You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

'తారకరత్న ఆరోగ్యం క్రిటికల్‌గానే ఉంది' - నారాయణ హృదయాలయ వైద్యులు

తారకరత్న ఆరోగ్యం క్రిటికల్‌గానే ఉందని, వెంటిలేటర్‌పై ఉన్నారని నారాయణ హృదయాలయ వైద్యులు తెలిపారు. తారకరత్నకు ఎక్మో (ECMO) పెట్టలేదని స్పష్టంచేశారు.

లైవ్ కవరేజీ

  1. లైవ్ అప్‌డేట్స్ సమాప్తం

    నేటి బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ అప్‌డేట్స్ ఇంతటితో ముగిస్తున్నాం.

    మళ్లీ రేపు ఉదయం కలుద్దాం.

    ధన్యవాదాలు.

  2. మంకీ మ్యాన్: బర్త్ డే పార్టీలు, పెళ్లిళ్లలో కోతి వేషంతో అలరిస్తున్న యువకుడు

  3. పాకిస్తాన్‌లో బాంబు పేలుడు: 47కి చేరిన మృతుల సంఖ్య

    పాకిస్తాన్‌లోని పెషావర్‌లో మసీదులో ప్రార్థనలు చేసుకుంటున్న పోలీసులను లక్ష్యంగా చేసుకుని జరిపిన బాంబు దాడిలో 47 మంది మరణించారు.

    ఈ మసీదు పోలీసు ప్రధాన కార్యాలయ ప్రాంతంలో ఉంది.

    పాకిస్తాన్‌ను కాపాడే బాధ్యతలు నిర్వహిస్తున్న పోలీసుల్ని లక్ష్యంగా చేసుకుని జరిపిన దాడితో ఉగ్రవాదులు ప్రజల్లో భయాందోళనను రేకెత్తించాలనుకున్నారని ఆ దేశ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.

    అయితే, ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ కూడా తామే దాడి జరిపినట్టు ప్రకటించలేదు. పాకిస్తాన్ తాలిబాన్‌తో సంబంధమున్న వారు ఈ దాడి జరిపినట్లు భావిస్తున్నారు.

    బాంబు దాడి జరిగిన సమయంలో మసీదులో 300 నుంచి 400 మంది వరకు పోలీసు అధికారులు ప్రార్థనలు చేస్తున్నారని స్థానిక మీడియాకు పెషావర్ పోలీసు చీఫ్ ముహమ్మద్ ఇజాజ్ ఖాన్ చెప్పారు.

    మధ్యాహ్నం 1.30కి(8.30 జీఎంటీ) ప్రార్థనలు జరిగే సమయంలో ఆ దాడి జరిగింది.

    శిథిలాల కిందనున్న మృతదేహాలను వెలికి తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని పెషావర్ నగర డిప్యూటీ కమిషనర్ షఫివుల్లా ఖాన్ చెప్పారు. శిథిలాల కిందనున్న ప్రజల్ని రక్షించడమే తమ ప్రస్తుత కర్తవ్యమని అన్నారు.

  4. తెలంగాణ: పేకాట చుట్టూ తిరుగుతున్న పీర్జాదిగూడ మునిసిపల్ కార్పొరేషన్ రాజకీయం

  5. పఠాన్: నాలుగేళ్ల అలసటంతా నాలుగు రోజుల్లోనే మాయమైపోయిందన్న షారుక్ ఖాన్

    పఠాన్ సినిమా భారీ విజయం సాధించడంపై బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సినిమా విజయం కోసం బాలీవుడ్ పరిశ్రమంతా వేచి చూసిందని తెలిపారు.

    మొత్తం పరిశ్రమను మళ్లీ పట్టాలెక్కించిన ప్రేక్షకులకు షారుక్ ఖాన్ ధన్యవాదాలు తెలియజేశారు.

    ఈ సినిమా సక్సెస్ కావడంతో నాలుగు రోజుల్లోనే నాలుగేళ్ల అలసటంతా మాయమైపోయిందని ముంబైలో నిర్వహించిన పత్రికా సమావేశంలో తెలిపారు.

    ముంబైలో నిర్వహించిన ఈ సమావేశంలో షారుక్ ఖాన్‌తో పాటు దీపికా పదుకొణే, జాన్ అబ్రహ్మం, దర్శకుడు సిద్ధార్థ ఆనంద్ కూడా పాల్గొన్నారు.

    ఈ సినిమాను భారీ విజయం సాధించడంపై షారుక్ ఖాన్ అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. బాయ్‌కాట్ ప్రచారం పెద్ద ఎత్తున సాగినప్పటికీ చాలా మంది ప్రజలు ఎంతో ప్రేమను చూపించారని అన్నారు.

    ఈ సినిమా విడుదల చేయడంలో సాయపడిన ప్రతి ఒక్కరికీ కూడా షారుక్ ఖాన్ కృతజ్ఞతలు తెలిపారు.

    5 రోజుల్లో రూ.543 కోట్లు వసూలు చేసిన పఠాన్

    వరుసగా ఐదో రోజూ కూడా పఠాన్ సినిమా రికార్డులు బద్దలు కొడుతోంది.

    ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఐదు రోజుల్లోనే రూ.543 కోట్లు వసూలు చేసినట్టు యష్ రాజ్ ఫిల్మ్స్ చెప్పింది.

    భారత్‌లో ఈ సినిమా సుమారు రూ.335 కోట్లు వసూలు చేస్తే, విదేశాల్లో రూ.208 కోట్లు కలెక్షన్లను రాబట్టింది.

    షారుక్ ఖాన్ పఠాన్ సినిమా జనవరి 25నవిడుదలైంది. ఈ సినిమా విడుదలైన రోజు నుంచి ప్రతి రోజూ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.

  6. 'తారకరత్న ఆరోగ్యం క్రిటికల్ గానే ఉంది' - నారాయణ హృదయాలయ వైద్యులు, ఎన్. తులసీ ప్రసాద్ రెడ్డి, బీబీసీ కోసం

    తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై బెంగళూరులోని నారాయణ హృదయాలయ వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.

    తారకరత్న ఆరోగ్యం క్రిటికల్‌గానే ఉందని, ఆయన వెంటిలేటర్‌పై ఉన్నారని తెలిపారు.

    "ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగానే ఉంది. వెంటిలేటర్, ఇతర ఉన్నత వైద్య సదుపాయాల సపోర్టుతో వైద్యం కొనసాగుతుంది. తారకరత్న ఎక్మో (ECMO) మీద ఉన్నట్టు మీడియాలో కథనాలు వస్తున్నాయి. అది నిజం కాదు. ఇప్పటివరకు ఆయనకి ఎక్మో పెట్టలేదు. కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలియజేస్తున్నాం. ఆయన పరిస్థితిలో ఏమైనా మార్పులు ఉంటే తప్పక తెలియజేస్తాం. ఏ అడ్డంకి లేకుండా ఆయనకు చికిత్స కొనసాగేందుకు, ప్రైవసీని కాపాడేందుకు అందరూ సహకరించాలని కోరుతున్నాం" అని నారాయణ హృదయాలయ వైద్యులు తెలిపారు.

  7. ఆంధ్రప్రదేశ్: మంత్రి అంబటి రాంబాబు చుట్టూ వివాదం ఎందుకు? కొడుకుని కోల్పోయిన కుటుంబానికి దక్కాల్సిన పరిహారం చెక్ ఏమయ్యింది?

  8. UPSC: సివిల్ సర్వీస్ పరీక్షల్లో విజయం సాధించడం ఎలా?

  9. తెలంగాణ: బడ్జెట్ సమావేశాలపై గవర్నర్, సర్కారు మధ్య రాజీ, బళ్ల సతీశ్, బీబీసీ ప్రతినిధి

    తెలంగాణలో బడ్జెట్ సమావేశాల విషయంలో రాష్ట్ర గవర్నర్‌కు, ప్రభుత్వానికి మధ్య హైకోర్టు వరకూ వెళ్లిన వివాదంలో తాత్కాలికంగా సంధి కుదిరింది.

    అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టటానికి గవర్నర్ ఇంకా ఆమోదం తెలుపలేదని, తక్షణమే అనుమతించాల్సిందిగా గవర్నర్‌కు ఆదేశిలివ్వాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నాడు పిటిషన్ వేసింది.

    ‘‘గవర్నరుకు నోటీసు ఇచ్చే అధికారం హైకోర్టుకు ఉందా’’ అంటూనే పిటిషన్‌ను విచారణకు తీసుకుంది హైకోర్టు. అయితే విచారణ సందర్భంగా ఇద్దరు లాయర్లనూ మాట్లాడుకోమని సూచించడంతో, గవర్నర్ తరపు లాయర్, ప్రభుత్వం తరపు లాయర్ - ఇద్దరూ మాట్లాడుకున్నారు.

    ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుంది. బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ఉంటుందని కోర్టుకు చెప్పింది. దీంతో బడ్జెట్ అనుమతులు క్లియర్ చేయడానికి కూడా రాజ్‌భవన్ అంగీకరిచినట్టు అయింది.

    నిజానికి ఈ కేసు ఎటు వెళుతుందా అని న్యాయ, ప్రభుత్వ వర్గాలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశాయి.

    గవర్నర్‌పై ప్రభుత్వం హైకోర్టకు వెళ్లడం అనేది అరుదైన ఘట్టం కావడంతో అందరికీ ఆసక్తి కలిగింది. మొత్తానికి ప్రభుత్వం, గవర్నర్ రాజీ పడడంతో తాత్కాలికంగా సమస్య పరిష్కారం అయింది.

  10. జగన్ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్, శంకర్ వడిశెట్టి, బీబీసీ కోసం

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ ప్రయాణిస్తున్న విమానం అత్యవసర లాండింగ్ చేశారు.

    జగన్ సోమవారం సాయంత్రం గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో దిల్లీ బయలుదేరారు. అయితే.. విమానం టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపటికే సాంకేతిక సమస్య కారణంగా గన్నవరంలోనే ఎమర్జెన్సీ లాండింగ్ చేశారు.

    ‘‘సాయంత్రం 5.03 గంటలకు విమానం టేకాఫ్ అయ్యింది. కాసేపటికి సాంకేతిక సమస్యని గుర్తించిన పైలట్ వెంటనే అప్రమత్తమయ్యారు. విమానాన్ని వెనక్కు మళ్లించారు. తిరిగి 5.27 నిమిషాలకు వెనక్కు వచ్చి ల్యాండయింది’’ అని రాష్ట్ర ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది.

    దీంతో గన్నవరం విమానాశ్రయంలో జగన్ దిగిపోయారు. విమానంలో సీఎంతో పాటు సీఎస్ జవహర్ రెడ్డి, వైఎస్సార్సీపీ లోక్‌సభ పక్ష నాయకుడు మిథున్‌రెడ్డి తదతరులు ఉన్నారు.

    జగన్ తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి దిల్లీ వెళ్లేందుకు అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు.

    జీ20 ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్ సన్నాహక సమావేశానికి రేపు సీఎం హాజరుకావాల్సి ఉంది. మార్చిలో జీ20 ఇన్వెస్ట్‌మెంట్ సదస్సు జరుగుతుంది. దానికి కర్టెన్ రైజర్‌గా వివిధ దేశాల దౌత్యవేత్తలు, ప్రముఖులతో సమావేశం జరుగుతుంది.

    సీఎం జగన్ ప్రయాణిస్తున్న విమానానికి తొలిసారిగా ఇలాంటి పరిస్థితి ఎదురుకావడంతో యంత్రాంగం అప్రమత్తమైంది.

    ఈ రోజు ఉదయమే సీఎం ప్రత్యేక హెలికాప్టర్‌లో వినుకొండ వెళ్ళారు. అక్కడ ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్నారు. బహిరంగ సభలో మాట్లాడారు.

  11. పాకిస్తాన్: పెషావర్‌ మసీదులో ఆత్మాహుతి దాడి.. 28కి పెరిగిన మృతుల సంఖ్య, 150 మందికి గాయాలు

    పాకిస్తాన్‌లోని పెషావర్‌లో గల ఒక మసీదులో జరిగిన ఆత్మాహుతి దాడి ఘటనలో మృతుల సంఖ్య 28కి పెరిగింది.

    పోలీసు లైను సమీపంలో గల మసీదులో ఈ ఆత్మాహుతి దాడి జరిగింది.

    ఈ పేలుడు ఘటనలో ఇప్పటి వరకు 28 మంది మరణించినట్టు పెషావర్ కమిషనర్ రియాజ్ మహసూద్ చెప్పారు.

    మసీదులో సహాయ చర్యలు జరుగుతున్నట్టు తెలిపారు.

    చాలా మంది ప్రజలు ఇంకా శిథిలాల కిందనే ఉన్నారని, దీంతో మృతుల సంఖ్య, గాయపడే వారి సంఖ్య పెరిగే అవకాశ ముందని పెషావర్ కమిషనర్ అన్నారు.

    ఈ ఘటనలో ఇప్పటి వరకు 150 మంది గాయాలు పాలయ్యారని, వారిలో చాలా మంది పోలీసు సిబ్బంది ఉన్నట్టు ఖైబర్ పఖ్తుంఖ్వా గవర్నర్ గులామ్ చెప్పారు.

    పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ ఈ ఆత్మాహుతి దాడిని తీవ్రంగా ఖండించారు. ఖైబర్ పఖ్తుంఖ్వాలో శాంతి భద్రతలు అదుపు తప్పకుండా ఉండేందుకు సమగ్రమైన వ్యూహాన్ని అమలు చేయనున్నట్టు చెప్పారు.

    శిథిలాల కిందనున్న మృతదేహాలను తీసేందుకు సహాయ చర్యలు కొనసాగుతున్నట్టు పెషావర్‌లోని సహాయక సిబ్బంది చెప్పారు.

    శిథిలాల కింద ఐదు నుంచి ఆరు మంది ఉన్నట్టు గుర్తించామని, వారిని సురక్షితంగా బయటికి తీసేందుకు ప్రయత్నిస్తున్నట్టు రెస్క్యూ స్క్వాడ్ అధికార ప్రతినిధి బిలాల్ అహ్మద్ ఫైజి చెప్పారు.

    శిథిలాల కింద కొన్ని మృతదేహాలు కూడా ఉన్నాయని అన్నారు. అయితే, ఎన్ని మృతదేహాలు ఉంటాయో ఆయన అంచనావేయలేదు.

  12. అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైర్‌మెంట్ తీసుకున్న మురళి విజయ్

    అంతర్జాతీయ క్రికెట్‌కు పదవీ విరమణ చేస్తున్నట్టు మురళి విజయ్ సోమవారం ప్రకటించారు. ట్విటర్‌లో ఒక లేఖను జారీ చేయడం ద్వారా మురళి విజయ్ ఈ ప్రకటన చేశారు.

    అంతర్జాతీయ స్థాయిలో భారత్ తరఫున ఆడటం చాలా గౌరవంగా భావించినట్టు ఆయన ఈ లేఖలో తెలిపారు.

    ఈ ట్వీట్‌లో మురళి విజయ్ బీసీసీఐను, తమిళనాడు క్రికెట్ అసోసియేషన్‌ను, ఐపీఎల్‌ను, చెన్నై సూపర్‌ కింగ్స్‌ను ట్యాగ్ చేశారు.

    క్రికెట్ ఆడేందుకు తనకు అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికీ తాను చాలా రుణపడి ఉంటానని చెప్పారు.

    తన కలను నిజం చేసుకునేందుకు సహాయ పడిన సహ క్రీడాకారులకు, కోచ్‌లకు, మెంటార్లకు, సపోర్టు స్టాఫ్‌కు ధన్యవాదాలు తెలియజేశారు.

    క్రికెట్ అభిమానులకు కూడా ధన్యవాదాలు చెప్పారు. తన కుటుంబానికి, స్నేహితులకు కూడా థ్యాంక్స్ చెప్పారు.

    మురళి విజయ్ మొత్తంగా 61 టెస్టులలో 3,982 పరుగులు చేశారు. 17 వన్డేలలో 339 పరుగులు చేశారు. టెస్టులలో 12 శతకాలను, 15 అర్థ శతకాలను నమోదు చేశారు.

  13. నందమూరి తారకరత్న ఆరోగ్యం మెరుగుపడుతోంది

    నందమూరి తారకరత్న ఆరోగ్యం మెరుగుపడుతోందని నందమూరి రామకృష్ణ చెప్పారు.

    గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు తదితర అవయవాలు సక్రమంగా పనిచేస్తున్నాయని తెలిపారు.

    సిటీ స్కాన్ తీశారని, రిపోర్టు సాయంత్రానికి వస్తుందన్నారు.

    లైఫ్ సపోర్ట్ పరికరాలు, అత్యవసర మందులు క్రమంగా తగ్గిస్తున్నారని, బ్రెయిన్‌కు సంబంధించి కండిషన్ మెరుగుపడటానికి మరికొంత సమయం పడుతుందని తెలిపారు.

    నందమూరి తారకరత్న పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తాడని ఆశిస్తున్నట్టు చెప్పారు.

    పరీక్షలన్నీ పూర్తి చేశాక మెడికల్ రిపోర్ట్ విడుదల చేసే అవకాశం ఉంది.

    తారకరత్నకు ఎక్మో పరికరాన్ని అమర్చలేదని, ఎక్మొ అమర్చారని జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేశారు.

  14. భారత్ జోడో యాత్ర: మంచు వర్షంలో రాహుల్ గాంధీ ప్రసంగం, కశ్మీరీ ప్రజలు నాకు ప్రేమను పంచారు

    కశ్మీర్‌లో భారీ మంచు వర్షం కురుస్తున్న సమయంలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ముగింపు ప్రసంగం చేశారు.

    ‘‘ఈ యాత్ర ద్వారా నేను చాలా నేర్చుకున్నాను. ఒక రోజు, నేను చాలా బాధలో ఉన్నాను. నేను మరో 6 నుంచి 7 గంటలు ఎక్కువ నడవాల్సి ఉంది. అది చాలా కష్టం. కానీ, ఒక అమ్మాయి నా వద్దకు పరిగెత్తుకుంటే వచ్చింది. నా కోసం ఏదో రాసినట్టు చెప్పింది. నన్ను కౌగిలించుకుని, పరిగెత్తింది.’’ అని రాహుల్ గాంధీ చెప్పారు.

    ఆ అమ్మాయి ఇచ్చినదాన్ని చదవడం ప్రారంభించినప్పుడు..‘‘మీ మోకాలి దెబ్బతిందని నేను చూశాను. మీరు మీ పాదంపై బరువు మోపినప్పుడు, మీ మోహంలో ఆ బాధ కనిపిస్తుంది. మీతో పాటు నేను నడవలేను. కానీ, నా హృదయంతో మీ పక్కనే నేను నడుస్తున్నాను. నా కోసం, నా భవిష్యత్ కోసం మీరు నడుస్తున్నారని నాకు తెలుసు. ఆ లేఖ చదివిన తర్వాత నా బాధంతా కనుమరుగైంది’’ అని రాహుల్ గాంధీ శ్రీనగర్‌ ముగింపు సమావేశంలో చెప్పారు.

    భయం లేకుండా జీవించడాన్ని తన కుటుంబం, గాంధీజీ తనకు నేర్పారని, లేదంటే మనం జీవిస్తున్నట్టే కాదన్నారు. జమ్ము కశ్మీర్ ప్రజలు నాకు గ్రనేడ్ ఇవ్వలేదని, ప్రేమ మాత్రమే ఇచ్చారని రాహుల్ గాంధీ అన్నారు.

    యాత్రలో భాగంగా కశ్మీర్‌కి వెళ్తున్నప్పుడు తనని వెహికిల్‌లో వెళ్లాలని సెక్యూరిటీ ప్రజలు తనకు సూచించారని, ఒకవేళ నడుచుకుంటూ వెళ్తే, గ్రనేడ్ పోలే ప్రమాదం ఉందని తన అడ్మిన్ కూడా చెప్పినట్టు చెప్పారు. తన తెలుపు రంగు టీ-షర్ట్‌ను ఎర్రగా మార్చే తనని ద్వేషించే ప్రజలకి తాను అవకాశం ఇవ్వాలనుకున్నానని తెలిపారు. కానీ కశ్మీర్ ప్రజలకు తనకు ప్రేమను మాత్రమే పంచారని సంతోషం వ్యక్తం చేశారు.

    కశ్మీర్‌కి వెళ్లే ముందు రాహుల్ గాంధీ స్వగృహానికి వెళ్తున్నట్టు తమకు సందేశం పంపినట్టు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ చెప్పారు.

    దేశమంతా మద్దతు ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ ఈ ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేయడంపై తనకు చాలా సంతోషంగా ఉందన్నారు.

  15. మహాత్మా గాంధీని హత్య చేసిన గాడ్సే కోర్టులో ఏం చెప్పారు? సర్దార్ పటేల్ మీద ఆరోపణలేమిటి?

  16. పర్సనల్ ఫైనాన్స్: ఒక ఏడాదిలో ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా ఉండాలి?

  17. బ్రేకింగ్ న్యూస్, పాకిస్తాన్: పెషావర్‌లో పేలుడు... 17 మంది మృతి

    పాకిస్తాన్‌లోని పెషావర్‌లో పోలీసు లైను సమీపంలో గల ఒక మసీదులో పేలుడు జరిగింది.

    ఈ పేలుడులో మృతుల సంఖ్య 17 మందికి పెరిగినట్లు పెషావర్‌లోని లేడీ రీడింగ్ హాస్పిటల్ ప్రతినిధి డాక్టర్ మహ్మద్ అసిమ్ ధృవీకరించారు.

    సోమవారం మధ్యాహ్నం జరిగిన ఈ పేలుడులో మరో 60 మంది గాయపడ్డారు.

    గాయపడినవారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండగా, మిగతావారి పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్ మహ్మద్ అసిమ్ తెలిపారు.

    బాంబు పేలుడుతో పెషావర్‌లో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు.

    పాకిస్తాన్‌ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ, మాజీ ప్రధాని, పీటీఐ చైర్మన్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ ఈ దాడిని ఖండించారు.

  18. మహాత్మా గాంధీ చివరి రోజు ఎలా గడిచింది?

  19. అదానీకి హిండెన్‌బర్గ్ సమాధానం... ‘దేశం చాటున మోసాన్ని దాచలేరు’

    హిండెన్‌బర్గ్ రీసెర్చ్ విడుదల చేసిన రిపోర్ట్ మీద ఆ సంస్థకు, అదానీ గ్రూప్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.

    హిండెన్‌బర్గ్ విడుదల చేసిన రిపోర్టుకు బదులుగా 413 పేజీల సమాధానాన్ని అదానీ గ్రూప్ విడుదల చేసింది.

    ‘భారతదేశంతోపాటు దేశంలోని సంస్థల స్వతంత్రత, నిబద్ధత, క్వాలిటీ మీద పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన దాడి ఇది. భారతదేశ అభివృద్ధి, ఆశయాల మీద అటాక్ ఇది’ అంటూ అదానీ గ్రూప్ ఆరోపించింది.

    దీనికి హిండెన్‌బర్గ్ బదులిచ్చింది.

    ‘దేశభక్తి రంగు పూయడం ద్వారా, ‘కాలిక్యులేటెడ్ అటాక్ ఆన్ ఇండియా’ అనడం ద్వారా... అసలు విషయాన్ని అదానీ గ్రూప్ పక్కదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తోంది. భారతదేశ అభివృద్ధి వల్లే తమ చైర్మన్ గౌతమ్ అదానీ సంపద భారీగా పెరిగిందని ఆ సంస్థ అంటోంది.

    కానీ దీనికి మేం ఒప్పుకోం. భారతదేశం ప్రజాస్వామ్యయుత దేశం. వేగంగా ఎదుగుతున్న ఈ దేశానికి ఎంతో భవిష్యత్తు ఉంది. దాన్ని మేం స్పష్టంగా చూస్తున్నాం. అలాగే జాతీయ జెండా చాటున అదానీ గ్రూప్ భారతదేశాన్ని దోచుకుంటోందని మేం నమ్ముతున్నాం’ అని హిండెన్‌బర్గ్ తాజాగా విమర్శించింది.

  20. లైవ్ పేజీకి స్వాగతం

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీని చూస్తూ ఉండండి.