకు మాత్రమే డాలర్లు మిగిలి ఉన్నాయి.

    జనవరిలో వార్షిక ద్రవ్యోల్బణం 27 శాతంగా నమోదైంది. 1975 తరువాత ఇదే అత్యధిక ద్రవ్యోల్బణం.

    గత వారం డాలర్‌తో పోలిస్తే పాకిస్తాన్ రూపాయి మారకపు విలువ 275కి చేరుకుంది.

    గత ఏడాది ఇదే సమయంలో మారకపు విలువ సుమారు 175 ఉంది.

  20. త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు: నేడు 60 స్థానాలకు పోలింగ్

    త్రిపురలోని 60 అసెంబ్లీ స్థానాలకు నేడు ఎన్నికలు జరుగుతున్నాయి. మార్చి 2న వీటి ఫలితాలు వెలువడతాయి.

    ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది.

    ఎన్నికల సంఘం ఓటింగ్ కోసం 3337 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. వీటిలో 1100 కేంద్రాలను సున్నిత కేంద్రాలుగా, 28 కీలక కేంద్రాలుగా ప్రకటించారు.

    ఈరోజు ఉదయం 9.00 గంటల వరకు 13 శాతం పోలింగ్ జరిగిందని ఎన్నికల సంఘం తెలిపింది.

    త్రిపుర ఎన్నికల్లో ప్రధానంగా బీజేపీ-ఐపీఎఫ్‌టీ కూటమి, సీపీఐ(ఎం), కాంగ్రెస్‌, తిప్రా మోథా మధ్య పోటీ నెలకొంది.

    తిప్రా మోథా అనేది త్రిపుర రాయల్ ప్రిన్స్ ప్రద్యోత్ బ్రిక్రమ్ మాణిక్య దేవ్‌బర్మ పార్టీ.

    ఈ పార్టీ త్రిపురలోని 31 శాతం గిరిజన జనాభా కోసం ప్రత్యేక రాష్ట్రం 'గ్రేటర్ త్రిపుర ల్యాండ్' గురించి డిమాండ్ చేస్తోంది.

    2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 36, వామపక్షాలు 16 సీట్లు గెలుచుకున్నాయి. రెండు పార్టీల మధ్య ఓట్ల శాతంలో తేడా ఒక్క శాతం లోపే ఉంది.

    బీజేపీకి 43.59 శాతం ఓట్లు రాగా, వామపక్షాలకు 43.35 శాతం ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ ఓట్ల శాతం 35.5 శాతం నుంచి 1.7 శాతానికి పడిపోయింది.

    36 సీట్లు గెలుచుకున్న బీజేపీ, ఇండీజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (ఐపీఎఫ్‌టీ)తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

    అంతకుముందు త్రిపురలో 25 ఏళ్ల పాటు వామపక్షాల ప్రభుత్వమే ఉంది. మాణిక్ సర్కార్ సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉన్నారు.